Wednesday, 22 March 2017

కురుక్షేత్ర యుద్ధం నాటికి కృష్ణుడి వయసెంతంటే..

కురుక్షేత్ర యుద్ధం నాటికి కృష్ణుడి వయసెంతంటే...


హిందూ మత పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. కల్పితాలే కొన్ని సందర్భాల్లో నిజంగా జరిగినట్లే ఉంటాయి. ఇక రామాయణ, మహాభారతాల్లో వివరించిన ఆయుధాలు, సాంకేతి పరిఙ్ఞ‌ానం, నిర్మాణాలు ప్రస్తుతం ఆధునిక సైన్స్‌లో నిజంగా జరుగుతున్నాయి.

మహాభారతంలో శ్రీకృష్ణుడిది కీలకమైన పాత్ర. తన తెలివైన వ్యూహాలతో కురుక్షేత్రంలో పాండవులు విజయానికి కారణమయ్యాడు. సాక్షాత్తు నారాయణుడి అవతారమైన భగవానుడు ఈ భూమిపై ఎన్నేళ్లు జీవించాడో తెలుసా? అసలు భారత యుద్ధం జరిగేటప్పటికి కృష్ణుడి వయసు ఎంత? అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

మత్స్య పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగేనాటికి శ్రీకృష్ణుడి వయసు 89 ఏళ్లు. మహాభారతంలోని మౌసల పర్వంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిన 39 ఏళ్ల తర్వాత కృష్ణుడు నిర్యాణం చేందాడని పేర్కొన్నారు. అంటే శ్రీకృష్ణుడు మానవ రూపంలో 125 ఏళ్లు జీవించాడు.

భగవద్గీతలో కృష్ణుడిని ఉద్దేశిస్తూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవ దేవా, యదు వంశంలో జన్మించిన నీవు, 125 ఏళ్ల పాటు భూమిపై నీ భక్తులతో కలిసున్నావని తెలిపాడు. అంటే కృష్ణుడు 125 ఏళ్ల తర్వాత తన అవతారాన్ని చాలించాడని తెలుస్తోంది.

అలాగే జగన్నాటక సూత్రధారికి చెందిన ఆసక్తికరమైన లీలలను భక్తులు కథలుగా చెప్పకుంటారు. విష్ణు పురాణం ప్రకారం 12 ఏళ్ల వయసులోనే తన మేనమామ కౌంసుడిని సంహరించాడు. అలాగే పదహారేళ్ల వయసులోనే గోకులంలో గోపికలతో రాసలీలలు జరిపినట్లు కొంత మంది పరిశోధకులు పేర్కొన్నారు.  

Sunday, 19 March 2017

నహుషుడి మిడిసిపాటు!




నహుషుడి మిడిసిపాటు!

నహుషుడు చంద్రవంశానికి చెందిన రాజు. పరాక్రమవంతుడిగా, ధర్మనిరతి కలిగిన చక్రవర్తిగా పేరు గడించిన వాడు. ఇలా ఉండగా, ఇంద్రుడు కొంత పాపం చేసినందువల్ల దాని పరిహారం కోసం మానస సరోవరంలో ఒక తామర తూడులో ఉండి తపస్సులో మునిగిపోయాడు. దాంతో ఇంద్రపదవికి ఖాళీ ఏర్పడింది. ఆయన తిరిగి వచ్చేవరకు ఆ స్థానాన్ని పూరించగల సమర్థుడైన వ్యక్తి కోసం దేవతలందరూ అన్వేషించసాగారు. చివరికి వారందరూ కూడా నహుషుడయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. నారద మహర్షిని నహుషుని వద్దకు పంపించి, ఇంద్రపదవిని స్వీకరించవలసిందిగా ఆహ్వానం పంపారు. నహుషుడు అందుకు ఆనందంగా అంగీకరించాడు. తాత్కాలిక సురపతిగా పదవిని స్వీకరించాడు. ధర్మబద్ధంగా పరిపాలన అందించసాగాడు. కాలంతోబాటే మనుషుల ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! క్రమేణా నహుషుడికి అధికార మదం తలకెక్కింది.

అహంకారం అతని విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది. ఇంతలో ఓ రోజున దేవేంద్రుడు భార్య శచీదేవి ఉద్యానవనంలో విహరిస్తూ అతని కంటపడింది. ఆమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు. ఆమెను అనుభవించాలన్న లాలస కలిగిందతనిలో. ఇంద్రపదవిని చేపట్టిన తనకు ఇంద్రుని భార్య శచీదేవి పట్టపురాణిగా విచ్చేసి, తనను సుఖపెట్టవలసిందేనంటూ శాసనం చేశాడు. నహుషుని అధర్మవర్తనకు దేవతలందరూ కోపించారు. కానీ, ఏం చేయగలరు... తామే తీసుకొచ్చి రాజుగా మహేంద్రపదవిని కట్టబెట్టాము కాబట్టి, కాదని ఖండించడానికి వీలు లేదు మరి. ఏం చేయాలో తోచక కలవరపడ్డారు. మహాపతివ్రత అయిన శచీదేవి ఇది తెలుసుకుంది.

దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని, ఈ ముప్పు తప్పించమని మొరపెట్టుకుంది. ఆయన ఓ ఉపాయం చెప్పాడు. అదేమంటే, నహుషుడిని ఎదిరించగల పరాక్రమవంతుడు ఎవరూ దేవతలలో లేరు కాబట్టి, అతన్ని ఎలాగైనా సరే, మునుల శాపానికి గురయేలా చేయాలి అన్నాడు బృహస్పతి. ఆయన మాటలకు ధైర్యం తెచ్చుకుంది శచీదేవి. ఓ ఉపాయం ఆలోచించింది. అదేమంటే, తాను ఇంద్రాణి కాబట్టి, తన భర్త సామాన్యుడిలా తన వద్దకు రాకూడదని, సప్తర్షులు మోసే పల్లకిలో తన మందిరానికి రావలసిందని కబురంపింది నహుషుడికి.

కామంతో, అధికార మదంతో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు ఆలోచించలేదు.

‘‘ఓస్‌! అదెంత పని’’ అంటూ, సప్తర్షులకు వర్తమానం పంపాడు తన పల్లకిని మోసేందుకు రావలసిందంటూ... నహుషుడి వర్తమానం విని సప్తర్షులు కోపోద్రిక్తులయ్యారు. అయినా, తమాయించుకున్నారు. నహుషుడు పల్లకిలో ఆసీనుడు కాగా, సప్తర్షులు ఆ పల్లకిని మోయసాగారు. వారిలో అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, బలహీనుడు కావడంతో పల్లకిని మోయడం అతని తలకు మించిన పనైంది. మిగిలిన వారితో సమానంగా అడుగులు వేయలేకపోయాడు. ఫలితంగా కుదుపులు రావడంతోపాటు, పల్లకి వేగం కూడా మందగించింది. కారణం తెలుసుకున్న నహుషుడు అగస్త్యుడిని కొరడాతో అదిలిస్తూ, ‘సర్ప సర్ప’ అన్నాడు.

