ఈ భూమిపై పుట్టిన వ్యక్తి లక్ష్యమేమిటి? ఒక వేళ ఈ లక్ష్యం మోక్షమే అయితే అది ఎన్ని రకాలు? దానిని ఎలా చేరుకోవాలి? లాంటి ప్రశ్నలు అనేకం కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం...
మనకు పారలౌకికము, పారమార్థికం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలుంటాయి.
పారలౌకికమంటే మనం ఉండే ఈ లోకం కంటే గొప్పదైన మరో లోకానికి సంబంధించినది అని అర్థం. అంటే ఆ లోకానికి చెందిన జీవులే కావచ్చు. లేక వస్తువులు కావచ్చు. ఉదాహరణకు కర్ణాటకలోని మేల్కోటేలోని పెరుమాళ్లకు ఒక వజ్రకిరీటం ఉంది. దానిని అరవభాషలో వైరముడి అంటారు. అనిరుద్ధుడనే వ్యూహరూపి యొక్క కిరీటమట. ఇది కొన్ని కారణముల చేత ప్రస్తుతం ఇక్కడుంది. ఇది ఈ లోకానికి కాక ఇతర గొప్ప లోకాలకి సంబంధించినదే కదా! కనుకనే దీనిని పారలౌకికము అంటారు. సాధారణంగా ఈ పదాన్ని పరమపదమునకు సంబంధించిన అనే దానికి పర్యాయంగా వాడతారు.
పారమార్థికం అంటే మనం పొందే అన్ని రకాల ప్రయోజనాలలో ఏ ప్రయోజనం చిట్టచివరదో, ఏ ప్రయోజనం పొందితే ఇక సమస్తమూ పొందినట్లే అవుతుందో అట్టి ఉత్కృష్టతమమైన ప్రయోజనానికే పరమార్థమని పేరు. అట్టి పరమార్థాన్ని గురించిన విషయాలను పారమార్థికములంటారు. దానికి సంబంధించిన బుద్ధిని పారమార్థికబుద్ధి అంటాం. పరమార్థాన్ని తెలిపే గ్రంథాలను పారమార్థిక శాస్త్రాలంటాం.
ఇక పారలౌకికంగా మనకు మోక్షం అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనిని మన శాస్త్రాల్లో నాలుగు రకాలుగా పేర్కొంటారు. అవి:
మొదటిది సాలోక్యం. అంటే పరమాత్మ ఉండే లోకాన్ని చేరటం.
రెండోది సారూప్యం. అంటే పరమాత్మతో సమానంగా రూపాన్ని ధరించడం.
మూడోది సామీప్యం. పరమాత్మ ఉండే ఆసన సమీపానికి చేరడం.
నాలుగోది సాయుజ్యం. అంటే జీవుడు తన అనుభవాలతో సమాన గుణానుభవాలను పొందటం.
ఈ నాలుగింటినీ చేరుకోవడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను కూడా మన శాస్త్రాలు సవివరంగా చెబుతున్నాయి. ఒకప్పుడు మన వేదరాశి 1134 శాఖలుగా లభించేది. ఇన్ని శాఖలను గ్రహించటం అందరికీ కష్టం కాబట్టి శ్రీవ్యాసభగవానుడు వీటిని నాలుగు ప్రధాన భాగాలుగా విడదీశాడు. ఇవి ఋక్శాఖ, యజుశ్శాఖ, సామశాఖ, అధర్వశాఖ. ఆ తర్వాత వీటిని మరి కొన్ని శాఖలుగా విడదీశారు. వీటిలో అన్ని శాఖలూ ముఖ్యమైనవే. మానవుడిని మోక్షం దారిలో నడిపించేవే!
-శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
No comments:
Post a Comment