Wednesday, 22 February 2017

మహాశివరాత్రి రోజు

మహాశివరాత్రి రోజున శివార్చన, ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత

ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి,మాస శివరాత్రి. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది “మహా శివరాత్రి”.

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే “మహా శివరాత్రి”. శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు.

శివార్చన :
తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.ముఖ్యంగా శివాలయం గోపుర శిఖరదర్శనం చేసుకున్న తరువాత శివాలయంలోపల శివలింగంను దర్శించుకుంటే మంచిది . ఈ రోజున పేదవారికి అన్నదానం,వస్త్రదానం చేయాలి.

రుద్రాభిషేకం
వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే “రుద్రాభిషేకం” (Rudrabhisheka) అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్ర
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

ఉపవాసం :
ఉపవాసమంటే మనసులో శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని వయసు అయినవారు,షుగర్ ఉన్నవారు అనారోగ్యంతో భాదపడుతున్నవారు ఆహారం తీసుకోకుండా శరీరాన్నిబాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది.

జాగరణ:
నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం. ఈనాడు చేసే జాగారాన్ని ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివాలయంలో కూర్చుని శివాలయంలో నిర్వహించే అభిషేకాలు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో చేసే అభిషేకం చూడడం శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుంది.

జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివపురాణములతో ఇవన్నీ చేయలేకపోయిన ఒక్క ఓం నమఃశివాయ అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామంలలో శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని ప్రజల విశ్వాసం.

ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో 14వ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది .

ఈ రోజున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నోరకాల పుణ్య స్నానములు, దానములు, పుష్ప, నైవేద్యం సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి.

ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

శివరాత్రితో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – "ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట ఆకలితో భాధ పడుతూ ఒక వ్యక్తి కనిపించగా అతనికి తనదగ్గర ఉన్న ఆహారం ముందు అతడికి ఇచ్చి తర్వాత తన కుటుంబసభ్యులు తను తిన్నాడు. ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వవృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరిక ఆహారం సమర్పించి తను సేవించాడు.

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని అందుకే పరమ శివుడును అభిషేకప్రియుడు అని పిలుస్తారు. శివుడికి అర్చన చేసే ఆర్ధికస్తోమత లేనివారు శివలింగం మీదు కొంచం నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు.

శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన శివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ,ఒడుదొడుకులు తొలగిపోతుంది.

No comments:

Post a Comment