Wednesday, 18 November 2015

రామాయణం - 2


ముని రక్షణ కోసం రాముని ప్రతిజ్ఞ

భరతుడు రాముడి వద్దకి వచ్చి పాదుకలని తీసుకొని రాజ్యానికి వెళ్ళాక, ఈ ప్రాంతం రాముడు ఉన్నాడని అందరికి తెలిసిపోయింది పైగా అయోధ్యకి అది దగ్గరగా ఉంది, ఎదో ఒక పనితో ప్రజలు వస్తూ పోతూ ఉంటారని రాముడు క్రమంగా దండకారణ్యం లోనికి వెళ్ళిపోతారు. అక్కడి నుండి నుండి రాముడు హనుమ సుగ్రీవులని కలిసేంతవరకు అది అరణ్యకాండ. అప్పుడు ఆయన ఎంతమందో ఋషులని ఆశ్రయించాడు, ఒక్కో ఋషికి ఆశ్రమం ఉండేది.
రాముడు ఒక మనిషిగా మంచిగా బ్రతకటం ఎలానో చూపడానికి తాను ఎన్నో ఆచరించి చూపాడు. మహనీయులని దర్శించాలి అని మనకు చెప్పేందుకు, రాముడు తాను అడవికి వెళ్ళినప్పుడు ఋషులని దర్శించడం తన కర్తవ్యం అని అనుకొని వెళ్ళేవాడు. రాముడు అరణ్యంలో మొదట శరభంగుడు అనే ఋషిని దర్శించాడు. శరభంగుని వైభవం ఎంత గొప్పదంటే, రామచంద్రుడు ఆయన ఆశ్రమాన్ని దర్శించే ముందు పై నుండి రథంలో ఇంద్రుడు వచ్చి సంప్రదించాడు. అట్లా తను శరభంగుడు అనే ఋషి వద్దకి వెళ్ళాడు. ఆ ఋషి మృత్యువుని కూడా తన చేతిలో పెట్టుకున్న మహనీయుడు. ఆయన ఉన్నంతకాలం ఆయన ఆశ్రమాన్ని ఏ రాక్షసుడూ ఏమి చేసేవాడు కాదట. కానీ తన తర్వాత ఆశ్రమాన్ని ఎట్లా కాపాడు కోవడం అని చింతించేవాడట. శాపం పెట్టి రాక్షసులను చంపేవారు కాదు ఎందుకంటే తపస్ శక్తి అనేది అతి విలువైనది. మామూలుగా పెద్దల వద్దకి వెళ్ళేప్పుడు వట్టి చేతులతో పోకూడదు అనేది నియమం. వారికి అవసరమైనదేదో ఇవ్వాలి. మామూలుగా ఋషుల వద్దకి వెళ్ళితే సమిదలు తీసుకు వెళ్ళేవారు, కానీ ఆ ఋషికి ఏమి ఇస్తే ఆనందపడుతాడు అని ఆలోచించి, వారికి కష్టం కల్గించే విరాధుడిని సంహరించి ఆ వార్తను శరభంగుడికి అర్పించాడు. అందుకు శరభంగుడు తాను ఆర్జించుకున్న పుణ్యాలని రాముడికి ఇచ్చి తన దేహాన్ని పరిత్యజించి, ఊర్థ్వలోకాని వెళ్ళాడు.  అట్లా ఇందులో ఎన్నో విషయాలు శ్రీరాముడు చూపించాడు, పెద్దలను దర్శించుకోవాలి, అట్లా వారిని దర్శించేందుకు వెళ్తే ఎదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, ఆ తీసుకుపోయేది ఏదో ఒకటి కాక వారు ఇష్టపడేది తీసుకు వెళ్ళాలి, అంతేకాక తాను అడవికి వచ్చినదే రాక్షస నిర్మూలన కనుక తన ధర్మాన్ని పాఠించాడు. అట్లా సామాన్య ధర్మం, రాజ ధర్మం, వైధిక ధర్మం అన్నీ పాటించి చూపాడు రాముడు. ఆతరువాత సుతీక్షణుడిని దర్శించాడు. ఆపై అగస్త్యుడిని దర్శించాడు. రామునికి కావల్సిన ధనస్సుని, భాణాలని అగస్త్యుడే ఇచ్చాడు. తరువాత యుద్దంలో రాముడు అలసిపోతే విజయం కలగడానికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అగస్త్యుడిని దర్శించాక క్రమంగా పంచవటి వచ్చాడు. ఆ మధ్యలో ఒక్కో ఋషి ఆశ్రమాలలో రెండు రోజులు గడిపేవాడు, అట్లా సుమారు పది సంవత్సరాలు గడిచాయి. అట్లా వారు పంచవటికి చేరుకున్నారు. 
అక్కడ కుటీరం వేసుకున్నారు. అక్కడ ఒక గ్రద్ద కనిపించింది. ఆ గద్ద పేరు జటాయువు, దశరథుని మిత్రుడు అని తెలిసింది. రామునికి ఒక వాగ్దానాన్ని చేసింది. ఇక్కడ మీరు హాయిగా సంచరించండి. ఎప్పుడైనా మీరిద్దరూ వనంలోకి వెళ్ళాల్సి వస్తే నేను సీతమ్మకు కాపలా ఉంటాను అని చెప్పింది. లక్ష్మణుడు మంచి కుటీరం నిర్మించాడు. రామచంద్రుడు కుటీరంలో ప్రవేశిస్తుంటే ఋషులంతా అక్కడికి వచ్చారు. ఎందరో ఋషులు ఉండేవారు దండకారణ్యంలో, వారితో పాటు రాక్షసులు ఎందరో ఉండేవారు. మేం నీ రాజ్యంలో ఉన్నాం, తమని రాక్షసుల భారి నుండి కాపాడాలి అని కోరారు. ఆయన సిగ్గుపడ్డాడు, ఆయన వచ్చిందే ఋషుల రక్షణకి అని, రక్షణ చేయటంలో జరిగిన కాల విలంబనకి క్షమాపన కోరాడు. అప్పుడు సీతమ్మ రాముడిని ఒక పరిక్ష పెట్టి చూస్తుంది. ఇంతకాలం మనం బాగానే ఉన్నాం, మన వద్దకి రాక్షసులు రాలేదు, ఇంత మంది ఋషులకి వాగ్దానం చేస్తున్నావు, మనం లేని పోని ఆపదలను తెచ్చుకుంటున్నామేమో అని, మన చుట్టూ ఉన్న వస్తువుల ప్రభావం మనపై పడుతుంది అనేది రామునికి చెప్పాలని ఆమె ఒక కథ చెబుతుంది. అనగనగా ఒక మహానుహావుడు తపస్సు చేసుకొని బాగుపడాలని అడవికి వెళ్ళాడు. ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే ఇంద్రునికి భయం. ఏదో ఒకలా తపస్సుని భంగం చేయాలని తను ఒక ఉపాయం చేసాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక సిపాయి వేశం వేసుకొని కత్తిని ఆయన పక్కన పెట్టి దీన్ని కాపాడండి నేను రేపు వచ్చి తీసుకుంటా, నన్ను శత్రువులు తరుముతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. తపస్సు ముగించి లేచి చూసాక ఆయనకు కొంత కొంత జ్ఞప్తికి వచ్చింది, ఎవరో అరువుగా పెట్టి వెళ్ళారని. ఆరోజునుండి ఆకత్తిని ప్రక్కనే పెట్టుకొని తపస్సు చేసుకొనే వాడు. ఉందో లేదో అని మధ్య మధ్యలో చేయితో తాకి చూసుకునే వాడు. అలాచేస్తే తన తపస్సు భంగం అవుతుందని భావించి దాన్ని తన ఒడిలో పెట్టుకొనే వాడు. ఇటూ అటు వెళ్ళినప్పుడు తన వెంట తీసుకొని వెళ్ళేవాడు. అది పాడు అయిపోతుందేమోనని, దాన్ని మధ్య మధ్య వాడుతూ ఉండాలి అని దర్బలు, సమిదలు కోయడానికి వాడేవాడు. అది ఎప్పుడూ చేతులో ఉండటంతో, ఇదివరకు అక్కడ ఉన్న జంతువులు ఆయనని ఏమని అనేవి కావు, చేతిలో ఏదో ఉన్నది చూసి, ఏమైనా చేస్తాడేమోనని ఎదురు తిరిగేవి, ఒక్క సారి కత్తితో అదురుతూ చివరికి జీవహింస కూడా చేయడం మొదలు పెట్టాడు. తపస్సు అంతా పోయి హింసాప్రవృత్తి ఏర్పడిపోయింది. కత్తి తామసిక వస్తువు దాని ప్రభావం మనపై ఉంటుంది. అందుకే సాత్విక వస్తువులు, సాత్విక వాతావరణం, సాత్వికంగా ఉన్న మూర్తిని ఆరాధన మనం ఏర్పరుచుకోవాలి. రామా! మనం ముని వృత్తి గడపడానికి వచ్చాం, మనకు ఈ భాణాలు ఎందుకు అని అడిగింది. ఇది తగునా అని అడిగింది సీతమ్మ. రామచంద్రుడు ఆమాట విన్నాక రాముడు ఒక ప్రతిజ్ఞచేసాడు. అసలు మనం వచ్చింది అసలు కార్యం రక్షణ చేయడానికి, ముని వృత్తి ఒక చిన్న భాగం. ఋషి రక్షణకి ఆటంకం ఏర్పడితే అసలు నేను నా ప్రాణాలనైనా వదిలేస్తా, నా ప్రాణాల కన్నా ఎక్కువైన నిన్ను వదిలేయడానికి వెనుకాడను. చివరికి లక్ష్మణుడినైనా  వదిలేయడానికి వెనుకాడను. సీతమ్మకు చాల సంతోషపడింది, ఆయన ప్రతిజ్ఞని స్థిరపరచటానికి ఆమే చేసిన పరిక్ష.