సర్ప అంటే త్వరగా నడవడమని అర్థం.

కోపించిన అగస్త్యుడు ‘‘అధికార మదంతో ఉచితానుచితాలు, ధర్మాధర్మాలు మరచిపోయిన నీవు వెంటనే సర్పంగా మారి, భూలోకంలో పడి ఉండు.’’ అని శపించాడు.

నహుషుడికి తన తప్పు తెలిసి వచ్చింది. కనులకు కమ్మిన పొరలు కరిగిపోయాయి. వెంటనే అగస్త్యుడి కాళ్లమీద పడి, తనను క్షమించి, శాపాంతాన్ని చెప్పవలసిందంటూ ప్రార్థించాడు.

అప్పుడు అగస్త్యుడు ‘‘రాజా! నీవు ఒక కొలను ఒడ్డున గల బిలంలో ఉంటూ, నీళ్లు తాగడానికొచ్చిన వారిని నిర్బంధిస్తూ, వారిని కొన్ని ప్రశ్నలు అడుగు. వారిలో ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతారో, అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది’’ అంటూ శాపాంతం చెప్పాడు.

తక్షణం నహుషుడు మహాసర్పమై, భూలోకంలోని ఒక కొలను వద్ద పడి ఉన్నాడు. కొన్ని వేల ఏళ్ల తర్వాత ఆ కొలను వద్దకు వచ్చిన భీముడిని తన భారీ శరీరంతో చుట్టి వేసి, ఎటూ కదలకుండా బంధించి వేస్తాడు. అతన్ని వెదుక్కుంటూ వచ్చిన ధర్మరాజు, నహుషుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో శాపవిముక్తి కలుగుతుంది. పూర్వపుణ్యం వల్లనో, ఈ జన్మలో చేసిన గొప్ప పనుల వల్లనో పదవులు వరించవచ్చు. దానిని తమ గొప్పతనంగా భావించి, అహకరించినవారికి పతనం తప్పదని పై ఉదంతం చెబుతుంది.



Thursday, 16 March 2017

శ్రావణ మాసం






శ్రావణమాస వైభవం

పూజలు, నోములు, వ్రతాలకు నెలవైన మాసం శ్రావణ మాసం. ఈ నెలలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. శ్రావణంలో జరుపుకునే ప్రతి నోముకూ ఓ విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మిక సాధనతో పాటు సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగి ఉన్నాయి. మానవ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందటమే శ్రావణ మాసపు వ్రతాల ప్రధాన ఉద్దేశం.

పౌర్ణమినాడు
చంద్రుడు శ్రవణం నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ నెలలో వచ్చే శుక్రవారాలనే నోములకు, వ్రతాలకు కేటాయించడానికి ప్రత్యేక కారణం ఉంది. వేంకటేశ్వరస్వామి నక్షత్రం కూడా శ్రవణమే! కాబట్టి ఆయన భార్య లక్ష్మీదేవికి, సోదరి గౌరికి శ్రావణ శుక్రవారాల్లోనే ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. మిగతాకాలాలతో పోలిస్తే వర్షాకాలంలో శక్తి సన్నగిల్లుతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఈ కాలంలో తగినంత శక్తిని సముపార్జించుకోవాలని శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజిస్తారు.

నోముల మాసం..
శ్రావణంలో ప్రధానంగా మంగళగౌరీవ్రతం, వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏ మంగళవారంనాడైనా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళ్లికి ముందు నాలుగేళ్లు, పెళ్లి తర్వాత ఒక ఏడాదిపాటు జరుపుకుంటారు.

వరలక్ష్మీవ్రతం..
మాత్రం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం ఐదోతనం కోసం, సంతానం కోసం జరుపుకుంటారు. ఇక వరలక్షీవ్రతాన్ని కుటుంబ సౌఖ్యం కోసం చేస్తారు. రెండు వ్రతాలు జరుపుకునే పద్ధతుల్లో, పాడే కథల్లో కూడా స్వల్ప వ్యత్యాసాలున్నాయి.

మంగళగౌరీ వ్రతం..
ఈ వ్రతం చేసుకునే రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేయాలి. బెల్లం కలిపిన బియ్యంపిండితో ప్రమిదలు తయారుచేసి వాటిలో శ్రేష్టమైన ఆవు నెయ్యు పోసి పవిడి పత్తితో చేసిన ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ దీపం నుంచి వెలువడే ధూపం సువాసనతో నిండి ఉంటుంది. ఇలా వెలిగే దీపం మీద ఇనుప కత్తి లేదా అట్లకాడను కదిలిస్తూ భర్త ఆయుర్దాయం కోసం నోములు నోచిన పతివ్రత కథను పాటగా పాడాలి. పాట పూర్తయ్యేలోపు కత్తికి దీపపు నుశి కాటుకలా అంటుకుంటుంది. ఈ కాటుకను వ్రతం జరుపుకునే సీ్త్ర తన కళ్లకు పెట్టుకోవాలి. తర్వాత ప్రమిదలు, ఒత్తితో సహా తినేయాలి.

వరలక్ష్మీ వ్రతం..
ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి.. వీళ్లందరూ అష్టలక్ష్ములు. వరలక్ష్మి కటాక్షం పొందకుండా అష్టలక్ష్ములను ప్రసన్నం చేసుకున్నంత మాత్రాన జీవితంలో సంతృప్తి పొందలేం. అందుకే శ్రావణ మాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. వరలక్ష్మి సత్ప్రవర్తన కలిగిన వారిని వరిస్తుంది. అందుకే ఈ వ్రతాన్ని మంచి మనసున్న చారుమతి కథను పాటగా పాడుతూ జరుపుకుంటారు. వరలక్ష్మీవ్రతం రోజున పచ్చి బియ్యంపిండితో చలివిడి ఉండ్రాళ్లు చేసి వాయనంగా ఇస్తారు. 12 ఉండ్రాళ్లు అమ్మవారికి, 12 బ్రాహ్మణుడికి, 12 నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. వ్రతం ఆచరించిన మహిళ నైవేద్యంగా పెట్టిన 12 ఉండ్రాళ్లు తిని మిగిలినవి ముత్తయిదువులకు ఇస్తారు. తర్వాత ముత్తయిదువులందరికీ పూజ చేసి వాళ్లనే వరలక్ష్మి అమ్మవారిగా భావిస్తూ వాయనం సమర్పించుకుని దీవెనలందుకుంటారు. వాయనం ఇస్తున్నవారు ‘ఇచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ ఉంటే పుచ్చుకున్నవారు ‘పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ దీవిస్తారు.

