భారత యుద్ధంలో విజేతలైన పాండవులు కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని దర్శించారు.
భీష్ముడు ధర్మరాజుకి వివిధ ధర్మాలు బోధించి..‘నాయనా. నా కర్తవ్యం కూడా ముగిసింది. ఇక నేను తృప్తిగా ఈ లోకం విడిచి వెళ్తా. నా చివరి కోరిక తీరుస్తావా మనవడా?’ అన్నాడు.
‘ఎంత మాట తాతా, తప్పక తీరుస్తా’ అన్నాడు ధర్మరాజు.
అప్పుడు భీష్ముడు.. ఇంతకు ముందు ఏ శవమూ దహించని చోట తన దహన సంస్కారం జరిపించాలని కోరాడు.
ధర్మరాజు సరేనన్నాడు.
భీష్ముని కళ్లు శాశ్వతంగా మూతబడినై.
అనంతరం.. అన్నగారి ఆదేశానుసారం నల్గురు సోదరులూ నాల్గు దిక్కులా వెతికినా శవ దహనం జరగని చోటు దొరకలేదు. ఈ క్రమంలో ధర్మరాజుకి ఒక పండు ముసలి రైతు కనిపించగా ఆశగా, ఆతృతగా అడిగాడు.
దానికా రైతు.. ‘నా ఎరికలో.. అదుగో ఆ కన్పించే ఎత్తైన గుట్టమీద ఇంతవరకు అలాంటిది జరగలేదు’ అన్నాడు.
ధర్మరాజు ఎగిరి గంతేశాడు. దహనానికి ఏర్పాట్లు జరిగినై. తల కొరివి పెట్టడమే తరువాయి.
ఆ సమయంలో.. ‘ఈ గుట్ట మీద వంద మంది భీష్ములు, మూడు వందల మంది పాండవులు, వెయ్యిమంది ద్రోణులు, ఇక లెక్కకు మించి కర్ణులు దహించబడ్డారు’ అంటూ ఆకాశవాణి వినిపించింది.
దీంతో పాండవులు ఉలిక్కిపడ్డారు.
అయ్యో! తాతయ్య కడసారి కోరిక తీర్చలేకపోయాం గదా - అని నీరుగారిపోయారు.
అంతలోనే ధర్మరాజు గంభీరంగా నవ్వుతూ.. ‘తాతగారు మహా మనీషి. ఆయన మేధ అసాధారణం. ఆయన భావం మనమే గ్రహించలేకపోయాం. అర్జునా! మనందరికీ ఏదో ఒక గర్వం. నీకు సవ్యసాచివని గర్వం. భీమునికి భుజబలగర్వం. నకులునికి సౌందర్య గర్వం. సహదేవునికి శాస్త్ర, విద్యా గర్వం. ధార్మికుడినని నాకు గర్వం. ఇక భారత యుద్ధంలో గెల్చామనే వ్యర్థ గర్వం సరేసరి’ అన్నాడు.
‘ఆహా! మనలాంటి వారు కాదు కాదు, మనకన్నా గొప్పవారెందరో ఇక్కడ (ఈ భూమ్మీద) అంతరించారు.’ అన్నాడు భీముడు.
‘ఆ సత్యాన్ని ఎంత విలక్షణంగా బోధించాడు తాతయ్య’ అన్నాడు నకులుడు.
అలా.. విజేతలైన పాండవులు పితామహుని చేతిలో ఓడినా తమ గర్వాన్ని పోగొట్టిన ఆ ఓటమిలో ఎంతో ఆనందం, తృప్తి, మనశ్శాంతి పొందారు.
- తంగిరాల రాజేంద్ర ప్రసాద శర్మ
No comments:
Post a Comment