రాముని శాంత స్వభావానికి పరిక్ష
కైకమ్మ వరం కోరేప్పుడు నేరుగా దండకారణ్యానికి రాముడు వెళ్ళాలని కోరింది. అసలు ఇక్కడికి వస్తే తప్ప ఋషుల భాదలు తెలియవు, రాక్షస నిర్మూలన జరగాలంటే అక్కడి రాక తప్పదు. అసలు కైకమ్మ కోరిన వరం వల్లే రామచంద్రుడు గొప్పవాడు కాగలిగాడు. అందుకే రామునికి కైకమ్మ అంటే అంత ప్రేమ. ఒక సారి రాముడు చల్లని నీటిలో స్నానం చేస్తూ పాపం భరతుడు సుకుమారంగా పెరిగినవాడు, నిష్కారణంగా ఆయన పై వచ్చిన నిందలవల్ల మనలాగే నారబట్టలు ధరించి, కందమూలాలు తింటూ ఎంత కష్టపడుతున్నాడు చూడు అని లక్ష్మణుడితో అన్నాడు. భరతుడు అర్థరాత్రి సరయూ నదికి వెళ్ళి స్నానం చేసేవాడట. అందరు ఉండే సమయంలో వెళ్తే ఇదిగో ఈయనే రాముడిని వనానికి పంపినది అని తనను అంటారని కాదు, అనవసరంగా వారు తమ మనసుని భాద పెట్టుకుంటారేమోనని. అంత సున్నిత హృదయం కలవాడు భరతుడు. రాముని ఎడబాటుని తట్టుకోలేక, తాపం తొలగించుకోవడానికి చల్లటి నీరు ఉండే సమయం అర్థరాత్రి, ఆసమయం చూసి వెళ్ళేవాడు. లక్ష్మణుడు రామునితో అసలు భరతుడు, మనం ఇలా కష్టపడి బ్రతకడానికి కారణం కైకమ్మే కదా కారణం అని కోపంతో లేచాడు. వెంటనే రాముడు కోపడ్డాడు.

ఆమె కనక వనానికి పంపకుంటే ఋషులని సేవించుకొనే అవకాశమే లేకుండేది. దశరథుడు చేయకుండా వదిలిన పనులు తనకు చేసే అవకాశం ఇచ్చింది ఆవిడే కదా. అసలు దశరథ మహారాజు యొక్క రాజ్యం భూమండలం అంతా ఉండాల్సినది, రాక్షసుల పాలై చిన్నదై పోయింది. పేరుకే ఆయన చక్రవర్తి. కొంత భాగం వాలి, కొంత భాగం కరధూషణాదులు, ఒకవైపు రావణుడు పాలిస్తున్నాడు. రాముడు వనానికి వచ్చాకే తిరిగి రాజ్యం పూర్తిగా చేతికి వచ్చింది. అట్లా చూస్తే అసలు కైకమ్మ ఆయన రాజ్యన్ని పెంచింది కానీ ఆయనకు రాజ్యం లేకుండా చేయలేదు. ఆమెను ఆనాడు ఎంత మంది తిట్టారో, మంత్రులు, ప్రజలు ఎంతమంది ఏమి అనుకున్నా ఆమె చెదరకుండా ఉండ గలిగింది. సీతమ్మను కూడా నార చీరలు ధరించాల్సిందే అని కచ్చితంగా చెప్పింది, వశిష్టులవారు నచ్చజెప్పి సీతమ్మను శాసించే అధికారం నీకు లేదు అని చెప్పాడు కనక సీతమ్మ పట్టు వస్త్రాలతోనే వనవాసం చేసింది. దశరథుడు రాముని వెంట సైన్యాన్ని పంపుతా అని శాసనం చేస్తే, నాకొడుకు ఏం పాలించడానికి ఏమి మిగిలింది, సైన్యాన్ని పంపడానికి వీలు లేదు అని అడ్డు చెప్పింది. కొంత కూడా మొహమాట పడలేదు. ఆమె అంత గట్టిగా నిలిచింది కనకనే చక్రవర్తి అని పేరు రామునికి సార్తకం అయ్యింది. అంత ఉపకార స్మృతి రామునికి కైకమ్మపై ఉండేది, మనకు ఎన్ని ఆటంకాలు కలిగినట్లు అనిపించినా, అది మన మంచికి అని భావించాలి. అది కలిగించినవారి యందు కూడా ఉపకార స్మృతి ఉండాలి. రామునికి వందల అపకారాలు చేసినా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకొనేవాడు కాదు. అందుకోసమే కైకమ్మను ఒక్క మాట అననిచ్చేవాడు కాదు.

రాముడు శాంత మూర్తి, కోపం ఎప్పుడూ కనిపించదు ఆయనలో, అట్లాంటి వాడు అసలు రావణుడిని చంపుతాడా లేదా అనేది దేవతలకు ఎంతో బెంగ ఉండేది. మొదట్లో విశ్వామిత్రుడికి ప్రేరణ కలిగించారు. రాకుమారుడు కదా ఆయన వెంట నడిచి వెళ్ళాలంటే విసుక్కుంటాడేమోనని చూసారు. సుమారు పదిహేను రోజులు నడిచారు, కానీ ఏమాత్రం విసుగు లేదు ఆయనలో. ఆరు రోజులు నిద్రలేకుండా కాపలా కాచాడు, కొంచం విసుగు ఆయన ముఖంలో కనిపించలేదు. కైంకమ్మచే వరాలు కోరించినా ఎట్లాంటి భాద ఆయనలో లేదు. ఇలాంటి మనిషి రావణుడిని ఎట్లా చంపుతాడు అని బెంగ దెవతలకి. ఏం చేస్తే రామునికి కోపం వస్తుంది అని ఒక ప్రయత్నం చేసారు, సీతమ్మను కష్టపెడితే కోపం వస్తుందేమోని, ఇంద్రుని కుమారుడైన జయంత్రునికి కాకి వేశం వేసి సీతమ్మను పొడిచిరా అని ఉసిగొలిపారు. రామచంద్రుడు సీతమ్మ ఒడిన విశ్రాంతి తీసుకుంటున్న సమయాన, కాకిరూపంలో వచ్చి ఆమెను పొడిచాడు, ఆమె రక్తం ఆయనపై పడింది, లేచి చూసాడు. అప్పుడు కోపం వచ్చింది. వెంటనే ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రం చేసి వేస్తే, అది వాని వెంట తరుముతుంటే వాడు ముల్లోకాలు తిరిగి చివరికి సీతమ్మ కాల్లపై పడితే అప్పుడు క్షమించాడు. సీతమ్మని భాద పెడితే రామునికి కోపం వస్తుంది అని దేవతలు గుర్తించారు. అట్లా సీతమ్మను రావణుడు ఏడిపిస్తే రాముడు తప్పకుండా రావణుడిని వదలడు అని ఒక ఉపాయం తయారు చేసుకున్నారు. సూర్పణక అక్కడికి విహారానికి వచ్చేట్టు చేసాడు. అంత చేసినా అసలు రామునికి రావణాసురుడి మీద కూడా కోపం లేదు, వాడు బాగుపడతాడేమోనని చివరిదాకా చూసాడు.

ఇది మానవుడంటే. అట్లా ఆచరించగలమా. జీవితంలో ఎన్ని కష్టాలు ఏర్పడితే అంత తట్టుకొనే శక్తి పెరుగుతుంది. అందుకు కష్టం కలిగించిన వారిని ఉపకారం అని భావించగలమా! ప్రతి చర్యకు రెండు ఫలాలు ఉంటాయి, దాన్ని మనకు అనుకూలంగా చేసుకోగలిగితే మనం చరిత్రలో నిలవగలం. అట్లా చూపడానికే రామాయణం.

వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి తో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది. సుగ్రీవుడి పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది.
విషయ సూచిక :
1 వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం
2 వాలి సుగ్రీవుల వైరం, రామునితో మైత్రి
3 వాలి మరణం, సుగ్రీవుని రాజ్యాభిషేకం
4 సీతాన్వేషణ
5 యుద్ధం
6 విజయం

వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం యుద్ధకాండము లొ చెప్పబడుతుంది. సుగ్రీవుడు కుంభకర్ణుడు మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా వాల్మీకి మహర్షి మనకు రామాయణంలొ అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ సూర్యుడు , ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగంలొను, కంఠభాగం లొను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.

వాలి సుగ్రీవుల వైరం, రామునితో మైత్రి
రామాయణంలో అరణ్య కాండ చివరి భాగంలో సుగ్రీవుని పాత్ర పరిచయమౌతుంది. సుగ్రీవుడు గొప్ప వీరుడు, ధర్మపరుడు, నిరంకుశుడు, కొంత చాపల్యం కలిగినవాడు, మిత్ర ధర్మానికి కట్టుబడినవాడుగా రామాయణంలో కనిపిస్తాడు. సుగ్రీవుడు దురదృష్టవశాన తనకంటే చాలా బలవంతుడైన అన్న వాలి క్రోధానికి గురై మరణభయంతో ఋష్యమూక పర్వతంపై బ్రతుకుతూ ఉన్నాడు.

సీతాపహరణంతో హతాశులైన రామలక్ష్మణులు సీతను వెతుకసాగారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామలక్ష్మణులు వాడి శరీరాన్ని తగులబెట్టారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – “రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుని అవుసరం ఉంది. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. అతను కూడా నీలాగే భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు. ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు” అని చెప్పాడు.

మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కధ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాలను గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.

