Thursday, 29 June 2017

భజేహం జ్యేష్ఠ రాజం





భజేహం జ్యేష్ఠ రాజం

ఏ శుభకార్యం చేసినా మొదటగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని గణపయ్యను పూజిస్తారు.

ఓం గణానామ్‌ త్వా గణపతిగ్‌మ్‌ హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తవమ్‌!
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనఃశృణ్వన్నూతిభి స్సీదసాదనమ్‌!!


గణపతి గురించి వేదం చెప్పిన మంత్రం ఇది. ఈ మంత్రం గణపతిని మూడు విధాలుగా వర్ణిస్తుంది. లౌకిక రూపాన్నీ, తాత్త్విక స్వరూపాన్నీ, ఆత్మ చింతననూ తెలియజేస్తుందీ వేద మంత్రం.

‘‘గణాల్లో గణపతిగా ఉన్నవాడు, కవులకు కవియైు ఉన్నవాడు, అన్న సమృద్ధి కలవాడు, అందరికన్నా మొదటగా ప్రకటితమైన వాడు, వేద మంత్రాల్లో ప్రకాశించేవాడు అయిన గణపతిని.. మా ప్రార్థనలు విని సమస్త శక్తులతో మా సదనం (ఇంటి)లోకి రావయ్యా’’ అని పిలవడం ఈ మంత్రంలోని అర్థం.

తాత్త్విక అర్థాన్ని గ్రహిస్తే.. ‘‘గణములు అంటే సమూహం అని అర్థం. అనంత విశ్వం ఒక మహా గణం. ఈ గణాలన్నింటిలో ప్రకాశించే శక్తి గణపతి. గణములు ఎన్ని ఉన్నా.. గణపతి ఒక్కడే! గణపతి తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే.. భిన్న దృష్టి తొలగిపోయి ఏకత్వం అర్థం అవుతుంది. కర్మకు కావాల్సిన చైతన్యాన్నీ, ప్రపంచానికి అవసరమైన ఐశ్వర్యాన్నీ ప్రసాదించేది వినాయకుడే’’ అని వర్ణించారు.

మూడో అర్థాన్ని పరిశీలిస్తే.. ‘‘గణములు అంటే ఇంద్రియాలు అని కూడా అర్థం ఉంది. ఇంద్రియాలన్నీ కలిపితే ఒక గణం. మన ఇంద్రియాలన్నింటినీ శాసించే ఆత్మ- గణపతి. కవులు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలకు మూలం ఆత్మ చైతన్యం. శరీర పోషణకు అన్నం కావాలి. దాని నుంచే ఇంద్రియాలకు శక్తి కలుగుతుంది. మనం చేసే కర్మలకు ఆయన అనుగ్రహం కావాలి. మొత్తంగా చూస్తే మన శరీరం అనే సదనంలో ఆత్మ స్వరూపంగా గణపతి ప్రకాశిస్తేనే మనుగడ సాధ్యమవుతుంద’’ని తాత్వికులు వర్ణించారు.

విఘ్నేశ్వరుడి రుపాన్ని పురాణాలు లోతుగా ఆవిష్కరించాయి. ఆదిలో పరమాత్మ నిరాకారుడు కనుక.. పసుపు ముద్దతో గణపతిని రూపొందించి కొలుస్తుంటాం. అవసరాన్ని బట్టి తన తత్వాన్ని తెలియజేసే రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. అలా ధరించిన రూపమే విఘ్నేశ్వర రూపం. ఏనుగు ముఖంతో ఆయన ప్రకటించిన రూపం బలానికీ, పుష్టికీ సంకేతం. వక్ర తుండం అంటే వంకర తొండం కలవాడని అర్థం. వక్రములను తుండనం చేయువాడని మరో అర్థం. వంకరగా ఉన్న ఆలోచనలను తొలగించే శక్తి ఆయన. ఒక కార్యంలో విఘ్నాలను పరిహరించి.. దాన్ని సవ్యంగా నడిపేవాడు గణపతి. సత్కార్యానికి విఘ్నాలు తొలగించడంలోనే కాదు... దుష్కర్మలకు విఘ్నాలు కలిగించడంలోనూ ఆయన విఘ్నేశ్వరుడే! ఈ వినాయక చవితి రోజు ఆ గణపయ్యను ఆరాధించి.. మన ఆలోచనలు సవ్యంగా సాగాలని కోరుకుందాం. మనం చేసే సత్కర్మల్లో విఘ్నాలు తొలగించమని వేడుకుందాం.

