Sunday, 23 March 2014

పాండవులు - విజేతలు ఓడినవేళ





విజేతలు ఓడినవేళ

భారత యుద్ధంలో విజేతలైన పాండవులు కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని దర్శించారు.

భీష్ముడు ధర్మరాజుకి వివిధ ధర్మాలు బోధించి..‘నాయనా. నా కర్తవ్యం కూడా ముగిసింది. ఇక నేను తృప్తిగా ఈ లోకం విడిచి వెళ్తా. నా చివరి కోరిక తీరుస్తావా మనవడా?’ అన్నాడు.

‘ఎంత మాట తాతా, తప్పక తీరుస్తా’ అన్నాడు ధర్మరాజు.

అప్పుడు భీష్ముడు.. ఇంతకు ముందు ఏ శవమూ దహించని చోట తన దహన సంస్కారం జరిపించాలని కోరాడు.

ధర్మరాజు సరేనన్నాడు.

భీష్ముని కళ్లు శాశ్వతంగా మూతబడినై.

అనంతరం.. అన్నగారి ఆదేశానుసారం నల్గురు సోదరులూ నాల్గు దిక్కులా వెతికినా శవ దహనం జరగని చోటు దొరకలేదు. ఈ క్రమంలో ధర్మరాజుకి ఒక పండు ముసలి రైతు కనిపించగా ఆశగా, ఆతృతగా అడిగాడు.

దానికా రైతు.. ‘నా ఎరికలో.. అదుగో ఆ కన్పించే ఎత్తైన గుట్టమీద ఇంతవరకు అలాంటిది జరగలేదు’ అన్నాడు.

ధర్మరాజు ఎగిరి గంతేశాడు. దహనానికి ఏర్పాట్లు జరిగినై. తల కొరివి పెట్టడమే తరువాయి.

ఆ సమయంలో.. ‘ఈ గుట్ట మీద వంద మంది భీష్ములు, మూడు వందల మంది పాండవులు, వెయ్యిమంది ద్రోణులు, ఇక లెక్కకు మించి కర్ణులు దహించబడ్డారు’ అంటూ ఆకాశవాణి వినిపించింది.

దీంతో పాండవులు ఉలిక్కిపడ్డారు.

అయ్యో! తాతయ్య కడసారి కోరిక తీర్చలేకపోయాం గదా - అని నీరుగారిపోయారు.

అంతలోనే ధర్మరాజు గంభీరంగా నవ్వుతూ.. ‘తాతగారు మహా మనీషి. ఆయన మేధ అసాధారణం. ఆయన భావం మనమే గ్రహించలేకపోయాం. అర్జునా! మనందరికీ ఏదో ఒక గర్వం. నీకు సవ్యసాచివని గర్వం. భీమునికి భుజబలగర్వం. నకులునికి సౌందర్య గర్వం. సహదేవునికి శాస్త్ర, విద్యా గర్వం. ధార్మికుడినని నాకు గర్వం. ఇక భారత యుద్ధంలో గెల్చామనే వ్యర్థ గర్వం సరేసరి’ అన్నాడు.

‘ఆహా! మనలాంటి వారు కాదు కాదు, మనకన్నా గొప్పవారెందరో ఇక్కడ (ఈ భూమ్మీద) అంతరించారు.’ అన్నాడు భీముడు.

‘ఆ సత్యాన్ని ఎంత విలక్షణంగా బోధించాడు తాతయ్య’ అన్నాడు నకులుడు.

అలా.. విజేతలైన పాండవులు పితామహుని చేతిలో ఓడినా తమ గర్వాన్ని పోగొట్టిన ఆ ఓటమిలో ఎంతో ఆనందం, తృప్తి, మనశ్శాంతి పొందారు.
- తంగిరాల రాజేంద్ర ప్రసాద శర్మ 

Friday, 21 March 2014

శనిదోషాలు





శనిదోషాలు


సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. ఇద్దరూ న్యాయాధిపతులే. అయినా వీరిలో ఈ లోకంలోని జీవుల పాపపుణ్యాలను బట్టీ ఇక్కడే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది. శని దోషకాలంలో దాగున్న పరమార్థం అదే.

జాతకంలో శనిదోషం ఉంది అనగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. శనిదోషం శుభప్రదమైనది కాకపోవడమే ఇందుకు కారణం. అయితే, శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతటి దోషం నుంచైనా ఉపశమనం లభిస్తుందనేది జ్యోతిషపరమైన వాస్తవం. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ఆయా రాశుల్లో చేసే సంచారాన్ని అనుసరించి శనిదోషం ఉంటుంది. ఈ శనిదోషాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని మూడురకాలుగా ఉంటాయి.

