Sunday, 14 January 2018

మహాభారత యుద్ధ కథ - 1


తిక్కన సోమయాజి మహాభారత యుద్ధకథ

రచన: కె. వి. ఎస్. రామారావు

వింటే భారతం వినాలిఈ మాట భారత ‘యుద్ధకథ’ గురించి అన్నారో లేదో గాని నేను చూసినంతలో ఇంత విపులంగా ఉత్కంఠభరితంగా కళ్లకి కట్టినట్టుగా యుద్ధక్రమాన్ని వర్ణించిన ఇతిహాసం మరొకటి, మరెక్కడా లేదు. నిజానికి భారత కథలోని ముఖ్య పాత్రల నిజమైన రూపాలు, స్వభావాలు మనకి యుద్ధభాగంలోనే కనిపిస్తాయని నా అభిప్రాయం. సామాన్యంగా భారతం చదివేవాళ్లు దాన్ని మొదట్నుంచి చివరిదాకా చదవరు. ఏ విరాట పర్వంతోనో మొదలెట్టి వాళ్లకి ఇష్టమైన రెండు మూడు ఇతర పర్వాలు చదివి ఊరుకుంటారు. అందునా యుద్ధపర్వాలు చదవటం చాలా అరుదు. దీనికి కారణాలు అనేకం.

చాలా మందికి భారతయుద్ధం అంటే మహాభారత్ టీవీ సీరియల్లోనో లేక అనేక సినిమాల్లోనో చూసిందే. కాకుంటే ‘కాళిదాసు కవిత్వం కొంతైతే నా పైత్యం కొంత’ అన్నట్టుంటాయవి.

ఇది తిక్కన తెలుగు భారతంలోని యుద్ధభాగాలకి తేలిక వచనంలో అనువాదం. వీలైనంత దగ్గరగా మూలాన్ని అనుసరిస్తూ, కథాగమనానికి అడ్డొచ్చే పునరుక్తుల్ని, యుద్ధకథకి నేరుగా సంబంధం లేని పిట్టకథల్ని మాత్రం వదిలేస్తూ సాగుతుంది. ఎన్నో ఆసక్తికరాలు, ఆశ్చర్యజనకాలైన సంఘటనల్తో నిండి అడుగడుగునా అబ్బురపరిచే ఈ యుద్ధకథనం అవశ్యపఠనీయం. మూలం చదవటానికి ఓపిక, తీరిక లేని వాళ్ల కోసం ఈ ప్రయత్నం. ఇక చదవండి.


*-*__/\__*-*__/\__*-*

[యుద్ధక్రమంలో అక్షౌహిణుల ప్రసక్తి పదేపదే వస్తుంది గనక ముందుగా అక్షౌహిణి అంటే ఎంతో చూద్దాం – ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదుగురు పదాతులు కలిస్తే ఒక పత్తి; మూడు పత్తులు ఒక సేనాముఖం; మూడు సేనాముఖాలు ఒక గుల్మం; మూడు గుల్మాలు ఒక గణం; మూడు గణాలు ఒక వాహిని; మూడు వాహినులు ఒక పృతన; మూడు పృతనలు ఒక చమువు; మూడు చమువులు ఒక కనీకిని; పది కనీకినులు ఒక అక్షౌహిణి. అంటే ఒక అక్షౌహిణి సేనలో 21,870 రథాలు, అన్నే ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతులు ఉంటారన్నమాట.]

తిక్కన ఇలా చెప్తున్నారు:

ఓ హరిహరనాథా ! ఇక భారతయుద్ధ వృత్తాంతం విను.

జనమేజయుడికి వైశంపాయనుడు అతని ముత్తాతలు పాండవుల వృత్తాంతాల్ని విపులీకరిస్తూ వాళ్లకీ కౌరవులకీ జరిగిన మహాభారతసంగ్రామ క్రమాన్ని వినిపించటానికి పూనుకున్నాడు.

కృష్ణుడి సంధి ప్రయత్నాలు విఫలమైనయ్. దుర్యోధనుడు దుశ్శాసన, కర్ణ, శకునుల్తో సభ విడిచి వెళ్లిపోయాడు. వాళ్లంతా కలిసి కృష్ణుణ్ణి బంధించబోతున్నారని గ్రహించాడు సాత్యకి. యాదవసైన్యంతో కృతవర్మని సభాభవనం ముందుంచి తనొక్కడే లోపలికి వెళ్లి దుర్యోధనుడి పన్నాగం గురించి రహస్యంగా అన్న చెవిలో చెప్పాడు. తర్వాత అతని అనుమతితో సాత్యకి అక్కడున్న వాళ్లందరికీ దుర్యోధనుడి పథకం గురించి వివరించాడు. కృష్ణుడు తన సంగతి తను చూసుకోగలనని, ఇక బయల్దేరటానికి అనుమతి ఇవ్వమని ధృతరాష్ట్రుణ్ణడిగాడు. కంగారుపడి ధృతరాష్ట్రుడు దుర్యోధన దుశ్శాసనాదుల్ని వెంటనే తీసుకురమ్మని విదురుణ్ణి పంపాడు.

ధృతరాష్ట్రుడు కొడుకుని మందలించాడు. విదురుడు కూడ కృష్ణుణ్ణి తక్కువగా అంచనా వెయ్యొద్దని హెచ్చరించాడు. కృష్ణుడు “నేనొక్కణ్ణే వున్నాననుకుంటున్నావేమో, ఇలా చూడు” అంటూ తన విశ్వరూపం చూపించాడు. అతని శరీరాన్నుంచి బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, బలరామార్జునులు, ఇతర పాండవులు, యాదవ వృష్ణి సైన్యాలు పుట్టుకొచ్చినయ్. అదిచూసి అంతా నిర్ఘాంతపోయారు. ధృతరాష్ట్రుడా రూపాన్ని చూడాలని కోరితే అతనికి తాత్కాలికంగా దివ్యదృష్టి ఇచ్చాడు కృష్ణుడు. తర్వాత ఆ రూపాన్ని ఉపసంహరించి సాత్యకి, కృతవర్మల్తో తిరుగు ప్రయాణం సాగించాడు. ధృతరాష్ట్రుడు, భీష్మ ద్రోణాది ఇతర పెద్దలు అతన్ని సాగనంపటానికి అతని వెనకే వచ్చారు.
ముందుగా కుంతి మందిరానికి వెళ్లి జరిగినదంతా ఆమెకి చెప్పి కొడుకులకి ఆమె ఏం చెప్పమంటుందో అడిగాడు కృష్ణుడు. “పరాక్రమంతో సంపాదించుకున్నదే రాజులకి భోజ్యం. సంధి ప్రయత్నాలు జరిగినయ్, వాళ్లతో కలిసుండటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇంక అనుమానాలు వద్దు, యుద్ధమే మార్గమని చెప్పు” అన్నదామె.

కృష్ణుడక్కణ్ణుంచి బయల్దేరి అందర్నీ వీడ్కొలిపి, ఒక్క కర్ణుణ్ణి మాత్రం తనతో రమ్మని తీసుకెళ్లాడు.

మరోవంక ధృతరాష్ట్రుడి కొలువులో అంతా కృష్ణుడి రాయబార విశేషాల గురించి మాట్లాడుతుంటే భీష్మద్రోణులు దుర్యోధనుడితో “కనీసం కుంతి ఐనా యుద్ధం వద్దని చెప్తుందనుకున్నాం, అదీ జరగలేదు. పాండవులకి దిశాదిర్దేశం చెయ్యగలిగిన వాళ్లు ఇద్దరే – కృష్ణుడు, కుంతి. వాళ్లిద్దరూ యుద్ధం వైపే మొగ్గు చూపుతున్నారు. అడ్డుపడకపోతే యుద్ధం తప్పదు. నువ్వు వెంటనే బయల్దేరివెళ్లి దార్లోనే కృష్ణుణ్ణి ఆపి అతనితో కలిసి వెళ్లి ధర్మరాజుతో సంధి మార్గం ఆలోచించు” అని ఉపదేశించారు. మొహాన గంటు పెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కూడ ఏమీ మాట్టాడలేదు.

విషయం అర్థమై “జీవితంలో అన్నీ చూసిన వాళ్లం మేము, మాకింకా మిగిలున్న ఆశలేం లేవు. ఒళ్లు దాచుకోవటానికి ఈ మాటలనటం లేదు, వెళ్లొస్తాం” అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారు వాళ్లిద్దరు. దుర్యోధనుడు తన మందిరానికి వెళ్లాడు.

కృష్ణుడు కర్ణుడితో రహస్యంగా అతని జన్మవృత్తాంతం చెప్పి అతను నిజానికి కుంతికొడుకని, పాండవపక్షానికి వస్తే అతన్ని రాజుని చేస్తానని, ద్రౌపది కూడ అతన్ని ఆరోభర్తగా తీసుకుంటుందని చెప్పాడు. కర్ణుడతన్ని సున్నితంగా తిరస్కరించి తన జన్మరహస్యం గురించి తను ముందే విన్నానని, ఐతే దుర్యోధనుణ్ణి వదిలి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసి, ఈ విషయాన్ని రహస్యంగానే వుంచమని కోరాడు. కృష్ణుడు ఒప్పుకుని ఇంక ఏడెనిమిది రోజుల్లో అమావాస్య అని, అదే యుద్ధానికి సరైన ముహూర్తమని దుర్యోధనాదుల్తో చెప్పమని చెప్పి పాండవుల దగ్గరికి బయల్దేరాడు.

ఇంకోవంక కుంతి కర్ణుణ్ణి కలవాలని నిశ్చయించుకుంది. ఉదయాన్నే అతన్ని చూడాలని వెళ్తే అతను గంగాస్నానానికి వెళ్లాడని విని అక్కడికి వెళ్లి అతని జపం అయేవరకు అక్కడే కూర్చుంది. అతనామెని చూసి నమస్కరించి వచ్చిన పని అడిగాడు. రహస్యంగా ఆమె తనే అతని తల్లని, పాండవులతో కలవమని చెప్పింది. అతనా విషయం ముందే తెలుసని, ఐతే తను దుర్యోధనుడి ఋణం తీర్చుకుంటానని బదులిచ్చాడు. ఆమె అంత దూరం వెదుక్కుంటూ వచ్చింది గనక యుద్ధంలో అర్జునుడు తప్ప పాండవుల్లో మరెవరినీ చంపనని మాటిచ్చాడు కర్ణుడు. అదీ బాగానే వుందని కుంతి వెళ్లిపోయింది.

కృష్ణుడు ఉపప్లావ్యం చేరుకుని జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ధర్మరాజు తమ్ముల్తో కలిసి వుండి కృష్ణుణ్ణి రప్పించి హస్తినలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పమన్నాడు. కృష్ణుడు ఎవరెవరు ఏమేం మాట్టాడింది, ఏం చేసింది చెప్పాడు. చివరికి దుర్యోధనుడు తనని బంధించటానికి ప్రయత్నిస్తే తను ఆ సమయానికి తగ్గట్టు హంగులు, మాయలు చేసి బయటపడ్డానని వివరించాడు. కుంతి చెప్పిన మాటలు వినిపించి యుద్ధమే కర్తవ్యమని తన అభిప్రాయమని కూడ చెప్పాడు. ఇంకా సంధి ప్రయత్నాలకి ఏమైనా అవకాశముందా అనడిగాడు ధర్మరాజు. లేదన్నాడు కృష్ణుడు. తమ్ముళ్ల అభిప్రాయం అడిగితే అర్జునుడు కృష్ణుడు యుద్ధమే మార్గమంటే అదే తమ అభిప్రాయమని అన్నాడు. యుద్ధమే కర్తవ్యమని నిర్ణయించాడు ధర్మరాజు.

కౌరవులకి భీష్ముడు సర్వసేనాధ్యక్షుడుగా వుండబోతున్నాడు గనక తమ వైపు నుంచి మంచి సమర్థుడైన వాణ్ణి సర్వసేనాపతిని చెయ్యాలన్నాడు ధర్మరాజు. సహదేవుడు విరాటుడి పేరు సూచించాడు. నకులుడు ద్రుపదుణ్ణి పెడదా మన్నాడు. అర్జునుడు ధృష్టద్యుమ్నుడు గాని, శిఖండి గాని ఐతే బాగుంటుందన్నాడు. ధర్మరాజు కృష్ణుడి ఉద్దేశం అడిగాడు. అతను ధృష్టద్యుమ్నుణ్ణి సేనాపతిగా అభిషేకించమన్నాడు. అలాగే అక్షౌహిణులకి ప్రత్యేకనాయకుల్ని కూడ చెప్పమన్నాడు ధర్మరాజు. “వాళ్లకి సొంతసైన్యాలున్నాయా లేవా అని కాకుండా మహాయోధులైన వాళ్లని అక్షౌహిణీనాయకులుగా ఉంచుదాం. ద్రుపదుడు, సాత్యకి, జరాసంధుడి పెద్దకొడుకు సహదేవుడు, యాదవవీరుడు చేకితానుడు, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు, శిఖండి – ఈ ఏడుగురు మన ఏడక్షౌహిణులకి నాయకులు” అని నిర్ణయించాడు కృష్ణుడు.

మర్నాడు ఉదయం కొలువు చేశాడు ధర్మరాజు. యుద్ధం తన నిర్ణయంగా ప్రకటించి, ఏడుగురు అక్షౌహిణీనాయకుల్ని అభిషేకించాడు. శ్వేతజాతుడైన ధృష్టద్యుమ్నుణ్ణి సకలచమూపతిగా ఉత్కృష్టంగా అభిషేకం చేసి పట్టం కట్టాడు. అర్జునుణ్ణి పిలిచి వాళ్లందర్నీ చూపించి “వీళ్లందర్నీ కంటికి రెప్పలా కాపాడాలి నువ్వు. అవసరాన్ని బట్టి గురువులా వీళ్లకి ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో చెప్తూ వాళ్ల ఆలోచనల్ని కూడ తీసుకుని పనులు చక్కబెట్టు. ఇక నీకు రక్షగా కృష్ణుడుంటాడు” అని చెప్పాడు. తమ సేనలో వున్న పెద్దలందర్నీ మంచిమాటల్తో సంతోషపరిచి ప్రస్థానభేరి వేయించాడు ధర్మరాజు.

మర్నాడు పెళ్లికి వెళ్తున్నట్టు బయల్దేరారందరూ. ముందుగా ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆమె, ఇతర పుణ్యస్త్రీలు చల్లిన అక్షతల్ని స్వీకరించి శుభశకునాల్తో కదిలారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకి ఎదురుగా వచ్చి సాష్టాంగప్రణామం చేసి అతని అనుమతితో సైన్యాన్ని ముందుండి నడిపించాడు. వెనగ్గా పరిచారకులు కావలసిన సామాగ్రిని, డేరాల్ని బళ్లమీద వేసుకుని వచ్చారు. మున్యాశ్రమాలకి ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తగా సాగుతూ కురుక్షేత్రం చేరిందా సైన్యసముద్రం. హిరణ్వతి అనే పుణ్యనది పక్కన నీరు, గడ్డి, కట్టెలు సమృద్ధిగా వుండి సమతలంగా వున్న చోట విడిది చేసింది. వెంటనే అక్కడ రాజమందిరాలు, తదితర శిబిరాలు వెలిసినయ్. ధృష్టద్యుమ్నుడు చుట్టూ కట్టుదిట్టాలు చేశాడు.

అక్కడ దుర్యోధనుడు ప్రయాణానికి అంతా సిద్ధం చేసేపని కర్ణ, దుశ్శాసన, శకునులకి అప్పగించాడు.

మర్నాడు దుర్యోధనుడు కొలువుదీరి తన అక్షౌహిణీనాయకులుగా ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు సుదక్షిణుడు, సైంధవులని నిశ్చయించి వాళ్లని అభిషేకించాడు.

ఆ తర్వాత వాళ్లని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లి నమస్కరించి వినయంగా సర్వసేనానాయకత్వం వహించమని ప్రార్థించాడు. అందుకు భీష్ముడు “నాకు మీరూ పాండవులు ఒకటే. ఐతే ఇంతకాలం మీతో వున్నా గనక మీపక్షాన యుద్ధం చెయ్యటం నా ధర్మం. సర్వసైన్యాధిపత్యం తీసుకుంటా. ఒక్క అర్జునుడు తప్ప అక్కడ నన్నెదిరించగలిగే వాళ్లు లేరు. అర్జునుడికున్న అస్త్రసంపద నాకు లేదు. ఇకపోతే, పాండవుల్ని చంపటానికి నాకు చేతులు రావు, వాళ్లూ నామీద విరుచుకుపడరు. మిగిలిన వాళ్లందర్నీ నేను చంపుతా. కాకుంటే ముందుగా యుద్ధానికి కర్ణుణ్ణన్నా పంపు, నన్నన్నా పంపు, మేం ఇద్దరం మాత్రం ఒకసారి యుద్ధం చెయ్యం. అలా ఒప్పుకుంటేనే నేనీ బాధ్యత తీసుకుంటా” అని ఖచ్చితంగా చెప్పాడు. దానికి కర్ణుడు “ఇందులో కొత్తగా చెప్పేదేముంది, భీష్ముడు పడ్డాకే నేను యుద్ధం లోకి వస్తానని సభలోనే చెప్పా” అని గుర్తుచేశాడు.

సకల చమూపతుల సమక్షంలో భీష్ముడికి సర్వసేనాపతిగా అభిషేకం చేసి పట్టంగట్టాడు దుర్యోధనుడు.

కౌరవసేనానీకం కూడ కురుక్షేత్రానికి కదిలింది. ఆ దగ్గర్లో ఒక చక్కటి ప్రదేశం చూసుకుని అక్కడ విడిదులేర్పాటు చేశారు. హస్తినలో ఎలా వున్నాయో అలాగే ఎవరెవరికి ఎలాటి మందిరం అవసరమో అలాటి మందిరాలు తయారైనయ్.

