Tuesday, 13 November 2018

దివ్వెల పండుగ దీపావళి








దివ్వెల పండుగ దీపావళి



సంబరాల దీపాల పండుగ, దీపావళి. ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది, దీపతోరణాలతో గృహాన్ని అలంకరించి, లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానిస్తూ, బాణాసంచాతో సంబరంగా జరుపుకునే ఐదు రోజుల పండుగ ఇది. నవ్యకాంతుల పర్వదినం. ఆనందాల వెలుగులను విరజి మ్ముతూ, ఉత్తేజాన్ని నింపే సంతోష సంరంభం. ఈరోజున భారతావనిలో ప్రతీ ఇల్లూ దీపపు కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతుంది. దీపావళిని పురస్కరించుకుని, ఆ పర్వదిన విశిష్టత తెలుసుకుందాం.

వెలుగుల పండుగ 'దీపావళి' నాడు ప్రతీ ఇల్లూ ఆనంద కాంతుల నిల యమే. ఇంటిని నూతనంగా అలంకరించి, కొత్త వస్త్రాలు ధరించి, లక్ష్మీపూజతో ఆ జ్ఞాన, సిరుల తల్లి శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు, ఆహ్వానిస్తారు. సాయంత్రం వేళ చిరు చిరు దివ్వెలు వెలుగులు పంచుతాయి. తారాజువ్వలు పైపైకి లేస్తాయి. కాకరపువ్వొత్తులు జిగేల్మంటాయి. ముఖాల్లో మతాబుల వెలు గులు నిండుతాయి. టపాసుల శబ్దాలు జీవితంలో నిండిన నిశ్శబ్దాన్ని పారదో లుతాయి. కేరింతలు కొట్టేలా మనస్సును ఉల్లాసపరుస్తాయి. అందుకే దీపావళి వస్తోందంటేనే పిల్లలకు సంబరం, పెద్దలకు ఉత్సాహం, ఉత్తేజం.

ఐదు రోజుల సంరంభం జీవితంలోని అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకునే సంతోషాల వేడుక దీపావళి. సాధారణంగా దీపావళి అంటే ఒక్కరోజు పండుగ అనుకుంటారు. కానీ నిజానికి దీపావళి ఐదు రోజుల పండుగ. ధన త్రయోదశితో ప్రారంభమై, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీ హస్తభోజనంతో ముగుస్తుంది.

ధనత్రయోదశి
దీపావళి ఐదు రోజుల సంబరాలు ధన త్రయోదశితో మొదలవుతాయి. ఈ రోజున ధనాధి దేవత లక్ష్మీదేవిని, ధన్వంతరిని, ధనాధిపతి కుబే రుణ్ణి, పూజిస్తారు. సుఖ సంతోషాలు, సిరిసంపదలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. దీనికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథలో ఈ రోజున, అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడే పాలకడలి నుంచి శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఆమెను ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడు శ్రీమహావిష్ణువు. అందుకే ఆ రోజున ధనాధిదేవత లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని విశ్వాసం. అందుకే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజున బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా వస్తోంది.

నరక చతుర్దశి
రెండవరోజు నరక చతురశి. లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్ళనూ, వాకిళ్ళనూ అలంకరించి పూజలు చేస్తారు. ఉదయాన్నే ఇల్లంతా కడిగి, ఇంటి ముంగిట రంగవల్లులు దిద్దుతారు. ఆ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వులనూనెతో తలంటుకొని స్నానం చేయాలి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలిచక్ర వర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

దీపావళి
అమావాస్య మూడవరోజు దీపావళి జరుపుకుంటారు. ఈరోజు దరిద్ర దేవతను వెళ్ళ గొట్టేందుకు శ్రీమహాలక్ష్మిని పూజించాలి. సిరిసంపదలనొసంగమని, సుఖసంతోషాలను అందివ్వమని ప్రార్థిస్తారు. సాయంత్రం వేళ లక్ష్మీపూజ నిర్వహించి, ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, దీపాలతో అలంకరిస్తారు. ఆ తరువాత ఆనందంగా బాణాసంచా కాలుస్తూ, నింగిని వెలుగులతో నింపుతారు. ఇలా ఏ ఇల్లయితే దీపాల వెలుగులతో కాంతులు విరజిమ్ముతుందో ఆ ఇంట సిరుల నిచ్చే శ్రీమహాలక్ష్మి అడుగు పెడుతుందని నమ్మకం.