ఏలినాటి శని
పూర్ణాయుష్కుడైన ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని మూడుసార్లు వస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శని ఏడున్నర సంవత్సరాలపాటు జాతకం మీద ప్రభావం చూపే కాలాన్ని ఏలినాటి శని అంటారు. దీన్నే ఏడునాడు శని అని కూడా వ్యవహరిస్తారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. ఇది శుభాశుభాల మిశ్రమకాలం. ఏ వ్యక్తి జాతక చక్రంలోనైనా పన్నెండు రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో సంబంధిత గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. జన్మరాశి నుంచి పన్నెండు, ఒకటి, రెండు స్థానాల్లో శని ఉన్న కాలాన్ని ఏలినాటి శని కాలంగా పేర్కొంటారు. మళ్లీ తిరిగి ఈ ఏడున్నర సంవత్సరాలను ద్వాదశ శని, జన్మశని, ద్వితీయశని అనే మూడు దశలుగా విభజిస్తారు. ఒక్కో దశా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. జన్మరాశి నుంచి పన్నెండో స్థానంలో శని ఉంటే దాన్ని ద్వాదశ శని అంటారు. ఈ కాలంలో ప్రమాదాలు, ధననష్టం, అపార్థాలు, అపోహలు అధికంగా ఉంటాయి. శనీశ్వరుడు ఒకటో స్థానంలో ఉన్న కాలాన్ని జన్మశని అంటారు. ఈ కాలంలో శారీరక, మానసిక అనారోగ్యాలు ఎక్కువవుతాయి. సంపాదన ఉంటుంది కానీ డబ్బు చేతిలో ఉండదు. జన్మరాశి నుంచి రెండో స్థానంలో శని ఉంటే ఆ కాలాన్ని ద్వితీయ శని అంటారు. ఏలినాటి శని చివరి దశ ఇది. ఈ కాలంలో ధననష్టం, అపార్థాలు ఉన్నప్పటికీ కోలుకునే దశ ప్రారంభమవుతుంది.

అర్ధాష్టమ శని
ఏలినాటి శని పూర్తయిన రెండున్నరేళ్ల తర్వాత అర్ధాష్టమ శని కాలం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని నాలుగో ఇంట ఉన్న కాలాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి.

అష్టమశని
అర్ధాష్టమశని దోషం పూర్తయిన ఏడున్నర సంవత్సరాల తర్వాత అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దోషకాలం. అపమృత్యుభయం, అనారోగ్యం, అవమానాలు వంటివన్నీ ఈ దోషకాలంలోనే జరుగుతాయి. అష్టమశని రెండున్నరేళ్ల కాలం పాటు ఉంటుంది.

ఇలా పరిహరిద్దాం 
ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి.  శనివారంతోపాటు త్రయోదశి, అమావాస్య కలసివచ్చినప్పుడు శనీశ్వరుడిని తప్పక ఆరాధించాలి. పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. యాచకులకూ వికలాంగులకూ పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం మంచిది.



Sunday, 16 March 2014

చిరంజీవులు





చిరంజీవులు


చిరంజీవులు అంటే చిరకాలం జీవించి ఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. వీరు ఏడుగురు చిరంజీవులు.

అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||

దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.



మధుపర్కం - పంచామృతం





 మధుపర్కం - పంచామృతం 

మధుపర్కం అంటే ఏమిటి?
మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. ఆ మిశ్రమం వేటితో చేయాలి? దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్వ పంచభిః – అంటే సమపాళ్ళలో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇంకా జలం. వీటి మిశ్రమమే మధుపర్కం.

పంచామృతం మధుపర్కం తేడా?
పూజల్లో పంచామృతం వాడతారు కదా – మరి పంచామృతానికీ, మధుపర్కానికీ తేడా ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనే ఇంకా చెక్కెర – ఈ క్రమంలో ఆయా పదార్థాలను విడి విడిగా స్నపనం చేసి, అలా వచ్చిన పదార్థాన్ని అంటే పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించాలి. అన్నిటినీ కలిపేసి అభిషేకం చేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమటుకూ సరైనదో తెలియదు. పంచామృతంతో అభిషేకం చేస్తాము; మధుపర్కం స్వీకరించమని అంటే తాగమని సమర్పించుకుంటాము – అది తేడా.

మధుపర్కం ఎందుకు సమర్పిస్తారు?
గౌరవాన్ని సుచిస్తూ సమర్పించుకునేది మధుపర్కం. యజమాని అంటే పూజ చేయిస్తున్న గృహస్తు లేదా పెళ్ళిలో కన్యాదానం చేస్తున్నతను – మర్యాద పూర్వకంగా గౌరవాన్ని సూచిస్తూ మధుపర్కం సమర్పించుకోవాలి. పూజలో అయితే భగవంతుడికి, పెళ్ళిలో ఐతే నారాయణ స్వరూపమైన వరుడికి. మధుపర్కం సమర్పించుకోవటం ఎంతటి గౌరవ సూచకమో, దానిని పద్ధతిగా స్వీకరించటమూ అంతే మర్యాదతో కూడుకున్నది. సంస్కృత నిఘంటువులో  ‘A mixture of honey’, a respectful offering made to a guest or to the bridegroom on his arrival at the door of the father of the bride అని ఉంది.