ఇదంతా విని హడావుడిగా కదిలొచ్చాడు బలరాముడు. ధర్మరాజుని కౌగిలించుకుని అందర్నీ కొలువు దీర్చి “ఎలాగైనా సంధి చెయ్యమని కృష్ణుడికి ఎన్నో విధాలుగా చెప్పా, ఐనా ఏదో కోపం తెచ్చుకుని సంధి కాకుండా చేశాడు కృష్ణుడు. అర్జునుడి మీద తనకున్న పక్షపాతంతో దాయాదులకి యుద్ధం తెచ్చిపెట్టాడు. ఇక పాండవులకి జయం, కౌరవులకి చావు నిశ్చయం. నేనీ ఘోరాన్ని చూడలేను, వినలేను. నేను తీర్చిదిద్దిన శిష్యులు భీమ దుర్యోధనులు ఒకర్నొకరు చంపుకోబోవటం నేను భరించలేను. సరస్వతీ తీర్థానికి వెళ్తూ ఆ విషయం మీకు చెబ్దామని ఇలా వచ్చా” అని అందరికీ చెప్పి తీర్థయాత్రలకి వెళ్లాడతను.

దుర్యోధనుడు శకుని కొడుకు ఉలూకుణ్ణి పిలిచి పాండవుల దగ్గరికి వెళ్లి కొన్ని మాటలు చెప్పిరమ్మని పంపాడు. అతను వెళ్లి ధర్మరాజుకా విషయం చెప్తే, అతను “అలాగే, ఆ బుద్ధిమంతుడు చెప్పిపంపిన తులువ మాటలేమిటో బయటపెట్టు, అందరం వింటాం” అన్నాడు. ఉలూకుడిలా అన్నాడు ధర్మరాజుతో – “పెద్ద పోటుగాడిలాగా యుద్ధానికి బయల్దేరొచ్చావ్, మీదగ్గరేవో అస్త్రశస్త్రాలున్నయ్యని మిడిసిపడుతున్నావ్. భీష్మ ద్రోణుల ముందు అవన్నీ ఎందుకు పనికిరావని చూడబోతున్నావ్. వాళ్లచేతిలో అర్జునుడి చావు తప్పదు”. ఆ తర్వాత భీముడివైపు తిరిగి “దుశ్శాసనుడి రొమ్ము చీలుస్తా, రక్తం తాగుతా అని బీరాలు పలికావుగా, వచ్చి అదేదో చేసి చూపించు. నూతిలో కప్పలా నీ బలం తల్చుకుని నువ్వే పొంగిపోవటం కాదు, అవతల వాళ్ల బలం గురించి తెలుసుకో” అని ఎత్తిపొడిచాడు. అర్జునుణ్ణి చూసి “తాటిచెట్టంత విల్లు గాండీవం వుందని మిడిసిపడకు. అంత పోటుగాడివైతే అదేదో సభలో పాంచాలిని పరాభవించినప్పుడే చూపించాల్సింది” అని చివరగా “ఏదో కృష్ణుడు కొన్ని మాయలు, ఇంద్రజాలాలు చేస్తేనో, లేకపోతే అర్జునుడి పరాక్రమానికో రాజ్యం వస్తుందనుకోకండి. వెయ్యిమంది కృష్ణులు, వెయ్యిమంది అర్జునులు వచ్చినా యుద్ధం చేస్తాం, రాజ్యంలో ఒక్క అంగుళం ఇవ్వం” అని దుర్యోధనుడి సందేశాన్ని వినిపించాడు ఉలూకుడు.

అదంతా విని పాండవులు కోపంతో ఊగిపోతుంటే కృష్ణుడు నవ్వుతూ ఉలూకుడితో “అందరూ వినేట్టుగా దుర్యోధనుడితో నువ్వూ ఇలా చెప్పు. యుద్ధంలో నువ్వెక్కడున్నా చావు తప్పించుకోలేవ్, భీముడు నువ్వు చూస్తుండగనే దుశ్శాసనుడి రక్తం తాగుతాడు” అంటుండగా అందుకుని అర్జునుడు ” సొంతంగా గెలిచే చేవలేక కాటికి కాళ్లు చాచిన భీష్ముణ్ణడ్డంపెట్టుకుని యుద్ధంలో గెలుద్దామనుకుంటున్నాడు దుర్యోధనుడు. పాపం ఆ ముసలాయన మాకు తొలికబళమై కాటికి పోవటం ఖాయం. ఆ తర్వాత ద్రోణుడు, కర్ణుడు చస్తారు. భీముడి గద దెబ్బలకి తన తొడలు విరుగుతుంటే అప్పుడు దుర్యోధనుడికి తన దుర్మార్గప్పనులు తెలిసొస్తయ్ లే. రేపే యుద్ధం మొదలు. వచ్చి తలపడమను” అని చెప్పాడు.

తాంబూలం, ఆభరణాలు ఇచ్చి ఉలూకుణ్ణి సాగనంపాడు ధర్మరాజు.

ఉలూకుడు తిరిగెళ్లి వాళ్లకి జరిగింది చెప్తే భీష్ముడు “నేనుండగా నీకు భయం అక్కర్లేదు. శత్రువుల సంగతి నేను చూస్తాగా” అని ధైర్యం చెప్పాడు దుర్యోధనుడికి.

“ఐతే మనలో, వాళ్లలో వున్న యోధముఖ్యుల తారతమ్యాలు నాకు వివరించి చెప్పు” అనడిగాడు దుర్యోధనుడు. భీష్ముడిలా వివరించాడు – “నువ్వు అతిరథుడివి, నీ తమ్ముళ్లంతా సమరథశ్రేష్టులు, నా గురించి నేనే చెప్పుకోవటం ఎందుకు, నా సంగతి అందరికీ తెలుసు. ఇక యాదవవీరుడు కృతవర్మ అతిరథుడు, శల్యుడూ అతిరథుడే. కృష్ణుడి మీద అసూయతో అల్లుళ్లని కాదని నీవైపుకి వచ్చాడు. భూరిశ్రవుడు అతిరథశ్రేష్టుడు. సైంథవుడు మహారథుడు. ద్రౌపది విషయంలో జరిగిన అవమానంతో తపస్సు చేసి వరాలు కూడ పొందాడు. కాంభోజరాజు సుదక్షిణుడు సమరథుడు. మేలైన రథసైన్యం వుందతనికి. మాహిష్మతీపతి నీలుడు అతిరథుడు. అతనికీ సహదేవుడికీ పడదు. అవంతిదేశాధీశులు విందానువిందులు అర్థరథులు. మంచిస్నేహితులు, ఒకరికోసం ఒకరు ప్రాణాలిస్తారు. త్రిగర్తపతులు ఐదుగురు సోదరులు, అందరూ మహారథులే. గోగ్రహణసమయాన జరిగిన అవమానానికి కుతకుతలాడుతున్నారు.

ఇక లక్ష్మణకుమారుడు సమరథుడు. కోసలరాజు బృహద్బలుడు సమరథుడు. దండధారుడు కూడ సమరథుడే. కృపాచార్యుడు అతిరథోత్తముడు. సమరథుడు శకుని. అశ్వత్థామ దివ్యాస్త్రసంపన్నుడు, అర్జునుడికి దీటైనవాడు. అతను బ్రాహ్మణుణ్ణని కాస్త వెనకముందాడతాడు గాని పూనుకుంటే యముడే. ఇక ద్రోణాచార్యుడు అతిరథోత్తముడు. అటూ ఇటూ అందరికీ విలువిద్యలో గురువు. వ్యూహరచనలో దిట్ట. వృద్ధుడని తగ్గించకూడదు. ప్రాణాలకి లెక్కచెయ్యడు, ప్రపంచం అంతా కలిసి వచ్చినా తన బాణాల్తో చిక్కు పరుస్తాడు. ఐతే అతనికి అర్జునుడంటే మహాప్రీతి, అతన్ని మాత్రం గట్టిగా కొట్టలేడు.

బాహ్లికుడు అతిరథుడు, మహాబలవంతుడు. ఇతని కొడుకు సోమదత్తుడు కూడ అంతే. వీళ్లకి యుద్ధం అంటే పెళ్లి లాటిది. రాక్షసరాజు హలాయుధుడు సమరథుడు, పాండవుల మీద అతనికి కోపం. పెద్ద రాక్షససేన వుందతనికి.

ప్రాగ్జ్యోతిషపతి భగదత్తుడు సమరథుడు. ఏనుగుయుద్ధంలో అతన్నెవరూ అడ్డుకోలేరు. గాంధారరాజులు వృషకుడు, అచలుడు సమరథులు. పెద్ద బలగం వున్నవాళ్లు, మంచి యుద్ధకౌశలం వుంది వాళ్లకి. ఇక నీ మిత్రుడు కర్ణుడు అర్థరథుడే. ఎందుకంటే అతని కవచకుండలాలు పోయినయ్, పరశురాముడి శాపాన అస్త్రబలం తగ్గింది.”

ద్రోణుడు కూడ అందుకంగీకరిస్తూ “ఔను, అతని సంగతి ఇంతకుముందూ చూశాం. పారిపోవటానికి వెనకాడడు కనక అర్థరథుడే” అని వరస కలిపాడు.

కర్ణుడు కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ భీష్ముడితో “దుర్యోధనుడి మంచి గురించి ఆలోచించవు, నిజంగా అర్థరథుడివి నువ్వే” అని దుర్యోధనుడితో “ఇతను అర్జున పక్షపాతి, పట్టుబట్టి యుద్ధం చెయ్యడు. ఇలాటివాడొక్కడు తక్కువైతే మనకి పోయేదేమీ లేదు. ముసలితనంతో బుద్ధి వశంలో లేక ఇలా మాట్టాడుతున్నాడు” అని విరుచుకుపడ్డాడు.

“ముసలివాణ్ణైన నా బలం ఏమిటో, ధైర్యం ఏమిటో, అస్త్రశస్త్రసంపద ఎలాటిదో నీ గురువు పరశురాముణ్ణడుగు, చెప్తాడు. నాతో యుద్ధం చేసిన వాళ్లేమయ్యారో లోకానికి తెలుసు, వృద్ధుణ్ణి నా పరాక్రమం ఎలాటిదో, యువకుడివి నీ పరాక్రమం ఎలాటిదో అర్జునుడికి బాగా తెలుసు” అని బదుచిచ్చాడు భీష్ముడు.

దుర్యోధనుడిద్దర్నీ సర్దిచెప్పి శత్రుసైన్యంలో ముఖ్యుల గురించి చెప్పమని అడిగాడు భీష్ముణ్ణి. అందుకతను, “నిజమాడితే నిష్టూరం, కర్ణుడికి నచ్చదు. నీకూ నచ్చకపోవచ్చు, మధ్య నాకెందుకు?” అని తప్పించుకోబోతే వదల్లేదు. చివరికి భీష్ముడిలా చెప్పుకొచ్చాడు – “ధర్మరాజు అతిరథుడు. భీముణ్ణి యుద్ధంలో పట్టలేం, అతను అతిరథశ్రేష్టుడు. అతనిది అమానుషమైన బాహుబలం, అసమాన విక్రమం. నకులసహదేవులు సమరథులు. ఐతే వాళ్లంతా ధర్మపరులు, ఆరంగాల విలువిద్య ఆసాంతం నేర్చుకున్నారు. ఒక్కొక్కరు విడివిడిగా యుద్ధాలు చేసి అనుభవం సంపాయించారు, అంతా కలిసి ఒక్కటిగా వస్తే మన సేనలు గగ్గోలు పడటం ఖాయం. ఇక అర్జునుడి విషయానికి వచ్చామంటే అతని శక్తిని కొలవటానికి మానాలే లేవు, అంతవాళ్లు న భూతో న భవిష్యతి. ఇక అతనికి తోడు కృష్ణుడు కలిస్తే చెప్పేదేముంది – వాళ్లు పాండవసేనల్ని రక్షించటం, మనబలాల్ని నిర్జించటం నిశ్చయం.

ద్రౌపదేయులు ఐదుగురూ మహారథులు. ఉత్తరుడు కూడ అలాటివాడే. అభిమన్యుడు అతిరథశ్రేష్టుడు, కృష్ణార్జునుల్తో సమానుడు. సాత్యకి అతిరథోత్తముడు, పాండవుల పట్ల స్నేహం వల్ల మనమీద అతనికి చాలా కోపం. వాళ్లిద్దరు చాలు మనవాళ్లందరి అంతు చూడటానికి.

ద్రుపదుడు, విరాటుడు పాండవులకి దగ్గరి బంధువులు, స్నేహితులు. ఇద్దరూ మహారథులు. శిఖండి మహారథుడు. అతని తమ్ముడు ధృష్టద్యుమ్నుడు అతిరథుడు. అతని కొడుకు ధృతవర్ముడు అర్థరథుడు, చిన్నప్పుడు చెడుతిరుగులు తిరిగి శస్త్రాస్త్రాల్లో పరిశ్రమ చెయ్యలేదు. చేదిరాజు, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు మహారథుడు. భోజుడు, అజుడనే రాజులు కూడ అలాటివాళ్లే.

ఇక పాంచాలవర్గంలో ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు మహారథులు. కేకయపతులు ఐదుగురు సోదరులు, అంతా మహారథులే. కాశీపతి నీలుడు, విరాటుడి దాయాదులు సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంఖుడు మహారథులు. చిత్రాయుధుడు, చేకితానుడు మహారథులు. అర్జునుడి స్నేహితులు. చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు కూడ అలాటి వాళ్లే. సేనాబిందుడనే రాజు అతిరథోత్తముడు, భీముడితో సమానమైనవాడు. పాండ్యుడు అతిరథుడు, పెద్దబలగం వున్నవాడు. కాశ్యుడు సమరథుడు. కుంతిభోజుడు అతిరథుడు., అతని దగ్గర అమితబలులైన యోధులున్నారు. రోచమానుడు మహారథుడు. అతిరథశ్రేష్టుడు, తండ్రంత వాడు ఘటోత్కచుడు, మాయాబలసంపన్నుడు.

మొత్తం మీద అటు ఇటూ గొప్పగొప్ప వాళ్లున్నారు. ఐతే వాళ్లలో నాముందు నిలబడగలిగే వాళ్లు చాలాకొద్దిమంది. ఒక్క శిఖండిని మాత్రం నేను చంపలేను” అని రెండు బలాల్లోని ప్రధానయోధుల గురించి సమగ్రంగా విశ్లేషించాడు భీష్ముడు.

దుర్యోధనుడు తాతతో “ఈ యుద్ధం ముగించటానికి నీకెంత కాలం పడుతుంది?” అనడిగాడు. భీష్ముడు “నా సంగతి నేను చెప్తా, మిగిలిన వాళ్లు వాళ్ల లెక్కలు వాళ్లు చెప్తారు. ఐతే నేను నీకో మాటిస్తా – వెయ్యిమంది పెద్ద రథికుల్ని చంపేవరకు రణం సాగిస్తా. ఆ తర్వాత ఎన్నాళ్లుంటాననేది అర్జునుడి చేతిలో వుంది. మొత్తం మీద పదివేలమందిని స్వయంగా చంపుతానని నాకు తోస్తున్నది. ఒక నెల సమయం వుంటే పాండవసైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేస్తా” అని తన లెక్క చెప్పాడు. ద్రోణుణ్ణి అదే మాట అడిగితే అతను “నేనా వృద్ధుణ్ణి, ఏదో ఓపిక్కొద్ది యుద్ధం చేస్తా. మీ తాతకి లాగే నాకూ ఒక నెల పడుతుంది పాండవబలాలన్నిట్నీ చంపటానికి” అన్నాడు. కృపాచార్యుడు ఆ పని రెండునెలల్లో చెయ్యగలనంటే అశ్వత్థామ పదిరోజులు చాలన్నాడు. అంతా విని కర్ణుడు, “నా దివ్యాస్త్రాల్తో వాళ్లని పొడిచెయ్యటానికి ఒక్క వారం చాలు” అన్నాడు.

ఆ మాటకి కలకలమని నవ్వాడు భీష్ముడు. “ఇక్కడ కూర్చుని చెప్పే మాటలకేం, ఎన్నైనా చెప్పొచ్చు. అక్కడ అర్జునుడి గాండివదీప్తులకి కళ్లు తిరుగుతుంటే, అతని గుణధ్వనికి చెవులు బద్దలౌతుంటే అప్పుడు చెప్పు, వింటా” అని ఎత్తిపొడిచాడు కర్ణుణ్ణి.

ఈ విషయాలన్నీ తీసుకెళ్లి చారులు ధర్మరాజుకి వినిపించారు. అతను తమ్ముళ్లని పిలిపించి తను విన్న విషయాలు వాళ్లకి చెప్పి “కౌరవసైన్యాన్ని చంపటానికి నీకెంతకాలం పడ్తుంది, చెప్పు” అని అర్జునుణ్ణడిగాడు.

దానికతను నవ్వుతూ “నా దగ్గరున్న పాశుపతాస్త్ర ప్రభావం వాళ్లెవరికీ తెలీదు గనక అలా మాట్టాడుతున్నారు. దాంతో ఒక్క నిమిషంలో ముల్లోకాల్నీ నాశనం చెయ్యగలను. ఐతే అలాటి ఘోరాయుధంతో అందర్నీ చంపటం తప్పు. మామూలు శస్త్రాస్త్రాల్తో యుద్ధం చేస్తేనే పౌరుషం. అప్పటికి అవసరాన్ని బట్టి చూద్దాంలే. ఐనా మనలో ఎవరు తక్కువ, భీముడా, కవలా, అభిమన్యుడా, ద్రౌపదేయులా? సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఘటోత్కచుడు – ఇలా జమాజెట్టీలున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు ఏనుక్కిలాగా నీబలం నీకు తెలీదు. నీకెలాటి సందేహమూ అక్కర్లేదు, మనకి విజయం సులభంగానే దొరుకుతుంది” అని ధైర్యం చెప్పాడు.

