Friday, 12 May 2017

శబరి

శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు. కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలం నుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది. రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి, మహా యోగులు పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.

రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి, రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత మా గురువులు చెప్పినప్పటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది. రాముని కోసం ఎంతో కాలంగా సంపాదించి, భద్ర పరచిన ఫల, మూలాదులను ఆయనకు అర్పించింది.

దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచి పండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే “ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకంలో లేదు. కాని “శబరి” పేరుతో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు. మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది. పద్మపురాణం లో మనకు ఈ విందు ప్రస్తావన కన్పిస్తోంది.

పద్మపురాణ భాగంలో “ పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది.

శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన.

శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణంలో కన్పిస్తోంది.
శబరి పూర్వ జన్మలో మాలిని అనే గంథర్వకన్య. గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది. భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా ఈమె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు ఈమెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి మాలినిగా మారిపోయి భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. అని కంబరామాయణం శబరి పూర్వ చరిత్రను ప్రస్తావించినా తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.




No comments:

Post a Comment