Friday, 28 November 2014

మహా గణపతిం.. మనసా స్మరామి





మహా గణపతిం.. మనసా స్మరామి


సర్వ విఘ్నాలను తొలిగించే దైవం విఘ్నేశ్వరుడు. తొలిపూజలు అందుకునే వేల్పుగా, దేవతాగణాలన్నింటికీ అధిపతిగా ఏకదంతుడిని కొలుస్తాం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలనే పూజించి వినాయక వ్రతకల్పాన్ని కొత్త సంకల్పంతో జరుపుకుందాం.. .

గణపతి ప్రస్తావన మనకు అతి ప్రాచీనమైన రుగ్వేదంలో కనిపిస్తుంది. విఘ్న నివారుడిగా గణేశుడు యుగయుగాలుగా పూజలు అందుకుంటున్నాడు. కృత యుగంలో మహోద్ఘటుడు, త్రేతా యుగంలో మయూరేశుడు, ద్వాపర యుగంలో గజాననుడు, కలియుగంలో ధూమ్రకేతువుగా గణపతిని సేవిస్తున్నారు.

ప్రస్తుతం మనం విఘ్నాలు తొలగించే నాయకుడిగా గణపతిని కొలుస్తాం. దీనికొక కారణముంది. మన శరీరంలో అన్ని అవయవాలు ఏకోన్ముఖంగా పనిచేస్తాయి. అదే విధంగా ఒక పనిలో అనేక కోణాలుంటాయి. ఇవన్నీ విజయం దిశలో ప్రయాణించాలంటే ఆ ఏకదంతుడి ఆశీర్వాదం అవసరం. అందుకే పెళ్లి, పూజ, పితృకార్యాల్లోనూ ముందుగా గణపతిని పూజించాల్సిందే! ఆఖరికి వినాయక చవితినాడు కూడా మొదట పసుపు వినాయకుడికి.. మహాగణాధిపతియే నమః అంటూ పూజ చేశాకే వినాయక విగ్రహాన్ని పూజిస్తాం.

ఏకదంతం అనేక రూపం..
మన శాస్త్రాలలో నృత్య గణపతి, ఉత్తిష్ట గణపతి, విద్యా గణపతి, ఆనంద గణపతి, యోగ గణపతి, అక్షర గణపతి ఇలా మొత్తం 54 గణపతి రూపాలను పేర్కొన్నారు. ఈ మూర్తుల ముద్రల్లోను, భంగిమలలోను తేడాలుంటాయి. వీటిలో 16 మాత్రమే ప్రధానమైనవి. వీటిన్నింటిలోను చాలా ముఖ్యమైనది అక్షర గణపతి. ఒక అక్షరం పలకాలంటే నోటి నుంచి బయటకొచ్చే గాలికి విఘ్నం కలిగించాలి. ఎక్కడ గాలికి విఘ్నం కలిగిస్తే ఆ అక్షరాన్ని స్పష్టంగా పలకగలుగుతామో తెలిపే ప్రఙ్ఞ మనకు ఇచ్చినందుకు అక్షర గణపతిని మనం పూజించాలి. ఇదే అక్షర గణపతి తత్వం. అందుకే వినాయక చవితినాడు పుస్తకాలను దేవుడి ముందుంచి దండం పెట్టుకుంటారు.

ఆరాధించే పద్ధతి..
విఘ్నేశ్వరుడిని ఆరాధించేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వీటిని ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. సృజనాత్మకత పేరుతో విఘ్నేశ్వరుడి విగ్రహాలు విభిన్న రూపాలు సంతరించుకుంటున్నాయి. డ్యాన్స్‌ చేస్తున్నట్టు, క్రికెట్‌ ఆడుతున్నట్టు.. ఇలా ఇష్టమున్న రీతిలో, పోటీ పడి మరీ భారీ సైజుల్లో వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను పూజించటం సరికాదు. ఇవి అలంకారానికే తప్ప పూజకు పనికిరావు. అందుకే ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా దాని పాదాల దగ్గర 12 అంగుళాలు మించనటువంటి మట్టి వినాయకుడిని పెట్టి ఆ విగ్రహానికే పూజ చేస్తారు. ఒకవేళ భారీ విగ్రహాలకే ప్రాణప్రతిష్ట చేయదలిస్తే దానికి అంతటి పూజ చేయాల్సి ఉంటుందంటున్నారు పండితులు. అంతే సమానంగా అన్నదానం కూడా చేయాలని చెబుతున్నారు.

పృధ్వీతత్వ రూపం..
గణపతి పృధ్వీతత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే గణపతి మన శరీరంలో మూలాధారంలో ఉన్నట్టు చెప్తారు. మన శరీరానికి ఓ రూపం ఇచ్చేది మూలాధారం. ఇది పృధ్వీతత్వానికి సంబంధించినది. ప్రకృతి రూపుడైన విఘ్నేశ్వరుడిని పర్యావరణానికి హానికారుడిగా మార్చిన ఘనత మనకే దక్కుతుంది. భూమి బాగుండాలంటే వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారైన బొమ్మలను వాడకూడదు. పూర్వం చెరువు మట్టితో బొమ్మలు తయారుచేసేవారు. ఇలా చేయటం వల్ల చెరువులో పూడిక తీసిన ప్రయోజనంతోపాటు మట్టి విగ్రహాలు తయారుచేసిన ఫలం కూడా దక్కుతుంది. అందుకే మట్టి వినాయకుడినే మహా గణపతిగా కొలుద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం.

నిమజ్జనం చేయాల్సిందే..
వినాయకుడి పూజ చేశాక కచ్చితంగా నిమజ్జనం చేస్తాం. ఇలా నిమజ్జనం చేయకుండా ఉండకూడదా? అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. శాస్త్ర ప్రకారం 365 రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయని విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేయాలి. నిమజ్జనాన్ని నీళ్లలోను, మట్టిలోను చేయవచ్చు. నీళ్ల సౌకర్యం లేనప్పుడు విగ్రహాలను పొలాల్లో వేయొచ్చు. ధాన్యపు గాదెల్లో దాచొచ్చు. వడ్లన్నీ అయిపోయాక విగ్రహం బయటపడుతుంది కదా! అప్పుడు దాన్ని తీసుకెళ్లి పొట్లపాదుల్లో ఉంచుతారు. వానాకాలం కాబట్టి వర్షం కురిసినప్పుడు పాదులోని మట్టిలో విగ్రహం కూడా కరిగి కలిసిపోతుంది.

విగ్రహం ఇలా ఉండాలి..

  • విగ్రహం డొల్లగా ఉండకూడదు. కాబట్టి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో అచ్చులు పోసి తయారు చేసిన విగ్రహాలు పూజకు పనికిరావు.
  • విగ్రహం వెండిదైనా, బంగారంతో తయారు చేసిందైనా డొల్లగా ఉంటే అలంకరణకే తప్ప పూజకు పనికిరాదు.
  • విగ్రహం ఆకారాన్ని బట్టి పూజ, సంకల్పం, నివేదన, అన్నదానం, సంతర్పణ చేయాలి.
  • గణపతిని గూర్చి మనం ఏ శక్తిని ఆశిస్తూ పూజ చేస్తున్నామో ఆ శక్తి అందాలంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజ చేయాలి.


No comments:

Post a Comment