అవతల హస్తినలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పక్కన పెట్టుకుని యుద్ధం గురించి బాధ పడుతూ ఉన్నాడు. అప్పుడక్కడికి త్రికాలవేది ఐన వేదవ్యాసుడు వచ్చాడు. “కాలానుగుణంగా రాజుల మధ్య యుద్ధం వచ్చింది, ఇదేమీ చింతించవలసిన విషయం కాదు. నీకీ యుద్ధం చూడాలనే కోరికుంటే చెప్పు, దివ్యదృష్టినిస్తాను, చూద్దువు గాని” అన్నాడతనితో. ధృతరాష్ట్రుడు “అన్నదమ్ముల మధ్య ఘోరయుద్ధం నేను చూడలేను. ఐతే మరెవరన్నా చూసి వివరంగా వినిపిస్తే వినాలని వుంది” అన్నాడు. సంజయుడికి యుద్ధంలో అందరి ప్రవర్తనలు, మనోభావాలు, రహస్యసంభాషణలు తెలిసేటట్టు, ఎలాటి ఆయుధాలూ అతన్నేమీ చెయ్యకుండా వుండేట్టు వరాలిచ్చి, శీఘ్రగమనాన్ని కూడ అనుగ్రహించి యుద్ధభూమికి వెళ్లి అక్కడ జరిగే అన్ని విషయాలు గమనించి వచ్చి ధృతరాష్ట్రుడికి వినిపించే పని అప్పగించి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు.

“ఎంతో విస్తారమైన భూమిలో ఒక చిన్న భాగమైన భారతవర్షం కోసం ఇదివరకు ఎందరో రాజులు యుద్ధాలు చేశారు, ఇప్పుడు వీళ్లూ చెయ్యబోతున్నారు. ఏమిటో ఈ మాయ!” అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడన్నాడూ, “భారతవర్షం ఎంతో భాగ్యవంతమైన ప్రదేశం, గొప్ప పర్వతాలు మణిమాణిక్యాలకూ ఖనివిశేషాలకూ నెలవులు; నదులు ధనధాన్య సమృద్ధి కలిగించేవి; జనపదాలు సంపదలకి ఆలవాలాలు. సరిగా పాలించే రాజుకి భూమి నిజంగా కామధేనువు లాటిది. అందుకే ఈ యుద్ధం. విచారించే సమయం మించిపోయింది. నేను యుద్ధభూమికి వెళ్లి అక్కడి విశేషాలు గమనించి వచ్చినీకు వివరంగా చెప్తా.”

అలా చెప్పి, వ్యాసవరంతో యుద్ధవిశేషాలన్నీ చూసివచ్చి ధృతరాష్ట్రుడికి ఆ వివరాలన్నీ వినిపించటానికి సంజయుడు యుద్ధభూమికి వెళ్ళాడు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు రాత్రి సంజయుడు తిరిగివచ్చాడు – గోడుగోడున ఏడుస్తూ.

“అందరికీ ఆధారమైన ఆ మహావీరుడికి అస్త్రాలు ఆధారాలయ్యాయి; పరశురాముణ్ణి ఓడించిన వాడికి శిఖండి చేతిలో ఓటమి కలిగింది; పదిరోజుల పాటు ప్రచండభానుడై పాండవబలగాల్ని కాల్చిన భీష్ముడు అస్తమించాడు” అని శోకాలు పెడుతూ వచ్చాడతను. ధృతరాష్ట్రుడు గుండెలవిసి మూర్ఛపడి ఉపచారాల్తో లేచాడు. “దేవాసురులంతా ఒక్కటై వచ్చినా గెలిచే ఆ మహానుభావుణ్ణి శిఖండి ఓడించటం ఎలా జరిగింది? పాండవ సముద్రాన్నుంచి కౌరవసేనని రక్షించే ద్వీపం, శౌర్య సత్వ శీల పరాక్రమాల్లో ఎదురులేని వాడు అన్న నమ్మకాలన్నీ వమ్మయ్యాయా? మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు? అడవులకి పారిపోయారా? ఆయనే లేకపోతే ఇంక మిగిలిందేముంది? ఇక అంతా ఐపోయినట్టే! అసలిదంతా ఎలా జరిగిందో నాకు వివరంగా చెప్పు” అనడిగాడు ఆత్రంగా. సంజయుడు వ్యాసుడికి నమస్కరించుకుని భీష్మ మరణం వరకు జరిగిన యుద్ధం గురించి చెప్పటం మొదలెట్టాడు.

అలా నేను పదిరోజుల నాడు ఇక్కడి నుంచి వెళ్లి దుర్యోధనుడి నగరుకు చేరా. అప్పుడతను దుశ్శాసనుడితో “మనందరికీ రక్ష భీష్ముడు. ఐతే తను శిఖండితో మాత్రం యుద్ధం చెయ్యలేనని మనకు ఇదివరకే చెప్పాడు. సరైన రక్షణ లేని సింహాన్ని నక్కలు పొట్టనపెట్టుకున్నట్టు ఈయన్ని మనం రక్షించుకోకపోతే శిఖండికి చిక్కే అవకాశం వుంది. కనక శిఖండి ఆ చాయల కనిపిస్తే చాలు, మీమీ బలగాల్తో మీరు అడ్డు పడాలి” అని చెప్పి పంపాడు.


మొదటి రోజు


తెల్లవారింది. కౌరవసేన కదిలింది. ఆ సేనాసముద్రానికి చంద్రుడిలా భీష్ముడు. అతని కేతనం సువర్ణతాళమయం. కాంచనమయ వేదికతో మెరిసేది ద్రోణుడిది. బంగారు ఎద్దుతో కృపుడు. సింహపుతోక కేతువు అశ్వధ్ధామది. అరటిపోక జెండా శల్యుడు.

యాదవబలాల్తో కృతవర్మ. పృథుసైన్యంతో సైంధవుడు. మదపుటేనుగుల సైన్యంతో విందానువిందులు, కాళింగుడు, భగదత్తుడు. కొడుకులు, తమ్ముల్తో గుర్రపు బలగంతో శకుని. కొడుకు వీరోత్తముడైన సోమదత్తుడు, మనవడు భూరిశ్రవుడితో పెద్ద బలగంతో బాహ్లికుడు. కాంభోజరాజు సుదక్షిణుడు. కోసలపతి బృహద్బలుడు. మాహిష్మతీ పురపు నీలుడు. త్రిగర్తపతి సుశర్మ. అలంబుస, హలాయుధ రాక్షసులు. సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన రాజులు. ఇలా పది అక్షౌహిణుల సైన్యం. రాజరాజు సొంత బలం మరో అక్షౌహిణి. పెళ్లికి వెళ్లినట్టు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ కదిలారు.

ముఖ్యమైన రాజులందర్నీ పిలిచి భీష్ముడు అన్నాడు “యుద్ధం అంటే రాజులకు తెరిచివున్న స్వర్గద్వారం. క్షత్రియుడై పుట్టి ఇంట్లో చావటం నీచం. ఉంటే రాజ్యయోగం, పోతే స్వర్గభోగం. ఇదివరకు మన పూర్వులు నడిచిన ఈ మార్గంలోనే మనమూ నడుద్దాం”. అంతా అలాగేనని అతనికి వాగ్దానాలు చేసి సంతోషంగా తమతమ సైన్యాల దగ్గరికి వెళ్లారు.

“గుర్తుంది కదా, నేను యుద్ధం చేసేప్పుడు కర్ణుడు గాని అతని బంధువులు గాని యుద్ధానికి రారు” అని దుర్యోధనుడికి గుర్తు చేశాడు భీష్ముడు.

తొలినాటి యుద్ధానికి నాందిగా మహాదృఢంగా మానుషవ్యూహం నిర్మించాడు భీష్ముడు. దేవతలు, పితృదేవతలు కూడ భారతరణం చూడటానికి విమానారూఢులై వేంచేశారు.

ఇక రెండో వంక – ధర్మజుడు, భీముడు, కృష్ణార్జునులు, కవలు, అభిమన్యుడు, ఉప పాండవులు కదిలి వచ్చారు. ఏనుగుల సైన్యంతో ద్రుపదుడు, కొడుకులు తమ్ముళ్లతో పెద్ద సైన్యంతో విరాటుడు, యాదవబలగంతో సాత్యకి; చేకితానుడు, అతనితో సల్లాపాలాడుతూ శిఖండి కదిలారు. అంబరమదిరే తూర్యధ్వనుల్తో మాగధసహదేవుడు, పాండవులకి కన్నులపండగ్గా ధృష్టద్యుమ్నుడు, చేత శూలపు వెలుగులు చిమ్ముతూ ఘటోత్కచుడు. పాండ్యపతి, కేకయు లైదుగురు, శైబ్యుడు, కాశ, కరూశాది అనేక దేశాల రాజులు. ఈ పాండవబలగం ఏడు అక్షౌహిణులు.

ఇరుసైన్యాలు కదిలి కురుక్షేత్రంలో ఉత్తమప్రదేశమైన శమంతపంచకానికి చేరాయి. శుభశకునాలు తోస్తుండగా ధర్మజుడు, తనవైపు రాజుల్ని పిలిచి “సమరంలో జయిస్తే రాజ్యం, లేకుంటే స్వర్గసామ్రాజ్యం. ఇందుకు సిద్ధమైతే నా పక్కన నిలవండి” అన్నాడు. అందరూ అలాగేనని ప్రతిజ్ఞలు చేశారు.

అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక సందేహం కలిగింది “మన సైన్యం వాళ్ల సైన్యం కన్నా చాలా పెద్దది. ఐనా ఏమాత్రం తొణుకూ బెణుకూ లేకుండా పాండవులు ఈ యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యారో?” సంజయుడన్నాడూ “ధర్మరాజుకీ ఇదే అనుమానం వచ్చింది. దానికి అర్జునుడు, ‘ఇదివరకు నారదుడు, వ్యాసుడు ఒక సందర్భంలో ధర్మనాశనులైన వాళ్లకి ఎంత పెద్ద సైన్యం వున్నా వాళ్లు చిన్న సేనకి ఓడిపోతారని’ చెప్పారు. అంతే కాక ‘మన సైన్యం సామాన్యం కాదు, ఎందరో మహాయోధులున్నారు, నీబలం కూడ నీకు తెలియదు. నువ్వూ, కృష్ణుడూ వున్న మన బలగం అజేయం’ అన్నాడు. అది నిజమని నా అభిప్రాయం కూడ.”

అప్పుడిక అర్జునుడు ధృష్టద్యుమ్నుడి చేత అచలవ్యూహం పన్నించాడు.

ఇంతలో ధర్మరాజు కవచం తీసి, ఆయుధాలు రథం మీద పెట్టి కిందికి దిగి మౌనంగా చేతులు మోడ్చి భీష్ముడి వైపుకి నడిచాడు. అతని తమ్ములు, బంధువులు బిత్తరపోయి అతని వెంట పరిగెత్తారు. ఎవరెంతగా అడిగినా ఒక్కముక్క మాట్లాడకుండా నడిచాడు ధర్మరాజు. కృష్ణుడు “పెద్దల ఆజ్ఞ తీసుకుని యుద్ధం చెయ్యటం జయప్రదం అని చెప్తారు. ఇప్పుడీయన చేస్తున్న పని అదే” అని వాళ్లని సమాధాన పరిచాడు. అందరూ నిలబడిపోయి చోద్యంగా చూస్తుంటే తమ్ముళ్లూ కృష్ణుడూ తనతో రాగా భీష్ముడి దగ్గరికి వెళ్లాడు ధర్మరాజు. సైన్యాలన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి, యుద్ధం మొదలు కాకుండానే పాండవులు ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారని అనుకోసాగారు.

భీష్ముడికి నమస్కరిస్తూ వినయంగా, శత్రువుల్ని జయించేట్లు దీవించమని అడిగాడు ధర్మజుడు. “ఇలా వచ్చి మంచిపని చేశావు, లేకపోతే నేన్నిన్ను శపించేవాణ్ణి సుమా! నీవైపుకు రమ్మని తప్ప ఇంకేదన్నా వరం కోరుకో” అన్నాడు భీష్ముడు. నిన్ను యుద్ధంలో గెలిచే మార్గం చెప్పమన్నాడు ధర్మరాజు. “నేను చేతి ఆయుధం వదిల్తే కాని నన్నెవరూ జయించలేరు. ఐతే అదెలా జరుగుతుందో చెప్పటానికి ఇది సమయం కాదు. అందుకు మళ్లీ వద్దువులే” అన్నాడు భీష్ముడు చిరునవ్వుతో.

అక్కడినుంచి ద్రోణ, కృప, శల్యుల దగ్గరికీ వెళ్లి పాదప్రణామాలు చేసి అనుజ్ఞ తీసుకున్నాడు. తన మరణరహస్యం చెప్పమంటే ద్రోణుడు ‘నేను ప్రాయోపవేశం చేసి శస్త్రాస్త్రాలు వదిల్తే తప్ప నన్ను ఎవరూ ఓడించలేరు, అలా జరగాలంటే మంచి నమ్మకస్తుడైన వ్యక్తి నేను భరించలేని కీడుమాట చెప్పాలి’, అని చెప్పాడు. కృపుడు తన్నెవరూ చంపలేరని చెప్పి ఆశీర్వదించాడు. శల్యుణ్ణి ‘నువ్వు కర్ణుడికి సారధివయే అవకాశం కలిగితే అతనికి చిక్కులు తెచ్చిపెట్టాలని’ అడిగితే, ‘అది మనం ముందు అనుకున్న విషయమేగా అలాగే చేస్తా’నని మాట ఇచ్చాడతను.

అప్పుడిక ధర్మజుడు వెనక్కు తిరిగాడు. ఇంతలో కృష్ణుడు అక్కడికి వచ్చిన కర్ణుణ్ణి చూశాడు. “భీష్ముడుండగా అతని వైపు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశావు, మరి అందాక పాండవుల వైపు ఒక చెయ్యి వెయ్యొచ్చు కదా” అనడిగాడతన్ని. “నాకు భీష్ముడి మీద కోపం గాని అలాగని రారాజుకి వ్యతిరేకంగా పోరాడను” అని ఖచ్చితంగా చెప్పాడతను. అతని సమాధానానికి కృష్ణుడు సంతోషించాడు. పాండవులతో కలిసి కౌరవసైన్యం బయటకు వచ్చాడు.

అప్పుడు ధర్మరాజు కౌరవసైన్యం వంక తిరిగి పెద్దగా – “మామీద స్నేహంతో మాతో కలవాలనుకున్న వారికి ఎవరికైనా స్వాగతం. వాళ్లని నా తమ్ముళ్లలాగా ఆదరిస్తా” అని ప్రకటించాడు. దానికి నీ కొడుకు యుయుత్సుడు “నేను వస్తా, నన్ను కలుపుకో”మన్నాడు. ధర్మజుడు అతన్ని కౌగిలించుకుని, ఉపచారాల్తో ఆనందింప చేశాడు. యుయుత్సుడు, అతని సైన్యం వెళ్ళి పాండవుల్తో కలిశారు. పాండవులు, ఇతర దొరలు తమతమ స్థానాలకు వెళ్లి యుద్ధసన్నద్ధులయారు.

అప్పుడు దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్లాడు “ఎందరో గొప్ప యోధులున్నా మనకన్నా పాండవుల వ్యూహం దిట్టంగా కనిపిస్తున్నది. మీరంతా అవసరమైన చోట్ల వుండి భీష్ముడికి కావలి కాయాలి సుమా” అన్నాడు. ఆమాట వేరే చెప్పాలా అని ద్రోణుడంటే భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. కౌరవ పక్షాన వున్న ఇతర మహావీరులు కూడ శంఖాలు పూరించారు. వివిధ వాద్యాల ఘోష మిన్ను ముట్టింది.

అటువైపు కృష్ణార్జునులు, తదితర దొరలూ కూడ శంఖాలు పూరించారు.

శస్త్ర ప్రయోగ సమయం వచ్చింది.

అర్జునుడు గాండీవం తీసుకుని అల్లెతాడు సారించి ఒక చేత్తో బాణం పట్టుకున్నాడు. “బావా, కౌరవుల్లో ఎవరితో యుద్ధం చెయ్యబోతున్నానో ఒక్కసారి చూద్దాం, రథాన్ని రెండుసైన్యాల మధ్య కొంచెం సేపు నిలుపు” అనడిగాడు. అలాగే చేశాడు కృష్ణుడు. ఒక్కసారి వాళ్లందర్నీ చూశాడు అర్జునుడు. ధనుర్బాణాలు పడేసి రథమ్మీద చతికిల పడ్డాడు. “ఎవరికోసం రాజ్యం సంపాయించాలనుకున్నానో వాళ్లంతా ఇక్కడ రణభూమిలో వున్నారు. వీళ్లని చంపి తెచ్చుకునే ఆ రాజ్యం నాకెందుకు? ఈ యుద్ధం నా వల్లకాదు” అంటూ బావురుమన్నాడు.

