Friday, 4 August 2017

అమ్మవారి పూజలో అంతరార్థమిదీ!

అమ్మవారి పూజలో అంతరార్థమిదీ!
  లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మన్దకటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేన్ద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్యకుటుమ్బినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్‌॥

లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించే పర్వదినం నేడు. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అంతే కాదండోయ్‌! తరచి చూస్తే, పండితుల్ని ఆరాతీస్తే అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలెన్నో! జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలెన్నో! అవే విపులీకరిస్తున్నారు ప్రముఖ పండితులు టి.కె.వి. రాఘవ.

లక్ష్మి అంటే గుర్తు చెప్పేది. భగవత్‌ తత్వం ఏమిటో తెలియజెప్పేది. స్త్రీ శక్తిని విశదపరిచేది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది. గుణముల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. వర అంటే శ్రేష్ఠమైనది. అంటే ప్రపంచంలో అత్యంత యోగ్యమైన ప్రయోజనాలను మనకు అందిస్తుంది.

కలశం: 
సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే.. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం.

కలశ వస్త్రం: 
వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పితృ దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్ని దేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితృదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్త్రానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా అతడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

మామిడి ఆకులు: 
కలశానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తాం. మామిడి ప్రాణశక్తిని అందిస్తుంది. చెడును పరిహరిస్తుంది. అందుకే బంధుమిత్రులు వచ్చే సమయంలో... శుభకార్యాల వేళలో మామిడి తోరణాలు తప్పనిసరి.

కొబ్బరికాయ: 
నిస్వార్థమైన జీవితానికి, అందులోని నీరు మనం పొందాల్సిన ఆనందానికి సంకేతాలు. కష్టపడి కోయడం, పెచ్చుతీయడం, పగులగొట్టి పెంకు తొలగించడం... ఇవన్నీ చేస్తే కానీ కొబ్బరి, తియ్యని నీళ్లు రావు. ‘‘ ఆ కష్టం మాకు తెలుసు, అయినప్పటికీ అన్ని సందర్భాల్లో మేం ఆ స్థాయిని ప్రదర్శించలేం. అలంకరించిన ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాం. స్వీకరించి మాకు శుభాలనివ్వు తల్లీ!’’ అంటూ వరలక్ష్మిని కోరుకోవడమే నారీకేళం విశిష్టత.
పసుపు కుంకుమలు: ఎరుపు అనురాగానికి ప్రతీక. పసుపు త్యాగాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా, సాఫీగా సాగడానికి ఈ రెండూ అవసరం. అవి కుటుంబంలోని అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి.

పానకం, వడపప్పు: 
ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పుల్ని తట్టుకోవడానికి స్త్రీలకు శక్తి కావాలి. శరీరానికి చలవ అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టే పెసరపప్పు, పానకంలో అవి లభిస్తాయి. పెసరపప్పు శక్తినిస్తుంది. పానకం చలవ. తేనె భార్యభర్తల అనురాగాన్ని.. పాలు.. ఆత్మీయ అనుబంధాన్నీ సూచిస్తాయి.


పూలసేవ: 

వరలక్ష్మీ దేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, విరహం ఎదురవకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే.


అష్టోత్తర శతనామాలు: 

అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


మహత్యం: 

లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు. ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయి.


