Wednesday, 14 September 2016

వినాయకుడిని పత్రితోనే ఎందుకు పూజిస్తారు ?

వినాయకుడిని పత్రితోనే ఎందుకు పూజిస్తారు ?
పుష్పం పత్రం ఫలం తోయం..’ అన్నారు. గణనాథునికి పత్రార్చన అంటే..ఎంతో ప్రీతికరం. అందుకే వినాయక చవితి పూజల్లో వివిధ రకాల పత్రాలను ఎక్కువగా వినియోగిస్తారు. వీటి వినియోగం వల్ల స్వామి వారిపై భక్తితో పాటు..ఆరోగ్యమూ సిద్ధిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. విఘ్నాధిపతి పూజకు వినియోగించే పత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో ఔషధ గుణం ఉందని చెబుతున్నారు.
చవితి పండగ మొదలైంది. గణనాథుడి పూజలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్వామి సేవలో తరించేందుకు ఊరూవాడా నిమగ్నమైంది. గణనాథుని పూజలో పత్రాలది ప్రత్యేకత. శ్లోకాలు చదువుతూ.. వివిధ రకాల పవిత్ర వృక్షాల ఆకులు, రెమ్మలతో గణనాథునికి పూజలు చేస్తుంటారు. వీటికి ఆరోగ్య సమస్యలను హరించే గుణం ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. స్వామి పూజలో వినియోగించే పత్రాలు వాటి ఔషధ గుణాలు ఇలా..
సింధూర పత్రం
ఈ పత్రం స్వామి వారికి ప్రీతికరమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటి కషాయం తాగితే.. జ్వరం ఇట్టే నయమవుతుంది. అలాగే..కీళ్లవా తలు, నొప్పులను తగ్గిస్తుంది.
దేవదారు పత్రం
వినాయక పూజల్లో దేవాదారు పత్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పత్రం నీళ్లలో వేసి కాచి.. అనంతరం వచ్చిన కషాయాన్ని కళ్లకు పూయడం మంచిది. ఇలా చేస్తే కళ్లు అందంగా..ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చూత పత్రం
దీనిని మామిడి పత్రం అని కూడా పిలుస్తారు. జ్వరం వల్ల కలిగే మేహరపు మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది.
కరవీపత్రం
దీన్ని గన్నేరు ఆకు అంటారు. కణుతులను కరిగించే స్వభావం దీని సొంతం. అలాగే.. జుట్టులో ఉండే పేలును అరికట్టేందుకు ఈరసాన్ని వినియోగిస్తారు.
తులసి పత్రం
తులసి ఆకులులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్ణం, కడుపునొప్పి, నోటి దుర్వాసనను అరికడతాయి. తేలు విషాన్ని హరించే.. యాంటీ సెప్టిక్గా దీనిని ఉపయోగిస్తారు.
జాజిపత్రం
ఇది వాతవ పట్లు, పైత్యానికి విరుగుడునిచ్చే ఆకు. అంతే..కాకుండా మొల లను నివారించేందుకు ఔషధం కూడా. చర్మ రోగాలకు, మచ్చలకు గవద బిల్లల నివారణకు దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు .
దాడిమి పత్రం
దానిమ్మ పత్రాన్ని దాడిమి పత్రం అని పిలుస్తారు. దీనివల్ల జీర్ణకోశం, మూత్ర, మలాశయ వ్యాధులు తగ్గుతాయి. అలాగే నోటిపూత, విరేచనాలు తగ్గించేలా పనిచేస్తుంది.
మాచీ పత్రం
దీని కషాయం సేవించడం వల్ల..శరీరంపై పుట్టే దద్దుర్లు తగ్గుతాయి. కుష్టు వ్యాధి తగ్గించేందుకు ఇది ఒక మంచి ఔషధం. తల నొప్పి, కీళ్ల నొప్పులను హరిస్తుంది.
బిల్వ పత్రం
దీనిని మారేడు లేక బిల్ల లేక బిత్తిరి పత్రం అని పిలుస్తారు. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని గుజ్జు, బంక విరేచనాలను తగ్గిస్తుంది.
గరిక
దీనిని కేవలం గడ్డిగానే చూస్తాం. కానీ పూజల్లో ఎంతో ప్రాధాన్యముంది. పశువులకు శ్రేష్టమైనది. ఇందులోని పత్రహరితం జీర్ణశక్తిని పెంచుతుంది. పూర్వం మేలైన గరికను పచ్చడిగా చేసి ఆహర పదార్థాలతో తీసుకునేవారు.
విష్ణు పత్రం
ఈ పత్రాలతో చేసిన కషాయం..పైత్యాన్ని తగ్గిస్తుంది. వివిధ విషజ్వరాలను నయం చేస్తుందని ప్రతీతి. అందుకే వీటిని పూర్వకాలం నుంచి పూజల్లో ఉపయోగిస్తుంటారు.
మరువక పత్రం
ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుందని పెద్దలు చెబుతుంటారు.
దత్తూర పత్రం
దీన్ని ఉమ్మెత్త పత్రం అని పిలుస్తారు. వీటి ఆకులను ఆముదంలో రాసి..దీపపు సెగ తగిలించి..అనంతరం మిశ్రమాన్ని గడ్డలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.
బద్రిపత్రం
వీటిని రేగు ఆకులు అంటారు. జీర్ణకోశ వ్యాధులు నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రక్తదోషాలను హరించి బలాన్ని చేకూరుస్తుంది.
ఇలా..ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆకారం
భారీ బొజ్జ, చేటల్లాంటి చెవులు, తొండంతో, ఏక దంతం పెద్ద తల, చిన్న కళ్లతో వినాయకుడు భిన్నంగా కనిపిస్తాడు. ఆయన రూ పం వెనక అనేక విశేషాలు దాగున్నాయని చాలా మందికి తెలియదు. విఘ్నేశ్వరుడి రూపం, ఆయనలోని ప్రతి అవయవం మనకు ఎన్నో సందేశాలను ఇస్తాయి. చూడగానే ఆకట్టుకునే ఆ సుందర రూపం వెనుక అనంత అంతరార్థం ఉంది.
పెద్ద తల : చక్కటి ఆలోచనలకు కేంద్రం
చిన్న కళ్లు : నిశిత దృష్టికి సంకేతం
చిట్టి నోరు : ఆచి తూచి మాట్లాడమని సూచన
తొండం : అత్యుత్తమ సామర్థ్యానికి ప్రతి రూపం
చేతిలో లడ్డూ : భక్తులకు వరాలు ఇవ్వడానికి సిద్ధమన్న భావన
చేటల్లాంటి చెవులు : భక్తుల మొరలాలకించడానికి సన్నద్ధత
గొడ్డలి : మానవుడిని బంధ విముక్తి చేయడం కోసమే
ఏక దంతం : చెడును అడ్డుకుని మంచిని మాత్రమే సంగ్రహించడం
అభయ హస్తం : భక్తలకు మోక్ష మార్గం ప్రసాదించడం
భారీ బొజ్జ : మంచి చెడులన్నింటినీ ఇముడ్చుకోగలిగిన శక్తి
ఎలుక : కోరికలకు చిహ్నం. ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయంగా ఉంటుంది.

No comments:

Post a Comment