వాల్మీకి ఉత్తరకాండకు, మన లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి. వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
- శూర్పణఖ విభీషణుడికి అక్క.
- రావణ, కుంభకర్ణ, శూర్పణఖా, విభీషణులు కన్యాపుత్రులు.
- మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు ('భూకైలాస్' గుర్తొచ్చిందా).
- రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.
- సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.
- శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.
- యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.
- ఒక్క చాకలే కాదు, అయోధ్యా ప్రజలందరూ 'రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ 'ని కారుకూతలు కూస్తారు.
- కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా.
- రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో. అయోధ్యలో కాదు.
- కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి, 'మీ తల్లిని వెంటబెట్టుకొని రండి' అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా,కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.
- సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధయాగాలు పూర్తి చేస్తాడు.
మీరు అన్యథా భావించని పక్షంలో మరొక సమాచారం. కుశలవులు రామసభలో రామాయణం గానం చేసి చెప్పినట్లుగా ఒక రామాయణ కావ్యం ఉంది. దానిపేరు ఆశ్చర్యరామాయణం.
ReplyDeleteఒక యభై ఏళ్ళక్రిందట మాయింట్లో దాని ప్రతి ఒకటి ఉండేడి. ఇప్పుడు ఆ కావ్యం ముద్రణలో దొరుకుతోందో లేదో తెలియదు.
మరొక సంగతి అండీ. శ్రీరామచంద్రులవారు రాజ్యం చేసినది పదునొకండు వేల సంవత్సరాలు. ఆయన సీతాసమేతులై రాజ్యం చేసినది పదివేలేండ్లు. సీతాపరిత్యాగానంతర రాజ్యపాలన ఒక వేయి సంవత్సరాలు.
ReplyDelete