ఆరోగ్య రహస్యాలు..
వ్రతాలకు శ్రావణ మాసాన్ని ఎంచుకోవటంలోనే ఆరోగ్యపరమైన కారణాలున్నాయి. పూర్వం శ్రావణమాసంలో భర్తలు పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. అలాంటప్పుడు తీరుబడిగా ఇంటిపట్టున ఉండే భార్యలకు తగినంత కాలక్షేపం కోసం వ్రతాలు చేసుకునే ఆచారం మొదలైంది. ఈ వ్రతాల్లో ఆచరించే కట్టుబాట్లు, నియమాలు చక్కటి వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. నైవేద్యంగా సమర్పించి ఆరగించే చలివిడి చలువ చేస్తుంది. చలివిడి గర్భధారణ అవరోధాలను తొలగిస్తుంది. వరలక్ష్మీవ్రతం రోజు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలోని మాంసకృతులు తక్షణ శక్తినిస్తాయి. అలాగే వర్షాకాలంలో పాదాలు ఎక్కవ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు కలుగుతుంటాయి. ఇలా ఇన్‌ఫెక్షన్లకు గురవ్వకుండా ఉండటం కోసమే కాళ్లకు పసుపు పూసుకోవటాన్ని ఈ వ్రతాల్లో భాగం చేశారు. ఆవునెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది.

వ్రతాల్లో సామాజిక అంశాలు..
మనం జరుపుకునే ప్రతి పూజ, వ్రతం, నోముకూ ఓ సామాజిక, వెజ్ఞానిక కారణం ఉంటుంది. అలాగే మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతాలకూ అలాంటి కారణాలే ఉన్నాయి.
  • పూర్వం బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి అమ్మాయిలకు పూజా విధానంపై అవగాహన ఉండేది కాదు. కొత్త పెళ్లికూతురికి వీటి మీద పట్టు ఏర్పర్చడం కోసం నోములు, వ్రతాలు చేయించటం వెనకున్న ప్రథమోద్దేశం.
  • ముత్తయిదువులకు వాయనాలివ్వటం, వారి కాళ్లకు పసుపు రాయటం వంటి పనుల ద్వారా సఖ్యత పెంపొందించటం, స్నేహ సంబంధాలు ఏర్పర్చుకోవటం, ఎదుటివారిని గౌరవించడం వంటి అలవాట్లను అలవరుచుకుంటారని వ్రతాల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చారు.
  • అత్తా కోడళ్ల మధ్య సఖ్యత పెంచడానికి కూడా ఈ వ్రతాలు దోహదం చేస్తాయి. కొడుకు అభివృద్ధి కోసం, కోడలి కడుపు పండటం కోసం అత్తగారే దగ్గరుండి మరీ కోడలి చేత నిష్టగా వ్రతాలు చేయిస్తుంది.
  • మంగళగౌరీ వ్రతంలో మొదటి వాయనం తల్లికే ఇవ్వాలనే నియమం ఉంది. పెళ్లి తర్వాత కూడా పిల్ల తల్లికి ప్రాధాన్యం తక్కువ కాకూడదనేదే ఇలాంటి ఆచారం వెనకున్న ఉద్దేశం.




శుభప్రదం శ్రావణం

వర్షరుతువుతో ఆగమించే శ్రావణమాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తెలుగు సంవత్సరంలో ఐదో మాసంగా వచ్చే శ్రావణంలో పండుగలు, వ్రతాలతో ఆధ్యాత్మికత పరిఢవిల్లుతుంది. పట్నం నుంచి పల్లె వరకు పండుగ శోభ సంతరించుకుంటుంది. వైదిక ప్రమాణ రీత్యా కూడా శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

శ్రావణం చంద్రుడికి ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ పౌర్ణమి రోజున చంద్రుడు తన స్వ నక్షత్రమైన శ్రవణంపై సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి శ్రావణం అన్న పేరు వచ్చింది. పైగా శ్రవణం నక్షత్రం వేంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. శ్రీహరి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. అందుకే శ్రావణ మాసంలో శనివారాలు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

వైదిక మాసం..
శ్రావణ మాసానికి వైదిక మాసమని కూడా పేరుంది. ఈ నెలలో వేదాధ్యయనం మొదలవుతుంది. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.

వ్రతాల మాసం..
శ్రావణ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడిని కొలిచే సంప్రదాయం కనిపిస్తుంది. శ్రావణ మంగళవారాలు తమ కాపురం పదికాలాలు చల్లగా సాగాలని కోరుతూ నవ వధువులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని కొలుస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. మహాలక్ష్మీదేవి భృగు మహర్షి, ఖ్యాతిలకు వరలక్ష్మిగా పౌర్ణమికి ముందు శుక్రవారం జన్మించిందని పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. దీన్ని పురస్కరించుకుని వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం సదాచారంగా వస్తోంది. రుగ్వేదంలోని శ్రీసూక్తం.. శ్రావణ లక్ష్మిగా అవతరించిందని.. మరో గాథ కనిపిస్తుంది. ఇక శ్రావణ శనివారాలు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పండుగల మాసం..
శ్రావణ మాసం రాకతోనే పండుగలు మొదలవుతాయి. నాగుల పంచమి మొదలు ఈ నెలలో ఎన్నో విశిష్టమైన తిథులు కనిపిస్తాయి. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దామోదర ద్వాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజిస్తారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌గా ఘనంగా జరుపుకునే శ్రావణ పౌర్ణమికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. శ్రావణ పౌర్ణమి నాడే విష్ణు అవతారంగా భావించే హయగ్రీవుడి జయంతి జరుపుకుంటారు. శ్రావణ బహుళ విదియ రోజున రాఘవేంద్రస్వామి జన్మతిథిని నిర్వహిస్తారు. శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణాష్టమిగా భారతావనిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి.




Wednesday, 15 March 2017

కార్తిక మాసం





కార్తిక మాసం - విశేషాల మాసం


కార్తిక సమో మాసో న కృతేన సమం యుగంవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌
అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. 

శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది.

ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి. ఈ నెలలో ఆచరించదగిన అనేక పూజలనూ, వ్రతాలనూ పూర్వులు నిర్దేశించారు. వీటితోపాటు ఆహార నియమాలనూ, పాటించాల్సిన విధులనూ కూడా బోధించారు. వాటి గురించి...

ఈ నెలలో పర్వదినాలు
శాక సప్తమి, గోపాష్టమి, అక్షయ నవమి, సార్వభౌమ వ్రతం, ఉత్థాన ఏకాదశి, ప్రబోధనైకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) , వైకుంఠ చతుర్దశి, కార్తిక పూర్ణిమ, త్రిపురోత్సవం, మన్వాది, కర్కాష్టమి, యమదీప దానం (కార్తిక బహుళ చతుర్దశి), కరక చతుర్థి, గోక్రీడనం

పఠించదగిన స్తోత్రాలు
వామన స్తోత్రం, మార్కండేయకృత శివస్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి, గణేశ స్తుతి, దశావతార స్తుతి, దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం, శ్రీ శివ స్తోత్రం, శివాష్టకం, మృత్యుంజయ మహామంత్ర జపం, శ్రీ విష్ణు స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, తులసీ కవచం, తులసీ షోడశ నామావళి

చేయదగిన వ్రతాలు
శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, ఉమా సహిత శంకర వ్రతం, శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం, కేదారేశ్వర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం, వృషోత్సర్జనం, జ్వాలా తోరణం, అర్ధనారీశ్వర వ్రతం, కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణ, బలిపూజ