దేశాన్ని పరిపాలించే రాజులు తమ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలి అనేది వారి భాద్యత. దాన్ని విస్మరిస్తే జరిగే ఉపద్రవాలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి శ్రీరామాయణం నిదర్శనం. దశరథ మహారాజుకి సరిపడే శక్తి ఉన్నా, తన రాజ్యాన్ని మొత్తం కాపాడుకోలేదు. తన భాద్యత మరచి చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. తన కోడలికి కూడా రక్షణ లేని స్థితి ఏర్పడింది. పరిపాలకులు బలహీనులైతే లోకానికి రక్షణ ఉండదు.

రాముడు వనవాసం వెళ్ళాక, దశరథుడు మరణించాడు. రాజులేకుండా రాజ్యం ఉండకూడదు అని వెంటనే భరతుడిని పిలిపించాడు వశిష్టుడు. రాజు లేని రాజ్యం అరాచకం. రాజులేని రాజ్యంలో ప్రజలు ఎట్లా ఉంటారో వివరించాడు. ఒకరిని ఒకరు గౌరవించరు. ఎవరికి ఎవరు సొంతం కారు. అంటే ఇతడు ఈమెకు భర్త, ఈమె ఇతనికి భార్య అనే వ్యవస్త ఉండదు. పెద్దలను పిల్లలు గౌరవించరు. నియంత్రించే వ్యక్తులు ఉండరు కనక ఒకరిని ఒకరు దోచుకొని తింటారు. రాజు లేని రాజ్యంలో ప్రతి ఒక్కడూ తృప్తిలేని ఎలుకలవలె దొరికినంత దోచుకొని దాచుకుంటారు. దశరథుడు చేసిన దానికి పరిణామం తన ప్రాణాలు కోల్పోవడం, తన కొడుకుని అడవిపాలు చేయడం, తన కోడలికి రక్షణ లేకుండా అవడం. అందుకే రాముడు ఆవ్యవస్తను సంస్కరించాలి అనుకున్నాడు.

వనానికి వెళ్ళినప్పుడు ఋషులు తమను రక్షించమని కోరితే, ఎందుకు మనకు ఇవన్నీ అని సీతమ్మ అంటే, నేను అవసరమైతే నిన్నైనా వదిలేస్తా కానీ తనను ఆశ్రయించి బ్రతికే వారిని తప్పక రక్షిస్తా అని ప్రతిజ్ఞచేసాడు. కేవలం అనడం కాదు, అవసరం వచ్చినప్పుడు సీతను గర్భవతిగా ఉన్నప్పుడు వదిలాడు కూడా.

రామచంద్రుడు కబంధుడిని సంహరించి, శభరిని దర్శించాడు. కబంధుడు దేహాన్ని వదిలి, అద్భుతమైన గంధర్వ దేహాన్ని ధరించి నీవు సీతకై అన్వేషిస్తున్నావు సీతమ్మను చూపించే మంచి మిత్రుడు దొరుకుతాడు, ఆయన కూడా రాజ్యాన్ని వదిలి ఋషిముఖ పర్వతంపై బ్రతుకుతున్నాడు. ఈ భూమిపై ఆయనకు సుపరిచితం కానీ ప్రాంతం లేదు, అతడు నీకు కావల్సిన సేవ అందిస్తాడు అని చెప్పి వెళ్ళాడు. కనుక అది బహుషా దేవతా కార్యమై ఉంటుంది అని సుగ్రీవుని దుఃఖం తనది అనుకున్నాడు. సుగ్రీవుడి తన కష్టాలను చెప్పుకున్నాడు. అతనికి సహాయం చేయడం న్యాయమే అని అనిపించింది. వెళ్ళి వాలితో యుద్దం చేయమని చెప్పాడు. నేను వెనక నుండి సంహరిస్తా అని చెప్పాడు.

సుగ్రీవుడు వాలి గొప్పతనాన్ని చెప్పాడు. దుందిభి అనే వాడు ఒకసారి సముద్రంతో కుస్తీ పట్టడానికి వచ్చాడు. నాతో వద్దు వెళ్ళి హిమాలయం వద్దకు వెళ్ళమని చెప్పాడు సముద్రుడు. హిమాలయం వద్దకు వెళ్ళి అడిగాడు, నాపై ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు, నాతో వద్దు, వాలి అనే వాడు ఉంటాడు. కావలిస్తే అతనితో కుస్తీ పట్టు అని చెప్పాడు. కయ్యానికి వాలి వద్దకు వచ్చాడు. అప్పుడు వాలి ఎత్తేస్తే ఇక యోజనం ఎత్తు ఎగిరి క్రింద పడి ప్రాణం కోల్పోయాడు. వాడి దేహం అక్కడ పడి ఉంది, దాన్ని చూపించాడు. రాముడు తన కాలుతో ఒక్క సారి తాకాడు, పది యోజనాలు ఎగిరి పడింది. వాలి మరొక పని చేసేవాడు, అక్కడ ఉన్న సాలవృక్షాలను కదల్చేవాడు అని అక్కడ ఉన్న ఏడు వృక్షాలను చూపించాడు. రాముడు తన భాణం వేసాడు అది ఆ ఏడు చెట్లని తొలగించి తిరిగి రామున్ని చేరింది. అప్పుడు సుగ్రీవునికి నమ్మకం కల్గింది.

వాలితో యుద్దానికి వెళ్ళమని చెప్పాడు. సుగ్రీవుడు వాలితో దెబ్బలు తిన్నాడు, వాలి ఎక్కడానికి వీలు లేని ఋషిముఖ పర్వతం వైపు పరుగెత్తి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పుడు రామచంద్రుడు వచ్చాడు, సుగ్రీవునికి కోపం వచ్చింది, హాయిగా బ్రతుకుతున్న తనకు చావుదెబ్బలు తినిపించావు అని దబాయించాడు. రాముడు అప్పుడు నీకు వాలికి తేడా తెలియలేదు, వాలి అనుకొని నిన్నేక్కడైనా కొట్టేస్తానేమోనని భయపడ్డాను అని చెప్పాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. వాలికి రాజ్య సుఖాలు ఉన్నాయి, బలిసి ఉన్నాడు. సుగ్రీవుడు రాజ్యం లేక, సుఖాలు లేక చిక్కి పోయి ఉన్నాడు. సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం వైపు పరుగెత్తుతున్నా గుర్తించలేక పోయాడా రాముడు అనేది నమ్మలెం. తరువాత సుగ్రీవునితో రాముడు చెప్పాడు, నీకు వాలికి ఉన్న తేడాని గుర్తించలేక పోయాను, ఎదైనా గుర్తింపు వేసుకుంటే తప్పక రక్షిస్తా అని చెప్పాడు. లక్ష్మణుడి ద్వారా ఒక మాల ఆయన మెడలో వేయించాడు. లక్ష్మణుడు గుర్తు వేసాక అప్పుడు రక్షణ లభిస్తుంది అని సుగ్రీవునికి అప్పుడు అనిపించింది. సుగ్రీవునికి పాలకునిగా పాటించాల్సిన నియమాలు తెలియని వాడు. మొదట రామచంద్రుడిని హనుమంతుని ద్వారా పిలిపించుకొని కలిసినప్పుడు లక్ష్మణ స్వామితో మాట్లాడలేదు రామునికి ఒక ఆసనం వేసి తనూ కూర్చున్నాడు, ప్రక్కనే ఉన్న లక్ష్మణ స్వామిని పట్టించుకోలేదు. హనుమంతుడు ఇది గుర్తించి తను ఒక చందనపు కట్టెను వేసి ఆదరించాడు. సుగ్రీవునికి తన వద్దకి వచ్చిన వ్యక్తులని ఆదరించాలని తెలియదు. అందుకే బుద్ది చెప్పాల్సి వచ్చింది. లక్ష్మణునిచే అలంకృతుడు అయ్యాక, అంటే రామానుజుని గుర్తు పడ్డాకే రక్షణ ఎంటో చూపించాడు. ఒక్క భాణంతోనే వాలిని నేలకోర్చాడు.

రాముడు చెట్టు చాటునుండి వాలిని కొట్టాడు. దాన్ని ఆనాడు అందరూ ధర్మం అని ఒప్పుకున్నారు. కానీ ఈనాటికి కొందరికి అది జీర్ణం కాని విషయం. వాలి రామునితో నీవు ధర్మాత్ముడవని విన్నాను, కానీ నన్ను ఇలా చాటు నుండి చంపి నీ వంశానికి మచ్చ తెచ్చుకున్నావు అని అన్నాడు. అదికూడా ఏమి చేతకాని నా తమ్ముడిని రక్షించావు, నన్నే కనక నీవు సహాయం అడిగి ఉంటే రావణాసురుడిని నీ కాల్ల ముందర పడేసేవాడిని, నా శక్తి గురించి తెలియదా. పరిపాలకునికి ఉండాల్సిన నియమాలు నీకు తెలియవు. ఈ భూమంతా ఈక్ష్వాకు వంశానికి చెందినది. ఆ ఈక్ష్వాకు రాజుకు ప్రతినిదిగా వచ్చాము. ఇక్కడి వ్యవస్తను చక్కబెట్టడానికి వచ్చాం. నీవు చేసిన దోశానికి ఫలం వధించడమే. ఎట్లా శిక్షించాలి అనేది సంబంధం లేని విషయం. ఇక సహాయం విషయానికి వస్తే ఒకరి సహాయం తీసుకోవడం అనేది రామచంద్రునికి అవసరం లేదు అని చెప్పాడు. ఈ విషయం సుగ్రీవునికి కూడా చెప్పాడు విభీషణున్ని రక్షించే సమయంలో. అట్లా చేయాలని అనుకోవడంలేదు, నీకు గౌరవం కట్ట బెట్టాలనేది నా కోరిక. అట్లా వాలితో నీ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. చక్రవర్తి వద్ద నుండి వచ్చిన ప్రతినిదులం, సుగ్రీవుడు వచ్చి తన భాద్యతని చూపించాడు. మమ్మల్ని వచ్చి స్వాగతించే భాద్యత తెలియని నీకు పరిపాలించే అర్హత లేదు అని చెప్పాడు రాముడు.