కలకల నవ్వాడు కృష్ణుడు. “ఎవరికోసం బాధపడ కూడదో వాళ్లని తల్చుకుని బాధపడుతున్నావు. ఆత్మ శాశ్వతం కాని శరీరం కాదు. ఆత్మ బాధించేది కాదు, బాధ పడేదీ కాదు” అంటూ ఎంతగానో బోధించాడు. “ఎండుటాకులు ఏ సమయంలో రాలాలో అప్పుడు రాల్తాయి. అలాగే శరీరాలకి మరణం కలుగుతుంది. దీన్లో ఒకరి ప్రమేయం లేదు” అని అతన్ని శాంతింప చేశాడు. అప్పుడు అర్జునుడు, “ఇప్పుడు నాకు కొంత ఉపశమనం కలిగింది. ఐతే మహనీయమైన నీ దివ్యరూపాన్ని ఒక్కసారి చూపించు” అనడిగాడు. “ఇది మానవనేత్రాల్తో చూడగలిగింది కాదు. నీకు దివ్యదృష్టి నిస్తున్నా, చూడు” అంటూ తన దివ్యరూపాన్ని చూపించాడు కృష్ణుడు. ఆ ఆకారం భయంకరమై తోచిందర్జునుడికి. అది తన కాలరూపమని, తను అప్పటికే వధించిన వారిని అర్జునుడు ముందుముందు చంపబోతున్నాడని వివరించాడు కృష్ణుడు. అతని కోరిక మేరకు ఆ రూపాన్ని ఉపసంహరించి పూర్వరూపంతో కనిపించాడు. అర్జునుడు యుద్ధానికి సుముఖుడయ్యాడు.

ఇలా విఘ్నాలన్నీ తీరటంతో ఇక యుద్ధం మొదలెట్టమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు వీరావేశంతో. దుశ్శాసనుడు కౌరవసేనని పురికొల్పాడు. భీష్ముడు ముందు సాగగా అతని వెనక కౌరవ సేనానీకం కదిలింది. రెండోవంక నుంచి భీముడు ముందుండగా పాండవసేన ఎదురుగా వచ్చి నిలిచింది. భీముడు శత్రువుల గుండెలు పగిలేలా సింహనాదం చేశాడు. దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మర్షణుడు, వివింశతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు. అటువైపు నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపదేయులు ఐదుగురు భీముడికి సాయంగా దూకారు. పోరు తీవ్రమైంది.

తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు దుర్యోధనుడు.

అటు ధర్మరాజు జయం మనదే అని తన సైన్యాన్ని ఉరికిస్తున్నాడు.

ఏనుగుల గంటల మోతలు, గుర్రాల సకిలింపులు, సైన్యాల పదఘట్టనలు భూనభోంతరాళాల్ని బద్దలు కొడుతున్నయ్. నడిమింటి సూర్యుడిలా మీ తండ్రి భీష్ముడు భీషణ రూపంతో యుద్ధం చేస్తున్నాడు. అది చూసి అర్జునుడు దేవదత్తాన్ని భీకరంగా మోగిస్తూ అతనితో తలపడ్డాడు. సాత్యకిని కృతవర్మ మార్కొన్నాడు. అభిమన్యుడు బృహద్బలుడితో తలపడితే అతను సూతుణ్ణి, గుర్రాల్ని చంపాడు. కోపంతో అభిమన్యుడూ వెంటనే అతనికి అదేపని చేశాడు. భీష్ముడు భీముడిపైకి కదిలాడు. దుశ్శాసనుడు నకులుడి మీద ఉగ్రబాణాలు వేశాడు. అతను ఒక భల్లంతో దుశ్శాసనుడి విల్లు విరగ్గొట్టి పాతిక బాణాల్ని అతని మీద వేశాడు. దుశ్శాసనుడు ఇంకో విల్లు తీసుకుని ఆ బాణాల్ని నరికి నకులుడి జెండా విరిచాడు. దుర్ముఖుడు సహదేవుడి మీదికి పోతే అతను వాడి సారథిని చంపి గుర్రాల్ని గాయపరిచాడు. ధర్మరాజు శల్యుడితో పోరాడాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో తలపడితే అతను వాడి పెద్దవింటిని మూడుముక్కలు చేశాడు. ఇంకోవిల్లు తీసుకుని పధ్నాలుగు వాడిబాణాలు వేశాడు వాడు. మాగధసహదేవుడు భూరిశ్రవుడితో తలపడ్డాడు. అలంబుసుడూ ఘటోత్కచుడూ ఢీకొన్నారు. అశ్వద్ధామ, శిఖండి ఒకర్నొకరు గాయపర్చుకున్నారు. భగదత్తుడు, విరాటుడు మరోవంక. కైకయరాజు బృహక్షత్రుడు, కృపుడు ఒకరొకరివి అన్నీ చంపుకుని కత్తులు పట్టుకుని కిందికి దూకారు. ఇంతలో ఒకవైపు నుంచి జయద్రథుడు మరోవైపు నుంచి ద్రుపదుడు వాళ్లిద్దరి మధ్యకు వచ్చి వాళ్ల రణాన్ని ఆపి ద్వంద్వయుద్ధంలో ఒకర్నొకరు గాయపర్చుకున్నారు.

ఇలా రణస్థలమంతా యుద్ధం చేస్తున్న చిన్న చిన్న గుంపుల్తో నిండిపోయింది.

మధ్యాన్నమయింది.

దుర్యోధనప్రేరితుడైన భీష్ముడు అంతటా తానే ఐ పాండవవర్గంలోని వ్యూహాలన్నిటినీ చీల్చిచెండాడుతూ తిరిగాడు. ఆ తేజోమూర్తిని ఎదిరించే ధైర్యం లేక అందరూ దిగాలుపడి చూస్తుంటే అభిమన్యుడు చెలరేగి శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, వివింశతి, కృపుడు – వీళ్లందర్నీ చీకాకు పరిచి భీష్ముడిని తొమ్మిది బాణాల్తో గాయపరిస్తే, ‘వీడు వివ్వచ్చుడికి కాస్త ఎక్కువేమో గాని తక్కువేమీ కాడు” అని భీష్మాదులంతా ముక్కున వేలేసుకున్నారు. భీష్ముడు, అతని పక్కనున్న ఐదుగురు దొరలూ తన మీద అంబుల వాన కురుస్తుంటే వాటన్నిటిని వ్యర్థపరిచి అభిమన్యుడు తాత తాళధ్వజాన్ని విరగ్గొట్టాడు. కౌరవసైన్యం హాహాకారం చేస్తే పాండవసేన ఉబ్బిపోయింది.

సింహనాదం చేస్తూ భీముడు వచ్చి తమ్ముడి కొడుక్కి సాయంగా శత్రువుల మీద దూకాడు. భీష్ముడు కోపంతో అతని కేతనాన్ని కూల్చాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయులు, విరాటుడు భీష్ముడితో తలపడ్డారు. ఉత్తరుడి ఏనుగు శల్యుడి రథాన్ని పిప్పిచేసింది. ఉగ్రకోపంతో శల్యుడు ఉత్తరుడి వక్షాన్ని ఒక శక్తితో బద్దలుకొడితే వాడు కింద పడుతూ దార్లోనే మరణించాడు. దాంతో ఆగక శల్యుడు వాడి ఏనుగునీ పీనుగ చేసి కృతవర్మ రథం మీదికి లంఘించాడు. అన్న చావుతో రెచ్చిన శంఖుడు శల్యుడి మీదికి దూకాడు. అంతలో భీష్ముడు వచ్చి వాణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. ఇది చూసి అర్జునుడు అతనికి అడ్డంగా వచ్చాడు. భీష్మార్జునుల పోరు ఘోరమైంది.

కృతవర్మ రథం నుంచి దూకి శల్యుడు శంఖుడి రథాల్ని నుగ్గుచేశాడు. వాడు అర్జునుడి రథం వెనక్కి పారిపోయాడు. ఇక అక్కణ్ణుంచి కదిలి భీష్ముడు విరాటసైన్యం మీద విరుచుకుపడ్డాడు. పాండవసైన్యాన్ని పరుగులు పెట్టించాడు. పాండవులు దిక్కుతోచక దిక్కులు చూస్తుండగా వాళ్ల మీద దయతలిచి సూర్యుడు అస్తమించాడు. తొలినాటి యుద్ధం ముగిసింది.

ఆ రాత్రి ధర్మజుడు తమ్ములు, మిగిలిన వాళ్లతో కలిసి నీరసంగా కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. “కృష్ణా, ఈ భీష్ముడి చేతిలో మన సైన్యం పూర్తిగా నాశనం కాకముందే యుద్ధం చాలించి నేను అడవులకి పోయి కూరాకులు తిని బతుకుతా. వీళ్లని అతనికి బలివ్వలేను. అర్జునుడేదో అతన్ని ఆపగలడని ఇన్నాళ్లు నేను భ్రమలో వున్నా. అది నిజం కాదని ఈ రోజు తేలిపోయింది” అని బావురుమన్నాడు. కృష్ణుడతన్ని ఊరడించాడు. మనవైపూ మహాయోధులున్నారు. ఒళ్లు దాచుకోకుండా పోరాడుతున్నారని ఇంకా పోరాడతారని వివరించాడు.
తను పుట్టిందే ద్రోణుణ్ణి వధించటానికని, మిగిలిన కౌరవసేనని అవసరమైతే తనే కడతేర్చగలనని భరోసా ఇచ్చాడు ధృష్టద్యుమ్నుడు. ధర్మరాజు కొంత శాంతించి తన నివాసానికి వెళ్లాడు.

రెండవ రోజు


తెల్లవారింది. కాల్యకృత్యాలు తీర్చుకుని యుద్ధోన్ముఖులయారు. అత్యంత శక్తివంతమైన క్రౌంచవ్యూహం నిర్మించమని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు ధర్మరాజు. అతనలాగే చేశాడు. అదిచూసి దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప, శల్య, కృతవర్మలతో మంతనాలు చేశాడు. మూడు వ్యూహాలు పన్నారు. వాటన్నిటికీ వెనగ్గా తన సైన్యంతో దుర్యోధనుడు నిలబడ్డాడు.

యుద్ధం మొదలైంది. భీష్ముడు మళ్లీ విజృంభించి అంతటా తానే అయి విహరించటం మొదలెట్టాడు.

అర్జునుడు అక్కడికి తీసుకువెళ్లమని అడిగితే, అలాగే చేస్తా; ఐతే నువ్వు ఎలాటి సందేహాలకీ తావులేకుండా భీష్ముడి చుట్టూ వున్న వాళ్లంతా బిత్తరపోయేట్టు నీ పరాక్రమం చూపించు అని పురికొల్పుతూ రథాన్ని అటు తోలాడు కృష్ణుడు. అర్జునుడు అడ్డొచ్చిన వాళ్లందర్నీ తన బాణవర్షంలో ముంచుతూ ముందుకు సాగాడు.

భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, వికర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు అతని మీదికి బాణప్రయోగాలు చేశారు. అర్జునుడు ఏమాత్రం చెదరక వాళ్లందరికీ సరైన రీతిలో బాణ సమాధానాలు చెప్పాడు.

ఇంతలో సాత్యకి, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు, అభిమన్యుడు వచ్చి భీష్ముడికి సాయపడే వాళ్లందరి మీద విరుచుకుపడ్డారు. అర్జునుడు భీష్ముణ్ణి దాటి కౌరవబలం మీద పడి చించి చెండాడాడు.

దుర్యోధనుడు భీష్ముడితో “అలా అర్జునుడు మన వాళ్లని ఊచకోత కోస్తుంటే ఏమీ చెయ్యటం లేదు నువ్వు. పైగా కర్ణుణ్ణి యుద్ధానికి రాకుండా చేశావు” అని ఎత్తిపొడిచాడు. భీష్ముడి మనసు కలుక్కుమంది. ఐనా మౌనంగా అర్జునుడి వైపుకి బయల్దేరాడు. దుర్యోధన వికర్ణులు ఒకపక్క నుంచి, అశ్వత్థామ మరోపక్క నుంచి అర్జునుడి మీద బాణాలు కురిపించారు. అటువైపు అర్జునుడికి తోడుగా అతని అన్నదమ్ములు వచ్చారు. వాళ్లందరి మధ్యా యుద్ధం తీవ్రమైంది.

భీష్ముడు కృష్ణుడి వక్షాన ఒక అమ్ము నాటాడు. కోపంతో అర్జునుడు భీష్మ సారధిని నొప్పించి కురుబలాన్ని తన బాణాల్లో కప్పేశాడు. భీష్ముడొక్కడే వాళ్లకి దిక్కయ్యాడు. అంతలో మధ్యాన్నమయింది.

మరోపక్క ద్రోణ ధృష్టద్యుమ్నులు తలపడ్డారు. ధృష్టద్యుమ్నుడి అన్ని ఆయుధాల్ని ముక్కలు చేశాడు ద్రోణాచార్యుడు. రథం నుగ్గయింది. ధృష్టద్యుమ్నుడు కిందికి దూకి వాలూ పలకా తీసుకుని అతని మీదికి దూకబోయాడు కాని ద్రోణుడి శరపరంపరలు అతన్ని కదలనివ్వలేదు. ఇంతలో భీముడు అడ్డంగా వచ్చి ధృష్టద్యుమ్నుడిని ఇంకో రథం ఎక్కించి ద్రోణుడితో తలపడ్డాడు. దుర్యోధనుడు కాళింగుడైన శ్రుతాయువుని పిలిచి భీముడి పైకి పంపాడు. వాడు మహాసైన్యంతో భీముడి మీదికి ఉరికాడు.

ద్రోణుడు విరాట ద్రుపదుల మీదికి కదిలాడు.

శ్రుతాయువు, తన నిషాద సైన్యంతో కేతుమంతుడు, భీముణ్ణి ఢీకొన్నారు. కేతుమంతుడు తొలిదెబ్బకే చచ్చాడు. శ్రుతాయువు కొడుకు శక్రదేవుడు భీముడి మీదికి దూకి అతని గుర్రాల్ని కూలిస్తే మండిపడుతూ భీముడో పెద్ద గదతో మోదాడు. రథమూ, సారధుల్తో సహా వాడు గతించాడు. పలకని కత్తిని పుచ్చుకుని భీముడు రథం మీంచి దూకి శ్రుతాయువు బాణాల్ని వమ్ము చేశాడు. ఇంతలో శ్రుతాయువు తమ్ముడు భానుమంతుడు ఏనికసైన్యంతో వచ్చి భీముడితో తలపడ్డాడు. సింహనాదం చేస్తూ భీముడు వాడి ఏనుగు దంతాల మీదికి లంఘించి ఒక్కపోటుతో వాణ్ణి చంపాడు. శ్రుతాయువు తన సైన్యాన్ని భీముడి మీదికి ఉసిగొల్పాడు. భీముడు రథం లేకుండానే భీభత్సంగా ఏనుగల్ని పీనుగుపెంటలు చేసి గుర్రాల్ని ఎక్కడ దొరికితే అక్కడ నరికి రథాల్ని సారధుల్ని ఊచకోత కోసి శ్రుతాయువు మీదికి దూకబోయేంతలో భీముడి సారధి అక్కడికి రథాన్ని తీసుకొచ్చాడు. అది ఎక్కి శ్రుతాయువు చక్రరక్షకుల్ని చంపి అతన్ని మూర్ఛితుణ్ణి చేసి ఒక్క బొబ్బ పెట్టే సరికి అతని సారథి భయంతో శ్రుతాయువు రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అతని బలాలు చిందరవందరగా పారిపోయినై.

భీముడు విజయసూచకంగా శంఖం పూరించాడు. అదివిని భీష్ముడు భీముడి మీదికి వస్తుంటే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి భీముడికి తోడుగా వచ్చిచేరారు. భీష్ముడు వాళ్లందరి మీదా విపరీతంగా బాణాలు వేసి భీముడి గుర్రాల్ని చంపాడు. భీముడు వీరావేశంతో గద తీసుకుని అతని మీదికి వెళ్ళాడు. ఇంతలో సాత్యకి భీష్ముడి సారధిని చంపాడు. సారధిలేని గుర్రాలు అతన్ని రథాన్ని తీసుకుని పరిగెత్తినయ్. ధృష్టద్యుమ్నుడు ఆదరంగా భీముణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు. సాత్యకి భీముడితో, “ఒక్కడివే ఇలా కళింగ బలాన్నంతటినీ బూడిద చెయ్యటం బాగుందా!” అని సరసమాడాడు.

ఇంతలో శల్య, కృప, అశ్వత్థామలు అటు వస్తుంటే ధృష్టద్యుమ్నుడు భీముణ్ణి వినయంగా తన రథం మీది నుంచి దించి వాళ్ల మీదికి వెళ్లాడు. వాళ్లు ముగ్గురూ అతనొక్కడితో యుద్ధం చెయ్యటం దూరం నుంచి గమనించిన అభిమన్యుడు అక్కడికి వేగంగా వచ్చి వాళ్లతో యుద్ధం చేస్తుంటే నీ మనవడు లక్ష్మణకుమారుడు పదునైన బాణాల్తో అతన్ని గాయపరిచి అతని విల్లు విరగ్గొట్టాడు. కౌరవులు ఆనందంగా అరిచారు. అభిమన్యుడు ఇంకో విల్లు తీసుకుని అతన్ని నొప్పించాడు. కొడుకు గాయాలు చూసిన దుర్యోధనుడు కోపంతో అభిమన్యుడి మీదికి కదిలాడు. అది చూసి భీష్మ ద్రోణాదులు కూడ అటు వెళ్ళారు. కొంచెమైనా జంకకుండా అభిమన్యుడు అందరికీ అన్నిరూపులై యుద్ధం చేస్తుంటే చూసి వాయువేగంతో రథం తోలుకుని బాణవర్షం కురిపిస్తూ దేవదత్తం పూరిస్తూ అర్జునుడక్కడికి వచ్చాడు. ఇది చూసి ధర్మరాజు తన సైన్యాన్ని పురికొలిపి అటు పంపాడు.