పూజా పుష్పాల్లో... ఓషధులెన్నో! 
జగాలనేలే తల్లికి.. వరాలనిచ్చే లక్ష్మికి.. చిట్టి చేమంతులు, పరిమళాల సన్నజాజులు, నల్ల కలువలు పున్నాగలు... ఇలా పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. వీటితో పూజించడం వల్ల ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఓషధి విలువలున్న ఆ పూల వాడకం వల్ల ఆరోగ్యానికీ ఎంతో మేలు అని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.
ప్రకృతి మనకు ఎన్నో సంపదలు ప్రసాదించే వరాల తల్లి. తిరిగి ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వాటిని వినియోగిస్తాం. అలా చేయడం వల్ల భక్తి భావన, ఆరోగ్య సంరక్షణ మనకు అందుతాయి.
ఓం రమాయై నమః... జాజిపుష్పం సమర్పయామి
విరజాజులు, సన్నజాజులు స్వచ్ఛతకు చిహ్నం. వీటికి ఉద్రేక భావనలను నియంత్రించే శక్తి ఉంది. చర్మ సంబంధ వ్యాధులను దూరం చేయడంలో ఉపకరిస్తాయి.
ఓం ఇందిరాయై నమః.. పుగ పుష్పం సమర్పయామి
పోక పువ్వులో ఎన్నో వైద్య విలువలున్నాయి. వీటికి చలువ చేసే గుణం ఉంది. వీటి పరిసర ప్రాంతాల్లో ఉంటూ గాలి పీల్చడం వల్ల అజీర్ణం, మూత్రకోశ సంబంధ సమస్యలు దరిచేరవు.
ఓం పద్మప్రియాయై నమః పున్నాగ సమర్పయామి
పున్నాగ పూలంటే అమ్మవారికి మహా ఇష్టం. వీటితో మహాలక్ష్మిని పూజించడం వల్ల మనసు, దేహం ప్రశాంతంగా మారతాయి. ఆధ్యాత్మిక భావనలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పున్నాగ పూలు, ఆకులు, బెరడుకు అమోఘమైన వైద్య విలువలున్నాయి. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులను తగ్గించే గుణం ఉంది.
ఓం హరిప్రియాయై నమః వకులా పుష్పం సమర్పయామి
పొగడ చెట్టు పూలు, పండ్లు, విత్తనాలు, బెరడు అన్నింటికి వైద్య విలువలున్నాయి. వాటికి గాయాలను మాన్పించే శక్తి ఉంది.
ఓం లోకమాత్రే నమః మల్లికాపుష్పం సమర్పయామి
మల్లెలు మనసుని మురిపిస్తాయి. మధుర భావనలు కలిగిస్తాయి. వీటికి అహాన్ని తగ్గించే శక్తి ఉంది. ఈ చెట్టు వేర్లు, పూవులు, ఆకులను చర్మ, అల్సర్ల నివారణలో ఉపయోగిస్తారు.
ఓం కమలవాసిన్యై నమః సేవంతికా పుష్పం సమర్పయామి
చామంతి పూవులనే సేవంతికా పువ్వులంటారు. వీటిని ధరించడం వల్ల, శరీరానికి తేజస్సు లభిస్తుంది. చామంతి ఆకులు, పువ్వులు కంటిని కాంతిమంతం చేస్తాయి. జ్వరం, తలనొప్పి, న్యుమోనియా వంటి సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి.
ఓం పద్మనిలయామై నమః పద్మ పుష్పం సమర్పయామి
పద్మ పుష్పానికి భౌతిక భావనలతో సతమతమయ్యే వారిని వాటి నుంచి దూరం చేసి... ఆధ్యాత్మిక శక్తినందించే శక్తి ఉంది. ఆసాంతం వైద్య విలువలకు ఉపకరిస్తుంది. ఈ పుష్పానికి మేనికి వర్ఛస్సునిచ్చే, సంకుచితత్వాన్ని పోగొట్టి మనస్సు పరిధిని విశాలం చేసే గుణం ఉంది అని మానసిక నిపుణులు చెబుతుంటారు.
వరలక్ష్మ్యై నమః నీలోత్పల పుష్పం సమర్పయామి
నల్ల కలువలనే నీలోత్పలాలు అంటారు. వీటికి మెదడును చైతన్యపరిచే శక్తి ఉంది. వరలక్ష్మీ మాతను వీటితో పూజించడం వల్ల ఆలోచనల్లో.. లక్ష్యాల్లో స్పష్టత వస్తుందని భక్తుల నమ్మకం. వీటి విత్తనాలు, పువ్వులకు మధుమేహాన్ని నివారించే శక్తి ఉంది.

No comments:

Post a Comment