సంకట హరుడు‘‘సృష్టి కార్యంలో బ్రహ్మదేవుడికి మొదట్లో అన్నీ విఘ్నాలే ఎదురయ్యాయట. అప్పుడు బ్రహ్మ తన జన్మకు మూలకారణమైన పరమాత్మను ‘ఓం’కారంతో ధ్యానించాడట. ‘ఓం’కారం ఒక రూపాన్ని ధరించి బ్రహ్మకు దర్శనమిచ్చాడట. ఆ రూపం ఏనుగు తల, వక్ర తుండం, మహాకాయంతో ఉందట! బ్రహ్మకు ‘వక్రతుండ’ మంత్రం ఉపదేశించి గణపతి అదృశ్యమయ్యాడట. బ్రహ్మను విఘ్నేశ్వరుడు అనుగ్రహించిన రోజు మాఘ బహుళ చతుర్థి. నాటి నుంచి ప్రతి మాసంలోనూ బహుళ చతుర్థిని సంకష్ట (సంకట) హర చతుర్థిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఎన్నోసార్లు అవతరించాడు. ఆ కారణంగానే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ తనయుడిగా.. వినాయకుడిగా.. ఉద్భవించాడు.

Friday, 23 June 2017

అభిమన్యుడు





ఓడినా అది విజయమే


అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగలడే గానీ, వెలుపలికి వచ్చే మార్గం మాత్రం అతనికి తెలియదు. అయితే, భీమ, దృష్టద్యుమ్నాది అనేక మంది మహాయోధులు తన వెనకే ఉంటారు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ యువయోధునికి అందరూ చెప్పారు. ఎంతో సందేహంతోనే యుధిష్టిరుడు అభిమన్యున్ని చక్రవ్యూహాన్ని చేధించడానికి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాడు. అభిమన్యుడు తన వింటికి నారి సంధించి మీటాడు. ఆ వింటి ధ్వని గాండీవ ధ్వనిలా రణరంగమంతటా ప్రతిధ్వనించింది. అభిమన్యుడు బాహ్యవలయమైన పద్మవ్యూహాన్ని సమీపించాడు. మరుక్షణంలో అభిమన్యుని రథం పద్మవ్యూహాన్ని చీల్చుకుని ముందుకు సాగింది. అభిమన్యుడి బాణాలకు వందలాది శత్రుసైనికులు ప్రాణాలు కోల్పోయారు. కౌరవ సైన్యం భయభీతమయ్యింది. అభిమన్యునితో దుర్యోధనుడు పోటీ పడలేడని తెలిసిన ద్రోణుడు అతని రక్షణకు వచ్చాడు. అప్పుడే రంగ ప్రవేశం చేసిన దుశ్శాసనుడు అభిమన్యుని దాటికి తట్టుకోలేక పారిపోయాడు. తన సైనికులు భయకంపితులై పారిపోవడం చూసి దుర్యోధనడు దిగ్భాంతికి గురయ్యాడు. అభిమన్యుడి ధనుస్సు వజ్రాయుధంలా అసంఖ్యాకమైన కౌరవ సైనికుల్ని ఊచకోత కోస్తూనే ఉంది. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా, అభిమన్యుడు మాత్రం హోరాహోరీగా పోరాడుతూనే ఉన్నాడు. 


నిస్పృహతో ద్రోణున్ని సమీపించిన శకుని ‘‘మనందరం కలిసి ఒక్క ఉదుటున దాడిచేస్తే తప్ప అభిమన్యున్ని చంపలేం.’’ అన్నాడు.

అది విన్న ద్రోణుడు ‘‘అజేయమైన ధనువు అభిమన్యుని చేతిలో ఉన్నంత సేపు ఎవరూ అతన్ని చంపలేరు. అందువల్ల ఎవరో ఒకరు అతని వింటి అల్లెత్రాటిని తెంచాలి. రథాన్ని ధ్వంసం చేయాలి. లేకపోతే అతన్నెవరూ ఓడించలేరు.’’ అన్నాడు.