చేయాల్సిన పూజలు
శివారాధనం, కేశవారాధనం, శక్త్యుపాసనం, గణేశార్చనం, సూర్చార్చనం, సవత్స గోపూజనం, వృషభ పూజ, అశ్వత్థ చూజ, వట పూజ, తులసి పూజ, ధాత్రీ పూజనం, గంగాది నదీపూజనం, జలస్థాన పూజనం

ఈ నెలలో చేయదగిన పనులు
కార్తిక ప్రాతఃస్నానం, ఆకాశ దీపం, వివిధ దానాలు, సాలగ్రామ దానం, కన్యా దానం, కార్తిక పురాణ పఠనం, శ్రవణం, ఉపవాసం, భూశయనం, బ్రహ్మచర్యం, శ్రీహరి కమలార్చనం, సహవ్రతులతో కలిసి వన భోజనం, తీర్థ యాత్రలు, కార్తిక నిత్య దీపారాధనం, సవత్స గోదానం, సువర్ణ తులసీ వృక్ష దానం, ఉపవాసం, నక్తం (పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యడం), ఏక భుక్తం, అయాచితం, విప్ర పూజన

చేయకూడని పనులు
పర నింద, గురు నింద, పర ద్రోహం, మాదకద్రవ్య సేవనం, తైలాభ్యంగనం, వ్రతభ్రష్టులతో సంభాషణం, బహిష్ఠులతో సంభాషణం, తల్ప శయనం, పరాన్న భోజనం, ఇతరుల ఎంగిలి పదార్థాల్ని తినడం, గణ భోజనం, గణికా భోజనం, పాచిపోయిన ఆహారం తినడం

తినదగినవి
ధాన్యం, యవలు (బార్లీ), జొన్నలు, గోధుమలు, కంద, సముద్రపు ఉప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పనస, మామిడి, కొబ్బరి, కరక్కాయ, పిప్పళ్ళు, జీలకర్ర, శొంఠి, ఒక విధమైన ఉసిరిక, నూనెతో చెయ్యని వంటకాలు, బెల్లం తప్ప చెరకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు.

విడిచి పెట్టాల్సినవి
ప్రాణుల శరీర భస్మం, చర్మంతో చేసిన పాత్రల్లో నీరు, నిమ్మపండు, దానిమ్మపండు, యజ్ఞ ప్రసాదం కానిది, విష్ణువుకు నైవేద్యం కాని ఆహారం, మాడిన అన్నం, మసూరములు, మాంసం- వీటికి ‘ఆమిషములు’ అని పేరు. వాటిని విడిచిపెట్టాలి. వీటితోపాటు ద్విదళ ధాన్యాలు, అవిసె, గుగ్గిళ్ళు, లవణం, ఆనపకాయ, కళింగ ఫలం, బహు బీజ ఫలాలు, నిర్బీజములైన ముల్లంగి, ఎర్ర ముల్లంగి , గుమ్మడి కాయ, చెరుకుగడ, కొత్త రేగు, ఉసిరిక, చింతకాయ, తేనె, పొట్లకాయ, వంగ, ఉల్లి, వెల్లుల్లి, తెల్ల ఆవాలు.

- డాక్టర్‌ రాణి సదాశివమూర్తి







కార్తీక దీప వైభవం!

ఎక్కడైనా సరే నడక అనేది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ల మీద నడవాలి. రెండు కాళ్ల మీద నడిచినట్లే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయనం, దక్షిణాయనం అనబడే పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. చాలా మంది తెలియక.. దక్షిణాయనంలో చనిపోతే ఏదో ఉపద్రవం వచ్చేసిందనుకుంటారు. శంకరాచార్యుల వారి బ్రహ్మసూత్రాల భాష్యం ప్రకారం- జీవుడు కొన్ని కొన్ని లోకముల మీదుగా ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమందు ఈశ్వరునియందు ఐక్యమైపోయే స్థితి దక్షిణాయనం. వాస్తవానికి ఉత్తరాయనం కన్నా దక్షిణాయనం గొప్పది. ఎందుకంటే దక్షిణాయనం అంతా ఉపాసన సంబంధమైనది. దీనిలో కార్తీకమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం కాబట్టి దానికి కార్తీకమాసమని పేరు. సాధారణంగా కొన్ని కొన్ని తిథులు విష్ణ్వాలయంలో ఉన్నవి శివాలయంలో ఉండవు. శివాలయంలో ఉన్నవి విష్ణ్వాలయంలో ఉండాలని లేదు. కానీ కార్తీకమాసంలో మాత్రం అన్ని దేవాలయాలలోను దీపాలను వెలిగిస్తారు. మనకు పన్నెండు నెలలు ఉన్నా.. ఒక్క కార్తీకమాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీకదీపమని పేరు. అంతే కాకుండా కార్తీక మాసంలో పెట్టే కార్తీక దీపం.. ఆకాశ దీపం.. ఇలా ఒక్కో దీపానికి ఒక్కో మహత్యం ఉంది. కార్తీక దీపాన్ని వెలిగించినప్పుడు- దామోదరమావాహయామి అనాలి. లేదా త్య్రయంబకమావాహయామి అనాలి. దామోదరుడు విష్ణు సంబంధం. త్య్రయంబకం శివ సంబంధం. త్రయంబకుడు అంటే మూడు కన్నులున్నవాడు అని మాత్రమే కాదు. మూడు లోకములకు తల్లి, తండ్రి కూడా. అటువంటి త్య్రయంబక స్వరూపమైన పరమ శివుణ్ణి ఆవాహన చేయాలి. దీపం మీద అక్షితలు, పువ్వో, పసుపో, కుంకుమో వేయాలి. అప్పుడు ఆ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. ఆకాశం వైపు చూసి

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాఃజలేస్థలే.. ఫలే ఏ నివసంతిజీవా దృష్ట్యాప్రదీపం నచ జన్మ భాగినఃభవన్తి త్వ శ్వపచాహి విప్రాః
అని చెప్పి నమస్కారం చేయాలి. ఈశ్వరా.. ఈ దీపం ద్వారా నిన్ను ఆవాహన చేసి.. ఈ విశ్వంలోని ప్రాణులన్నింటికీ ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్లు చేస్తున్నానని ఈ శ్లోకార్థం. ఇక కార్తీక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఈశ్వరుడు వెలిగించిన ఆకాశ దీపాలు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఒక చిన్నపాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి, భగవంతుడి నామాలు చెబుతూ పైకెత్తేది ఆకాశదీపం. ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ





Monday, 13 March 2017

భగీరథప్రయత్నం

వెండికొండమీద అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు పార్వతీపతి. ఇంతలో తననెవరో ఆర్తితో పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎవరా ఆ పిలుస్తున్నది అని తరచి చూశాడు. భూలోకంలో భగీరథుడనే మహారాజు తనకోసం తీవ్రమైన తపస్సు చేస్తూ, కనిపించాడు. అతని తపస్సులోని నిస్వార్థాన్ని తెలుసుకున్న ముక్కంటి క్షణం కూడా ఆలసించకుండా వెంటనే వెళ్లి భగీరథుడి ముందు నిలిచాడు.