అప్పుడు వాలి అడిగాడు, రామా మేము జంతువులం. తిన తగని జంతువులం, అట్లాంటి నన్ను చాటు నుండి సంహరించావు ఇది న్యాయమేనా అని, నన్ను ఎందుకు హతమార్చావు, నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా అని వాలి శ్రీరాముడిని అడిగాడు. అందుకు శ్రీరాముడు నేను వైరం ఉంది అని చేయట్లేదు, నీవు చేసింది అధర్మం కనక దాన్ని సరి దిద్దడాని కోసం చేసాను. జంతువును కదా అట్లా నన్ను వెనకనుండి చంపవచ్చా, ఇదేమైనా న్యాయమా అని అడిగాడు. జంతువువు కనుకనే అట్లా చంపాను, ఏదైనా జంతువును వేటాడాలంటే ఒక జంతువును ఎరగా పెట్టాలి, అట్లా నేను సుగ్రీవుడిని పెట్టి నిన్ను చంపాను. నీవు ఇక్కడి వ్యవస్తను పాటించలేదు కనక ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. అందుకు వాలి అంగీకరించాడు. తమ్ముడు అంటే కొడుకు సమానం, అతడి భార్య బిడ్డతో సమానం అట్లాంటి తమ్ముడి భార్యను బంధించడం తప్పు అని చెప్పాడు. ఇది ఘోరమైన అపరాదం మా రాజ్యం ప్రకారం. అందుకు వాలి తన తప్పుని అంగీకరించాడు, తన కుమారుడైన అంగదుడిని మంచిగా చూసుకోవాలని కోరుకున్నాడు. అట్లా సుగ్రీవుడితో సఖ్యం చేసుకున్నాడు కనక సుగ్రీవుడిని కాపాడాడు. సుగ్రీవునికి ఏది అనుకూలమో అది చేసాడు. అందుకే వాలిని సంహరించడం అనేది రామునికి దోశం కాలేదు, ఆయన ధర్మాత్ముడని సమాజం గుర్తించింది. నింద వచ్చినా పరిపాలకుడు ఎవరిని వారి వారి హద్దులలో ఉంచాలి అని తెలిసినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన మూర్తీభవించిన ధర్మం అని చెబుతారు. ఇది చేయాలా వద్దా ? తగునా కాదా ? అని ఇలా మనకు జీవితంలో ఎన్నో విషయాలు ఎదురవుతుంటాయి. శ్రీరామచంద్రుడు వాలితో ఒక మాట అన్నాడు, నిన్ను చంపినందుకు నాకు మనస్సులో అయ్యో పాపం అని కొంత కూడా అనిపించడం లేదు. ఇదే మొదటి ప్రమాణం అని చెప్పాడు. ఏదైనా చేయాలంటే అది మనకు నచ్చినదైతే మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకుంటాం, కానీ చాలా చోట్ల మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకోం. ఇది మన ప్రవృత్తి. ఆమనస్సును మనం ధర్మానికి కట్టుబడేలా చేసుకోవాలి. శ్రీరాముని చరిత్రను మన ముందు పెట్టుకోగలిగితే మనం ఏది తగినదిగా స్వీకరించాలి, దేన్ని తగనిదిగా వదలాలి అనేది తెలుస్తుంది. రాముడు వాలిని సంహరించాక వానరుల రాజ్యాన్ని తాను తీసుకోలేదు, అందుకే సుగ్రీవుడు రామునికి దాసుడైపోయాడు. రావణాసురుడిని సంహరించాక ఆరాజ్యాన్ని విభీషణునికి ఉచ్చాడు, అలా అందించినందుకు విభీషణుడు దాసుడై పోయాడు. అట్లా రామ రాజ్యం అయ్యింది. ఒకరిని అణిచివేయకూడదు. సమాజం అన్నాక అన్ని రకాల జాతులు ఉంటాయి. ఎన్నో మతాలు, కులాలు ఉంటాయి. ఎవరు వారి ధర్మాన్ని పాటించుకోవాలి. ఇతర ధర్మాలను గౌరవించాలి. అందుకే మనం చేసే వైధిక కార్యాలు లోకం మొత్తం బాగుకోసం. అట్లా మన మనస్సును మనం సంస్కరించుకోవాలి.

సుగ్రీవునికి రాజ్యం అప్పగించాక, వర్షాకాలం అయ్యేసరికి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆతరువాత సీతకోసం వెతకడానికి బయలుదేరుదాం అని చెప్పాడు. వనవాస నియమం ప్రకారం రాముడు కొండగుహల్లో గడిపాడు. కనీసం ఒక్క సారి వెళ్ళి పలకరించలేదు సుగ్రీవుడు. తన భాద్యతలను పూర్తిగా మరచిపోయాడు. అప్పుడు రాముడు తిరిగి భాద్యతలను గుర్తుచేయాల్సి వచ్చింది. సుగ్రీవా! వాలి వెళ్ళిన దారి ఇంకా మూసివేయలేదు, తెరిచి అట్లే పెట్టాను, నిన్ను ముందు వెనక కొందరిని కలిపి మర్యాదగా పంపాల్సి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. హనుమంతుడు, అంగదుడు, లక్ష్మణుడు వెళ్ళి చెప్పాక సుగ్రీవుడు తన భాద్యత గుర్తించాడు.

లోకంలో మనం ప్రవర్తించేప్పుడు మన హక్కుకు ముందు మన భాద్యత ఎమిటో తెలుసుకోవాలి. వాలి, సుగ్రీవులు ఇద్దరూ వారి వారి హక్కు ఏమిటో తెలుసుకున్నారు కానీ భాద్యత ఏమిటో తెలుసుకోలేదు. రామచంద్రుడు విభీషణుడిని ఎట్లా రక్షించాలో అని అడిగితే, రక్షించాలా వద్దా అని తన సలహా చెప్పాడు సుగ్రీవుడు. అందుకే చివర హనుమంతుడిని అడిగితే, నేను గొప్ప చదుకుకున్నవాడినని కాదు, నేను మీకు చెప్పగలిగిన వాడిని కాదు, కానీ మీరు అడిగినప్పుడు చెప్పాల్సిన భాద్యత ఉంది కనక చెబుతున్నా అని చెప్పాడు. అశ్రయించినవాడిని తప్పక రక్షించి తీరాలి అని చెప్పాడు. వాడు శత్రువైనా సరే, మన ప్రాణాలకు హాని అయినా సరే రక్షించి తీరాలి. ఇది భాద్యత అంటే. హక్కులు తరువాత విషయం. భాద్యతలు సవ్యంగా నెరవేర్చుకోవడం కోసం హక్కులు తెలియాలి. మానవుడిగా మనకు కొన్ని భాద్యతలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. ఇది మన భాద్యత. వాలి తన భాద్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. సుగ్రీవుడు తన భాద్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. హనుమంతుడు తన భాద్యత గుర్తించాడు కనక రాముని విశ్వాస పాత్రుడైనాడు. మనిషి అట్లా భాద్యతని గుర్తించి బ్రతికితే సరియైన రక్షణకి యోగ్యుడవుతాడు. కిష్కింద కాండలో వాలి సుగ్రీవుల కథలో రాముడు నిరూపించాడు.

సీతాన్వేషణ
రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండీ వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు. కాలసర్ప సదృశమైన ధనుస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని పట్ల వినయంతో తార, సుగ్రీవుడు ఆ రామానుజుని ప్రసన్నం చేసుకొన్నారు. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.

సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానరులు నలుదిక్కులకూ సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.

తన సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపిం రామ కార్యానికి ఉద్యుక్తుడు అయ్యాడు. సీతమ్మను అన్వేషించడానికి సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుడు భాగాలు చేసి, నాలుగు దిక్కులకి ఎంతవరకు వెళ్ళవచ్చు, ఆ వెళ్ళే మార్గంలో ఏమేమి ఉంటాయి, అక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాలని చెప్పి పంపాడు. ముఖ్యంగా దక్షిణ దిక్కుకి వెళ్ళే హనుమంతునికి శ్రీరామ చంద్రుడు తన నామంతో ఉండే అంగుళికాన్ని ఇచ్చి, నీవల్ల ఈ పని జరుగుతుంది అని ఆశీర్వదించి పంపాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళినవారు సముద్రం వరకు చేరుతారు. అంతవరకు కిష్కింద కాండ.

సుందర కాండ

సుందరం అంటే ఏమిటి ?

