Sunday, 20 August 2017

కుబేరుని అహంకారం బాలగణపతి సమాధానం


అలకాధిపుని అహమణచిన బాలగణపతి

అలకాపురాధీశుడు, ధనాధిపతి కుబేరునికి తన సంపదనంతా చూసుకునేసరికి  అహంకారం తలెత్తింది. ముల్లోకాలలో తనను మించిన ధనవంతుడే లేడనుకున్నాడు. తన వైభోగాన్ని చాటుకునేందుకు దేవతలందరికీ గొప్ప విందు ఇవ్వదలచుకున్నాడు. అనుకున్నదే తడవు సమస్త దేవతలనూ విందుకు ఆహ్వానించాడు. ఒంటినిండా బూడిద పూసుకుని, మొలకు గజచర్మాన్ని చుట్టుకుని, శ్మశానాలలో పుర్రెపట్టుకుని పొట్టపోసుకునే పరమేశ్వరుడంటే చిన్నచూపు. ఆయనను విందుకు పిలవకూడదనుకున్నాడు. అయినా, తన వైభోగాన్ని చాటుకోవాలంటే పిలవక తప్పదనుకుని,  అయిష్టంగా వెళ్లాడు. పరమేశ్వరునికి కుబేరుని ఆంతర్యం అర్థమైంది.

కపట భక్తి నటిస్తూ, తనను పిలిచేందుకు వచ్చిన కుబేరునితో ‘అలకాధీశా! అనివార్య కారణాల వల్ల నేను విందుకు రాలేకపోతున్నాను. కాని నా బదులుగా నా పెద్ద కుమారుడిని పంపుతాను. అతనికింత అన్నం పెడితే చాలు– నా కడుపు నిండిపోతుంద’న్నాడు.

సరేనంటూ సమ్మతించాడు అలకాధిపుడు.

తీరా, విందు రోజు రానే వచ్చింది. దేవతలందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంతలో గుజ్జురూపంలో ఉన్న బాలగణేశుడు వచ్చాడు. వస్తూనే బొజ్జ నిమురుకుంటూ ‘ఆకలి’ అన్నాడు.

పసిపిల్లవాడు కదా, ముందుగా పెట్టేద్దామనుకున్నాడు కుబేరుడు. వెంటనే బంగారు విస్తరిని పరిచి అందులో కొద్ది కొద్దిగా భోజన పదార్థాలు, పిండివంటలు వడ్డింపించాడు. వాటన్నింటినీ కలిపి ఒక్కముద్దగా చేసి నోట్లో పెట్టుకుని, ఇంకాస్త... అన్నట్లు చూశాడు. చిన్నవాడైనా తిండి పుష్ఠి గలవాడే అనుకున్న కుబేరుడు ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ మొత్తంలో వడ్డించాడు. కన్ను మూసి తెరిచేలోపు అంతా ఖాళీ అయింది. అలా కుబేరుని దాసీజనం వడ్డిస్తూనే ఉన్నారు, పదార్థాలన్నీ ఖాళీ అయిపోతూనే ఉన్నాయి కాని వినాయకుడి చిన్ని బొజ్జ నిండటం లేదు. తనశక్తితో ధనాగారంలోని స్వర్ణరాశులన్నింటినీ ఆహారంగా మార్చి బాలగణపతికి భోజనంగా అందిస్తున్నా అదంతా హాంఫట్‌ అయిపోసాగింది.

వినాయకుడికి బొజ్జ నిండకపోవడంతో అందుబాటులో ఉన్న వంటపాత్రలను కూడా కరకరా నమిలి తినేయసాగాడు. ఆయనకు తోడు ఆయన మూషికం కూడా వీర విహారం చేయసాగింది.

ఈలోగా దేవతలందరూ విచ్చేసి, వడ్డనకోసం ఎదురు చూడసాగారు. అందరిముందూ పరువు పోయే పరిస్థితి తలెత్తడంతో  ఏం చేయాలో పాలుపోలేదు కుబేరునికి.

దాంతో తన తప్పు తెలిసి వచ్చి, పార్వతీ పరమేశ్వరుల వద్దకు పరుగెత్తుకుని వెళ్లి, వారి పాదాల మీద వాలి శరణు కోరాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో కాసిన్ని బియ్యాన్ని నీటితో తడిపి, పంచాక్షరీ మంత్రంతో అభిమంత్రించి బాలగణేశుని నోటిలో పెట్టింది. అమ్మ పెట్టిన ఆ బియ్యపు గింజలతో బాలగణపతి బొజ్జ నిండి, బ్రేవ్‌మని త్రేన్చాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో భోజనపదార్థాలన్నీ యథాప్రకారం నిండిపోయాయి. దేవతలందరూ తృప్తిగా విందుభోజనం చేసి, కుబేరుని కొనియాడుతూ ఇళ్లకు వెళ్లారు. కుబేరుడు జీవితంలో మరెన్నడూ అహాన్ని ప్రదర్శించలేదు.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

No comments:

Post a Comment