‘‘వత్సా! నీ తపస్సు నన్ను మెప్పించింది. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు మేఘగంభీరమైన స్వరంతో పరమేశ్వరుడు.

ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు భగీరథుడు. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ, అభయ హస్తంతో సాక్షాత్కరించిన ముక్కంటిని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో  నోటమాట రాలేదు భగీరథునికి. భక్తిపారవశ్యం నుంచి తేరుకున్న తర్వాత తానెందుకోసం తపస్సు చేసిందీ శివుడితో చెప్పసాగాడిలా...

‘‘సర్వజ్ఞులైన మీరు ఎరుగనిది కాదు నా గాథ.. అయినా, చెప్పడం నా ధర్మం.  సుమారు లక్షసంవత్సరాల క్రితం సగరుడనే చక్రవర్తి లోకకల్యాణం కోసం అశ్వమేధ యాగం యాగం చేశాడు. చివరలో యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దానిని అనుసరించి, ఆ రాజుకు జన్మించిన 60 వేలమంది కుమారులూ వెళ్లేవారు. అది అన్ని రాజ్యాలకూ వెళ్లి, యథేచ్ఛగా సంచరించేది. ఆయా రాజులందరూ దాని రాకను గౌరవించి, సగరుడికి సామంతులుగా మారి పోయేవారు. చివరికోరోజున ఆ అశ్వం రాజపుత్రులందరి కళ్లూ కప్పి, ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లింది. రాజుకీవిషయం తెలిసి, దాన్ని వెతుక్కు రమ్మని కుమారులను పంపాడు. అశ్వం లేకుండా రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వనని చెప్పాడు.

రాజకుమారులు యాగాశ్వం కోసం భూమండలమంతా వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పాతాళంలో వెదకాలని నిశ్చయించుకుని ఒక్కొక్కరు ఒక్కో యోజనం చొప్పున భూమిని తవ్వుతూ పాతాళంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! వారికి పాతాళంలో వారి అశ్వం ఒక బయలులో పచ్చిక మేస్తూ కనిపించింది. దాని చెంతనే కపిల ముని తపస్సులో నిమగ్నమై ఉండటం చూసి, ఆయనే తమ అశ్వాన్ని బంధించాడేమోనని భావించి, ఆయన గడ్డం పట్టుకుని లాగారు. తపోభంగం కావడంతో కళ్లు తెరిచి వారివంక చుర్రున చూశాడు కపిలముని. ఆ కన్నుల నుండి అగ్నికీలలు వెలువడి వారందరూ బూడిద కుప్పలుగా మారిపోయారు. సగరపుత్రులు ఎంతకాలానికీ రాజ్యానికి చేరుకోకపోవడంతో వారికోసం అన్వేషిస్తూ వారి వారసుడైన అంశుమంతుడు పాతాళలోకానికిళ్లాడు. అక్కడ బూడిద కుప్పలుగా మారిన పితరుల భస్మరాశులను, పక్కనే తపోధాన్యంలో లీనమై ఉన్న కపిలమునిని చూసి, విషయం గ్రహించి, మునిని ప్రార్థించాడు.

అప్పుడు ముని, శివుని శిరస్సుపై ఉన్న గంగ వచ్చి, వీరి భస్మరాసులపై ప్రవహిస్తే వీరికి మోక్షం కలుగుతుందని చెప్పాడు. నాటినుంచి మా వంశంలోని వారందరూ గంగను భువికి రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి నేను ఎలాగైనా సాధించాలని మిమ్ములను ప్రార్థించాను స్వామీ, కాబట్టి దయచేసి మా పితరులకు సద్గతులు కలగడంతోపాటు, అందరి పాపాలనూ ప్రక్షాళన చేయగల పరమ పావనమైన గంగను దయచేసి నాతో పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను’’ అని కోరాడు.

అతని వినయానికి, పట్టుదలకు ముగ్ధుడైన శివుడు ‘‘భక్తా! గంగను నీ వెంట పంపడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ, దివినుంచి జాలువారే గంగాప్రవాహ ఉద్ధృతిని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు, గంగాప్రవాహంతో భూమిలో ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అందువల్ల నేను ఇక్కడే కూర్చుని, గంగాప్రవాహ వేగాన్ని నా జటాజూటాలతో నిలువరిస్తాను’’ అని వరమిచ్చాడు.

మాట మేరకు శివుడు దివినుంచి మహోద్ధృతవేగంతో దుముకుతున్న గంగను తన జటాజూటాలతో బంధించి, ఏడు పాయలుగా చేసి, భూమిమీదకు వదిలాడు. అయినప్పటికీ గంగాప్రవాహ వేగానికి జహ్నుమహర్షి ఆశ్రమం మునిగిపోవడంతో ఆయన కోపించి, గంగను ఒక్క గుక్కలో ఔపోసన పట్టేశాడు. భగీరథుని ప్రార్థనకు తన చెవినుంచి వదిలిపెట్టాడు. జాహ్నవిగా మారిన గంగ అనేక దేశాలు, రాజ్యాలు, నగరాలు దాటుకుంటూ వచ్చి, చివరికి భగీరథుడి ముత్తాతల భస్మరాశుల మీద ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కల్పించింది. అలా దివినుంచి గంగను భువికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినందువల్ల భగీరథ ప్రయత్నమనే నానుడి ఏర్పడింది. అలాగే భగీరథుని అనుసరించి వచ్చింది కనుక గంగకు భాగీరథి అనే పేరు స్థిరపడింది. పరమశివుని భక్తవత్సలతను, ఒక మంచిప్రయత్నం చేయడానికి ఎన్నో ఆటంకాలను, అవరోధాలను అధిగమించాలని ఈ ఉదంతం నిరూపిస్తోంది.

ఆ నవ్వు వెనుక...

అది అయోధ్యానగరం. మరికాసేపట్లో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. సకల సన్నాహాలూ జరుగుతున్నాయి. ఇనకుల తిలకుడు, దశరథ తనయుడు రామచంద్రమూర్తికి అయోధ్యానగర చక్రవర్తిగా పట్టం కట్టే ఆ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని నగర ప్రజలతో పాటు దూరదేశాల నుంచి ఎందరెందరో పెద్దలు, ప్రముఖులు, మహర్షులు, వస్తూ వస్తూ వెంటబెట్టుకు వచ్చిన వానరులతో సహా ఎందరో మహానుభావు లున్నారక్కడ. ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నప్పటికీ అంతా నిశ్శబ్దం... ఇంతలో ఎక్కడినుంచో నవ్వు, ఆ వెంటనే చిటికలు వేస్తున్న శబ్దమూ వినిపించాయి. అన్ని తలకాయలూ ఆ నవ్వు వినవచ్చిన దిశగా తిరిగాయి. నవ్వుతున్నదెవరో చూసి, నివ్వెరపాటుకు గురయ్యాయి. ఆ నవ్విన వారు లక్ష్మణుడు. ఇంతకూ లక్ష్మణుడు ఎందుకు నవ్వినట్లు, తమను చూసేనేమో అని అనుకోసాగారు.