హనుమంతుడు లంక చేరి సీతమ్మను దర్శించి నేను రాముడు పంపిన అసలైన దూతను అని విషయాన్ని నిరూపించడానికి రాముడు ఇచ్చిన అంగుళికాన్ని సీతమ్మకు చూపిస్తాడు. ఆ సన్నివేశం ఆమె ప్రాణాలకి శక్తి నింపేట్టుగా చేసింది. ఆపై సీతమ్మ తన చూడామణిని హనుమకు ఇచ్చి పంపింది. అది చూస్తే రామునికి తన తండ్రి జనకుడు, దశరథ మహారాజు మరియూ నేను గుర్తుకు వస్తాను అని చెప్పింది. ఈ విషయాలను తెలిపేదే సుందర కాండ. మరి సుందరం అని దీనికి ఎట్లా పేరు వచ్చింది ? సుందరం అంటే ఏమిటి ?
సుందరం అంటే ఏమిటి ?
రామాయణంలోని సుండరకాండ ఎవరి సౌందర్యాన్ని చెబుతుంది. మన పూర్వ ఆచార్యులు దానికి అందమైన వివరణ ఇచ్చారు. నిజానికి పైకి కనిపించే అందాలు అసలైన అందాలు కావు. మన శరీరాన్ని తీసుకుంటే వయసులో ఉన్నంత వరకు అందంగా ఉంటుంది, కాస్త వయస్సు ఎక్కువయ్యాక ఎంత ప్రయత్నించినా అసలు రూపాన్ని దాచలేం. అందం అంటే అదేనా ? అందం అనేది ఒక సాపేక్షికమైనది. ఒకరికి అందం అనిపించింది మరొకరికి అనిపించక పోవచ్చు. అందుకే కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత చెబుతారు. కానీ మన పెద్దలు ఆనందమే అందం అని చెప్పారు. ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే అందం, ఎవరికి వారికి. అయితే ఒక్కొక్కరికి వేరుగా కాకుండా, అందరికి సామాన్యేనా ఏది అందమైనది? ఏది ఆనంద దాయకమైనది ? శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుకొని ఉండగా సభలో ఆయనకు ఒక సందేహం కలిగిందట. మనిషికి అత్యంత ప్రీతి తమమైనది ఏది, ఏది ఎక్కువ ఆనందదాయకమైనది అని. సభలో అందరిని అడిగారట, అక్కడ ఆయన ఒల్లో మనవడు ఉన్నాడని చూసి మనిషికి ప్రేమ మనవడిపై ఉంటుంది అని చెప్పారట. ప్రక్కనే తెనాలి రామను అడిగీతే ఎవరి దేహం వారికి ప్రీతి తమం అని చెప్పాడట. ఇకపై అందరూ చెప్పారట తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ కంటే మించింది ఏది లేదు అని. ఎందుకంటే తన శరీరాన్ని లెక్క చేయకుండా కంటుంది సంతానాన్ని. ఏమోయ్ రామా నీసమాధానం అని మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామని అడిగితే,  శరీరానికి అనుకూలం ఉన్నంతవరకే ఆప్రేమ దానికి మించి దేహంపైనే అందరికి ప్రేమ అని చెప్పాడు. మరి నిరూపించు అని చెప్పాడట. ఒక పెద్ద పాత్రలో ఒక తల్లి కోతిని, పిల్ల కోతిని ఉంచి, కొద్దికొద్దిగా నీళ్ళు పోయించాడు. ఆ తల్లి కోతి పిల్ల కోతికి ఏ అపాయం కాకుండా తన చేతితో ఎత్తి పట్టుకొని రక్షిస్తోందట. ఆ నీరు తన నోటి వరకు వచ్చాయి, ఇకపై కొన్ని నీరు పోయగా తన ముక్కు వరకు రాగానే, చివరికి తన ఉనికికే ప్రమాధం ఏర్పడగానే ఆ పిల్ల కోతిని క్రిందకు లాగి దానిపై ఎక్కి నిలుచుందట. మనుష్యులకైనా అంతే దేహంమీదే ప్రేమ.గొప్ప గొప్ప వేదాంతులు కూడా తమ తమ శరీరాలను కాపాడుకోవాల్సిన అవసరం వస్తే ధర్మాన్ని ప్రక్కన పెట్టేస్తారు. ముందు దేహమే లేకుండా పోతే ఎట్లా, మంచో చెడో పరిహారమో తర్వాత దేహం అనేది అవసరం కదా మొదట దేనికైనా.

కానీ కొందరు మహానుభావులు ఆ శరీరానికి సుఃఖాలు తగ్గించి ఎంతో కష్టపడి ఈ శరీరానికి లోన ఒకటి ఉంది అంటూ దాని కోసం అన్వేషణ ప్రారంభించారు. అట్లాంటి మహానుభావులు అట్లాంటి తత్వాని గురించి వివరించారు, దానికే అత్మ తత్వం అని పేరు. 'నేను' అని చెబుతున్నామే, అదే ఆత్మ. ఆ ఆత్మకి ఏది వ్యతిరేఖంగా కాకుండా మనం జీవనం కొనసాగిస్తుంటాం. మనిషికి దాని గురించి తెలిస్తే అసలు ఆనందాన్ని ఇచ్చేది 'ఆత్మ' అని తెలుస్తుంది. ఈ ఆత్మ ఎక్కడిది ? ఎలా వచ్చింది ఈ శరీరం లోనికి. తెలిసి ఎవరూ రాలేదు. ఈ జీవుడిని వెనకాతల ఒకడు ప్రేరేపించువాడొకడున్నాడు. ఈ జీవుడిని శరీరం అంతటా వ్యాపించేట్టు చేస్తుంటాడు, వాడుంటేనే ఈ శరీరానికి ఒక లెక్క, లేకుంటే శవం అని అంటారు. వ్యాపించి పనిచేయించుకొనువాడు కనక ఆత్మ అని పేరు పెట్టారు. ఇలాంటి ఆత్మ అనేది ప్రతి ప్రాణి కోటిలో ఉంది. మరి వీటన్నింటిని కలిపి నడిపించే శక్తి ఎక్కడ ఉంటుంది. మనం ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఒక పద్దతి ప్రకారం నడుస్తున్నాయి. విటిని నడిపేది ఎవరు ? ఇన్నింటిలోనూ వ్యాపించి ఉన్న వాడిని పరమాత్మ అని పేరు. ఇన్నింటిలో నడిపించేది, అది నీలో కూడా ఉండి నడిపేది. అంటే ఆత్మకు కూడా వెనకాతల ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది మన బుద్దుకి అందేది కాదు. శాస్త్రం చదివి తెలుసుకోవాల్సిందే. ఇంద్రియాలకి గోచరించేది కాదు, అంతకంటే సూక్ష్మం కనుక. శాస్త్రాల్లో ఆవెనకాతల ఉన్న పరమాత్మ దయామయుడని, కరుణామయుడని, ఈ ఆత్మని ఉద్దరించాలని అనుకుంటాడు కనుకనే మనల్ని ఈ శరీరంలో పెట్టాడు. దాన్నే జీవితం అని అంటారు. జీవితం అంటే జీవుడు శరీరంతో సాగించే ప్రయాణానికి జీవితం అని పేరు.

ఇలా మనం ఎన్నో శరీరాల్లోంచి ప్రయాణం సాగించాం. అయితే ఈ జీవితం ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. కష్టాలు కలగ కుండా ఉండాలని మనం కోరుకుంటాం. సుఃఖాలు కలగాలని కోరుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు జరగటం లేదు. అట్లా మనం దుఖాలకు కారణం వీడు, వాడు అని ఒకరిపై వేసి చెబుతుంటాం. నిజానికి ఈ జీవితం మనకి అనుకూలంగా ఉండేట్టు చేసుకోనేందుకు, మళ్ళీ తిరిగు దుఖ భూయిష్టమైన దేహాలలోకి వెళ్ళకుండా ఉండే స్థితి ఏమిటో తెలిస్తేనే అది తెలివి అని అంటారు. మిగతా విషయాలను తెలివి అని అనరు. మిగతావి జ్ఞానం అని అనటానికి వీలు లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక 26 విషయాలు చెబుతూ, ఇవి కాక మిగతావి అన్నీ అజ్ఞానాలే అని చెప్పాడు. మనకు ఎన్నో జరుగుతుంటాయి, ఒకరిపై నిందారోపన చేయకూడదు. మనల్ని మనం ఒకరితో పోల్చుకొని భగవంతుడు నాకు ఇలా చేసాడు అని నిందిస్తుంటాం. భగవంతుడు నిష్పాక్షికుడు. అందరిని సమానంగానే చూస్తాడు. ఇప్పుడు మనం చూసే తేడాలన్నీ మనం మనం చేసుకున్నవే. ఇది మొదట అంగీకరించాలి. స్వీకరించిన వాటిని సక్రమంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. భగవంతుని మీద విశ్వాసంతోటి అర్పణం కావాలి. మనల్ని భగవంతుని వైపు నడిపించగల జ్ఞానిని ఆశ్రయించాలి. అప్పుడు మనకు తిరిగి ఇక్కడికి రావల్సిన స్థిని ఏర్పడుతుంది. అది ఆనందం అంటే, అది సుందరం అంటే.

