Friday, 13 March 2015

సుందోపసుందులు





సుందోపసుందులు

పూర్వం కుంభుడనే రాక్షసుండేవాడు. వాడు మహాబలశాలి. వాడికి ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరూ మహాభయంకర దేహం కలవారు. పెద్దవాడు సుందుడు, రెండో వాడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. ఒకరోజు వారికి తమ పూర్వీకుల మాదిరిగా త్రిలోకాలను జయించాలనే కోరిక కలిగింది.

దాంతో వింధ్యపర్వతం చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. అన్నపానీయాలు తీసుకోకుండా కఠోర తపస్సు చేశారు. గాలిని ఆహారంగా గ్రహిస్తూ బొటనవేలు మీద నిలుచుని తపస్సు చేశారు. ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆ రాక్షససోదరులు చలించలేదు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరకోమన్నాడు. అప్పుడు వారు ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్యలన్నీ తమకు రావాలనీ, ఇంద్రజాల విద్యలన్నీ తమ ఆధీనంలో ఉండాలనీ, తమకు తాము వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరొకరి వల్ల మరణం రాకూడదని కోరుకున్నారు. వారి కోరికను అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు.

బ్రహ్మ ఇచ్చిన వరంతో వాళ్లు అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం... ఇలా లోకాలన్నీ వశపరచుకున్నారు. మునులను హింసించారు. ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞసామాగ్రిని ధ్వంసం చేశారు. వారి వల్ల ఎవ్వరికీ మనఃశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవతలు, మునులు బ్రహ్మను శరణు కోరారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి ‘‘మహాశిల్పీ! ప్రపంచంలో ఎంతటి వారైనా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు’’ అని అన్నాడు.

బ్రహ్మ ఆజ్ఞ మేరకు విశ్వకర్మ తిలోత్తమ అనే అందగత్తను రూపొందించారు. ఆమె అందం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. దేవేంద్రుడు వెయ్యి కళ్లూ విప్పి చూశాడు. ఆ అందగత్తె తిలోత్తమ రాక్షస సోదరులున్న వింధ్యపర్వతాన్ని చేరుకుంది. మైకంలో తూళుతున్న ఆ సోదరులు తిలోత్తమను చూసి మైమరచి పోయారు. తిలోత్తమ భయాన్ని, సిగ్గుని అభినయిస్తూ ఓరచూపుతో ఇద్దరినీ రెచ్చగొట్టింది. ఒకడు కుడిచేయి అందుకుంటే మరొకడు ఎడమచేయి అందుకున్నాడు.

మద్యం మత్తులో ఉన్న సుందున్ని ఒక కంటితో, ఉపసుందున్ని మరో కంటితో రెచ్చగొట్టింది. ‘తమ్ముడూ! అన్న భార్య తల్లితో సమానం. నువ్వు తాకకూడదు’ అన్నాడు సుందుడు. ‘తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వుదూరంగా వెళ్లు’ అన్నాడు ఉపసుందుడు. నేనెవరికి దక్కాలో మీరిద్దరూ తేల్చుకోండి అంటూ పక్కకు తప్పుకుంది తిలోత్తమ. అంటే ముష్టిఘాతాలు కురిపించుకుని ఇద్దరు సోదరులు నేలకూలారు. కామపిశాచి ఎంతటి వారినైనా నేలకూలేలా చేస్తుందనడానికి ఈ కథ మంచి ఉదాహరణగా నిలిచింది.

No comments:

Post a Comment