రామకృష్ణ పరమహంస దగ్గరకు నరేంద్రుడు (స్వామి వివేకానంద) జ్ఞాన సముపార్జన కోసం వెళ్తూ ఉండేవాడు. ఒకసారి నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస అష్టావక్రగీత పుస్తకాన్ని ఇచ్చి కొన్ని శ్లోకాలను సంస్కృతం నుంచి బెంగాలీలోకి అనువాదం చేయమన్నాడు. ఈ శ్లోకాల ద్వారా అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందనేది రామకృష్ణుడి భావన. ఈ విషయాన్ని స్వామి నిత్యస్వరూపానంద 1950లో రాసిన ‘రామకృష్ణ పరమహంస చరిత్ర’లో పేర్కొన్నారు. భగవద్గీత గురించి తెలియని భారతీయులు అతి తక్కువ మంది ఉంటారు. మరి అష్టావక్రగీతో? వేదాంతపరంగా చాలా కీలకమైన అంశాలను చర్చించే ఈ గ్రంథం గురించి అతి తక్కువ మందికి తెలుసు.
అష్టావక్రుడు ఒక రుషి. అష్ట అంటే ఎనిమిది.. వక్ర అంటే వంకర అని అర్థం. శరీరంలో ఎనిమిది వంకరలు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది. అసలు అష్టావక్రుడి పుట్టుక గురించి మహాభారతంలో అరణ్యపర్వంలో ఉంది. అష్టావక్రుడి తండ్రి కహోడకుడు. తల్లి సుజాత. అష్టావక్రుడు సుజాత గర్భంలో ఉన్నప్పుడు.. ఒక రోజు కహోడకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు. కహోడకుడు చదువుతున్న వేదాలను అష్టావక్రుడు గర్భంలో నుంచి వింటున్నాడు. కహోడకుడు ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్ఛరించాడు.
అష్టావక్రుడు తల్లి గర్భంలో నుంచి.. తన తండ్రికి ‘నువ్వు తప్పుగా ఉచ్ఛరిస్తున్నావు’ అని చెప్పాడు.
దాంతో కహోడకుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు ఎనిమిది వంకరలతో ఈ భూమి మీదకు రా.’ అని శపించాడు. ఇలా తండ్రి శాప ఫలితంగా అష్టావక్రుడు ఎనిమిది వంకరలతో పుట్టాడు.
కహోడకుడు గొప్ప పండితుడే కానీ అతని కన్నా గొప్పవాళ్లు అనేక మంది ఉండేవారు. ఒక సందర్భంలో కహోడకుడు విదీష రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్లాడు. అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడు కహోడకుడిని ఓడించాడు. ఆ రాజు కహోడకుడికి చెరశాలలో వేయించాడు. 12 ఏళ్ల వయస్సులో అష్టావక్రుడు తన తండ్రిని కాపాడటానికి విదీషకు వెళ్లి.. అక్కడి పండితులలో సంవాదానికి దిగి గెలిచాడు. తన తండ్రిని విముక్తున్ని చేస్తాడు. ఆ తర్వాత సామంగ (డెహ్రాడూన సమీపంలోని సాంగ్ అనే నది అని ప్రసిద్ధి) అనే నదిలో స్నానం చేసి.. తన వంకరలను పోగొట్టుకున్నాడు.
తన వంకరలన్నీ తొలగిపోయిన తర్వాత అష్టావక్రుడు దేశపర్యటన చేశాడు. మళ్లీ విదీష రాజ్యానికి వెళ్లి అక్కడ రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు.
ఈ సందర్భంలో జనకుడికి అష్టావక్రుడు చేసిన బోధలనే అష్టావక్ర గీత అంటారు. దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉంటాయి. ఈ అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. అష్టావక్రగీతను ఎప్పుడు రాశారు అనే విషయాన్ని చెప్పటం చాలా కష్టం. అయితే భగవద్గీతను రాసిన తర్వాతే దీనిని రాశారని చెప్పవచ్చు. సంస్కృతంలోని ఈ మూల గ్రంథాన్ని తర్వాతి కాలంలో అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది.
సనాతన ధర్మంలో ఎనిమిది అంకెకు చాలా విశిష్టత ఉంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలను (రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతి, నుదురు) ఈ ఎనిమిది సంఖ్య సూచిస్తుంది. ఈ ఎనిమిది సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ ప్రమాణం చేయగలం.
No comments:
Post a Comment