ఉదాసీన స్థితి నుండి కర్తవ్య దిశగా హనుమ

అజ్ఞానపుటంధకారంలో జీవితంలో అడుగువేసే మానవునికి రకరకాల సమస్యల వలయాలని ఛేదించుకుంటూ ముందుకు సాగాల్సిన కర్తవ్యపరాయణుడైన ఒక మానవునికి సుందరకాండ ఒక నిదర్శణం. మనిషికి ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే ముందర మనోధైర్యపు లోపమే అనర్థాలకి మూలకారణం అవుతూ ఉంటుంది. మనిషిలో ఈ రకమైన నిర్లిక్తమైన మనస్స్థితి, ఒక ఉదాసీనమైన ప్రవృత్తి, ఇది అన్ని రకాల అనర్థాలకి మూలకారణం అవుతుంది. దాన్ని దూరం చెయ్యాలి. దాన్ని వదలాలి.  మనోదైర్యం ఒక్కటి ఏర్పడినట్లయితే అన్ని రకాల అవరోధాలని మనం అతిక్రమించి ముందుకు సాగగలిగినట్లే.
సీతాన్వేషణ చేయటం కోసం వెళ్ళిన హనుమ ఆయన లంకకి చేరాడు. అంతటా వెతికాడు. నేనే వెతకగలను అనే ఒక రకమైనటువంటి గర్వం ఒక రకమైన అహంకారం. ఎందుకంటే వంద యోజనాల సాగరం దాటివచ్చాడాయే! దేవతలంతా ఆకాశం నుండి చూసి " ఓ దుష్కరం కృతవాన్" అని నాలుగు సార్లు ఆయన్ని గట్టిగా పొగిడేసేటప్పటికి ఆయన నిజంగా నేను ఎంత గొప్ప పని చేసాను అనుకున్నాడు. ఆయనకి కొంచెం గర్వం పెరిగింది. సాగరతీరం లో బయలుదేరేటప్పుడు "యథా రాఘవం నిర్ముక్త:శరః గచ్చేత్" అని తాను ప్రారంభంఅయ్యాడు. రాముడి వదిలిన బాణం వెళ్ళినట్లుగానే నేను వెళతాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవసరమేలేదు అని అనుకుంటూ వెళ్ళినటువంటి ఆ హనుమ, అక్కడి దాకా వెళ్ళినతరువాత, వీళ్ళందరి పొగడ్తలు విని నేనే ఇంత గొప్ప పని చేసాను అని కొంచెం గర్విస్తూ, ఆయన సీతకోసం అన్వేషణ ప్రారంభం చేసాడు. ఎందరినో చూశాడు. ఎన్నో స్థానాలు వెతికాడు. ఎక్కడా సీతమ్మ కనిపించలేదు. తెల్లవారితే తిరిగి తాను తన స్థానానికి వెళ్ళైపోవాలి. ఇక్కడ చూస్తే ఎక్కడా కూడా సీతమ్మ జాడయే కనిపించటం లేదు. లోపల, బయట వెతకని చోటంటూ లేకుండా వెతికేసాడాయన. అయితే ఆ అశోకవనాన్ని మాత్రం తాను స్పృశించనేలేదు. మిగిలినటువంటి అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. అన్నిటినీ కూడా వెతికి వెతికి,ఎక్కడా కూడా ఏమి కనిపించలేదు. ఎక్కడ ఉంటుంది సీతమ్మ?
ఇంకాసేపటిలో తెల్లవారబోతుంది. ఒక గోడ మీద తాను కూర్చున్నాడు.  సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం ఇచ్చిన కాలమా దాటిపోయింది కనుక వెళితే ఆయన ఎలాగూ ప్రాణాలు తీసివేస్తాడు. కాక నేను సీతని చూడకుండా వెన్నక్కి వెడితే  నా రాక కోసం ఎదురుచూసేవారందరు కూడా ప్రాణాలు వదిలివేస్తారు సీత కనిపించలేదని. మేం అక్కడికి వెళితే సుగ్రీవుడు ప్రాణం తీస్తాడు.ఆయన ప్రాణం పోతుంది. ఆయన ప్రాణం పోతే రాముడి ప్రాణం పోతుంది. . రాముడి ప్రాణం పోతే భరతుని ప్రాణం పోతుంది. అయోధ్యాపుర జనుల ప్రాణాలు పోతాయి. నేనొక్కడిని వెళితే కదా ఇంతమంది ప్రాణాలు కోల్పోయేది? కనుక నేను అక్కడికి వెళ్ళకుండా  ఈ సమాచారం ఇవ్వకుండా ఇక్కడే ప్రాణాలు వదిలివేసినప్పటికిని ఏం పెద్ద దోషం లేదు. కనుక నేనాత్మహత్య చేసుకుంటాను. ఇక్కడ ఉండిపోవటానికి అయితే వీలు లేదు కదా! వాళ్ళందరినీ వదిలి ఉండలేను. వెళ్ళి తగిన సమాచారం ఇవ్వలేను. కనుక నాకు కేవలం ఆత్మహత్య మాత్రమే శరణ్యం అనుకున్నాడు.
ఇంతతెలివైనటువంటి హనుమంతుడు కూడాను. నవ వ్యాకరణ పండితుడంటారు. చతుశ్శాస్త్ర పండితుడంటారు. నాలుగు వేదములనూ కూడా తాను అధ్యయనం చేసిన మహనీయుడని రాముడి చేత పొగడ్త పొంది మహనీయుడైనటువంటి హనుమంతుడంతటి వాడికే తనలో కలిగినటువంటి కాస్త అహంకారం, కాస్త గర్వం, అది తగునో తగదో తెలియనటువంటి ఆలోచనలలోకి ఆయన్ని ముంచెత్తేసింది. ఇక ఎందుకు ప్రాణం తీసేసుకుందాం అని అనుకుంటూ ఉన్న సమయంలో అతనికే, బుద్ధిమంతుడు కదా! ఒకరు చెప్పక్కరలేకుండానే సహజంగానే మళ్ళీ జ్ఞానం కలుగుతుంది. అహంకారం తగ్గుతుంది. తాను పెద్దల దగ్గర శిరస్సు వంచాలనేటటువంటి జ్ఞానం పెరుగుతుంది. అలానే హనుమంతుడికి కుడా "ఒక్కసారి నేను  ఏ సీత కోసం వెతుకుతున్నానో ఆ సీతనే ప్రార్థిస్తాను. రామచంద్రుడిని ప్రార్థిస్తాను" అంటూ గతంలో తాను చేసినటువంటి అన్ని రకములైనటువంటి ప్రార్థనలని కూడా ఒక ప్రక్కన నిలిపి, తాను ఆ వేళ సీతమ్మ కోసం ప్రార్థన చేసాడు. "నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై" జనకాత్మజ అయినటువంటి సీతకి నమస్కారం అంటూ ఆయన సీతారాముల సన్నిధానంలో చేసినటువంటి ఆ నమస్సు యొక్క ఫలితంగా అంత వరకూ తాను అన్నీ చూసాననుకున్నవాడు తను ఒక ప్రక్కకి తిరగగానే అశోకవనం కనిపించింది. చెట్టు కనిపించింది. చెట్టు కింద సీతమ్మ కనిపించింది. కొన్ని గుర్తులతోటి "ఈవిడ సీతే" అని నిర్ణయం చేసుకున్నాడు.
అయితే ఆ రకంగా హనుమంతుడంతటివాడికే అయినా కొంచెం అహంకారపు పాలు ఏర్పడగానే తను యుక్తాయుక్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునేటంతవరకు వెళ్ళిపోయాడు అని అంటే అతనిలో ఒక రకమైన క్లీబత ఏర్పడిపోయింది అతనిలో ఒక రకమైనటువంటి హృదయదౌర్భల్యం ఏర్పడిపోయింది అని అంటే ఇక సామాన్యులైనటువంటి మన లాంటి వాళ్ళకి ఏమిటి కనుక ఏం చెప్పాలి కనుక? ఈ సన్నివేశం మనకు స్పూర్తి దాయకం. ఎక్కడెక్కడ ఏ ఏ సన్నివేశాల్లో మనోదౌర్భల్యం కలుగుతుందో, అలాంటి చోటల్లా మనం శ్రీకృష్ణుని పాదలకి నమస్కారం లేదా శ్రీ రాముని పాదాలకి నమస్కారం అని మనం ఆ రకమైన ఒక ధైర్యాన్ని నిర్మాణం చేసుకోగలిగినట్లయితే మనలోకి హృదయదౌర్బల్యం చేరదు. కర్తవ్యపాలన మనం చేసుకోగలుగుతాం. 

సీత దుఖానికి కారణం ఎవరు ?

సీతమ్మ లంకా నగరంలో ఉంది. వందల మంది రాక్షస స్త్రీలు హింసిస్తున్నారు. మాటలతో, చేతలతో నిరంతరం అమెను హింసిస్తూ ఉన్నారు. అట్లాంటి సీతమ్మను చూడటానికి హనుమంతుడు వెళ్ళాడు. ఆ హనుమంతుని చూడగానే సీతమ్మ మొదట ఒక ప్రశ్న వేసింది. ఒక కాకి నన్ను పొడిచిందని కోపగించి గడ్డి పోచను తీసి అస్త్రంగా మార్చి వదిలాడు రాముడు. ఒక కాకి చేసిన చిన్న ఇబ్బందికి అంత చేసాడు, కానీ రావణాసురుడు పదినెలలుగా ఇంట హింస చేయిస్తున్నాడు, చేతకాని వాడు కాదు రాముడు,  ఒకరు కాదు రామ లక్ష్మణులు ఇద్దరూ సమర్థులే. వారి అస్త్ర శస్త్రాలకు తిరుగులేదు. ఎదురుగా ఉండ నవసరంలేదు వారు అనుకుంటే ఒక్కసారి రావణుడిని చంపిపాడ వేయగలరు. ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారు. అని ముందు రామ లక్ష్మణులని దూశించింది.

రామ లక్ష్మణుల చేతకాని తనం వల్లనో లేక వారి అశ్రద్దతో సీత లంకానగరంలో ప్రవేశించిందా ? సీతకు కలిగిన దుఖాలకు కారణం ఎవరు. మొదట సీత ఈ విషయం అంగీకరించలేదు. కానీ తరువాత తానే తన తప్పును ఒప్పుకుంది. "మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నసంశయః" ఇది రామ లక్ష్మణుల తప్పు కాదు, నేను చేసుకున్నదే అని అంగీకరించింది. మొదట బంగారు లేడిని చూసి ఇలాంటివి ప్రపంచంలో ఉండవు. దాని నోట్లొంచి మంటలు వస్తున్నాయి, ఇతరమైన జంతువులు భయపడి పారిపోతున్నాయి. బంగారపు చాయ కలిగి ఉండవు, అని లక్ష్మణ స్వామి చెప్పాడు. ఇది తప్పని సరి మారీచుని మాయ అయి ఉంటుంది, వద్దు మనకి అని రాముడు చెప్పాడు. కానీ సీతమ్మ వినలేదు. ఒకవేల రాక్షసుడైతే సంహరించు, ప్రాణాలతో దొరికినా, లేక ప్రాణాలు లేక దొరికినా దాని చర్మాన్ని మనం అయోధ్యకు మన వనవాస జ్ఞాపికగా తీసుకుపోదాం అని చెప్పింది. వద్దు అని ఎంతచెప్పినా, రాముడిని నిర్భందించి పంపింది. రాముడు వెళ్ళాక ఆలేడిని చంపగానే హే లక్ష్మణా, హే సీతా అంటూ మారీచుడు అరిచాడు.