బలిపాడ్యమి
దీపావళి మర్నాడు నాలుగోరోజు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమ్మీదికి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈరోజును 'నవదివస్'గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే.

భగినీ హస్తభోజనం
దీపావళి ఐదో రోజు వేడుకను యమద్వితీయ, భాయిదూజ్గా జరుపు కుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ అక్కచెల్లెళ్ళ చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు. కూతురు యమున. యమున తన సోదరుణ్ణి ఎంతో అభిమానించేది. తన ఇంట్లో విందుచేసి పొమ్మని యమున ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక వెళ్ళలేకపోయాడు యముడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వా నించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ప్రతి ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం అద్దం పడుతుంది.

ఇలా ఐదు రోజుల పండుగగా దీపావళిని భారతావని మొత్తం నూతనోత్సాహంతో జరుపుకుంటుంది. ఆరోజున బంధువులు, స్నేహితుల ఇళ్ళకు వెళ్ళడం, మిఠా యిలు పంచుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అలాగే దీపావళినాడు నూతన గృహోపకరణాలు కొనడం చేస్తారు. రంగురంగుల, విభిన్న దీపాలతో, తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. నూతన వస్త్రాల కొనుగోళ్ళు జరుగుతాయి. ఇక బాణాసంచా సంగతి చెప్పనే అక్కరలేదు. పరిస్థి తులకనుగుణంగా, తాహతుకు తగ్గట్టుగా బాణాసంచా కొనుగోళ్ళు జరుగుతాయి. అయితే ఈ బాణాసంచా కాల్చడం వల్ల శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం పెరిగిపోతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు బాణాసంచాపై ఖర్చుపెడుతున్నారు. అందుకే కాలుష్యాన్ని నివారించడానికి సుప్రీంకోర్టు బాణాసంచా కాల్చడం పై పరిమితులు విధించింది. ఆ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని, హరిత దీపావళి జరుపుకోవాలని, బాంబులు కాల్చ కూడదని ఆంక్షలు విధించింది.

వీటిని పాటిస్తే ఆరోగ్యకర, ఆనందాల దీపావళి మీ ఇంట సిరులతోపాటు, ఆరోగ్యాన్నీ, ఉల్లాసాన్నీ పంచుతుంది. కాబట్టి దీపాల వెలుగులతో మీ ఇంటిని నందనవనంగా మార్చే దీపావళిని ఆనందంగా జరుపుకోండి. హ్యాపీ దీపావళి!


దీపాల కథలెన్నో...

దీపావళి అంటే దీపాల వరుస. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. అయితే దీపావళి ప్రాశస్త్యం గురించి, దీపావళి జరుపుకోవడానికి గల కారణాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకృష్ణపరమాత్మ సత్యభామా సమేతంగా గావించిన నరకాసుర వధ గాథను దీపావళి జరుపుకోవడానికి ముఖ్య కారణంగా చెబుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు.
 రాముడు రావణుణ్ణి సంహరించి, సీతా, లక్ష్మణుల సహా అయోధ్యకు విచ్చేస్తున్న శుభసందర్భంలో, ఆ రోజు అమావాస్య కావడంతో అయోధ్యావాసులు శ్రీరామునికి స్వాగతం పలికేందుకు దీపాలను వెలిగించి, అమావాస్య చీకట్లను పారదోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను జరుపుకుంటున్నట్టుగా చెబుతారు.
పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని, తమ రాజ్యానికి తిరిగివచ్చిన శుభసందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అప్పటినుంచి అదే ఆనవాయితీగా వస్తూ దీపాల పండుగను జరుపుకుంటున్నారనేది దీపావళి నేపథ్యంగా చెబుతారు.
అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగ చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆనందోల్లాసాలతో దీపాలు వెలిగించి, బాణా సంచాతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.