యక్ష ప్రశ్నలు





72 చిక్కు ప్రశ్నలు
ధర్మరాజు ఇచ్చిన జవాబులు


మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.
అవి ...
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
జ. సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
జ. అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
జ. మనస్సు

39. ఎవరితో సంధి శిధిలమవదు?
జ. సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
జ. యాగకర్మ

41. లోకానికి దిక్కు ఎవరు?
జ. సత్పురుషులు

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
జ. భూమి, ఆకాశములందు

43. లోకాన్ని కప్పివున్నది ఏది?
జ. అజ్ఞానం

44. శ్రాద్ధవిధికి సమయమేది?
జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు

45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో...

46. తపస్సు అంటే ఏమిటి?
జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం

47. క్షమ అంటే ఏమిటి?
జ. ద్వందాలు సహించడం

48. సిగ్గు అంటే ఏమిటి?
జ. చేయరాని పనులంటే జడవడం

49. సర్వధనియనదగు వాడెవడు?
జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు

50. జ్ఞానం అంటే ఏమిటి?
జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం

51. దయ అంటే ఏమిటి?
జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం

52. అర్జవం అంటే ఏమిటి?
జ. సదా సమభావం కలిగి ఉండటం

53. సోమరితనం అంటే ఏమిటి?
జ. ధర్మకార్యములు చేయకుండుట

54. దుఃఖం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం కలిగి ఉండటం

55. ధైర్యం అంటే ఏమిటి?
జ. ఇంద్రియ నిగ్రహం

56. స్నానం అంటే ఏమిటి?
జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం

57. దానం అంటే ఏమిటి?
జ. సమస్తప్రాణుల్ని రక్షించడం

58. పండితుడెవరు?
జ. ధర్మం తెలిసినవాడు

59. మూర్ఖుడెవడు?
జ. ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు

60. ఏది కాయం?
జ. సంసారానికి కారణమైంది

61. అహంకారం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం

62. డంభం అంటే ఏమిటి?
జ. తన గొప్పతానే చెప్పుకోవటం

63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును?
జ. తన భార్యలో, తన భర్తలో

64. నరకం అనుభవించే వారెవరు?
జ. ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మ శాసా్త్రల్నీ, దేవతల్ని, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
జ. ప్రవర్తన మాత్రమే

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
జ. మైత్రి

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
జ. అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
జ. సుఖపడతాడు

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
జ. అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు

70. ఏది ఆశ్చర్యం?
జ. ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం

71. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు?
జ. ప్రియయూ అప్రియయూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు?
జ. నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడై ఎవరైతే ఉంటాడో వానిని.






Saturday, 15 March 2014

ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా?





ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా మారిందంటే..

మహాభారత యుద్ధం ప్రారంభమై పది రోజుల కూడా పూర్తికాక ముందే భీష్ముడు అంపశయ్యపై ఒరిగాడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడు నివ్వెరపోయాడు. ‘ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్లు, పాండు పుత్రులు సమరయోధులై ఉన్నారు. అక్కడ ఏం జరుగుతోంది?’ అని సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు.

ధృతరాష్ట్రుడు అంధుడు. అతడికి ఉన్నది కేవలం అవయవలోపమే కాదు.. ఒకవిధంగా మానసిక వికలాంగుడు కూడా. అతడి మనసులో ఏదో తెలియని వెలితి. ఈ లోపం ఉన్నవారిని ఎప్పుడూ ఏదో లేదనే మనస్తాపం వెంటాడుతూనే ఉంటుంది. వారు ఆ వెలితి నుంచి బయటపడాలనే తపనతో సతమతమవుతుంటారు. ఇలాంటి వాళ్లకు ఎన్ని ఉన్నా ఏదీ కనపడదు. ‘ఇంకా ఏదో పొందాలి.. ఏదేదో అయిపోవాలి’ అనే ఆరాటం ఉంటుంది. ఇదే అసలైన అవిటితనం. ఈ అవిటితనమే మమకారానికి దారితీసింది. అందుకే ధృతరాష్ట్రుడు.. నావాళ్లు ఏమైపోయారో అంటూ సంజయుడి దగ్గర రోదించాడు.

తండ్రికి తగ్గ తనయుడు దుర్యోధనుడు. ఇతను అహంకారానికి అసలైన ప్రతీక. తనకు మించి ఎవ్వరూ ఉండరాదు. తనకన్నా ఎవరూ గొప్ప కాకూడదనే మితిమీరిన అహంకారం. ఈ అహంకారంతో గురువును కూడా ధిక్కరించేలా మాట్లాడాడు. ‘తవ శిష్యేణ ధీమతా..’, ‘మదర్థే త్యక్త జీవితాః’.. ‘నీ శిష్యుడైన దృష్టధ్యుమ్నునిచే పాండవ సైన్యం ఎలా కూర్చబడి ఉందో చూడు’, అలాగే.. ‘నా కోసం మీరందరూ జీవితాలను త్యాం చేసి వచ్చారు’ అనే ప్రేలాపనతో దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఈ విధంగ ధర్మక్షేత్రం.. కురుక్షేత్రంగా మారడానికి అహంకార, మమకారాలే కారణమయ్యాయి.


స్వామి పరిపూర్ణానంద