ఆమాటలు విన్న సీతమ్మ, లక్ష్మణ స్వామిని వెళ్ళమని చెప్పింది, ఆయన వెళ్ళనంటే నానా మాటలు అన్నది. రాముడు లేనిది చూసి నన్ను పొందాలని అనుకుంటున్నావా అని చాలా రకాలుగా కృరమైన మాటలు అనే సరికి లక్ష్మణ స్వామి తట్టుకోలేక వెళ్ళాడు. లక్ష్మణ స్వామిని నిర్భందించి పంపింది. రావణాసుడు వచ్చి ఆమెను ఎత్తుకు పోయాడు. రావణాసుడు భిక్షకుడిగా వచ్చాడు. ఆ వచ్చినవాడు ఆమె అందాన్ని పొగిడాడు, అమె గురించి అడిగాడు. ఉన్న విషయాలు అన్ని చెప్పింది. తెలియని వారికి అలా చెప్పవచ్చా. అప్పుడైనా తప్పించుకోనే ప్రయత్నం ఆమె చేయలేదు. సీతమ్మకు ఏర్పడ్డ దుఖాలకు కారణం తనే. అయితే ఈ విషయం మొదట ఒప్పుకోక పోయినా, తరువాత హనుమంతుని ముందు అంగీకరించింది. నా తప్పే అని రామ లక్ష్మణులతో చెప్పని సందేశం హనుమంతునితో పంపింది.

సీతమ్మ తన దోశాన్ని అంగీకరించి, రామచంద్రునికి శరణాగతి చేసింది. ఆ శరణాగతి నేరుగా కాక హనుమ ద్వారా చేసి, ఆయన హనుమ ద్వారా పంపిన చిహ్నాన్ని పొంది, రాముడి వల్ల తప్ప మరొకరి వల్ల రక్షణ వద్దు అని తన సంసిద్దతని చెప్పింది. హనుమంతుడు నేనే తీసుకువెళ్తా అని చెప్పినా, రాముడే రావాలి అని చెప్పింది. సీతమ్మ అట్లా చేసిన ఆత్మార్పణమే రాముడు రావడానికి, రావణుడిని చంపి ఆమెను స్వీకరించడానికి కారణమైంది. అది సుందర కాండ తెలిపేది. 

ఆత్మ సౌందర్యాన్ని తెలిపేది సుందర కాండ

సుందర కాండ తెలిపేది సీతమ్మ కథనే అయినా మన జీవితానికి అతుకుతుంది. సీతమ్మ లంకలో ఉంది. లంక నూరు యోజనాల దూరంలో ఉంది. అతి లోక సుందరమైన నగరం. విశ్వకర్మ నిర్మాణం చేసాడు. అంత అందమైన నగరానికి పాలకుడు రావణాసురుడు. లోకాలని ఏడిపించే వ్యక్తి. రజో గుణనికి నిలువు రూపం. అయితే ఆయనకు ఇద్దరు సోదరులు. ఒకడు కుంభకర్ణుడు, తామసికుడు. మరొక సోదరుడు విభీషణుడు పరమ సాత్వికుడు. ఈ రావణాసురుడు పది తలలు కలవాడు. పది తలలతో ఉంటాడు. లంకానగరంలో సీతమ్మతో పాటు ఎందరో ఆడవారిని నిర్భందించాడు. వారందరూ భయానికో లేక వేరే గతి లేక రావణుడితో ఉండిపోయారు. సీతమ్మ అలా చేయలేదు, రాముడు రావాల్సి వచ్చింది. ఇది లంకానగర చరిత్ర.

ఆ సీత లోపలి ఆత్మ అని చెబుతారు. జనకుడు యజ్ఞం కోసం  క్షేత్రాన్ని దున్నినప్పుడు సీత లభించింది. అట్లానే మనం శరీరం అనే క్షేత్రాన్ని సాధన చేయగా ఆత్మ అనేది లభిస్తుంది. సీత ఎట్లా అయితే పుట్టలేదో, ఈ ఆత్మకు జన్మ లేదు. ఆ లభించిన సీతను ఎవరికి అర్పించాలో తెలియక జనకుడు ధనస్సును వంపినవాడికి అర్పిస్తా అని చెపాడు. ధనస్సు రామునికి వంగింది కనుక సీతను రామునికి ఇచ్చి వివాహం చేసాడు. మనం సాధన చేయగా లభించిన ఆత్మను ఎవరికి అర్పించాలి అంటే, ధనస్సు ఓంకారానికి గుర్తు, ఓంకారం ఎవరికి వంగునో వానికే అర్పించాలి. ఓంకారం తెలిపేది పరమాత్మకు కనుక ఈ ఆత్మ పరమాత్మకు మాత్రమే చెందినది.

పరమాత్మ అందరిని ఆనందింపజేస్తాడు కనుక ఆయన రమయతి - రామ అని పేరు. రాముడిని చూసి పురుషులు కూడా మోహించేంత సౌందర్యం ఉన్న రాముడు సీతకు వశుడై ఉన్నప్పటికీ, ఆమె బంగారు లేడిని తెచ్చివ్వమని చెప్పింది. దేవుడు ప్రక్కగా ఉండగ మనం మరొకటి కోరాల్సిన అవసరం ఉండదు, అందుకే గోదాదేవి "ఉన్నై అరుతిత్తు వందోం" మేం నిన్ను కోరి వచ్చాం అని చెబుతుంది. ఇది మనం అడగ గలగాలి. దయ వల్ల భగవంతుడు మనం క్షుద్రమైనవి  కోరినా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, కానీ మనకు హితం చెప్పే గురువులు ఉంటారు, వారు మనం ఏది కోరతగునో చెబుతుంటారు. కానీ మనం వారిని కూడా లెక్క చెయ్యం. సీతమ్మకు లక్ష్మణ స్వామి హితం చెప్పినా, ఆమె ఆయనను కూడా దూరం పంపింది. అందుకే సీతమ్మ రావణాసురుడి చెరలో పడినట్లే మనం కూడా అట్లానే శరీరం అనే లంకలో పడి ఉన్నాం.

లంకా నగరం ఎంత అందంగా ఉండేదో, మన శరీరం అనేది ఒక అందమైన పురం. సీతని రావణాసురుడు హింసించినట్లే, మన ఆత్మపై ఆదిపత్యం చూపేది మన మనస్సు. మనస్సుకు రావణుడు అని పేరు. రావణాసురుడికి పది తలలున్నట్లే, ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు  మొత్తం పది ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు. రావణుడు మన మనస్సు యొక్క రజో గుణానికి గుర్తు. రావణుడికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులున్నట్లే, మనస్సుకు తమస్సు, సాత్వికం అనే గుణాలు ఉంటాయి. దైవాన్ని గురించి, ధర్మాన్ని గురించి విభీషణుడు హితం చెప్పినట్లే, అప్పుడప్పుడు మనస్సుకు సాత్విక ప్రవృత్తి ఉంటుంది కానీ రజో గుణం దాన్ని అణిచివేస్తుంది. ఎట్లాంటి జ్ఞానం లేక పడి నిద్రపోయే స్థితిని తమోగుణం అని అంటారు, ఇది కుంభకర్ణుడు దీనికి గుర్తు. ఏది చూసినా నాకోసమే అనేదే రజో గుణం, రావణుడు దానికి గుర్తు. రజో గుణం పెరిగి చివరికి దేవుడికి చెందినదాన్ని కూడా నాకు కావాలి అన్నప్పుడు రాముడు రావాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త దేవుల్లని పుట్టిస్తున్నారు. ఇది ప్రమాధకరమైన స్థితి. ప్రపంచాన్ని మన ఆధీనంలోకి రావాలని అనుకుంటున్నాం, అది ప్రమాధకరం. సీత తను చేసిన తప్పువాలే రావణుడి చెరలో పడ్డట్లే, మనం కూడా భగవంతునితో అనందాన్ని అనుభవించేవాళ్ళం ఒకనాడు కానీ మనం చేసుకున్న స్వయంకృత అపరాదం వల్ల మనం ఈ శరీరంలోకి వచ్చాం. లంకలో పడ్డ సీత బయట పడాలని అనుకుంది. ఆ లంక వంద యోజనాల దూరం ఉంది. అట్లానే శరీరానికి వంద ఏండ్ల ఆయుపరిమితి ఉంది.

సీతమ్మతో పాటు ఉన్న కొందరు రావణుడిని లొంగిపోయారు, అట్లా లోకంలో ఎందరో బద్ద జీవులు సంసారంలో ఉండిపోతున్నారు. అయితే సీతమ్మ రాముడే రావాలి అని అనుకున్నట్లు, కొందరు ముముక్షువులు భగవంతునికోసం ఎదురు చూస్తుంటారు. రాముడు మొదట హనుమంతుడిని ఒక ముద్రిక ఇచ్చి పంపి మార్గాన్ని సుగమనం చేసాడు. అయితే భగవంతుడు నేరుగా రాడు, మొదట ఒక గురువుని మన కోసం పంపి మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఈ శరీరమనే లంకలో పడి ఉన్న మనం మనస్సనే రావణుడికి లొంగక రాముడికే శరణాగతి చేస్తే అప్పుడు రాముడు పంపిన హనుమవలె ఒక ఆచార్యుడు మన వద్దకు వస్తాడు. భగవంతుని గురించి చెప్పగలిగిన వాడు హనుమ, సదాచార్యుడు మనకు భగవంతుని గురించి వర్ణిస్తాడు, భగవంతుడు అనుగ్రహించిన చిహ్నాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం మన అంగీకారం తెలియజేయాలి, ఒకరిపై దోశాన్ని పెట్టక మనం స్థితికి కారణం మనమే అని గుర్తించి, రాముడే కాపాడాలని కోరాలి. హనుమంతుడు వెళ్ళి రాముడు వచ్చి సీతమ్మకు చెర నుండి బయట పడేట్టు చేసాడు.