‘ఎట్టకేలకు నా కడుపున  పుట్టిన రాముడికే పట్టాభిషేకం జరుగుతున్నందుకు నేను సంతోషపడుతున్నానని కాబోలు’ అని ముందుగా కౌసల్య అనుకుంది.

‘భరతుడి రాజ్యం ఇంతటితో చెల్లిపోయింది, కైక తిక్క కుదిరిందని కాబోలు’ అని కైకేయి,

‘తనకూ, తన సోదరుడు శత్రుఘ్నుడికీ,  ఎల్లప్పుడూ సేవకులుగా ఉండక తప్పడం లేదని విరక్తిగా నవ్వుకున్నాడేమో నా బిడ్డ’ అని సుమిత్ర అనుకున్నారు.

తన అన్నను చంపి, తనను రాజుగా చేసినందుకే రామపట్టాభిషేకానికి విచ్చేశామనే లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని సుగ్రీవుడు, విభీషణుడూ అనుకున్నారు.

చూసి రమ్మంటే కాల్చి వచ్చిన తన తొందరపాటును, తెలివి తక్కువతనాన్ని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని హనుమంతుడు,

ముసలివాడినై పోయి, కళ్లు సరిగా కనపడక, చెవులు స్పష్టంగా వినపడక, ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉండి కూడా రామపట్టాభిషేకానికి వచ్చిన తనని చూసే నవ్వాడేమో అని జాంబవంతుడు,

రావణుడి చెరలో అంతకాలమూ పవిత్రంగా ఉండి కూడా, చివరకు తనను అగ్నిపరీక్ష చేయించి కానీ, తనను ఏలుకోవడానికి తన నాథుడు  సిద్ధపడలేదని తనను చూసే లక్ష్మణుడు నవ్వి ఉండవచ్చునని సీతాదేవి .

హనుమంతుడు కనిపెట్టేదాకా సీతజాడ కనిపెట్టలేకపోవడం, వానరుల సాయం ఉంటే తప్ప, రావణుడిని వధించలేకపోయిన తనను చూసే తమ్ముడు నవ్వి ఉంటాడని రాముడూ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుకున్నారట లక్ష్మణుడి నవ్వు చూసి.

నిజానికి లక్ష్మణుడు నవ్వింది పై కారణాలలో ఏ ఒక్కదాని వల్లా కాదు, ఏ ఒక్కరినీ చూసి నవ్వుకోలేదు. తన దుస్థితికి తన మీద తనకే జాలి వేసి, నవ్వుకున్నాడట. అదేమిటంటే, వనవాసానికి వెళుతున్న రాముడి వెంట లక్ష్మణుడు బయలు దేరాడు. ఆ తర్వాత సీతామాత కూడా వనవాసానికి బయలుదేరింది. ఎంతగా బతిమాలినా, ఇంకెంతగా నచ్చజెప్పినా, అనునయించినా, చివరకు భయపెట్టినా కూడా సీతాదేవి వినకుండా రాముడి వెంట వనవాసానికి బయల్దేరింది. సరిగ్గా అప్పుడే లక్ష్మణుడి పత్ని ఊర్మిళ కూడా లక్ష్మణుడి వంక దీనంగా చూసిందట, తాను కూడా లక్ష్మణుడి వెంట వనవాసానికి వస్తానన్నట్టుగా... అయితే లక్ష్మణుడు వద్దన్నట్టుగా కన్నులతోనే సైగ చేసి చెప్పాడట. అయితే తాను లేక తన పత్ని వియోగ బాధను అనుభవిస్తుందేమోననే ఉద్దేశంతో, తాను వనవాసంలో ఉన్నంత కాలమూ తన నిద్రను కూడా తన పత్నికే ఇవ్వమని నిద్రాదేవతను కోరాడట. అంతేకాదు, అన్నావదినలకు కాపలా కాయాలి కాబట్టి, దయచేసి తనజోలికి రాకుండా ఉండమని నిద్రాదేవతను పరిపరివిధాలా ప్రార్థించాడట! అందుకు అంగీకరించిన నిద్రాదేవి, పద్నాలుగేళ్లపాటు ఓపిక పట్టి, తీరా తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామపట్టాభిషేక మహోత్సవ సమయంలో ఎంత చెప్పినా, తనమాట వినకుండా తనను ఆవహించేందుకు వస్తోందని నవ్వు వచ్చిందట. అంతమంది సభాసదుల మధ్యలో తన అన్నగారైన రామçచంద్రమూర్తికి పట్టాభిషేకమహోత్సవం జరిగేటప్పుడు నిద్రపోయి తన పరువు తీయకుండా కనీసం మరికొద్ది సమయమైన గడువు ఇవ్వమని బతిమాలుకున్నాడట లక్ష్మణుడు.

ఈ కథ పుక్కిటి పురాణమే కావచ్చు, ఏ కవో, పండితుడో సరదాకోసం అసలు విషయానికి మరికొంత ముందు వెనుకలు జోడించి ఉండవచ్చు, దీనిపై లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర అనే ఉపాఖ్యానాలే వెలువడి ఉండవచ్చు కానీ, నిద్ర అనేది మనిషికి ఎంత అవసరమో, సమయానికి నిద్రపోకపోతే ఎంత అనర్థమో, అసÆ దర్భంగా నిద్రపోవడం ఎంత హాస్యాస్పదమో వివరిస్తుంది.     

పరనిందతో ప్రమాదం





పరనిందతో ప్రమాదం

ఒకరోజు శ్రీకృష్ణుడు, గోపబాలురు యమునా తీరమున ఆడుకుంటున్న సమయంలో బకాసురుని సోదరుడైన అఘాసురుడు అక్కడికి ఒక పెద్ద కొండచిలువ రూపంలో వచ్చాడు. నోటిని తెరిచి శ్రీకృష్ణుణ్ణి మింగేయాలని ఎదురు చూస్తున్నాడు. అఘాసురుడుని నోరు ఎంత పెద్దగా ఉందంటే పైపెదవి మేఘాలను, కింద పెదవి భూమిని తాకుతున్నాయి. అది గమనించక గోపబాలురు గోవులతో సహా పెద్ద కొండబిలం వలెనున్న అఘాసురుని నోట్లోకి వెళ్లిపోయారు. నందకిశోరుడు కూడా వారి వెంట అఘాసురుణి నోట్లోకి వెళ్లాడు. అది గమనించిన అఘాసురుడు వెంటనే నోరు మూసేసాడు. లోపల విషవాయువుల ప్రభావం చేత గోవులు, గోపబాలురు అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు అఘాసురుణి నవరంధ్రాలను మూసి ఉదరం ఉబ్బేలా చేశాడు. ఫలితంగా అఘాసురుడు పొట్టపగిలి మరణించాడు. పొట్టలో నుంచి గోవులు, గోప బాలురు బయటపడ్డారు.

