కుబేరుడు బంగారానికి ఆధిపతి. అతను తన ఐశ్వర్యాన్ని చూసుకుని విర్రవీగేవాడు. ఒకరోజు పరమేశ్వరుని ముందూ తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. కైలాసానికి వెళ్లి ‘స్వామీ! మీరు ఇరువురూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి’ అని కోరాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న శివుడు ఇతనికి గుణపాఠం నేర్పాలని అనుకుని ‘నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను’ అని చెప్పాడు. వెంటనే కుబేరుడు ‘నేను ఏర్పాట్లు చేశాను, మీరు మా ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరించాలి, మీరు రాకపోతే నేను బాధపడతాను’ అని అన్నాడు. అలా అయితే ‘నా కుమారున్ని పంపిస్తానని’ శివుడు అన్నాడు. దానికి కుబేరుడు సరే అన్నాడు. అయితే నీకొక ముఖ్య విషయం చెబుతాను.
వినాయకుడు కొంచెం ఎక్కువగా తింటాడు, ఫరవాలేదుగా అని అడిగాడు. మరేం ఫరవాలేదు స్వామీ. ఎంత తిన్నా నేను పెట్టగలను అని కుబేరుడు జవాబిచ్చాడు. అయితే సరే నా కుమారున్ని తీసుకెళ్లు అని శివుడు వినాయకున్ని పంపిస్తాడు. వినాయకుడు కుబేరుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఆహారపదార్థాలు రుచిగా ఉండటంతో వినాయకుడు తృప్తిగా తినడం మొదలుపెట్టాడు. వడ్డిస్తూనే ఉన్నారు, వినాయకుడు తింటూనే ఉన్నాడు. ఇంతలో వంటవాడు వచ్చి కుబేరునితో వండిందంతా అయిపోయిందని చెప్పాడు. కుబేరునికి ఏం చేయాలో పాలుపోలేదు. వినాయకున్ని ఎలా శాంతపరచాలో కుబేరునికి తెలియలేదు. ‘‘వినాయకా! వండిందంతా ఆయిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు’ అని అడిగాడు.
‘‘నాకు ఏదో ఒకటి పెట్టు లేదంటే నిన్ను మింగేస్తాను’ అని వినాయకుడు హెచ్చరించాడు. దాంతో కుబేరునికి శివుడు గుర్తొచ్చాడు. ఆయనొక్కడే నన్ను కాపాడగలడు అనుకుని కైలాసానికి పరుగు పెట్టాడు. ‘‘నన్ను క్షమించు స్వామీ! నువ్వొక్కడివే నన్ను కాపాడగలవు’’అని మోకరిల్లి పడి వేడుకున్నాడు. శివుడు అతన్ని క్షమించి ‘నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా కుమారునికి ప్రేమతో ఈ మరమరాలు సమర్పించు. నీకు అతని ఆశీర్వాదం లభిస్తుంది’ అని ఇచ్చి పంపించాడు. వెంటనే కుబేరుడు వినాయకుని దగ్గరకు వెళ్లి ‘తండ్రీ నన్ను క్షమించండి. ఈ మరమరాలు తీసుకుని నన్ను ఆశీర్వదించండి’ అని వేడుకున్నాడు. అవి తిన్న వినాయకునికి ఆకలి తీరింది. కుబేరున్ని ఆశీర్వదించాడు.
No comments:
Post a Comment