భూమ్యాకాశాలు కనపడనంత దట్టంగా దుమ్మూ ధూళీ అలముకున్నయ్. మన సైన్యం దిక్కుతోచక పారిపోసాగింది. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు. భీష్ముడు ద్రోణుడితో “ఇలా భీషణంగా పోరాడుతున్న అర్జునుడిని మనం ఇప్పుడేమీ చెయ్యలేం. పొద్దు కూడ వాలుతున్నది. మన వాళ్లంతా అలిసిపోయారు. ఇవాల్టికి యుద్ధం చాలిద్దాం” అని చెప్పి అందర్నీ పిలిచి నడిపించాడు. పాండవ బలగాలు ఉత్సాహంగా కేకలు పెడుతూ శిబిరాలకు కదిలారు.

మూడవరోజు


మూడవరోజు యుద్ధానికి పొద్దున్నే లేచి భీష్ముడు గరుడవ్యూహం పన్నాడు. మన వ్యూహాన్ని చూసి అర్జునుడు అర్థచంద్రవ్యూహం అమర్చమని ధృష్టద్యుమ్నుడితో చెప్పాడు. అతనలాగే చేశాడు. రెండుబలాలు కదిలినయ్. అర్జునుడు మన పదాతులు జడుసుకుని పారుతుంటే తన రథాన్ని నడిపించి రథాలు, రథికులు, గుర్రాలు, సారథులు అని చూడకుండా అందర్నీ అన్నిట్నీ నుగ్గు చేస్తూ సాగుతుంటే నీ కొడుకులంతా కోపంగా అతని మీద విరుచుకుపడ్డారు. దాంతో పాండవులు వాళ్ల మీదికి ఉరికారు. ఎవరెవరో తెలియరానంతగా బలగాలు కలగలిసి పోయినై. దేవాసుర యుద్ధాన్ని తలపిస్తూ ఇరుపక్షాలు పోరుసాగించినయ్. మనవైపు నుంచి భీష్ముడు, ద్రోణుడు, పురుమిత్రుడు, సైంధవుడు, సౌబలుడు (శకుని), వికర్ణుడు పాండవసేన మీద పడితే; వాళ్లవైపు నుంచి భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, ద్రౌపదేయులు వాళ్లతో తలపడ్డారు. అప్పుడు నీ పెద్దకొడుకు భీముడున్న చోటికి వెళ్తుంటే అతని కన్నా ముందుగానే భీష్మద్రోణులు అక్కడికి చేరి పోరుతుంటే అన్నకి సాయంగా అర్జునుడూ అక్కడికే వచ్చి కౌరవసేనని మట్టుపెడుతుంటే సాత్యకి, అభిమన్యుడు గాంధార బలగాల పని పట్టారు. ఆ శకుని బలగం సాత్యకి రథాన్ని నుగ్గుచేస్తే అతను వేగంగా అభిమన్యుడి రథం మీదికి దూకాడు. వాళ్లిద్దరూ కలిసి గాంధార బలాన్ని గందరగోళం చేశారు.

ఇంతలో ధర్మజుడు భీష్ముడితో తలపడ్డాడు. దుర్యోధనుడు భీముడి మీద అనేక బాణాలేశాడు. దానికి నవ్వుతూ భీముడు వేసిన ఒక ఉగ్ర బాణానికి దుర్యోధనుడు చతికిలపడి మూర్ఛపోవటంతో భయపడి అతని సారథి రథాన్ని అక్కడి నుంచి దూరంగా తోలుకుపోయాడు.

కౌరవబలంలో కలకలం చెలరేగింది. కంగారులో వున్న ఆ సైన్యాన్ని ధృష్టద్యుమ్నుడు ఒకవంక, భీముడు మరోవంక ఊచకోత కోశారు. భీష్మ ద్రోణులు నిలపటానికి వ్యర్థప్రయత్నం చేశారు. సాత్యకి, అభిమన్యుల దెబ్బలకు గాంధారసేన కూడ భయంతో పారిపోతుంటే వాళ్లతో పాటే శకునీ అతని బంధువులూ పరుగులు తీశారు. మరోవంక అర్జునుడు మిగతా కౌరవసేనని చిందరవందర చేశాడు.

అప్పుడు నీ కొడుక్కి తెలివొచ్చి సారథిని తిట్టిపోసి యుద్ధరంగానికి తిరిగొచ్చి అందర్నీ పిలిచి పరుగులు ఆపించాడు. భీష్మ ద్రోణుల దగ్గరికెళ్ళి, “మీరొక్కొక్కరే ముల్లోకాల్ని మూడుచెరువులు తాగించగలరు. మీ ముక్కున ఊపిరి వుండగానే మన సైన్యం ఇలా దిక్కుమాలిన దురవస్థలో వున్నదంటే ఏమనాలి? మీరు పాండవుల మీద కోపగించరన్న మాట ముందే చెప్పొచ్చు కదా?” అంటూ, భీష్ముడితో, “నువ్విలా చేస్తావనుకుంటే ముందే కర్ణుణ్ణి తెచ్చుకుని మా తిప్పలేవో మేం పడేవాళ్లం. నీ మూలాన అడియాసకి పోయి భంగపడ్డా” అని నిష్టూరాలాడాడు.

దానికి భీష్ముడు చిరునవ్వు నవ్వాడు. “పాండవులు గట్టిగా నిలబడి యుద్ధం చేస్తే వాళ్లని ఓడించటం దేవేంద్రుడికి తరమా? అలాటి వాళ్లు మనలాటి వృద్ధులు, దుర్బుద్ధుల చేతిలో ఓడుతారా? ఐనా నా ఓపిక్కొద్దీ పరాక్రమిస్తా. మీరంతా పక్కనుండి చూస్తూండండి” అని అప్పుడున్న మధ్యాహ్నసూర్యుడు తానే అయి భీష్ముడు అర్జునుడి మీదికి దూకాడు. అప్పుడు నీ తండ్రి ప్రళయకాల రుద్రుడిని తలపిస్తూ అన్ని దిక్కులా తనే కనిపిస్తూ శత్రుబలంలోని మొనగాళ్లను పేరెత్తి పిలిచి మరీ దండిస్తూ రణభూమిని రక్తసిక్తం చేస్తూ పరాక్రమనృత్యం చేశాడు. పాంచాల యాదవ బలగాలు చెల్లాచెదురైనై. పాండవులు కూడ బిక్కచచ్చి నీరుగారి నిలుచున్నారు.

అదిచూసి కృష్ణుడు “ఎప్పుడెప్పుడు నేను భీష్మద్రోణకృప సహితంగా కౌరవబలాల్ని నుగ్గుచేస్తానా అని ఇన్నాళ్లు ఎదురుచూసిన వాడివి ఇప్పుడు అవసరమైనప్పుడు ఇలా వూరుకుంటే ఎలా?” అంటే అర్జునుడు “నువ్వంత మాటంటే ఇంకా ఊరుకుంటానా! అతని మీదికి నడుపు మన రథాన్ని” అని భీష్ముడితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా పోరారు. భీష్ముడు కృష్ణార్జునులిద్దర్నీ బాణాల్తో బాగా గాయపరిచాడు. ఐనా ఆగక అర్జునుడతని మీద బాణపరంపరలు కురిశాడు.

కృష్ణుడు తనలో “ఇటు పాండవ సైన్యాలా పారిపోతున్నయ్, ఇప్పుడిక్కడ భీష్ముణ్ణి ఎదిరించి నిలవగల మగతనం ఎవడిలోనూ కనపడటం లేదు, అర్జునుడు కూడ అలిసి తూగుతున్నాడు, యాదవ కేకయ పాంచాల బలాలు కాపాడేవాడు లేక పారుతున్నయ్, కురుబలాలు వాళ్ల మీద పడి వీరవిహారం చేస్తున్నయ్, ఇంకా ఉపేక్షిస్తే దుర్యోధనుడి కోరిక ఈపూటే తీరబోతుంది. నేనీ భీష్ముణ్ణి చంపి ధర్మజుణ్ణి గెలిపించాలి” అనుకుంటూ ఉండగా సాత్యకి ఏనుగుబలగంతో వచ్చి అందర్నీ పిలిచి “ఇచ్చిన మాట గాలికి వదిలి ఇలా పారిపోవటం మగతనం కాదు, రండి ఈ భీష్ముడు గీష్ముడి పనిపడదాం” అని అర్జునుడి రథం వైపుకి వస్తుంటే కృష్ణుడతనితో, “పారిపోతున్న పిరికిపందల్ని ఎందుకు పిలుస్తావ్? నేనుండగా దుర్యోధనుడు గెలవటం అసాధ్యం. ఇప్పుడే భీష్మ ద్రోణాదుల్ని మట్టుబెట్టి పాండవులకి రాజ్యం ఇస్తా, చూడు” అంటూ సుదర్శనచక్రాన్ని తలవటంతోనే అది వెంటనే వచ్చి అతన్ని చేరింది.

దాన్ని తన కుడిచేతికి అమర్చుకుని పగ్గాల్ని రథం మీద పారేసి పట్టుపీతాంబరం చెంగు తూలగా ధరణి అదిరేట్టు కిందికి దూకి సింహనాదంతో భీకరవదనంతో జగత్సంహారానికి కదిలిన రుద్రుడిలా భీష్ముడి వైపుకి కదిల్తే కౌరవసేనంతా కిక్కురుమనకుండా నిలబడిపోయింది; దుర్యోధనుడు గుటకలు మింగుతూ చూస్తున్నాడు; భీష్ముడొక్కడే ప్రశాంతంగా ప్రేమగా “ఇంతకన్నా నాకు కావసిందేముంది, త్వరగా వచ్చి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి” అన్నాడు; అర్జునుడు రథం మీంచి దూకి పరిగెత్తి అతని వెనకభాగాన్ని గుచ్చిపట్టుకుని పదడుగుల మేర ఈడ్చినా వదలకుండా ఎలాగో వేలాడి “ఇంక ఒక్క అడుగేస్తే సాత్యకిని చంపినంత ఒట్టు, కోపం చాలించు, నీ సాయంతో కౌరవసేనని నరుకుతా. నువ్విలా నా పరాక్రమాన్ని తక్కువ చెయ్యటం నీకు న్యాయం కాదు” అంటూ అతన్ని ఆపాడు.

కృష్ణుడు శాంతించి రథం మీదికి తిరిగి వచ్చి పాంచజన్యం పూరించాడు. గాండీవీ దేవదత్తాన్ని పూరిస్తూ కౌరవసైన్యం మీద బాణవృష్టి కురిపించాడు. భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు అతని మీద రకరకాల శస్త్రాలు ప్రయోగించారు. అర్జునుడలిగి ఇంద్రాస్త్రాన్ని వేశాడు. ఆ అస్త్రం కురుసైన్యాల్ని కలచివేసి అపారనష్టం కలిగించింది. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాల్ని మోగించారు. అరుణకిరణుడు అస్తమాద్రికి చేరాడు.

నాలుగవ రోజు.


తెలతెలవారుతుండగా లేచి భీష్ముడు యుద్ధానికి బయల్దేరితే సాగరతరంగాల్లా అతని వెనక సేనలూ కదిలాయి. వ్యూహాలేవీ లేకుండానే రెండు బలాలూ తలపడ్డాయి. సూర్యచంద్రుళ్లా నరనారాయణులు కౌరవసేన మీదికి దూకారు. అనేక సైన్యాల్ని ఇలా అర్జునుడు తరుముతుంటే భీష్ముడు అతన్ని ఢీకొన్నాడు. భీష్ముడి పక్కన ద్రోణుడు, వివింశతి, కృపుడు, సోమదత్తుడు, శల్యుడు ఉన్నారు. వాళ్లందరితో అభిమన్యుడు ఒక్కడే తలపడ్డాడు. భీష్ముడు అభిమన్యుణ్ణి దాటివెళ్లి అర్జునుడి మీద బాణాలు కురిశాడు. అందరూ ఆశ్చర్యంతో వాళ్ల యుద్ధం చూస్తుండగా అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యతనయుడు, చిత్రసేనుడు అభిమన్యుడితో పోరారు. ఇలా ఎంతోమంది తనని చుట్టుముట్టినా ఏమాత్రం తొణక్కుండా అందరితో అతను యుద్ధం చేశాడు.

ధృతరాష్ట్ర మహారాజా, అనకూడదు కాని హస్తలాఘవంలో, బలంలో, శౌర్యంలో అభిమన్యుడికి సరిపోయే వాళ్లెవరూ మన బలగంలో లేరు. అప్పుడు కొడుకుని చూసి అర్జునుడు వేగంగా అక్కడికి వచ్చి అందర్నీ చిక్కుపరిచాడు. ఇంతలో నీ కొడుకు పంపగా త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు ముప్పై ఐదు వేల రథాల వారు వాళ్లిద్దర్నీ చుట్టుముట్టారు. ఇదిచూసి ధృష్టద్యుమ్నుడు వచ్చి కలిశాడు. అప్పుడు శల్యుడి కొడుకు అతనితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ధృష్టద్యుమ్నుడి చేతిలో అతని రథం విరిగితే పలకా వాలూ పట్టుకుని భీకరసమరం చేశాడు. ధృష్టద్యుమ్నుడి సైన్యం కకావికలైంది. ధృష్టద్యుమ్నుడు గద తీసుకుని ఒక దెబ్బతో అతని పలకనీ రెండో దెబ్బతో అతని తలనీ పగలగొట్టాడు. కోపంతో శల్యుడతని మీదికి దూకితే ధృష్టద్యుమ్నుడు నానాబాణాల్తో అతన్నెదుర్కున్నాడు.

“ఏం చెప్తాం, అంతా దైవాధీనం. పాండవుల చేతిలో మనవాళ్లు చావటం ఖాయం, చావు వార్తలు వినటం నా ఖర్మం. పాండవుల్ని గెలిచే ఉపాయమే లేదుగదా” అని నిట్టూర్చాడు ధృతరాష్ట్రుడు. “అదంతే మరి. నీ సైన్యం చాలా నాశనమైంది, నాయకులూ చస్తారు. స్థిరంగా వుండి విను” అంటూ సంజయుడు కొనసాగించాడు.

ఇలా శల్యుడు ధృష్టద్యుమ్నుడిని గాయపరుస్తూ పోరుతుంటే అభిమన్యుడు అతనితో తలపడ్డాడు. దుర్యోధనుడు పంపగా వచ్చి దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్షణుడు, సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివింశతి, వికర్ణుడు వాళ్లిద్దరి మీద పడ్డారు. నకులుడు సహదేవుడు వచ్చి మామ మీద బాణాలు కురిపించారు. ఒకవంక ప్రేమతోనే అతను వాళ్ల మీదా బాణాలు ప్రయోగించాడు. వాళ్లకి తోడుగా ద్రుపదుడు, విరాటుడు వచ్చి కలిశారు. మనవైపు నుంచీ యోధానుయోధులు శల్యుడికి సాయంగా వెళ్లారు. మధ్యాన్నమైంది.

అప్పుడు భీముడు తీవ్రావేశంతో “ఈపూటతో యుద్ధం సమాప్తం కావాల్సిందే” అంటూ నీ కొడుకు మీదికి రథాన్ని కదిలించాడు. నీ కొడుకులంతా కంగారుపడ్డారు. దుర్యోధనుడు గజానీకంతో మాగధుణ్ణి భీముడి పైకి ఉసిగొల్పాడు. ఐతే భీముడు ఉల్లాసంగా గద తీసుకుని కిందికి దూకి గజసైన్యాన్ని నుగ్గుచెయ్యటం మొదలెట్టాడు. ద్రౌపదేయులు, అభిమన్యుడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు అతని పక్కల ఉండి ఏనుగుల మీద బాణాలు కురిపించారు. ముఖ్యంగా నకులుడి కొడుకు శతానీకుడు ఎన్నో ఏనుగుల్ని సంహరించాడు. మాగధుడు అభిమన్యుడి మీదికి ఏనుగుని తరిమితే అతనొక పదునైన బాణంతో దాని కుంభస్థలాన్ని కొట్టి అది కొంచెం ఒరిగితే క్షణమాత్రంలో వాడి తల నరికాడు.

ఇక భీముడు, అభిమన్యుడు మిగిలిన పాండవవీరులు ఆ గజసైన్యాన్ని చెండాడుకున్నారు. మిగిలిన ఏనుగులు పరిగెత్తి కౌరవసైన్యాన్నే తొక్కసాగినయ్. దుర్యోధనుడు పిలిచి ఆపే వరకు సైన్యం కకావికలై పారిపోయింది. అప్పుడు భీష్ముడు వచ్చి బాణపరంపరల్తో భీముణ్ణి ఎదుర్కున్నాడు. ఇంతలో సాత్యకి వచ్చి భీష్ముడి మీద దూకితే మధ్యలో అలంబుసుడు సాత్యకిని నొప్పించాడు. సాత్యకి తన బాణాల్తో ఆ రాక్షసుణ్ణి ఆపితే సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు సాత్యకితో తలపడ్డాడు. ఇటు దుర్యోధనుడు, అతని తమ్ములు భూరిశ్రవుడికి తోడుగా నిలిస్తే అటు పాండవులు సాత్యకి పక్కకి వచ్చారు. ఇరువర్గాల వారికి పోరు ఘోరమైంది. భీముడు నీ కొడుకుల మీదికి దూకాడు. దుర్యోధనుడు అతని మీదికి బాణాలు కురిశాడు. వజ్రాయుధం లాటి బాణంతో దుర్యోధనుడు భీముడి వక్షాన్ని నాటాడు. భీముడు మూర్ఛవచ్చి తూలాడు. ఇదిచూసి కోపించి అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు ఒక్కుమ్మడిగా నీ కొడుకుని చుట్టుముట్టారు.