అఘాసురుని వృత్తాంతము:
శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు. యవ్వనుడు, బలిష్ఠమైన దేహం కలవాడు. కాని పరులను నిందించే స్వభావం ఉంది.
అఘాసురుడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి ‘ఇన్ని వంకరలేమి’ అని హేళన చేశాడు.
ఆ మాటలు విన్న మహర్షి ‘ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు’ అని శపించాడు.
చేసిన తప్పును మన్నించమని అఘాసురుడు మహర్షిని వేడుకున్నాడు.
అప్పుడు మహర్షి ‘నాయనా! పరనింద మృత్యువు వంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే, వారి పాపములో సగం మనకు వస్తుంది. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యంలో సగం అతనికి వెళ్లిపోతుంది. కాబట్టి అనవసరంగా పరనింద చేయకూడదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు’ అని అన్నాడు.

అలా అఘాసురుడు సర్పరూపం ధరించి శ్రీకృష్ణుని చేతిలో విముక్తిని పొందాడు.


Friday, 10 March 2017

పురాణాల్లోని బలమైన ఈ పాత్రలే నేటి మహిళలకు ఆదర్శం!

పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళ పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత, మేనక, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటి తరం మహిళలకు ఎంతో ఆదర్శం. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హిందూ పురాణల్లో మహిళ పాత్రల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

శ్రీమహావిష్ణువు స్త్రీ రూపం మోహిని. దేవతలకు ఈ అవతారం ఓ పెద్ద వరం. మోహినిని అస్త్రంగా చేసుకున్న దేవతలు అమృత కలశాన్ని రాక్షసుల నుంచి తెలివిగా తీసుకున్నారు. మహాభారతంలో వేదవ్యాసుడు మోహిని వృత్తాంతం గురించి పేర్కొన్నాడు. మోహిని పాత్రను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత కాలంలో అందమైన మగువలు కూడా తమ కార్యాలను నెరవేర్చుకుంటున్నారు.

హిడింబి ఎవరు సహకారం లేకుండా ఒంటరిగానే తన కుమారుడు ఘటోత్కచుడికి ఉన్నత విలువలను, సుగుణాలను నేర్పింది. హిడింబాసురుడనే రాక్షసుని సోదరి హిడింబి. పాండవులను అంతం చేయడానికి ధుర్యోదనుడు లక్క గృహానికి పంపినప్పుడు ఈ విషయం తెలుసుకున్న వారు అక్కడ నుంచి తప్పించుకుని ఓ అరణ్యంలో ప్రవేశిస్తారు. తమపై దాడిచేసిన హిడింబాసురుని భీముడు సంహరిస్తాడు.

అతని సోదరి హిడింబి మాత్రం భీముడిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత హిడింబిని వివాహం చేసుకుని కొంత కాలం తర్వాత భీముడు హస్తినకు చేరుకుంటాడు. భీముడు అక్కడ నుంచి వెడలిపోయిన తర్వాత హిడింబికి ఘటోత్కచుడు జన్మిస్తాడు. అప్పటి నుంచి తన కుమారుడిని పెంచి పెద్ద చేసి ఆదర్శంగా నిలిపింది.

భర్త శాప విమోచనం కోసం అప్పుడే పుట్టిన తన పుత్రులను గంగ త్యాగం చేసింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలకు కూడా భర్త విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందూ పురాణాల్లో నిష్కల్మషమైన గంగ పవిత్రతను గురించి పేర్కొన్నారు.

రావణుడి భార్యయైన మండోదరి తన ఆధ్యాత్మిక చింతనతో నిశ్శబ్దాన్ని పాటించింది. ఈమె అందమైన మహిళేకాదు, తెలివైనది కూడా. సీత విషయంలో రావణుడి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే కాదు దీని వల్ల అంతం తప్పదని కూడా హెచ్చరించింది.

వాలి భార్యయైన తార గొప్ప ధర్మ విలువలగల మహిళ. అంతరిక్షంతో సంబంధం కలిగిన తార గూఢచర్యంలోనూ, ఇతరులపై దయ చూపడంలోనూ తన ప్రవీణ్యతను చాటుకుంది.

జనకుడి కుమార్తె, శ్రీరాముని భార్యయైన సీత సహనశీలి. తన క్షమాగుణంతో భూదేవిని మించిన మహిళ. భర్త కోసం అన్నింటిని త్యాగం చేసిన జానకి, ఒంటిరి తల్లిగానూ లవకుశలకు జన్మనిచ్చి వారిని గొప్ప వీరులుగా తీర్చిదిద్దింది.

ద్రుపదుడు యఙ్ఞవాటికలో అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అగ్ని జ్వాల మాదిరిగా అందమైన, బలమైన మహిళ. అలాగే మంచి వ్యూహకర్త కూడా. తనను నిండు సభలో అవమానించిన కౌరవులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఆమె సఫలమైంది. అంతే కాదు ఆ సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది.

మహాభారతానికి మూలకారణం








ఈ ప్రేమకథే మహాభారతానికి మూలకారణం


చరిత్రలు, పురాణాలంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఓ బంగారు గని లాంటింది. శంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి ఓ అందమైన మహిళ, కానీ ఈమె మత్స్యకన్య. కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది. దీంతో సత్యవతిని వివాహం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.

తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓ నాడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరాశర మహర్షి ఓ గొప్ప తపశ్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లింది.

ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు. అయితే తన మూడు కోరికలు నేరవేర్చితేనే దీనికి ఒప్పకుంటానని సత్యవతి అంటుంది.

1. మనం కలిసున్నప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరాశర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు.

2. దీని వల్ల తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్వత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరాశర హామీ ఇచ్చాడు.

3. తన శరీరం వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంది. దీనిని నుంచి విముక్తి కలిగించడమే కాదు తొమ్మిది మైళ్ల దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేశాడు.

సత్యవతి షరతులు అంగీకరించడంతో పరాశర మహర్షి కోరిక తీర్చింది. ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించివాడే వేద వ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు.

ఒక రోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెదుక్కొంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన శంతనుడు అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడ నుంచే మహాభారతం ప్రథమ అధ్యాయం ప్రారంభమవుతుంది.



అష్ట భార్యల్లో ఆ ఇద్దరిపైనే కృష్ణుడికి ఎందుకంత ప్రేమ?

కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు.

అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి, ఇంకొకరు సత్యభామ. అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. రుక్మిణి విదర్భ రాజు భీష్మకుని కుమార్తె. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకుంది. తన శ్వాస, నిశ్వాసల్లోనూ నిరంతం కృష్ణుని ధ్యానంలో గడిపింది.

అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు. రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. శిశుపాలుడు, జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు. గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరినీ ఊహించడానికి సాహసం చేయలేదు.

తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నాడని, కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటూ కృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది. అలాగే తాను ఆలయంలో ఎదురుచూస్తూ ఉంటానని తెలియజేసింది. సందేశం అందుకున్న వాసుదేవుడు తాను రక్షిస్తానని అభయం ఇచ్చాడు. మందిరంలో గోవిందుడి రాకకోసం రుక్మిణి ఎదురుచూస్తూ పార్వతిని ప్రార్థిస్తూ గడిపింది.

కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భ చేరుకుని రుక్మిణిని అక్కడ నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం. ఆమె ఎప్పుడూ నారాయణుడి హృద‌య‌ మందిరంలో కొలువుంటుంది. అందుకే రుక్మిణి అంటే ఆయనకు వల్లమాలిని అభిమానం. భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది.

ద్వారక కోశాధికారి సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహాంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు.

కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి బయలుదేరుతాడు. జాంబవంతుడు దగ్గర ఉన్నట్లు గుర్తించి, అతడు ఉండే గుహకు వెళతాడు. అక్కడ జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితోపాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.

శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అంతే కాదు ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు.

త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బంధీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు. తాను ఈ జన్మలో ఏకపత్నీ వ్రతుడనని, వచ్చే జన్మలో వివాహం చేసుకుని, తన రాజ్యానికి రెండో రాణిగా చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను కృష్ణుడు పరిణయమాడాడు.

అలాగే పురాణాల ప్రకారం సత్యభామ భూదేవి అవతారంగా పేర్కొంటారు. లక్ష్మీ, భూదేవి అంశంతో జన్మించిన రుక్మిణి, సత్యభామలంటే గోవర్దన గిరిధారికి అందుకే అంత ఇష్టం. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం.

పాండవులతో ద్రౌపది వివాహ బంధం ఎలా సాగిందంటే...

ఒక మహిళకు అనేక మంది భర్తలు ఈ ఆలోచనే పురుషులకు అసౌకర్యాన్ని కలిగించే అనుభూతి. కానీ మహాభారతంలో ద్రౌపది పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఇది వివాదస్పదమైన పాత్ర కూడా. ద్రౌపది అనివార్య పరిస్థితుల్లో తన తెలివితేటలతో పాండవులను సంతృప్తి పరచడానికి ప్రయత్నించింది. అయితే పాండవులతో ద్రౌపదికి  మధ్య సంబంధాల్లో తెలియని అంశాలు చాలానే ఉన్నాయి.

పాండవుల ఐదుగురిలో ఒక్కొక్కరు ఏడాది చొప్పున ద్రౌపది దగ్గర ఉండేవారు. ఒక ఏడాది పూర్తయితే మరో నాలుగేళ్ల వరకు వాళ్లు వేచి ఉండేవారు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకు మొదటి అవకాశం లభించింది. యుధిష్ఠరుడు నిర్ణయించిన నియమాలను పాండవులంతా పాటించారు. ద్రౌపదిని వివాహం చేసుకునే ముందు అన్నదమ్ములు అయిదుగురు సమావేశమయ్యారు.

అప్పుడు ధర్మరాజు తన సోదరులకు శక్తివంతులైన రాక్షస సోదరుల కథను ఉదాహరణగా చెప్పాడు. సంద, ఉపాసంద అనే సోదరులు ఇరువురూ ఒకే మహిళను ప్రేమిస్తారు. దీంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగి ఒకొరినొకరు అంతం చేసుకుంటారు. అందుకే ద్రౌపది విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ధర్మజుడు తన సోదరులను హెచ్చరించాడు.

ఒక్కో ఏడాది ఒక్కో సోదరుడు పాంచాలి వద్ద గడపాలని, ఈ కాలంలో ఇతరులు ఆమె వంక కన్నెత్తి కూడా చూడరాదని షరతు విధిస్తాడు. అగ్రజుడు కాబట్టి తన నుంచే ఈ నిబంధన ప్రారంభమవుతుందని తెలిపాడు. అలాగే ఎవరైనా ఈ నియమాన్ని అతిక్రమించి వాళ్లు పన్నెండేళ్ల పాటు ఆమెను పొందలేరని కూడా తెలిపాడు. ఇది తమ ఐదుగురిలో ఎవరికైనా వర్తిస్తుందని తెలిపాడు. అయితే అనివార్య కారణాల వల్ల అర్జునుడు ఈ నిబంధనలను అతిక్రమిస్తాడు.

ఓ పేద బ్రాహ్మణుడి గోవులను దొంగల ఎత్తుకెళితే వాటి రక్షణకు ఆయుధాల కోసం ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న సమయంలో అంత:పురంలోకి ప్రవేశిస్తాడు. దీంతో నియమాన్ని అతిక్రమించడం వల్ల పన్నెండేళ్లు వారికి దూరంగా ఉంటాడు. ఆ సందర్భంలో ఇంద్రుడిని కలుసుకుని, ఊర్వశి శాపానికి గురవుతాడు. అలాగే విలు విద్యలో చాలా మంది గురువుల నుంచి కొత్త పద్ధతులు, నైపుణ్యాలు నేర్చుకుంటాడు. సుభద్ర, చిత్రాంగదలను కూడా వివాహమాడతాడు.

పాండవ మధ్యముడైన అర్జునుడంటే ద్రౌపదికి వల్లమాలిన ప్రేమ ఉన్న ఆమె ఏనాడు దీన్ని వ్యక్తం చేయలేదు. స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించి ఆమెను మనసును అర్జునుడు గెలుచుకున్నాడు. కానీ ద్రౌపదిని తన సోదరులు పంచుకోవడం కూడా అర్జునుడికి సుతారం ఇష్టం లేదు. అయితే శ్రీకృష్ణుని సోదరి సుభద్ర మాత్రం పార్థుడికి ఇష్టమైన భార్య.

ద్రౌపది అంటే భీముడికి చాలా ప్రేమ. ఆమె కోరికలను నెరవేర్చి సంతృప్తి పరిచేవాడు. అలాగే విచారంగా ఉన్నా తట్టుకోలేకపోయేవాడు. పాంచాలి కోసం కుబేర వనంలోని పుష్ఫాలను సైతం తీసుకొచ్చాడు. అఙ్ఞాత‌వాసంలో మత్య్య రాజు పట్టమహిషి సుదీష్ణాదేవి పరిచారికగా చేరిన ద్రౌపది దీనస్థితికి భీమసేనుడు ఎంతో బాధపడ్డాడు. నిండు సభలో ఆమెను అవమానించిన 100 మంది కౌరవులను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.

నకుల, సహదేవులు ఇద్దరూ ధర్మరాజును అనుసరించారు. అగ్రజుడు అంటే వారికి నమ్మకం. ఎప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడస్తూ, అతడి ఆఙ్ఞను శిరసావహించారు.


ఐదుగురి సోదరులకు భార్యగా ఉండటానికి అంగీకరిస్తూనే ద్రౌపది ఓ షరతు విధించింది. తనతో ఉన్నప్పుడు వేరే మహిళలను అనుమతించకూడదని పేర్కొంది. అంటే వారికి చెందిన మిగతా భార్యలు ఆ ఏడాది అంత:పురంలో ఉండకూడదని అర్థం. ద్రౌపదికి పాండవులకు పుట్టిన వారి ఉప పాండవులు అంటారు. అయిదుగురు సోదరుల ద్వారా ఒక్కొక్కరు జన్మించారు.