Tuesday, 22 March 2016

శ్రీ మహాభారతం తొలిశ్రోత





శ్రీ మహాభారతం తొలిశ్రోత

పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు చంద్రవంశానికే ప్రధాన అలంకారం లాంటివాడు. ఈయన రాజుల్లో ఋషిలాంటివాడు. దయాగుణంతో ప్రవర్తిస్తూ ధర్మాన్ని భూమండలమంత ప్రచారం చేసిన మహానుభావుడు. జనమేజయుడు అనే పేరుతో మొత్తం 9 మంది మనకు మహాభారత కథలో కనిపిస్తారు. అయితే పాండవ వంశీయులలో పరీక్షిత్తుకుమద్రవతి అనే ఆమెకు జన్మించిన జనమేజయుడు అందరిలోకి ప్రధానుడు. తక్షకుడి విషాగ్నిలో పరీక్షిత్తు దగ్ధమైపోయినప్పుడు ఆయన మంత్రి, పురోహితులు రాజ్యమంతా రాజులేక ఆరాజకమవుతుందని చిన్న పిల్లవాడైన జనమేజయుడిని హస్తిన పురానికి అధిపతిగా అభిషేకించి రాజు లేనిలోటును తీర్చారు. రాజైన జనమేజయుడు ఆయనకు పూర్వులైన పాండురాజు, ధర్మరాజుల లాగానే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించగలిగాడు.

ఆ రోజుల్లో కాశీ రాజ్యాన్ని సువర్ణవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు వపుష్టమ. యువకుడైన జనమేజయుడికి కాశీరాజు పుత్రిక వపుష్టమతో ఆనాటి ఆయనమంత్రులు పెళ్ళి జరిపించారు. ఆదర్శ దంపతులుగా ఉన్నవారికి శతానీకుడు, శంకు కర్ణుడు అనే ఇద్దరు మగబిడ్డలు కలిగారు. జనమేజయుడికి శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే ముగ్గురు సోదరులు ఉండేవారు. జనమేజయుడు చాలా కాలంపాటు కురుక్షేత్రంలో యజ్ఞం చేశాడు. ఆ సమయంలో సారమేముడు అనే ఒక కుక్కపిల్ల యజ్ఞం జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో వచ్చింది. ఆ కుక్కపిల్ల యాగశాల వద్దకు రావటం కానీ, యాగాన్ని పాడుచేయటం కానీ ఏమీ చేయలేదు. అయినా జనమేజయుడి సోదరులు దానిని కొట్టారు. అది రోదిస్తూ తన తల్లి అయిన సరమ దగ్గరకు వచ్చింది. సరమకు తనకుమారుడు ఏ తప్పు చేయకపోయినా జనమేజయుడి సోదరులు తన కుమారుడిని కొట్టినందుకు కోపం వచ్చింది. వెంటనే వారి దగ్గరకు వెళ్ళి నిలదీసింది. అన్యాయంగా అపరాధం చేసినందుకు భవిష్యత్తులో జనమేజయాదులందరికీ నష్టం కలుగుతుందని శపించింది. జనమేజయుడికి ఈ సంఘటన మనస్థాపాన్ని కలిగించింది. ఆ దోషం పోగొట్టుకోవటానికిఏమి చేయాలో అతనికి పాలుపోలేదు. తన పురోహితులందరిని తనకు తరుణోపాయం ఏదైనా సూచించమని అడిగాడు. ఇంతలో ఒకసారి ఆయన అడవికి వేటకు వెళ్ళాల్సివచ్చింది. ఆ అడవిలో శృతశ్రవుడు అనే ఒక ముని ఆశ్రమం కనిపించింది. శృతశ్రవుడికి ఒక సర్ప స్త్రీ వల్ల ఒక కుమారుడు కలిగాడని, అతడు ఎంతో శక్తి సంపన్నుడని, ఎలాంటి పాపాన్ని అయినా పోగొట్టగలడని జనమేజయుడు అంతకు ముందే వినివున్నాడు. కనుక ఆ మునిని అడిగి ఆయన కుమారుడైన సోమశ్రవుడిని తనవెంట తీసుకువెళ్ళాలనుకున్నాడు. రాజు కోరిక విని సరేఅన్నాడు ముని. రాజు ముని కుమారుడిని తనవెంట తెచ్చి రాజ పురోహితుడిగా నియమించాడు. ఒకసారి జనమేజయుడు తక్షశిల నగరం మీదకు దండెత్తి ఆనగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జనమేజయుడికి వేదుడు అనే ఇంకొక పురోహితుడు కూడా ఉండేవాడు. ఇద్దరి పురోహితుల సలహాల మేరకు జనమేజయుడు రాజ్యాన్ని చక్కగా పాలించసాగాడు.

జనమేజయుడికి మనసులో చిన్ననాటి నుంచి ఒక బాధ మిగిలేవుంది. తన తండ్రి అయిన పరీక్షిత్తును తక్షకుడు సంహరించినందుకు సర్పజాతి అంతటినీ నాశనం చేయటానికి సర్పయాగం చేయాలనుకున్నాడు. సర్పయాగంప్రారంభమైంది. ఆ అగ్నిగుండంలో అగ్ని సమాన విషం ఉన్న నాగులు నల్లనివి, తెల్లనివి, పచ్చనివి, ఎర్రనివి అయిన సర్పాలు రకరకాలైన సర్పాలు ఒకటికాక ఎన్నెన్నో శిరస్సులున్న సర్పాలు అన్నివచ్చి పడసాగాయి. జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలన్నీ పడి నాశనమవుతుంటే ‘వాసుకి’ అనే సర్పరాజు చూస్తూ కూర్చోలేకపోయాడు. ఆయన తన మేనల్లుడైన ఆస్తీకుడిని పిలిచి యాగాన్ని ఆపమని కోరాడు. ఆస్తీకుడు వెనువెంటనే వెళ్ళి జనమేజయ మహారాజును ప్రార్థించాడు. ఆస్తీకుడి ప్రార్థనలకు ఆనందించిన జనమేజయుడు తన యాగాన్ని ఆపుచేశాడు.

ఆ తర్వాత జనమేజయుడు కొద్ది కాలానికి శిష్య సమేతుడై ఉన్న వ్యాసమహర్షిని స్తుతించి తన పూర్వీకుల చరిత్ర అయిన మహాభారత కథ వివరించమని కోరాడు. అప్పుడు వ్యాసుడు వైశంపాయనుడిని చూసి భారతకథ నంతటిని జనమేజయుడికి వివరించమన్నాడు. అలా ఆ మహర్షి ద్వారా జనమేజయుడు భారత కథనంతా విన్నాడు. మహాభారతాన్ని మొట్టమొదట విన్నవాడు ఈ మహారాజే. ధర్మబద్ధుడైన రాజుగా జనమేజయుడు అందరిచేత ప్రశంసలు అందుకొని ధన్యజీవి అయ్యాడు.



No comments:

Post a Comment