ఇంతలో తెలివొచ్చి భీముడు భీషణంగా యుద్ధం ప్రారంభించాడు. నీ కొడుకులు పధ్నాలుగు మంది భీముడి పైకి లంఘిస్తే వాళ్లలో చాలామందిని అతను అప్పటికప్పుడే చంపాడు. మిగిలిన వాళ్లు పారిపోయారు. అదిచూసి భీష్ముడు మనవైపు మొనగాళ్లతో, “భీముడిలా రాజు కొడుకుల్ని చంపుతుంటే మీరు ఊరుకోవచ్చా?” అని అదిలిస్తే భగదత్తుడు భీముడి పైకి తన భద్రగజాన్ని నడిపించాడు. అభిమన్యాదులు దాని మీద బాణాలేస్తే అది రెచ్చిపోయి పాండవసైన్యాన్ని తొక్కెయ్యటం మొదలెట్టింది. దాన్నెలా ఆపాలా తోచక పాండవయోధులు తబ్బిబ్బయారు. దుర్యోధనుడు మరోబాణం భీముడి వక్షాన నాటితే అతను తూలి కేతనం పట్టుకుని నిలదొక్కుకున్నాడు. కౌరవసేన ఉబ్బిపోయింది.

అప్పుడు తండ్రికి సహాయంగా ఘటోత్కచుడు వచ్చాడు. “ఇది మాయాయుద్ధానికి సమయం” అని తన మాయాజాలంతో కౌరవసేనకి విభ్రమం కలిగించాడు. భగదత్తుడు తన ఏనుగు మీద వచ్చి అడ్డుపడబోయాడు గాని అతని ఏనుగు మాట వినక పరిగెత్తింది. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీదికి వెళ్తుంటే భీష్మ ద్రోణాదులంతా అతనికి అడ్డు పడ్డారు. పోరు భీకరమైంది. ఆ ఘటోత్కచుణ్ణి ఆ సమయంలో ఎదిరించటం సాధ్యం కాదని ఆ రోజుకి యుద్ధం చాలిద్దామని భీష్ముడు ద్రోణుడికి చెప్తే అతను మిగిలిన వాళ్లను తోడుకుని తిరుగుముఖం పట్టాడు. జయ జయ ధ్వానాల్తో పాండవసైన్యం శిబిరాలకు తరలింది.

ఐదవరోజు.


మకరవ్యూహంతో కౌరవసైన్యం, శ్యేనవ్యూహంతో పాండవసైన్యం తలపడ్డాయి. భీముడు సునాయాసంగా మకరవ్యూహం లోకి చొరబడ్డాడు. భీష్ముడి మీద బాణాలు వర్షించాడు. ఐతే పితామహుడు నెయ్యిపోసిన అగ్నిలాగా భీముణ్ణి నొప్పించి అతని సైన్యాన్ని చెండాడాడు. అంతలో అర్జునుడక్కడికి వచ్చి దివ్యశరాల్ని కురిపించాడు కౌరవుల మీద.

నీ పెద్దకొడుకు ద్రోణుడి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు – “నీకూ భీష్ముడికీ పాండవుల్ని గెలుద్దామన్న ఉద్దేశమే లేదు. అర్జునుడిలా మన సైన్యాన్ని కోస్తుంటే ఏవీ పట్టించుకోరు” అని. ద్రోణుడు నొచ్చుకుని “ఇప్పటివరకు అర్జునుడితో తలపడ్డ ప్రతిసారీ అతనే గెలిచాడు – గోగ్రహణ సందర్భం ఇంతలోనే మర్చిపోయావా? ఇంతవరకు ఎప్పుడూ వాళ్లని ఆపలేకపోయాం. ఇప్పుడు వాళ్లని జయించటం సాధ్యమా? ఎందుకీ మాటలు?” అంటూ పాండవవ్యూహం లోకి ప్రవేశించాడు. అక్కడతన్ని సాత్యకి ఎదుర్కున్నాడు. వాళ్లిద్దరూ యుద్ధం చేస్తుంటే శల్యుడు అతని తోడై భీముడితో తలపడితే ద్రౌపదేయులు, అభిమన్యుడు వాళ్ల మీదికి దూకారు. ఇంతలో శిఖండి భీష్ముడి మీద బాణాలు వేస్తుంటే, “దీనితో నేను యుద్ధం చేస్తానా?” అని అతను పక్కకి తిరిగి వెళ్లాడు. అదిచూసి దుర్యోధనుడు ఉసిగొలిపితే ద్రోణుడు శిఖండితో తలపడ్డాడు.

ఘోరమైంది యుద్ధం. ఎటుచూసినా పీనుగుదిబ్బలు. భీముణ్ణి చుట్టుకుని పాండవబలగం, భీష్మరక్షితమై కౌరవబలగం పోరాడినయ్. నీ కొడుకులు ఉమ్మడిగా వెళ్లి భీముడిని చుట్టుముడితే అతనూ అర్జునుడూ కలిసి వాళ్లని చెల్లాచెదురు చేశారు. దుర్యోధనుడు అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు కదిలించాడు. అటూ ఇటూ పోటువీరులు ఒకళ్ళొకళ్లతో తలపడి పోరుతుంటే భీష్ముడు భీముణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. కోపంతో సాత్యకి భీష్ముడి మీద బాణప్రయోగం చేశాడు. భీష్ముడలిగి అతని సారథిని చంపితే గుర్రాలు అటు ఇటూ అయి రథం ఒరిగిపోయింది. “వెళ్లండి, సాత్యకిని కాపాడండి” అన్న అరుపులు పాండవసైన్యంలో. విరథుడైన అతనితో యుద్ధం భావ్యం కాదని భీష్ముడు పాండవవ్యూహం మీదికి నారి సారించాడు.

విరాటుడు యముడిలా భీష్ముడిని అడ్డుకున్నాడు. భీష్ముడతన్ని బాణాల్తో నొప్పిస్తే అర్జునుడు భీష్ముడి మీదికి బయల్దేరాడు. మధ్యలో అశ్వత్థామ అడ్డుకుని నొప్పించాడు. వాళ్లిద్దరి మధ్యా తీవ్రయుద్ధం జరిగింది. అశ్వత్థామకి గాయాలయాయి. అర్జునుడతనితో యుద్ధం చాలించి మరోవైపుకు కదిలాడు.

భీష్ముడితో తలపడబోతున్న భీముణ్ణి దుర్యోధనుడు ఆపాడు. ఇద్దరికీ ఉగ్రమైన బాణయుద్ధం జరిగింది. దుర్యోధనుడికి సాయంగా చిత్రసేనుడు, పురుమిత్రుడు, భీష్ముడు వస్తే వాళ్లని అభిమన్యుడు ఎదుర్కున్నాడు. అందరూ విస్తుపోతుండగా వాళ్లందర్నీ మూడుచెరువుల నీళ్లు తాగించాడు. ఇదిచూసి లక్ష్మణకుమారుడు అభిమన్యుడి మీద అంపపరంపరలు కురిస్తే అభిమన్యుడతని గుర్రాల్నీ సారథినీ చంపాడు. ఐనా తొణకక నీ మనవడు శక్తిని విసిరాడు. అభిమన్యుడు దాన్ని నరికి నీ మనవడి మీద ఓ తీవ్రసాయకాన్ని సంధిస్తుంటే అది గమనించి కృపుడు లక్ష్మణుణ్ణి తన రథమ్మీదికి లాగి దూరంగా తీసుకుపోయాడు.

దుర్యోధనుడు తన బలగాన్ని సమకూర్చుకుని మళ్ళీ తలపడ్డాడు. సాత్యకి కౌరవసేనని కలగించాడు. భూరిశ్రవుడు అతనికి అడ్డు పడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక సాత్యకి పక్కనున్న యోధులు పారిపోతే సాత్యకి కొడుకులు పదిమంది భూరిశ్రవుణ్ణి తమలో ఒకణ్ణి ఎన్నుకుని వాడితో పోరాడమనంటే అతను అందరితో ఒకేసారి పోరుతానని ఆ పదిమందినీ చంపాడు. అదిచూసి బాధతో సాత్యకి భూరిశ్రవుడి మీద దూకి అతని గుర్రాల్ని సారథిని చంపితే భూరిశ్రవుడూ అదేపని చేశాడు. ఇద్దరూ కత్తులు పట్టి కిందికి దూకి తలపడబోతుంటే సాత్యకిని భీముడు భూరిశ్రవుణ్ణి దుర్యోధనుడు వాళ్ల రథాల మీద దూరంగా తీసుకెళ్ళారు.

ఇంకో వంక అర్జునుడు కౌరవసేనని నాశనం చేస్తున్నాడు. దుర్యోధనుడు అరవై ఐదు వేల రథాల్ని అతని మీదికి పురికొల్పితే అతను వాటన్నిటినీ నుగ్గు చేశాడు. ఇంతలో సూర్యాస్తమయం కావొచ్చింది. “జంతువులన్నీ అలిసిపోయి కనిపిస్తున్నయ్, ఇవాల్టికి యుద్ధం ఆపుదాం” అని నీ తండ్రి ద్రోణాదులకు చెప్పి సేనల్ని మరలించాడు.

ఆరవ రోజు.


పొద్దున్నే అర్జునుడు సేనాపతిని రప్పించి మకరవ్యూహం పన్నమని చెప్పాడు. అదిచూసి భీష్ముడు దానికి ప్రతిగా క్రౌంచవ్యూహం కట్టాడు. రెండుసైన్యాలు ఎదురుగా నడిచినై. అసహనంగా భీముడు కౌరవవ్యూహం వైపుకి దూసుకుపోయాడు. ఎదురుగా వున్న కౌరవసేన భయపడి తప్పుకుని అతనికి దారిస్తుంటే ద్రోణుడు కోపంతో భీముడి మీద బాణాలేశాడు. భీముడతని సారథిని చంపాడు. ద్రోణుడు రథం తనే తోలుకుంటూ పాండవవ్యూహం వైపుకి కదిలాడు. భీష్ముడతనికి బాసటగా కలిశాడు.

ఇటు భీమవిక్రమానికి కౌరవసేన కకావికలైంది. దుర్యోధన ధర్మజులిద్దరూ తమ సేనల్ని కూడగట్టి ప్రోత్సహిస్తే రెండు సైన్యాలు తలపడినయ్. నీకొడుకులు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్మదుడు, దుస్సహుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్ముడు, దుష్కర్ణుడు ఒకేచోట కనపడేసరికి భీముడు ఉత్సాహంగా వాళ్లని తాకాడు. నీకొడుకులు కూడ భీముడిప్పుడు ఒంటిగా దొరికాడు వీణ్ణి వదలకూడదని చుట్టుముట్టారు. దానికి భీముడు ఆనందపడి తన సారథిని రథాన్ని ఒక పక్కన నిలబెట్టి ఉండమని చెప్పి గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు గదతో కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని మోదుతూ వీరవిహారం చేస్తుంటే దూరాన ద్రోణుడితో యుద్ధం చేస్తున్న ధృష్టద్యుమ్నుడు అది మాని భీముడున్న వైపుకి వచ్చాడు. ఐతే అక్కడతనికి భీముడి రథం మాత్రమే కనిపించటంతో ఒక్కసారిగా దుఃఖంతో వణికే గొంతుతో “భీముడికి ఏమన్నా ఐతే నా ప్రాణాలుండవు, ఎక్కడ భీముడు?” అని అతని సారథిని అడిగాడు. సారథి మాటలకి ఊరట పొంది, పీనుగులే తనకు భీముడున్న వైపుకు దారి చూపుతుంటే వెళ్లి నీకొడుకుల్ని ఎదుర్కున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అందర్నీ పిలిచి బిగ్గరగా “వీణ్ణీ వదలొద్దు, చంపండి” అనరిచాడు. వాళ్లంతా ధృష్టద్యుమ్నుడి మీదికి దూకారు. అతను ప్రమోహన బాణంతో వాళ్లని నిశ్చేష్టితుల్ని చేశాడు. భీముడు దాహం వేస్తుంటే వెళ్లి ఒక మడుగులో దప్పితీర్చుకున్నాడు.

అక్కడ ధృష్టద్యుమ్నుడు తప్పుకున్నాక ద్రుపదుడు ద్రోణుడితో తలపడ్డాడు. కాని ద్రోణుడి ధాటికి నిలవలేక పారిపోయాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడు వెళ్లిన వంక బయల్దేరాడు. దార్లో నిశ్చేష్టులై వున్న వాళ్లకి వినుతప్రజ్ఞా బాణంతో తెలివి తెప్పించి అందరూ కలిసి భీమ ధృష్టద్యుమ్నుల మీదికి కదిలారు. ఇదిచూసి ధర్మరాజు ఐదుగురు కేకయుల్ని, ద్రౌపదేయుల్ని, ధృష్టకేతుణ్ణి పిలిచి మీరు అభిమన్యుణ్ణి ముందుంచుకుని వాళ్లకి తోడుపడమని పంపించాడు. ఆ పన్నెండుమందీ వెళ్లి భీముడి దగ్గరకి చేరారు. ఇంకా ఇలా నేల మీదే నిలబడి యుద్ధం చెయ్యడం బాగుండదు, రథం ఎక్కమని భీముణ్ణి పంపాడు ధృష్టద్యుమ్నుడు.

ద్రోణుడు పాండవసైన్యం మీద విరుచుకుపడుతుంటే అతన్నెదుర్కున్నాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణుడతన్ని ముప్పుతిప్పలు పెట్టి రథం నుగ్గుచేస్తే అభిమన్యుడి రథం ఎక్కాడు. ఇంతలో ఇంకొక సారథి తెచ్చిన రథం మీద ఎక్కి మళ్లీ ద్రోణుడితో తలపడ్డాడు. భీముడు కూడ తన రథం ఎక్కి దుర్యోధనుడి మీద బాణాలేశాడు. ఐతే దుర్యోధనుడు తన తమ్ముల్తో కలిసి భీముణ్ణి పట్టుకుందామని చుట్టుముట్టాడు కాని అభిమన్యుడు, తక్కిన పాండవకుమార వర్గం వాళ్ల మీద దాడి చేశారు. తట్టుకోలేక నీ కొడుకులు పారిపోతే వాళ్లందర్నీ ఒకేసారి చంపే అవకాశం పోయిందని భీముడు బాధపడ్డాడు. అదిచూసి దుర్యోధనుడు భీముడితో తలపడ్డాడు. వికర్ణుడు, చిత్రసేనుడు అభిమన్యుడితో పోరాడారు. అభిమన్యుడు వికర్ణుడి రథం విరగ్గొడితే వాడు చిత్రసేనుడి రథం మీదికి దూకి ఇద్దరూ కలిసి అక్కణ్ణుంచి తప్పుకున్నారు. ద్రౌపదేయులు దుర్యోధనుడి మీద బాణాలు విసిరారు.

మరోవంక భీష్ముడు పాండవవ్యూహంలోకి చొచ్చుకుపోయి వీరవిహారం చేస్తుంటే అర్జునుడతనికి అడ్డుపడ్డాడు. ఇద్దరికీ ఘోరసమరం జరిగింది. ఇంతలో మధ్యాన్నం అయింది.

భీముడెలాగైనా సరే ఇవాళే దుర్యోధనుణ్ణి చంపాలని అతని మీద అనేక బాణాలు ప్రయోగించి గాయపరిచాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. అదిచూసి సైంధవుడు తన సైన్యంతో వచ్చి భీముణ్ణి చుట్టుముట్టాడు. కృపుడు దుర్యోధనుణ్ణి తన రథమ్మీద దూరంగా తీసుకుపోయాడు. అభిమన్యుడు తదితరులు సైంధవుడితో తలపడ్డారు. అప్పుడు నీకొడుకులు అభిమన్యుడి మీదికి దూకితే వాళ్లకి సాయం చెయ్యటానికి అదివరకు విరథుడై పారిపోయిన వికర్ణుడు తిరిగొచ్చి అభిమన్యుడిని ఎదుర్కున్నాడు. అభిమన్యుడతన్ని నానాబాణాల్తో హింసించాడు. అదిచూసి మిగిలిన వాళ్లంతా అభిమన్యుడి మీదికి వెళ్తుంటే ద్రౌపదేయులు అతనికడ్డంగా వాళ్లతో తలపడ్డారు. ముఖ్యంగా నకులుడికొడుకు శతానీకుడు వీరవిక్రమంతో పోరాడాడు. రెండోవంక భీష్ముడు ప్రళయకాల కాలుడిలా పాండవబలాల్ని పరుగులు తీయించాడు. సాయంత్రమైంది. తన బలాల్ని మళ్లించుకుని శిబిరం దారి పట్టాడు భీష్ముడు.

ఏడవరోజు

ఏడవరోజు యుద్ధానికి కౌరవసేనని మండలవ్యూహంగా దిద్దాడు భీష్ముడు. అదిచూసి వజ్రవ్యూహం కల్పించమని ధర్మజుడు తన సేనాపతికి చెప్పాడు. రెండు సైన్యాలు ఆవేశంగా రెండోవైపుకు దూసుకుపోయినయ్.

ద్రోణుడు విరాటునితో, అశ్వత్థామ శిఖండితో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో, శల్యుడు కవలల్తో, విందానువిందులు యుధామన్యునితో, అనేకమంది రాజులు అర్జునుడితో తలపడ్డారు. అలాగే భీముడూ కృతవర్మ, అభిమన్యుడూ చిత్రసేన దుశ్శాస వికర్ణులు, ఘటోత్కచుడూ భగదత్తుడు, సాత్యకీ అలంబుసుడు, ధృష్టకేతుడూ భూరిశ్రవుడు, చేకితానుడూ కృపాచార్యుడు, ధర్మజుడూ శ్రుతాయువు, ఎంతోమంది రాజులూ భీష్ముడు జతలుగా పోరసాగారు.