అట్లా హనుమ ద్వారా జరిగిన కాండ కనుక ఆత్మ ఎందుకు ఈ చిక్కులో పడింది అని తెలియజేసేది, ఇందులోంచి విడిపించేది ఎవరు, ఇక్కడినుండి చేరాల్సిన చోటేది అనే జ్ఞానాన్ని ఇస్తుంది ఈ కాండ. అది అసలైన జ్ఞానం. మిగతావి కొంతసేపు ఉండే ఆనందాలే, భగవంతుడిని చేరితే మాత్రమే వస్తుంది. గురువు మనకు ఈ సంసారాన్ని దాటి తరింపజేసే ఉపకారం చేస్తే మనకు అసలైన ఆనందాన్ని కలిగించినట్లు అవుతుంది. ఆత్మ సౌందర్యం, శరణాగతిచేయించే ఆచార్య సౌందర్యం, భగవంతుని సౌందర్యం అన్నింటిని తెలిపేది కనుక ఈ కాండకు సుందర కాండ అని పేరు.

యుద్ద కాండ

శరణాగతి గొప్పతనం

హనుమంతుడు సీతను వెతికి సీతమ్మ సమాచారాన్ని రామునికి అందిస్తాడు. ఆతరువాత సముద్రాన్ని ఎట్లా దాటాలి అని సముద్రతీరానికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో విభీషణుడు వస్తాడు. రావణాసురుడి పరివారంలో ఒకడు, అసలు ఆ వంశంలో తప్పి పుట్టాడు. ఈ విషయం వాళ్ళే అనుకొనే వారు. వారి సోదరి సూర్పణక రామ చంద్రుడిని కలిసినప్పుడు తన గురించి తెలుపుతూ లోకాన్ని ఏడిపించే రావణాసురుడి చెల్లెలిని అని చెప్పింది. నాకు మరొక అన్న కుంభకర్ణుడు ఉన్నాడు, నిద్ర పోతూ ఉంటాడు అని చెప్పింది. మరొకడు పొరపాటున మా వంశంలో పుట్టాడు విభీషణుడు 'నతు రాక్షస చేష్టితః విభీషణః ధర్మాత్మ' అని చెప్పింది. ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేవాడు, అది మా వంశ ఆచారం కాదు అని చెప్పింది. అయినా తాను ఉన్న చోట శ్రేయస్సును కలిగించాలి అని కోరుకునేవాడు విభీషణుడు. అవకాశం దొరికినప్పుడల్లా రావణాసురుడి చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడాడు. సీతమ్మను జాగ్రత్తగా తిరిగి రామచంద్రునికి ఇవ్వు, అది నీకూ నీ కులానికి మంచిది అని చెప్పాడు. అనేక సార్లు చెపాడు. సామాన్యంగా మంచి చెప్పేవాళ్ళంటే పడదు, మన దోశాలను ప్రోత్సహించేవాళ్ళంటేనే మనకు ఇష్టం. నీకు దేవతలే పెద్ద లెక్క లేదు, మానవులు, కోతులు పెద్ద లెక్కనా అని అందరూ రావణాసురుడికి ఎప్పుడూ తన చుట్టూ చేరి చెప్పేవారు. విభీషణుడిని అవమానించి పంపారు. రావణా నేను వెళ్ళి పోతున్నాను అని 'సులభా పురుషం రాజన్ సతతా ప్రియ వాదినః' మనకి ఇష్టమైనట్టుగా మాట్లాడే వారు మన చుట్టూ ఉంటారు, కానీ వారు మనల్ని బాగుచేస్తారో నాశనం చేస్తారో తెలియదు. కానీ మన బాగుకోరే వారు దొరకడం చాలా కష్టం, వారు మన బాగు కోసం చెప్పిన మాటలు 'అప్రియతు పత్యస్య' చేదుగా పత్యం వలె అని పిస్తాయి, అని చెప్పి తనతో పాటు నలుగురు మిత్రులను తీసుకొని బయలుదేరాడు.
 
రామచంద్రుడు ఉండే సముద్ర తీరానికి చేరాడు. ఆయన రాక్షస కులంలో పుట్టినప్పటికీ రామచంద్రునికి శరణాగతి చేయాలని వచ్చాడు. సుగ్రీవునికి తన కోరికను విన్నపించాడు. పెద్దలను ఆశ్రయించేప్పుడు నేరుగా కాక వారి పరివారం ద్వారా ఆశ్రయించాలి అని తెలిసిన యోగ్యుడు. సుగ్రీవునికి ఆశ్రయం ఇద్దామని అనిపించలేదు. చివరికి రామచంద్రుడు వారందిరిని మెప్పించి నేను తప్పక రక్షించి తీరుతా అని ప్రతిజ్ఞచేసి వద్దు అని వాదులాడిన సుగ్రీవుడిని పంపి పిలిపించుకున్నాడు. విభీషణుడిని తన సోదరునిగా అంగీకరించాడు. రామ చంద్రుడు విభీషణుడిని కలిసాక తను కాపాడటానికి ఇంతమందిని ఒప్పించేసరికి నిన్ను ఆకాశంలోనే ఉంచాల్సి వచ్చింది అని "లోచనాభ్యాం పిభర్ణివా" తన కంటి చూపు తోనే ఒక్కసారి తాకేస్తున్నడా అన్నటు చూసాడట. అయితే విభీషణుడిని యుద్దంలో అవసరం వస్తాడేమోనని స్వీకరించాడా అంటే, అలా చేసి ఉంటే తను అంత దగ్గర చేయాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ ఆయనను తన ఆప్తుడిగా స్వీకరించాడు. ప్రక్కన లక్ష్మణస్వామి, సుగ్రీవుడు ప్రక్కన ఉన్నా సముద్రం ఎట్లా దాటాలో విభీషణుడినే అడిగాడు. విభీషణుడు చాలా అమాయకుడు. ఆయన తను రామునికి ఎట్లాంటి సహాయం చేసినవాడు కాదు, పెద్ద పలుకుబడి ఉన్నవాడు కాదు. అక్కడ తరిమేస్తే నిలవ నీడ లేక వచ్చినవాడు, తను రామునికి శరణాగతి చేస్తే వెంటనే ఫలితం పొందాడు. రాముడు ప్రసన్నం కావడానికి రామున్ని ఆశ్రయించడం అనేది ముఖ్యం తన విషయంలో, అందుకే శరణాగతి ఎంత గొప్పది అని చెప్పి తాను ఎట్లా అయితే రక్షణ పొందాడో రామున్ని కూడా సముద్రానికి శరణాగతి చేయమని సలహా ఇచ్చాడు. సముద్రుడు రాముడు చేసే శరణాగతికి అర్హుడా కాదా అని కూడా చూడలేదు. విభీషణుడి మాట వెంటనే విన్నాడు. ఇది రామునికి విభీషణుడి యందలి ప్రేమ. శరణాగతి ఎవరు చేసినా ఫలిస్తుంది అని చెబుతారు. భరతుడు చేసిన శరణాగతి పద్నాలుగు ఏండ్ల తరువాత ఫలించింది, కానీ విభీషణుడికి వెంటనే ఫలితం లభించింది.

 
భగవంతుడిని ఆశ్రయించడానికి  పెద్ద కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు, యోగాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు, మనం ఒక్కసారి మనస్సులో భగవంతుడు నాకు అనుకూలుడు అని అనుకుంటే చాలు. భగవంతుడు తప్ప మరొకడు ఉద్దరించేవాడు లేడు అని ముందు గ్రహించాలి. భగవంతుడికి శరణాగతి చేస్తున్నా అని నోరు తెరిచి చెప్పాలి. భగవంతునికి ఆమాత్రం తెలియదా అని అనుకుటాం. కానీ ఆ భగవంతుడు మనకు మనస్సును ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. వాటిని మనం ఆయన కోసం వాడాలి, భగవంతుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పాలి. "రాఘవం శరణం గతః" అని ఆ మాట విభీషణుడు అన్నాడు. రాముడి ముందర, సుగ్రీవాదుల ముందర వ్యక్తం చేసాడు. నేను రావణుడు తరువాత పుట్టిన నీచుడిని అని చెప్పాడు. రామచంద్రుడు తన హృదయానికి హృదయంగా స్వీకరించాడు. సముద్రుడికి శరణాగతి చేయాలో వద్దో ఆలోచించలేదు. శరణాగతి చేసాడు, అట్లా మూడు రోజులు వేచి చూసాడు. సముద్రం స్పందించలేదు, వెంటనే లక్ష్మణుడితో ఇలాంటి వానికి తల వంచడం తప్పు, ఇలాంటి సముద్రం అనేది ఒకటి ఉంటుంది అనేదే లేకుండా చేస్తా అని అస్త్రాలని తీసాడు. వెంటనే సముద్రుడు వచ్చాడు. మర్యాదలు పెట్టినవాడిని నివ్వూ, నీవు నాకు శరణాగతి చేయడం ఏమిటి అని సముద్రుడు చెప్పాడు. కావాలంటే నాలో ఉన్న లొసుగులు చెబుతా అని మీలో నలుడు చేతితో దేన్ని తాకి సముద్రంలో వేసినా తేలుతుంది, కనుక ఆ నలుడితో సేతువును నిర్మించుకోండి అని సలహ ఇచ్చాడు. అప్పుడు కొండలు, చెట్లు, రాల్లు అన్నింటిని నలుడు స్పృశించి వేస్తే సేతువు తయారు అయ్యింది.
 
 
మనది రాముడిని విశ్వసించిన జాతి కనక, నీదైన లోకానికి క్షేమం కలిగేట్టు చేసుకో అని విన్నపించుకుందాం.

 

No comments:

Post a Comment