Sunday, 20 August 2017

వినాయక చవితి - వినాయకుడు

విశ్వ వినాయకుడు
వినాయకుడు కేవలం హిందూమతానికి మాత్రమే, కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. వినాయకుణ్ని జైనులు, బౌద్ధులు కూడా తమ తమ రీతుల్లో ఆరాధిస్తారు. భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల్లో వినాయకుడి ఆరాధన వేల ఏళ్ల కిందటే ఉండేదనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రమథ గణనాయకుడైన వినాయకుడు నిజానికి విశ్వవినాయకుడు. భారత భూభాగానికి వెలుపల గజాననుడి ఆరాధన విశేషాలు మీ కోసం...

వినాయకుణ్ని వ్యాపారవర్గాల వారు విశేషంగా ఆరాధించేవారు. సముద్ర వర్తకుల పుణ్యమా అని వినాయకుడు భారత భూభాగాన్ని దాటి బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, జపాన్‌ తదితర దేశాలకు విస్తరించాడు. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్‌లోను, శ్రీలంకలోను, నేపాల్‌కు పొరుగునే ఉండే భూటాన్, టిబెట్‌ ప్రాంతాలలో కూడా శతాబ్దాల కిందటే వినాయకుడి ఆరాధన ఉండేది. హిందూ మతస్తులతో పాటు వారితో సన్నిహితంగా మెలగిన జైనులు, బౌద్ధులు కూడా వినాయకుణ్ని ఆరాధించేవారు.

జైన వినాయకుడు
జైన మత నిబంధనలకు సంబంధించిన సాహిత్యంలో ఎక్కడా వినాయకుడి ప్రస్తావన కనిపించకపోయినా, జైనులు వినాయకుణ్ని శతాబ్దాల కిందటే ఆరాధించేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. పన్నెండో శతాబ్దికి చెందిన జైన గురువు హేమచంద్ర రాసిన ‘అభిధాన చింతామణి’, పదిహేనో శతాబ్దికి చెందిన జైన గురువు వర్ధమాన సూరి రాసిన ‘ఆచార దినకర’ వంటి గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుణ్ని ఈ గ్రంథాలలో హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా అభివర్ణించారు. ఇవి శ్వేతాంబర జైన గ్రంథాలు. దిగంబర జైన గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన పెద్దగా కనిపించదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని ఖండగిరి, ఉదయగిరి గుహలలోను, మథురలోను మధ్యయుగాల నాటి జైన ఆరాధనా కేంద్రాలలో వినాయకుడి శిల్పాలు కనిపిస్తాయి. రాజస్తాన్, గుజరాత్‌లలోని జైన ఆలయాల్లోనూ వినాయకుడి చిత్రాలు కనిపిస్తాయి.

బౌద్ధ వినాయకుడు
ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాలలో వినాయకుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. టిబెటన్ల వినాయకుడు రుధిరవర్ణంలో ఉగ్రరూపంలో కనిపిస్తాడు. ‘మహారక్త’ గణపతిగా టిబెటన్లు వినాయకుణ్ని తాంత్రిక పద్ధతుల్లో కొలిచేవారు. టిబెట్‌లోని వజ్రయాన బౌద్ధులు, చైనాలోని షింగాన్‌ బౌద్ధులు వినాయకుణ్ని ఆరాధించేవారు. షింగాన్‌ బౌద్ధుల ద్వారానే వినాయకుడి ఆరాధన జపాన్‌కు పాకింది. జపాన్‌ రాజధాని టోక్యో శివార్లలోని అసాకుసా ప్రాంతంలో పన్నెండో శతాబ్ది నాటి గణపతి ఆలయం ఉంది. బౌద్ధులు గణపతిని తమ దైవాలలో ఒకరిగా ఆరాధిస్తే, హిందువుల గణపతి పురాణం, ముద్గల పురాణాలు బుద్ధుణ్ని గణపతి అవతారంగా అభివర్ణించడం విశేషం. థాయ్‌లాండ్‌ వాసులు వినాయకుణ్ని ఆరాధించడం ద్వారా అదృష్టం కలసి వస్తుందని, విజయాలు వరిస్తాయని విశ్వసిస్తారు. ఇండోనేసియన్లు గణపతిని జ్ఞానప్రదాతగా పూజిస్తారు. ఇండోనేసియాలోని బేండుంగ్‌లో గణేశుడి పేరిట ఒక వీధి ఉంది. జావాకు చేరువలోని ఒక దీవిలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటి పురాతన వినాయకుడి విగ్రహం బయటపడింది. ఇండోనేసియాలోని ప్రంబానన్‌ ఆలయంలో తొమ్మిదో శతాబ్ది నాటి వినాయకుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ప్రాచీనకాలం నుంచే ఇతర దేశాల్లోని వినాయకుడి ఆరాధనకు, ఉనికికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్నాయి.

వినాయక చవితి...
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో పదడుగులు ఉంటుంది ఒక విగ్రహం. ఓ ఊర్లో యాభై అడుగులు ఉంటుంది ఇంకో విగ్రహం. ఎలా కొలిచినా సరే కదా అని చెప్పి రకరకాల రంగులు వాడేస్తున్నాం. విగ్రహం తయారీకి ఏవేవో కృత్రిమ పదార్థాలు వాడేస్తున్నాం. అవన్నీ నిమజ్జనం రోజున చెరువుల్లో, నదుల్లో మునిగిపోయి ప్రకృతిని పాడు చేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుణ్ని కొలిచేందుకు ప్రకృతికి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నాం? అందుకే ఇప్పటికైనా ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణహిత) మార్గానికి వెళ్దాం అంటూ పుట్టుకొచ్చిన కొత్త వినాయకుణ్ని కొలుద్దాం...

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వినాయకుడికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజున మొదలయ్యే ఈ ఉత్సవాన్ని ఏటా తొమ్మిది నుంచి 21 రోజుల పాటు జరుపుతున్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయన మరణం తర్వాత ఈ వేడుక మళ్లీ ఇంటివరకే చేసుకునే పండుగగానే మిగిలిపోయింది. 1880వ దశకంలో, బ్రిటిష్‌ పాలన జరుగుతున్న రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలను మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించడం మొదలైంది. ఇక నాటినుంచి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అదే స్థాయిలో జరుగుతూనే వస్తున్నాయి.

మొదట్లో వినాయక చవితి ఉత్సవాలకు పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ రాకతో విగ్రహాల తయారీల ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గడం, సులువుగా, కలర్‌ఫుల్‌గా విగ్రహాలను తయారుచేసే అవకాశం దొరకడంతో దాదాపుగా సమాజమంతా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలకే ఓటు వేస్తూ వచ్చింది. అయితే విగ్రహాల తయారీకి ఇలా వాడుతోన్న ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, కృత్రిమ రంగులు వినాయక నిమజ్జనం తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయని, పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెబుతూ గత ఐదారు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వైపుకు సమాజం అడుగులేస్తోంది. ఏటా ఇదే విషయంపై ఎన్నో క్యాంపెయిన్స్‌ నడుస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు.

No comments:

Post a Comment