“భీష్ముడి వ్యూహాన్ని చూసుకుని మురిసిపోతూ భయంలేకుండా వీళ్లు మనమీదికి ఎలా వచ్చారో చూశావా, వీళ్ల సంగతి చూస్తా చూడు” అంటూ అర్జునుడు తననెదిరించిన వారి మీద అమ్ములు కురిశాడు. వాళ్ళూ ఒక్కుమ్మడిగా అతని మీద దూకితే కోపంతో అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అది వాళ్లు వేసిన బాణాల్ని నాశనం చేసి, వాళ్లకి గాయాలు చేసి, గజహయాల్ని కూల్చి భీభత్సం సృష్టిస్తే ఆ రాజులు పారిపోయి తమతమ సైన్యాల వెనక దాక్కున్నారు. అది చూసి దుర్యోధనుడు, “నా ఎదుటనే మీరిలా పారిపోయి దాక్కోవటం ధర్మం కాదు. ఒక్కడే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. అతనికి సాయం చెయ్యండి వెళ్లి” అని గద్దిస్తే అప్పుడు భీష్ముడి చుట్టుపక్కల చేరారు వాళ్లు.

ఒకవంక ద్రోణుడు విరాటుడితో తలపడి అతని రథాన్ని విరిస్తే అతని కొడుకు శంఖుడి రథం ఎక్కి తండ్రీ కొడుకులు ద్రోణుడి మీద బాణాలేశారు. ద్రోణుడు కోపించి వేసిన దొడ్డనారసం శంఖుడి వక్షాన దూరి వెనగ్గా బయటికొచ్చింది. వాడు పైలోకాలకి పోయాడు. అదిచూసి విరాటుడు, అతనితో పాటే అతని సైన్యమూ పారిపోయినయ్.

శిఖండి అశ్వత్థామతో పోరాడు. ఐతే అశ్వత్థామ అతని విల్లూ రథమూ విరిస్తే పలకా వాలూ తీసుకుని కిందికి దూకాడు. అశ్వత్థామ అవీ విరిస్తే శిఖండి సాత్యకి రథం ఎక్కాడు. ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణపరంపరలు వేశాడు. అతని విల్లుని తుంచాడు. నీ కొడుకు ఇంకో విల్లందుకునే లోగా అతని రథాన్ని విరిచాడు. కత్తితో అతను కిందికి దూకితే సౌబలుడు వేగంగా వచ్చి తన రథం మీద ఎక్కించుకుపోయాడు. సాత్యకి అలంబుసుడి మాయని ఇంద్రాస్త్రంతో మాయంచేసి వాణ్ణి గగ్గోలుపెడితే వాడు పారిపోయాడు. సాత్యకి సింహనాదం చేశాడు. కృతవర్మ భీముడితో తలపడితే అతను సారథిని రథాన్ని బాణాల్తో పడేసి కృతవర్మ ఒంటినిండా బాణాలు నాటాడు. ఏదుపందిలా నడుస్తూ అతను నీ బావమరది వృషకుడి రథం మీదికి ఎక్కాడు.

భగదత్తుడు తన ఏనుగుతో పాండవసేనని వేటాడుతుంటే ఘటోత్కచుడతన్ని ఎదుర్కున్నాడు. ఐతే అతను ఘటోత్కచుడి మాయల్ని పటాపంచలు చెయ్యటమే కాక వాడి మీద అనేక బాణాలు వేశాడు. ఆ ధాటికాగలేక వాడు పారిపోతే భగదత్తుడు వాడి బలాన్ని నాశనం చేశాడు.

శల్యుడి మీద అతని మేనల్లుళ్లు శరవృష్టి కురిశారు. అతనూ కోపంగా వాళ్లని నొప్పించాడు. సహదేవుడు వేగంగా వేసిన ఒక బాణం అతని వక్షం నుంచి దూసుకుపోయి రక్తస్పర్శ లేకుండానే వెనగ్గా బయటికొచ్చింది. అతను చచ్చినట్టు మూర్ఛపడటం, అతని సారథి వేగంగా అక్కణ్ణుంచి దూరంగా నడపటం జరిగిపోయినయ్.

చేకితానుడు కృపుడితో పోరాడు. ఇద్దరూ భీషణంగా యుద్ధం చేసి చివరికి కత్తుల్తో కిందికి దూకి పొడుచుకుని మూర్ఛపోయారు. వాళ్లని వాళ్ల పక్కల వాళ్లు పక్కకి తీసుకుపోయారు. దుశ్శాసన వికర్ణ చిత్రసేనుల్తో అభిమన్యుడికి పెద్దయుద్ధమయింది. ఐతే భీముడి ప్రతిజ్ఞల మూలాన అతను వాళ్లని చంపకుండా వదిలాడు. అప్పుడు భీష్ముడు అనేకమంది రాజుల్తో ఆ అభిమన్యుడి మీద తలపడ్డాడు. అదిచూసి అర్జునుడు అటు రథం తోలమన్నాడు. అలా వెళ్తుంటే త్రిగర్తుడు సుశర్మ అతన్ని అడ్డుకున్నాడు. అర్జునుడు అతన్నీ అతని సైన్యాన్నీ తిప్పలు పెట్టాడు. అతని రథరక్షకులు ముప్పైరెండు మంది కమ్ముకుంటే అర్జునుడు చిరునవ్వుతో వాళ్లందర్నీ కడతేర్చాడు.

ఒకపక్క భీష్ముడు ధర్మజుడి విల్లుని విరిచితే కోపంతో భీముడు గదతీసుకుని దుర్యోధనుడి మీదికి పరిగెత్తాడు. అతనికి సైంధవుడు అడ్డం పడ్డాడు. చిత్రసేనుడు భీముడి మీద బాణాలేస్తే అతను కోపంతో గద విసిరాడు. అది ఎవరి మీద పడుతుందోనని నీవైపు రాజులు భయపడి పరిగెత్తారు, రారాజుని తల్చుకున్నవాడే లేడు. చిత్రసేనుడు రథం మీంచి దూకుతుండగా ఆ గదపడి అతని రథం నుగ్గయ్యింది. వికర్ణుడతన్ని తన రథమ్మీద ఎక్కించుకున్నాడు. మరోచోట భీష్ముడు అన్నిదిక్కుల తానే ఐ వీరవిహారం చేశాడు. సూర్యాస్తమయం అయింది.

ఎనిమిదవ రోజు


కురుపితామహుడు కూర్మవ్యూహంతో సన్నద్ధమైతే ధర్మజుడు దానికి సరైన ప్రతివ్యూహం చెయ్యమని తన సేనాపతికి చెప్పాడు. అతను శృంగాటకవ్యూహం పన్నాడు. రెండు సైన్యాలు మోహరించి ఉత్సాహంగా తలపడినై.

నీ తండ్రి వీరరూపంతో పాండవబలం వైపుకి కదిల్తే భీముడు తప్ప మిగిలిన వాళ్లంతా పక్కకి తప్పుకున్నారు. భీముడు సారథిని చంపటంతో భీష్ముడి రథాశ్వాలు దాన్ని లాక్కుని పరిగెత్తినయ్. నీ కొడుకు సునాభుడు భీముణ్ణి ప్రతిఘటించాడు. భీముడు ప్రళయకాలాంతకుడిలా వాడి తల నరికేశాడు. దాంతో నీకొడుకులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాశి, పండితకుడు, కుండధారుడు, విశాలాక్షుడు, మహోదరుడు ఒక్కసారిగా భీముడి మీద దాడిచేశారు. భీముడు భీకరాకారంతో ఆ ఏడుగుర్నీ యమపురికి పంపాడు. అదిచూసి మిగిలిన నీకొడుకులు భయంతో దాక్కున్నారు.

దుర్యోధనుడు తన చుట్టూ వున్న వీరుల్ని భీముడి మీద కలబడమని పంపి శోకగద్గద కంఠంతో భీష్ముడితో “ఇలా భీముడు నా తమ్ముల్ని చంపుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావ్, అందరూ ఒకేసారి చావాలని ఎదురుచూస్తున్నావా ఏమిటి?” అని నిష్టూరాలాడాడు. అతను బాధపడి, “నేనూ, ద్రోణుడు, విదురుడు నీకు ముందే చెప్పాం ఇలా జరగబోతుందని. విన్నావా? నీ తమ్ముళ్లలో ఒకసారి భీముడి చేతికి చిక్కిన వాళ్లని కాపాట్టం ఎవరివల్లౌతుంది? వీరస్వర్గం కోసం పోరాడుతున్నాం అందరం. గెలుపోటములు దైవాధీనాలు. మన ప్రయత్నలోపం లేకుండా మన ధర్మం నిర్వర్తిస్తున్నాం. గెలుపొస్తే వద్దంటామా?” అని రౌద్రాకారంతో భీముడితో తలపడ్డాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి వచ్చి అతనితో పోరాడారు. దుర్యోధనుడు పంపగా వచ్చిన రథికుల్ని చేకితానుడు, ద్రౌపదేయుల్తో కలిసి అర్జునుడు ఎదుర్కున్నారు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కౌరవసేన మీదికి లంఘించారు. ఇలా మూడు యుద్ధరంగాల్లో పోరు సాగింది.

ద్రోణుడు ద్రుపదుడి సైన్యం మీద కాలుదువ్వాడు. అంతలో ఉలూచీ అర్జునుల కొడుకు ఇరావంతుడు గుర్రపుసేనతో కౌరవసైన్యంలోకి చొచ్చుకుపోయాడు. శకుని ఆరుగురు తమ్ములు అతన్ని పొదివి బాణవర్షం కురిపించారు. గాయాలైన అతని గుర్రం పడిపోతే ఏమాత్రం తొణక్కుండా కత్తితో కిందికి దూకి ఘోరయుద్ధం చేశాడు. శకుని తమ్ములూ కిందికి దిగి అతనితో తలపడ్డారు. అతనా ఆరుగుర్నీ పన్నెండు ముక్కలుగా నరికాడు. అదిచూసి దుర్యోధనుడు అలంబుసుణ్ణి అతని మీదికి పంపాడు. వాడి మాయాజాలంతో ఇరావంతుడి గుర్రపుసైన్యం మాయమైంది. అలంబుసుడు ఆకాశానికెగిరితే ఇరావంతుడూ ఎగిరి వాణ్ణి తన కత్తితో ఖండించాడు. ఐతే ఆ రాక్షసుడు సరికొత్త రూపంతో మళ్లీ యుద్ధం సాగించాడు. ఇరావంతుడు శేషుడి ఆకారంలో నాగబాణాలు వేస్తే వాడు గరుత్మంతుడి రూపంలో వచ్చి నాగబాణాల్ని మింగి కత్తితో అతని తల నరికాడు.

సోదరుడు ఇరావంతుడి తల అలా ఇల పడటం చూసి ఘటోత్కచుడు అపరకాలుడిగా కౌరవసేన మీద విరుచుకుపడ్డాడు. గజాల్ని, అశ్వాల్ని, రథాల్ని, రథికుల్ని అదీ ఇదీ అని చూడకుండా నాశనం చేశాడు. దుర్యోధనుడి మీదికి దూకి అతన్ని చంపటానికి శక్తి ఎత్తితే వంగరాజు అతనికి అడ్డుపడ్డాడు. ఆ శక్తితో వాడి ఏనుగు చచ్చింది. వాడు నేల మీద పడ్డాడు. ఐతే దుర్యోధనుడు ఒక్కడే ఘటోత్కచుడికి ఎదురు నిలిచి వాడి మీద ఒక మహాస్త్రం వేశాడు. దాన్ని దార్లోనే నరికి వాడు సింహనాదం చేస్తే అది విని భీష్ముడు రారాజుకి రక్షణగా వెళ్లమని కేక వేస్తే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు – ఇలా ఎంతోమంది దొరలు అటువైపుకు పరిగెత్తి ఘటోత్కచుడితో తలపడ్డారు. అలా అంతమంది రథికులు ఒక్కసారి కమ్ముకునే సరికి ఆగలేక ఆ రాక్షసుడు ఆకాశాని కెగిరాడు.

అదిచూసిన ధర్మరాజు భీముడితో, “ఇక్కడ భీష్ముడిని ఆపటానికి అర్జునుడున్నాడు. అక్కడ ఘటోత్కచుడికి సాయంగా నువ్వు త్వరగా వెళ్లు” అనటంతో వేగంగా భీముడక్కడికి తరలాడు. ఒక అర్థచంద్రాకార బాణంతో దుర్యోధనుడు భీముడి వింటిని విరిచి మరో పదునైన బాణం అతని వక్షాన నాటాడు. ఆ దెబ్బకి భీముడు తూలాడు. అది చూసి పాండవకుమారగణం నీ కొడుకు మీద కోపంతో దూకారు. కృప బాహ్లికాదులు వాళ్లనెదుర్కున్నారు. ద్రోణుడొక బాణంతో భీముణ్ణి రక్తపరిషిక్తుణ్ణి చేస్తే భీముడు రౌద్రంగా వేసిన బాణంతో ద్రోణుడు మూర్ఛపోయాడు. దుర్యోధన, అశ్వత్థామలు భీముడి మీదికి దూకారు. ఇంతలో ద్రోణుడు తెలివికి వచ్చాడు. అతనూ కృపుడూ భీముణ్ణి చుట్టుముడితే అభిమన్యుడు, ద్రౌపదేయులు వాళ్లని అడ్డగించారు.

ఇంతలో అనూప రాజు, భీముడి మిత్రుడు నీలుడు అశ్వత్థామతో యుద్ధంలో గాయపడితే ఘటోత్కచుడు అశ్వత్థామతో తలపడితే కొడుక్కి సాయంగా ద్రోణుడూ అతని మీద బాణాలేశాడు. కోపంతో ఘటోత్కచుడు మాయ పన్నాడు. దానివల్ల దుర్యోధనుడు, ద్రోణుడు, అక్కడున్న ఇతర కౌరవరథికులు నెత్తుటిమడుగుల్లో పడివున్నట్టు కౌరవసేనకి తోచి అందరూ హాహాకారాలు చేస్తుంటే భీష్ముడు వచ్చి అది మాయే కాని నిజం కాదని ఎంతచెప్పినా వినక సైన్యం కకావికలైంది. దుర్యోధనుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్లి నిష్టూరాలాడాడు. అతను భగదత్తుణ్ణి పిలిచి, “నీకు రాక్షసుల మాయలు అంటవు కనక వెళ్లి ఈ ఘటోత్కచుడితో పోరాడు” అని చెప్పాడు. ఆ భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుతో పాండవసేనని నుగ్గుచేశాడు. అభిమన్యుడు, ద్రౌపదేయులు అనేక బాణాల్తో దాన్ని నొప్పిస్తే అది పాండవబలమ్మీదికే పరిగెత్తి అనేక గుర్రాల్ని సైన్యాల్ని చంపింది.

భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం గురించి చెప్పాడు. అది విని దుఃఖించాడర్జునుడు. అతని శవం ఎక్కడో చూపించు అని అర్జునుడక్కడికి వెళ్లి కొడుకుని తలుచుకుని రోదించాడు. అది చూసి కృష్ణుడు “ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఇంతలోనే మర్చిపోయావా?”అన్నట్టు చిరునవ్వు నవ్వాడతన్ని చూసి. “నువ్వు చెప్పిన మాటలు మర్చిపోలేదు, పద యుద్ధం చేద్దాం” అని అర్జునుడక్కణ్ణుంచి బయల్దేరాడు. మళ్ళీ పోరు ఘోరమైంది. ద్రోణుడు భీముడితో యుద్ధంచేస్తుంటే అతని రక్షణలో వుండి భీముణ్ణి మర్దించొచ్చని నీకుమారులు కొందరు భీముడితో యుద్ధానికి తగులుకున్నారు, ఐతే అతను ఎన్నో బాణాలు తగిలినా లెక్కచెయ్యక నీకొడుకులు గుండభేది, అనాధృష్యుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనులని దీర్ఘనిద్రకి పంపాడు.

చీకటి పడటంతో సేనలు వెనక్కి మళ్లినయ్.

శిబిరానికి వెళ్తూ దుర్యోధనుడు వెంటనే కర్ణ శకునుల్ని రప్పించమని దుశ్శాసనుడికి చెప్పాడు. ఆ ముగ్గురితో దుర్యోధనుడు “భీష్మ ద్రోణ అశ్వత్థామలు మధ్యస్తులై వుండి పాండవబలమ్మీద గట్టిగా పోరాడటం లేదు. మన బలాలు రోజురోజుకీ చచ్చి సన్నగిల్లుతున్నయ్. ఇప్పుడు ఏమిటి మన కర్తవ్యం?” అనడిగాడు. రణోత్సాహంతో కర్ణుడు “భీష్ముణ్ణి తప్పించు. నేను యుద్ధంలో దూకి పాండవబలం అంతం చూస్తా” అన్నాడు. “ఐతే నేను తాతతో మాట్లాడతా” అని చెప్పి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని మణిఖచిత రథమ్మీద భీష్ముడి శిబిరానికి చేరాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడితో. తాత అనుమతితో లోపలికి వెళ్ళి చేతులు మోడ్చి “నువ్వు మనసు పెట్టి యుద్ధం చెయ్యనందువల్ల ఎనిమిది రోజులైనా పాండవసైన్యానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. ఇదంతా ఎందుకు, నువ్వు యుద్ధం నుంచి తప్పుకుని కర్ణుణ్ణి రప్పించు” అన్నాడు. ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటే భీష్ముడు అత్యంత విషాదంతో కొంచెం సేపు మౌనంగా వుండిపోయాడు. “నీకోసం ఓపిక కొద్దీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి లేకుండా యుద్ధం చేస్తుంటే నువ్విలా అనటం భావ్యమా? ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసినట్టేనా? అర్జునుడు ఎంత వీరుడో నీకు తెలియంది కాదు. ఐనా ఈ యుద్ధం తెచ్చిపెట్టుకున్నావ్. ఒకటి చెప్తా విను. అర్జునుడిని, శిఖండిని నేను గెలవలేను. ద్రుపద, విరాట, యాదవ సైన్యాల్ని మట్టిగరిపిస్తా. పాండవుల సంగతి మీరు చూసుకోండి. అర్థరాత్రి వచ్చి కష్టం కలిగించే మాటలంటే గెలుపు వస్తుందా? వెళ్లు. రేపు నా పరాక్రమాన్ని చూద్దువు గాని” అని పంపాడు.

