Saturday, 15 March 2014

ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా?





ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా మారిందంటే..

మహాభారత యుద్ధం ప్రారంభమై పది రోజుల కూడా పూర్తికాక ముందే భీష్ముడు అంపశయ్యపై ఒరిగాడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడు నివ్వెరపోయాడు. ‘ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్లు, పాండు పుత్రులు సమరయోధులై ఉన్నారు. అక్కడ ఏం జరుగుతోంది?’ అని సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు.

ధృతరాష్ట్రుడు అంధుడు. అతడికి ఉన్నది కేవలం అవయవలోపమే కాదు.. ఒకవిధంగా మానసిక వికలాంగుడు కూడా. అతడి మనసులో ఏదో తెలియని వెలితి. ఈ లోపం ఉన్నవారిని ఎప్పుడూ ఏదో లేదనే మనస్తాపం వెంటాడుతూనే ఉంటుంది. వారు ఆ వెలితి నుంచి బయటపడాలనే తపనతో సతమతమవుతుంటారు. ఇలాంటి వాళ్లకు ఎన్ని ఉన్నా ఏదీ కనపడదు. ‘ఇంకా ఏదో పొందాలి.. ఏదేదో అయిపోవాలి’ అనే ఆరాటం ఉంటుంది. ఇదే అసలైన అవిటితనం. ఈ అవిటితనమే మమకారానికి దారితీసింది. అందుకే ధృతరాష్ట్రుడు.. నావాళ్లు ఏమైపోయారో అంటూ సంజయుడి దగ్గర రోదించాడు.

తండ్రికి తగ్గ తనయుడు దుర్యోధనుడు. ఇతను అహంకారానికి అసలైన ప్రతీక. తనకు మించి ఎవ్వరూ ఉండరాదు. తనకన్నా ఎవరూ గొప్ప కాకూడదనే మితిమీరిన అహంకారం. ఈ అహంకారంతో గురువును కూడా ధిక్కరించేలా మాట్లాడాడు. ‘తవ శిష్యేణ ధీమతా..’, ‘మదర్థే త్యక్త జీవితాః’.. ‘నీ శిష్యుడైన దృష్టధ్యుమ్నునిచే పాండవ సైన్యం ఎలా కూర్చబడి ఉందో చూడు’, అలాగే.. ‘నా కోసం మీరందరూ జీవితాలను త్యాం చేసి వచ్చారు’ అనే ప్రేలాపనతో దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఈ విధంగ ధర్మక్షేత్రం.. కురుక్షేత్రంగా మారడానికి అహంకార, మమకారాలే కారణమయ్యాయి.


స్వామి పరిపూర్ణానంద

No comments:

Post a Comment