Wednesday, 11 January 2017

వీరులకు ఉత్తమ లోక ప్రాప్తి.

ధర్మరాజు " పితామహా యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి ? " అని అడిగాడు. 

భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు " ధర్మనందనా ! పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణానంతరం స్వర్గలోకం వెళ్ళాడు. స్వర్గలోకంలో తన దగ్గర పరిచారకుడు సుదేవుడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగడం చూసి దేవేంద్రుడిని చూసి " దేవేంద్రా ! నా దగ్గర పరిచారకుడు ఎటు వంటి యజ్ఞయాగములు చెయ్యకనే ఎలా నా కంటే అధికంగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు " అని అడిగాడు. 

ఇంద్రుడు " సుదేవుడిని గురించి ఇలా చెప్పాడు " పూర్వం శృతశృంగుడు అనే రాక్షసునికి సదముడు, వదముడు, దముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చెయ్యడానికి పంపుతూ " వస్తే విజయంతో రా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు " అని చెప్పావు. వారి గురించి చారుల వలన తెలుసుకున్న సుదేవుడు వారి మాయోపాయములను గురించి తెలుసుకుని వారిని జయించడం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపి శివుని స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై " మహావీరా! నీ వంటి వాడికి ఇది తగదు. ఎందుకిలా చేస్తున్నావు " అని అడిగాడు.

సుదేవుడు " శంకరా ! శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకుని జననష్టం కావడం ఇష్ట పడక ఇలా చేసాను " అన్నాడు.

అప్పుడు శివుడు అతడికి దివ్యరధమును, దివ్యధనస్సును, దివ్యమైన అంబుల పొదిని ఇచ్చి ఏ మాత్రం కాలు కింద పెట్టకుండా శత్రుసంహారం చెయ్యమని చెప్పాడు. సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు, దముడిని యుద్ధంలో సంహరించాడు. సోదరుల మరణానికి కోపోద్రేకుడైన విదముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రధము దిగి విదముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరిక్కుని ఇద్దరూ చనిపోయారు. రాక్షససైన్యం చెదిరి పోయింది నీకు విజయం చేకూరింది. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా వీర మరణానికి సాటి రావు " అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని " భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ధర్మనందనా ! ఒక సారి జనకుడికి ప్రత్యర్ధుడికి యుద్ధం సంభవించింది. అప్పుడు జనకుడు తన సైన్యముతో " మహా వీరులారా ! మీకు వీరమరణం చెందిన వారికి ప్రాప్తించే సకల సుఖాలకు స్థానమైన స్వర్గం కావాలా ! లేక పిరికి వారికి కలిగే నరకం కావాలా !"అని అడిగాడు. జనకుని అంతర్యం తెలుసుకున్న వీరులు ప్రాణాలకు తెగించి పోరాడి జనకునికి విజయం సాధించి పెట్టారు. కనుక ధర్మనందనా ! వీరుడికి స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి " అని భీష్ముడు చెప్పాడు.    

No comments:

Post a Comment