వివిధ దేశాల్లో...


ఆనందానికి, సంతోషానికి, ఉత్సాహానికి సంకేతం వెలుగు, కాంతి. మనస్సులోని బాధ, దుఃఖం వంటి చీకట్లను పారదోలి జీవితంలో వెలుగులను నింపుకోవడమే ఆనంద దీపావళి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో, తమ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ దీపాలు వెలిగిస్తుంటారు. దీపాల పండుగలు జరుపుకుంటారు. ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుకోవడా నికి వెలుగుదివ్వెల తారాజువ్వలతో నింగిని తేజోవంతం చేస్తారు. మరి వెలుగుల పండుగను జరుపుకునే కొన్ని దేశాల గురించి తెలుసుకుందామా!

జపాన్
తోరో నాగోషి పేరుతో దీపాల పండుగను నిర్వహిస్తారు. ముఖ్యంగా మూడు రోజుల పండుగ ఇది. బోట్లలో దీపాలను వదులుతారు. బంధువులు, స్నేహితులు బహుమతులు, స్వీట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు.

నేపాల్
నేపాల్లో 'తిహార్ పేరుతో దీపాల పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా ఇది ఐదు రోజులు పండుగ. ఒక్కోరోజుకు ఒక్కో విశిష్ట ప్రాధాన్యం ఉంది. మొదటిరోజు ఆవులను పూజిస్తారు. ఆరోజున లక్ష్మీదేవి ఆవుల్లో కొలువై ఉంటుందని నమ్మిక. అందుకే ఆ రోజున ఆవులను పూజించి, వాటికి ఆహారం అందిస్తారు. రెండోరోజు కుక్కల కోసం. ఆరోజు వాటికి ప్రత్యేక ఆహారం తయారుచేసి అందిస్తారు. మూడవరోజు సిరిసంపదల వృద్దికి, శ్రేయస్సుకు లక్ష్మీదేవిని ఆరాధించి, దీపాలతో ఇళ్ళను అలంకరిస్తారు. తినుబండారాలు ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. అలాగే నాలుగో రోజు యముడిని పూజి స్తారు. ఐదోరోజు భాయిదూజ్ జరుపుకుంటారు.

మలేసియా
మలేసియా హిందువులు 'హరి దీవాలీ' పేరుతో దీపావళి జరుపుకుంటారు. పండుగ రోజు సూర్యాస్తమయం కాకముందే తైలాభ్యంగనం (ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి, శనగపిండితో స్నానం చేయడం. ఇలాంటి స్నానంతో మన చర్మంలోని ప్రతి స్వేదరంధ్రమూ శుభ్రపడుతుంది.) చేసి, నూతన వస్త్రాలు ధరించి, దేవాలయాలకు వెళతారు. ఇళ్ళు వీధులు ప్రత్యేకంగా దీపకాంతులతో వెలిగిపోతుంటాయి.

థాయిలాండ్
ఇక్కడ 'లాయ్ క్రేథాంగ్' పేరుతో దీపావళి సంబరాలు సాగుతాయి. కాక పోతే మనం అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటే థాయిలాండ్ ప్రజలు మాత్రం థాయ్ క్యాలెండర్ ప్రకారం పున్నమి రోజున జరుపుకుంటారు. ఆ రోజున బాణాసంచా కాలుస్తారు. హాట్ ఎయిర్ బెలూన్స్లో దీపాలు ఉంచి నింగిలోకి వదులుతారు. ఇక్కడ దీపాల్ని వెలిగించడం పవిత్రకార్యంగా భావిస్తారు. బాణాసంచాను కాలుస్తారు.

బర్మా
ఇక్కడ 'అంగేజుల పండుగ అన్న పేరుతో దీపావళిని జరుపుకుంటారు. దీన్నే 'తంగజు' అని కూడా అంటారు.

ఇవేకాక చైనా, ఆస్ట్రేలియా, ఫిజి, మారిషస్, ఇండోనేసియా వంటి దేశాల్లో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.

-నర్మద వాసిరెడ్డి


No comments:

Post a Comment