ఆ మాట విన్న రాధేయుడు జయధ్రధునితో పోరాడుతున్న అభిమన్యుని వెనుకగా వెళ్లి వింటి అల్లెత్రాటిని కోసివేశాడు. అదే సమయంలో ద్రోణుడు అభిమన్యుని రథపు అశ్వాలను వధించాడు. కృపుడు సారథిని హతమార్చాడు. అభిమన్యుడు నిస్సహాయుడుగా నిలుచుండిపోయాడు. అయినా రథచక్రంతోనూ, గదతోనూ కొంత పోరాడాడు అయితే చివరికి అభిమన్యుడు అలిసిపోయాడు. శరీరమంతా గాయాల మయమై రక్తం చిమ్ముతోంది. సొమ్మసిల్లి నేలకూలిపోయాడు అతని కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కౌరవులు విజయోత్సాహంతో కేకలు వేశారు. కానీ, ద్రోణుని వెన్నులో ఒక మహా నేరం చేసిన భావన పాకిపోయింది. వింటి అల్లెత్రాటిని కోసిన ఈ నీచకృత్యంలో నేను భాగస్వామినయ్యాను కదా అన్న వ్యధ అతన్ని దహించివేయసాగింది. అభిమన్యున్ని హతమార్చగలిగామన్న సంతోషం ఏ మూలన పడిపోయిందోకానీ, అతన్ని చంపడానికి తాను అనుసరించిన అధర్మ మార్గం తీవ్రమైన హృదయ క్షోభకు గురిచేసింది. అధర్మ మార్గంలో సాధించిన విజయం వేయి అపజయాలకు సమానమని, ధర్మ మార్గంలో ఓడినా అది వేయి విజయాలకు సమానమని అతనికి బోధపడసాగింది.



Saturday, 3 June 2017

అర్జునుడు

అర్జునుడు
SN. Question Answer 
1 ఎవరి వర ప్రభావంతో కుంతీదేవికి అర్జునుడు జన్మించాడు? ఇంద్రుడు
2 అర్జునుడు ఎవరి వద్ద ధనుర్విద్యలో ఆరితేరాడు? ద్రోణాచార్యుడు
3 కృష్ణార్జునులను కలిపి ఏమని పిలుస్తారు? నరనారాయణులు
4 ద్రౌపదితో స్వయంవరం కోసం అర్జునుడు ఏ యంత్రాన్ని ఛేదించాడు? మత్స్య యంత్రం
5 అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు ఏ రూపంతో జీవించాడు? నపుంసకుడు
6 ఎవరి శాపంతో అర్జునుడు నపుంసక రూపాన్ని పొందాల్సి వచ్చింది? ఊర్వశి
7 అర్జునుడి భార్య సుభద్ర ఎవరి చెల్లెలు? కృష్ణుడు
8 సుభద్రార్జునుల కుమారుడెవరు? అభిమన్యు
9 అర్జునుడి ధనుస్సు పేరేమిటి? గాండీవము
10 శివుడు అర్జునుడికి ప్రసాదించిన అస్త్రం? పాశుపతాస్త్రం
11 కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న ధ్వజం ఏది? కపిధ్వజం
12 అర్జునుడి ద్వారా మానవాళికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం భగవద్గీత
13 కౌరవసేనలో అర్జునుడికి సమానమైన వీరుడిగా ఎవరిని భావిస్తారు? కర్ణుడు
14 భీష్ముడిని చంపడానికి అర్జునుడు ఎవరి సాయం తీసుకున్నాడు? శిఖండి
15 కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథి ఎవరు? శ్రీకృష్ణుడు
16 ద్రౌపదితో అర్జునుడికి పుట్టిన కుమారుడి పేరేమిటి? శృతకర్మ
17 గీతాబోధ తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా దర్శనమిచ్చాడు? విశ్వరూపం
18 అర్జునుడి కోసం ఎవరి బొటనవేలును ద్రోణుడు గురుదక్షిణగా కోరాడు? ఏకలవ్యుడు
19 అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు ఎవరికి రథసారథిగా వ్యవహరించాడు? ఉత్తర కుమారుడు
20 విరాట మహారాజు కొలువులో అర్జునుడు ఏ బాధ్యత నిర్వర్తించేవాడు ? నాట్యాచార్యుడు