కౌరవులకు నిజమైన శత్రువులు పాండవులు కాదు!
మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియవారు ఉన్నారంటే అది వింతే అవుతుంది. గాంధారికి స్వయానా సోదరుడైన శకుని తన దుష్ట పన్నాగాలతో పాండవులను మాయా జూదంలో ఓడించి రాజ్యం నుంచి వెల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేశాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి కౌరవులపై తన ప్రతీకారం తీర్చుకుని చేసిన శపథం నేరవేర్చుకోడానికి పథకం వేసి విజయం సాధించాడు. తన చిన్నతనంలో జరిగిన సంఘటనతో కురు వంశాన్ని నాశనం చేస్తానని శకుని ఓ భయంకరమైన ప్రమాణం చేశాడు.
గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుభలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన శకుని పుట్టుకతోనే కుంటివాడు కాదు. ఇది తండ్రి సుబల చేసిన గాయం. పుట్టుకతోనే అంధుడైన ధ్రుతరాష్ట్రుడికి గాంధార రాజు సుబలుని కుమార్తె గాంధారిని భార్యగా చేయాలని భీష్ముడు భావించాడు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం బీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెట్టాడు.
తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ధ్రుతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో సుబలుడు ఆగ్రహించాడు. ఈ విపత్తు నుంచి తప్పించాలంటే గాంధారికి మేకతో వివాహం జరిపించాలని జ్యోతిషులు సూచించారు. వివాహం తర్వాత ఆ మేకను బలిస్తే ఆమె వితంతవుగా మారుతుంది. అప్పుడు ధ్రుతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి రెండో భర్త అవుతాడు సలహా ఇచ్చారు. జ్యోతిషుల చెప్పిన విధంగా గాంధారికి ముందు మేకతో పెళ్లి జరిపించి దాన్ని బలిచ్చారు.
తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ధ్రుతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయాలని ఆదేశించాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు. కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి సబలుడు శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా మార్చాడు.
తాను చనిపోయే ముందు శకుని తల్లి కూడా తన శరీరంలోని ఓ ప్రత్యేక భాగం నుంచి ఎముకను విరిచి ఇచ్చి దీంతో కౌరవులపై ప్రతీకారం కోసం ప్రయత్నించాలని కోరింది. శకుని దీన్ని పాచికగా తయారుచేశాడు. దీంతో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది. దుర్యోధనుడితో పాండవులు జూదం సమయంలో దీన్ని వినియోగించాడు.
ఒక పథకం ప్రకారం పాచికలు వేసి ఎత్తుగడలతో కుయుక్తులతో మోసం చేసే వాళ్లని, మాయ చేసే వాళ్లని 'శకుని'తో పోలుస్తూ ఉండటం మనం వింటూ ఉంటాం. శకుని పాచిక వేస్తే పారకుండా ఉంటుందా? ఎంతంటే అంత పడాల్సిందే. పడి తీరాల్సిందే. అంటే శకుని పాచికకు తిరుగులేదన్నమాట!
ఈ శకుని పాత్రని పాత సినిమాల్లో చూసే ఉంటారు. ఆ పాత్ర వేసిన ధూళిపాలని చూస్తే చాలా ఆసక్తిగానే కాదు, ఆందోళనగా కూడా ఉంటుంది. అవును, 'భారతం'లో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిస్థితులను పెంచిపోషించిన వాడే ఈ శకుని!
ధుర్యోధనునితో 'మామా' అని పిలిపించుకున్న శకుని స్వయానా కౌరవులకు మేనమామే. ఇతనికి వృషకుడు, అచలుడు అన్నదమ్ములు. శకునికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు ఉలూకుడు.
కౌరవుల దురాగతాలకు అంతకుమించిన దురాలోచనలు శకుని దగ్గర ఉండి ప్రోత్సహించే వాడు. అసలు ధర్మరాజుని జూదమాడమని దింపిందీ శకునే. ఆ మాయా జూదంలో పాచికలు వేసి పాండవులను ఓడించి కౌరవుల్ని గెలిపించేలా ఆడిందీ శకునే. పాండవులూ కౌరవుల మధ్య ఉన్న శతృత్వాన్ని తన కుటిల రాజ నీతితో పెంచిందీ శకునే.
ఇంత కుటిలమైన పన్నాగాలు శకుని ఎందుకు పన్నాడు? ఏం ప్రయోజనం ఆశించి చేశాడు? దానికి కారణం ఉంది. శకునితో సహా సోదరులందరినీ కారాగారంలో వేసి పిడికెడు మెతుకులు వేసే వారట కౌరవులు. ఆ పిడికెడు మెతుకులను శకునికి ఇచ్చి అతని అన్నదమ్ములు ఆకలితోనే ఉండిపోయే వారట. అలా బతికి బట్టకట్టిన శకుని అంతకంతా తీర్చుకోవడానికని... ధుర్యోధనునికి ఎదురు తిరగలేక, ఆ శక్తి లేక, కౌరవ పక్షం చేరి ధుర్యోధనుడు సహా కౌరవ వంశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో కౌరవుల్ని పాండవులపైకి ఎగదోశాడని చెబుతారు.
శకుని మాయలు యుద్ధ సమయంలో సాగకుండా అర్జునుడు అడ్డుకట్ట వేశాడు. అయితే నకుల సహదేవుల చేతుల్లోనే చనిపోయాడు. ఎత్తులూ జిత్తులూ వేసి తగవులు పెట్టే మాయగాళ్లని ఇప్పటికీ 'శకుని' అనే పిలుస్తారు. అదన్నమాట శకుని అసలు కథ!
No comments:
Post a Comment