గాంధారి, దృతరాష్ట్రుని ద్వారా వందమంది పుత్రులను పొందాలన్న వరాన్ని పొందే విషయం తెలిసిందే! అయితే గాంధారి తన ద్వారా సంతానాన్ని పొందుతుందో లేదో అన్న సందేహంలో ఉన్న దృతరాష్ట్రుడు... సుఖద అనే ఓ చెలికత్తె ద్వారా బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరే యుయుత్సుడు! అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు, ఇటు సుఖద కుమారుడు యుయుత్సుడు ఒకే సమయంలో జన్మిస్తారు. అంటే! హస్తినాపుర రాజ్యం మీద దుర్యోధనునికి ఎంత అధికారం ఉందో యుయుత్సునికి కూడా అంతే అధికారం ఉంది. కానీ దుర్యోధనుడు అంత ఉదారంగా ఆలోచిస్తాడని భావించలేం కదా! యుయుత్సుడిని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు. అయినా అది యుయుత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సకల విద్యలూ నేర్చకుని, సకల ధర్మాలూ ఔపోసన పట్టి అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు. అసలు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం!
కౌరవుల ఆగడాలను మొదటి నుంచీ గమనిస్తూ ఉన్నవాడే కాబట్టి, యుయుత్సునికి వారి మీద అసహ్యం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! అందుకని ఎప్పుడైతే ధర్మయుద్ధం మొదలైందో నిస్సంకోచంగా పాండవుల పక్షాన నిలిచేందుకు సిద్ధపడతాడు యుయుత్సుడు. అంతేకాదు! పాండవులను హతమార్చేందుకు కౌరవలు పన్నే పన్నాగాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ ఉంటాడు. ఒక రకంగా రామాయణంలో విభీషణుడు ఎలాంటివాడో, భారతంలో యుయుత్సుడు అలాంటివాడన్న మాట! కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలచి యుయుత్సుడు చేసిన యుద్ధం చిరస్మరణీయమైనది.
ధర్మపక్షాన నిలిచినందుకు యుయుత్సునికి తగిన ఫలితమే దక్కుతుంది. ఆ మహాసంగ్రామంలో కౌరవులంతో అసువులు బాయగా ఒక్క యుయుత్సువు మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు. ఆ మాటకి వస్తే కేవలం కౌరవులలో మాత్రమే కాదు... యోధానుయోధులు సైతం నేలకొరిగిన ఆ యుద్ధానంతరం ప్రాణాలతో మిగిలిన 12 మంది ప్రముఖులలో యుయుత్సుడు ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కొన్నేళ్లపాటు హస్తినను ఏలిన పాండవులు స్వర్గారోహణానికి బయల్దేరతారు. వెళ్తూ వెళ్తూ హస్తినాపురానికి రాజుగా అర్జునుడి మనవడైన పరీక్షిత్తుని నియమిస్తారు. ఆ పరీక్షిత్తునికి పాలనలో తగిన సాయం చేసే బాధ్యతను యుయుత్సునికి అప్పగించి మరీ వెళ్తారు పాండవులు. అలా భారతంలో యుయుత్సుని కథ సుఖాంతమవుతుంది.
మహాభారతంలో ప్రధానకథతోపాటు అనేకానేక ఉపకథలుంటాయి. వందల పాత్రలుంటాయి. దేనికదే విశిష్టమైనది. అయితే అందులో ఏమాత్రం ప్రాచుర్యంలోకి రాని పాత్రలు అనేకం. రామాయణంలో విభీషణుడి వంటి పాత్ర మహాభారతంలోనూ ఉంది. ఇద్దరికీ ఎన్నో పోలికలు. అయినవాళ్లను విడిచిపెట్టి తను నమ్మిన ధర్మం వైపే నిలబడాలనే వైఖరి అందులో ప్రధానమైంది.
రామాయణంలో విభీషణుడు రావణ, కుంభకర్ణుల సోదరుడే. భారతంలో యుయుత్సుడు కూడా ధృతరాష్ట్రుడి కొడుకే. తన పుట్టుక నుంచి జీవితమంతా ఓ ఆసక్తికరమైన కథ. గాంధారి గర్భం ధరించి రెండేళ్లు గడిచినా ప్రసవం జరగదు. దీంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యక సుఖదను పెళ్లాడతాడు. ఆమెకు యుయుత్సుడు, గాంధారికి దుర్యోధనుడు ఒకేసారి పుడతారు. ఆ తరువాతే దుశ్శాసనుడు, దుస్సల సహా మిగతా కౌరవులంతా పుడతారు. నిజానికి దుర్యోధనుడికి ఎన్ని హక్కులున్నాయో యుయుత్సుడికీ అన్నే హక్కులుండాలి. కానీ పట్టమహిషి గాంధారి కాబట్టి గాంధారి సంతానానికే అమిత ప్రాధాన్యం లభించింది.
తనకు ఏది ధర్మమని తోస్తే దాన్నే ఆచరించేవాడు యుయుత్సుడు. ఓ విభిన్నమైన పాత్ర ఇది. విషపునీటి ప్రయోగం గురించి తెలిసి దాన్నుంచి భీముడిని కాపాడటంతో కౌరవులు యుయుత్సుడిని దూరంగా ఉంచడం ప్రారంభిస్తారు. ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో దాన్ని ఖండితంగా వ్యతిరేకించింది కేవలం యుయుత్సుడే. కురుక్షేత్ర సమరంలో ఎవరు ఎవరివైపునయినా ఉండవచ్చునని అనడంతో యుయుత్సుడు పాండవుల వైపు చేరతాడు. యుయుత్సుడిలాగే దుర్యోధనాదుల ధోరణిని వ్యతిరేకించే మరో సోదరుడు వికర్ణుడు మాత్రం అన్నలతోనే ఉండిపోయాడు. యుయుత్సుడు రావణుడి పట్ల విభీషణుడిలా ఓ విశేష నిర్ణయం తీసుకోగా, వికర్ణుడు మాత్రం కుంభకర్ణుడిలా సోదరుడితోనే ఉండిపోతాడు.
అలాగని యుయుత్సుడు అల్లాటప్పా ఏమీ కాదు. ఒకేసారి పదివేల మందితో పోరాడగలిగే అతిరథుల్లో ఒకడు. కురుక్షేత్ర అనంతరం మరణించకుండా మిగిలిపోయిన పదకొండు మందిలో ఒకడు యుయుత్సుడు. తమ రాజ్యపాలన ముగిశాక పాండవులు హిమాలయాలకు మహా ప్రస్థానం ఆరంభిస్తారు. అప్పుడు మరీ చిన్నవాడైన పరీక్షిత్తుకు యుయుత్సుడినే సంరక్షకుడిగా నియమిస్తారు. భీష్మ, ద్రోణాదులకూ రాగద్వేషాలు అంటగట్టిన కౌరవులు యుయుత్సుడి విషయంలో మాత్రం ఒక్క మాట అనడానికీ సాహసించలేదు. అదీ యుయుత్సుడి పాత్ర విశిష్టత.
No comments:
Post a Comment