Sunday, 20 August 2017

రాహుకేతువులు - సూర్యచంద్రులు

చేటు తెచ్చిన కామం

అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం, ఆ తర్వాత ఉచ్ఛైశ్రవం, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, లక్ష్మీదేవితో సహా అనేకానేక దివ్యమైన వస్తువులు, దివ్యశరీర ధారులు ఉద్భవం అవుతున్నారు. అంతిమంగా వైద్యశాస్త్రానికంతటికీ అధిదేవత, శంఖుచక్ర గదాపద్మాలను ధరించి, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును పోలి ఉన్న దివ్యపురుషుడు ధన్వంతరి అమృత భాండంతో ఆవిర్భవించాడు.

అంతవరకు ఎంతో క్రమశిక్షణతో అమృతాన్ని చిలుకుతున్న దేవదానవులకు కళ్లముందు అమృతభాండం కనిపించడంతో అవతలి వారికి వాటా ఇవ్వాలనే విషయాన్ని విస్మరించి, ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కున్నారు. తమ మటుకు తామే అమృతాన్ని తాగేద్దామని సముద్రపుటొడ్డున పరుగులు తీస్తున్నారు. ముందుగా రాక్షసులు అమృత పాత్రను పట్టుకుని పారిపోతుంటే దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించాడు.

మోహిని జగన్మోహనంగా నవ్వుతూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలుచుంది. 


కామానికి లొంగిపోయిన రాక్షసులు మోహినిని చూసి లొట్టలు వేసుకుంటూ, ‘‘అమృతాన్ని నీవే మాకు న్యాయంగా పంచు. అని ఆమెను కోరారు. 

‘‘నేనెవరినో మీకు తెలియదు. నన్ను పెద్ద చేసి, మీరు చేతిలో అమృతపాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్నడగలేదు. ఇప్పుడు నేను ఈ పాత్రను పట్టుకుపోతే మీరు ఏమయిపోతారు?’’అని అడిగింది. 

మోహిని మాటలు విన్న తర్వాత కూడా వారు ‘‘అమృతాన్ని నీవే మాకు పంచాలి అన్నారు.

మోహిని వారి నుంచి అమృతపాత్రను అందుకుని, ‘‘మీరు చక్కగా స్నానం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతాన్ని పోస్తాను.’’ అని అంది. 


వారలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే, ఆమె శరీర పృష్టభాగం రాక్షసులకు కనపడుతుంది. దాంతో వారు అమృతం మీద దృష్టిపెట్టకుండా, మోహిని అంగాంగాల మీద దృష్టిపెట్టారు. అదే వారి పతనానికి కారణమయ్యింది. 

మోహిని దేవతలకు పవిత్రంగా కనపడుతోంది. 

రాక్షసులకు మాత్రం మోహజనకంగా కనపడుతోంది.

దీనిని రాహువు అనే రాక్షసుడు గమనించాడు. వెళ్లి దేవతల పంక్తిలో సూర్యచంద్రుల మధ్యన కూర్చున్నాడు. అది తెలుసుకున్న సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. కానీ, పంక్తి ధర్మాన్ని పాటించిన విష్ణువు రాహువుకు కూడా అమృతాన్ని పోశాడు కానీ, అది గొంతు దిగేలోగానే తన చక్రం చేత ఖండించాడు. అయితే అమృతంతో కూడినందువల్ల తల మాత్రం పడిపోలేదు. మొండేనికి కూడా ప్రాణం వచ్చింది. అదే కేతువు. 


తన ఉనికిని గురించి విష్ణుమూర్తికి తెలియజెప్పారనే కోపంతోనే రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతూ ఉంటారు. అదే సూర్యచంద్రగ్రహణాలు.

No comments:

Post a Comment