తొమ్మిదవ రోజు


సముచిత సమయానికి లేచి యుద్ధానికి బయల్దేరాడు నీ పెద్దకొడుకు. భీష్ముణ్ణి చూపిస్తూ మిగతా రాజులతో అన్నాడూ, “ఇతనివాళ పాంచాలాది బలగాల్ని చంపి పాండవుల్ని ఓడిస్తానని నాతో రాత్రి చెప్పాడు. కాబట్టి మనందరం మన బలం, శౌర్యం చూపించాలి” అని. దాంతో భీష్ముడికి చీదర కలిగిందతని మీద. ఐనా తమాయించుకున్నాడు. అది గమనించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో “మనం అంతా తాతతోనే వుందాం, ఇరవై రెండు వేల రథాల వాళ్లని అతని ముందు పెట్టించు” అని చెప్పాడు. అతనలాగే చేశాడు. అలాగే ద్రోణ, కృప, అశ్వత్థామల్తో “ఆ నీచుడు శిఖండికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన దొరక్కుండా మీరంతా కాపాడాలి” అని చెప్తే వాళ్లు అందుకు సిద్ధమయారు. భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. అదిచూసి అర్జునుడు ధృష్టద్యుమ్నుడితో, “భీష్ముడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టు. మనం అందరం కలిసి భీష్ముణ్ణి చుట్టుముట్టేట్టు వ్యూహం తయారుచెయ్యి” అంటే అతను అలాగే చేశాడు. ఇలా సన్నద్ధమై రెండూ సైన్యాలూ పోరుకు తలపడినయ్.

ముందుగా అభిమన్యుడు దూదిమీదికి దూకే అగ్నిలాగా మన బలగాల మీదికి దూకాడు. మన వ్యూహం చెల్లాచెదురయింది. దుర్యోధనుడు అలంబుసుణ్ణి పిలిచి “నువ్వు తప్ప ఇప్పుడు వీణ్ణి ఆపగలిగే వాడు మన సేనలో లేడు. నువ్వు వాడి సంగతి చూడు, మేం పాండవులకి అడ్డుపడతాం” అని అభిమన్యుడి మీదికి పంపాడు. ఐతే వాడికి అడ్డంగా ద్రౌపదేయులు వచ్చి వాణ్ణి ఎదుర్కున్నారు. ఇరువైపులకీ ఘోర యుద్ధం జరిగింది. అలంబుసుడు ఆ ఐదుగురి ధాటికి సొమ్మసిల్లి తూలి జెండాకొయ్య పట్టుకు నిలబడ్డాడు. అంతలోనే తేరుకుని వాళ్ల విల్లులని విరిచి, ఒక్కొకర్ని ఐదైదు బాణాల్తో నొప్పించాడు. సోదరుల్ని అలా గాయపరుస్తున్న అలంబుసుడితో అభిమన్యుడు తలపడ్డాడు. మిగిలిన వాళ్లంతా యుద్ధం మాని వాళ్లిద్దరి పోరు చూస్తున్నారు. అలంబుసుడు మాయల్లో అసాధ్యుడు, అభిమన్యుడా అస్త్రవిద్యలో అఖండుడు, వీళ్లిద్దరి యుద్ధం ఏమౌతుందో అని అంతటా కుతూహలం. అలంబుసుడి మాయల్ని అవలీలగా పటాపంచలు చేస్తూ అభిమన్యుడు వాడి ఒళ్లంతా తూట్లు కొడితే వాడు రథాన్నొదిలి కాలికొద్దీ పరిగెత్తాడు.

అది చూసి అనేకమంది రథికుల్తో వచ్చి భీష్ముడు అభిమన్యుడితో తలపడ్డాడు. ఐతే అతను ఏమాత్రం తొణక్కుండా అందరికీ అన్ని రూపులై యుద్ధం సాగిస్తుంటే అర్జునుడు వచ్చి భీష్ముడి మీదికి దూకాడు. అభిమన్యుడి మీదికి పోబోతున్న కృపుడి మీద సాత్యకి బాణాలు కురిపిస్తే వాటిని అశ్వత్థామ మద్యలోనే తుంచి, అలాగే సాత్యకి విల్లుని కూడ విరిచాడు. అతను కోపించి ఇంకో వింటిని తీసుకుని ఒక నిశితబాణంతో కొడితే అశ్వత్థామకి మూర్ఛ వచ్చి సిడం పట్టుకుని ఒరిగాడు. కాని అంతలోనే తెలివి తెచ్చుకుని తనూ ఒక పదునైన బాణంతో సాత్యకి వక్షాన్ని మోదాడు. దాంతో వీరోద్రేకంతో సాత్యకి అతన్ని అనేక బాణాల్తో కప్పేశాడు. అదిచూసి పరుగున వచ్చి ద్రోణుడు సాత్యకి మీదికి వెళ్తుంటే అర్జునుడు ద్రోణుడితో తలపడ్డాడు.

అది విని, “సంజయా, ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ద్రోణుడికి అర్జునుడంటే బహుప్రీతి. అర్జునుడికీ ద్రోణుడి మీద గొప్ప గౌరవం, భక్తి. మరలాటి వాళ్లు ఒకరితో ఒకరు యుద్ధం ఎలా చేశారో!” అన్నాడు ధృతరాష్ట్రుడు. “క్షాత్రానికి పూనుకుని యుద్ధానికి వచ్చాక గురువులు, చుట్టాలు అని చూస్తారా? యుద్ధం చెయ్యటం తప్ప మార్గం లేదు” అని కథ చెప్పటం సాగించాడు సంజయుడు.

అర్జునుడు ద్రోణుడి మీద అనేకబాణాలు ప్రయోగించాడు. దానికి ఏమాత్రం చెదరకుండా ద్రోణుడు తనూ అన్ని బాణాలతో అర్జునుణ్ణి ముంచెత్తాడు. ఐతే ఇంతలో దుర్యోధనుడు పంపితే వచ్చిన త్రిగర్తులు ద్రోణుణ్ణి దాటి అర్జునుడితో తలపడ్డారు. వాయుబాణంతో అర్జునుడు వాళ్లని ఆపాడు. ద్రోణుడు దాన్ని ఉపసంహరింపజేస్తే అర్జునుడు సుశర్మ కొడుకుల్ని కూల్చాడు. దాంతో దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహ్లికుడు అర్జునుణ్ణి తాకారు. అర్జునుడితో యుద్ధం వాళ్లందరికీ తలమునకలైంది.

మరోవంక భీష్ముడు ధర్మరాజు మీదికి ఉరికాడు. శకుని, భూరిశ్రవుడూ నకుల సహదేవుల్తో తలపడ్డారు. కాళింగుడు, భగదత్తుడు భీముడితో కలబడ్డారు. ఐతే భీష్ముడి దెబ్బకు ధర్మరాజు చాలక అందర్నీ కేకలేసి పిలిస్తే భీముడక్కడికి ఉరుకులు పరుగుల్తో వచ్చాడు. ఈలోపు గానే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు భీష్ముడికి అడ్డుపడి పోరుతున్నారు. శిఖండి తప్ప మిగిలిన వాళ్లందరితో భీష్ముడు అపరరుద్రుడై పోరు సాగించాడు. భీముడటు వెళ్లటం చూసి యాదవ వీరులు, ద్రౌపదేయులు కూడ అక్కడికే చేరితే అదిచూసి మన సైన్యం లోని ముఖ్యమైన వాళ్లందరూ అక్కడికే పరిగెత్తారు. రెండుమూకలకూ రణం దారుణమైంది. దుర్యోధనుడు శకుని దుశ్శాసనుల్ని భీష్ముడికి తోడుగా వెళ్లమని పంపి పదివేల ఆశ్వికబలంతో ధర్మరాజుని ఎదుర్కున్నాడు. ధర్మరాజు, కవలలు ఆ గుర్రపుసేనని చీల్చి చెండాడారు. దాంతో దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్లి దీనంగా ఇప్పుడు నువ్వు తప్ప ఆ ధర్మజుణ్ణి, కవల్ని ఆపేవాళ్లు లేరు అనటంతో అతను వాళ్లమీద విరుచుకుపడ్డాడు. అది గమనించి భీమార్జునులు శల్యుడి మీదికి వస్తే ఇటునుంచి భీష్మద్రోణులు అతనికి తోడుగా వచ్చి చేరారు.

అప్పుడిక భీష్ముడు మధ్యాహ్న సూర్యుడిలా విజృంభించి పాండవులందర్నీ నానా విధాలుగా హింసించాడు. అతన్ని అరికట్టటానికి ఎవరూ సాహసించ లేకపోయారు. కృష్ణుడు ఎంతగా ప్రోత్సహించినా అర్జునుడు కూడ నిరుత్సాహంతో నిలబడ్డాడే కాని దుర్నిరీక్ష్యుడైన తాత వంక చూడలేకపోయాడు. “ఇదివరకు అన్ని బీరాలు పలికి ఇప్పుడిలా నీరసంగా వుంటే ఎలా?” అని కృష్ణుడంటే, “అందర్నీ చంపి రాజ్యం సంపాయించటం అంత ఘనకార్యమా? నా మనసొప్పటం లేదు. సరే, ఐనా రథాన్నటు నడుపు, ఆ భీష్ముడి సంగతి చూస్తా” అన్నాడు అర్జునుడు. భీష్ముడితో తలపడ్డాడు. కాని భీష్ముడు వీరాకారంతో అర్జునుడి అంగాంగాలా అస్త్రాలు గుచ్చి కృష్ణుణ్ణీ, గుర్రాల్నీ కూడ నొప్పించాడు. అర్జునుడు కోపంతో భీష్ముడి విల్లు విరిచాడు. అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని విరిస్తే, ఔరా అర్జునా అంటూ భీష్ముడు ఇంకో విల్లు పుచ్చుకుని వందబాణాలు ఒక్కసారిగా అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ ధాటికి అర్జునుడు తూలుతూ శక్తికొద్దీ యుద్ధం చేస్తుంటే చూసి దారుణరోషంతో కృష్ణుడు పగ్గాల్ని రథమ్మీద పారేసి ములుకోల చేతబట్టి రథం మీంచి కిందికురికాడు.

ధరణీచక్రం తొట్రుపడేట్టు కృష్ణుడలా ఉరికి భీష్ముడి మీదికి వెళ్తుంటే అందరూ గగ్గోలు పడిపోయారు. నీ సేన చెల్లాచెదురయింది. భీష్ముడొక్కడే మనసు చల్లబడగా హాయిగా నవ్వుతూ, “మహాత్మా, త్వరగా రా. ఇంతకన్నా నాకు కావలసిందేముంది? నీ దయవల్ల ఈ లోకంలో కీర్తి, పైలోకంలో సద్గతీ కలగబోతున్నాయి” అంటూంటే అర్జునుడు హడావుడిగా రథం దూకి పరిగెత్తి వెనక నుంచి కృష్ణుడి చేతులు పట్టుకుని వేలాడితే, ఆగకుండా విడిపించుకుని అతను ముందుకు సాగుతుంటే, అర్జునుడు వదలక అతన్ని పట్టుకుని లాగి వేలాడి ఆపి “యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసి ఇలా ఉరకటం నీకు ధర్మమేనా? ఏదో అలిసిపోయి కొంచెంసేపు సరిగా పోరాడలేదు గాని ఇక నా ప్రతాపం చూద్దువు గాని, తిరిగి రా” అని ప్రార్థిస్తే చివరకు వెనక్కు మళ్లాడు కృష్ణుడు. ఐనా భీష్ముడి ఘోరనారాచాల ధాటికి ఎవ్వరూ ఆగలేక బిక్కమొగాల్తో చూస్తుంటే వాళ్ల దైన్యం చూడలేకా అన్నట్టు సూర్యుడు అస్తాద్రికి చేరాడు.

భీష్ముడి చేతిలో దెబ్బలు తిన్న పాండవసేనని చూసి ధర్మరాజుకి గుండె నీరయింది. ఆ రాత్రి తమ్ముల్ని వెంటబెట్టుకుని కృష్ణుడి శిబిరానికి వెళ్లాడు. “ఇవాళ భీష్ముడి యుద్ధం చూస్తే అతన్ని అరికట్టటం మాకు సాధ్యం కాదని తేలిపోయింది. నేను అడవులకి వెళ్లి తపోవృత్తిలో గడుపుతా. అలా చెయ్యటానికి ధర్మవిరోధం కాని మార్గం ఏమిటో బోధించు” అనడిగాడు. “ఇంత దీనత నీకు పనికిరాదు. అవసరమైతే నేను నీకు రాజ్యం సంపాయించి ఇస్తా” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. “యుద్ధం చెయ్యనని నువ్వన్నమాట నీచేత తప్పిస్తానా? ఐనా భీష్ముడు నాకు మేలు చేస్తాడు, రాజ్యం ఇప్పిస్తాడు” అని అంతలోనే, “చూశావా, తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి తనే తండ్రిగా మమ్మల్ని పెంచిన తాతనే చంపాలని ఆలోచిస్తున్నా, ఈ రాజధర్మం ఎంత క్రూరమైంది!” అని నిట్టూర్చాడు. “ఇతనిప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు” అని గ్రహించాడు కృష్ణుడు. “ఇదివరకు మళ్ళీ వద్దువులే అని నీతో అన్నాడు కదా భీష్ముడు? కనక అదే కర్తవ్యం. మనందరం అతని దగ్గరికి వెళ్లి అతన్ని చంపే మార్గం అడుగుదాం. ఇప్పుడు తప్పక చెప్తాడు” అని కర్తవ్యం బోధించాడు. సౌమ్య వేషాలు ధరించి అందరూ అతి రహస్యంగా భీష్ముడి మందిరానికి వెళ్లి అమితభక్తితో అతని పాదాలకి నమస్కరించారు.

భీష్ముడు ఆదరంగా పేరుపేరునా అందరి క్షేమాలు అడిగి కనుక్కున్నాడు. “ఇక్కడికి మీరు వచ్చిన పనేమిటి? ఏం కావాల్సినా అడగండి, తప్పక చేస్తా” అన్నాడు. ధర్మరాజు దీనంగా ఇలా అన్నాడు – “ఇంకా సైన్యం ఎక్కువగా చావకుండా మాకు రాజ్యం దక్కే మార్గం ఉపదేశించు”. “నేను యుద్ధం చేస్తుంటే నీకు సైన్యక్షయమూ తప్పదూ, రాజ్యమూ రాదు. కాబట్టి నన్ను ఓడించటమే మార్గం” అన్నాడు భీష్ముడు. “మూడో కన్ను మూసి, చేతి త్రిశూలం దాచి, వచ్చిన రుద్రుడిలా నువ్వు యుద్ధం చేస్తుంటే నిన్ను ఓడించటం ఏ మగవాడి వల్ల ఔతుంది? నీ దయ ఉంటే తప్ప నిన్ను గెలవలేం” అన్నాడు ధర్మరాజు. “నువ్వన్నది నిజం. నేను, పుట్టినప్పుడు కాకుండా మధ్యలో మగవాడైన వాడితో యుద్ధం చెయ్యను. శిఖండి అలాటి వాడు. కాబట్టి వాణ్ణి ముందుంచుకుని అర్జునుడు నన్ను నొప్పించి పడెయ్యాలి. అలా చెయ్యండి. మీకు నా ఆశీస్సులు” అని వాళ్లని దీవించి పంపాడు భీష్ముడు.

దారిలో అర్జునుడు భీష్ముడలా చావుకి సిద్ధం కావటమూ ఆ నీచపు పని తన చేతి మీదగా చెయ్యాల్సి రావటమూ తల్చుకుని బాధపడుతూ కృష్ణుడితో అన్నాడు – “గురువు, మహాజ్ఞాని, ధర్మపరుడు, వయోవృద్ధుడు, దయావంతుడైన తాతని ఇలా వంచనతో చంపటం నా వల్ల కాదు. చిన్నప్పుడు మట్టికొట్టుకుని వున్న నన్ను ఎత్తుకుని ఆ మట్టంతా తన బట్టలకు అంటుకుంటున్నా పట్టించుకోకుండా కౌగిలించుకుని మా తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. తండ్రి చనిపోయినప్పటినుంచి పెంచిన మహాభుజశాలిని అధర్మంగా చంపేంత క్రూరులా పాండవులు?” దానికి కృష్ణుడు, “నువ్వు రాజధర్మం మరిచిపోతున్నావు. అదిగాక భీష్ముణ్ణి చంపుతానని ఇదివరకు అన్నావు గుర్తులేదా? ఆ మాట నిలబెట్టుకోవటం నీ ధర్మం కాదా?” అన్నాడు. “ధృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణ సంహారానికని అంటారు. అతను భీష్ముణ్ణి కూడ చంపగలడు. ఈ పనీ అతనికే అప్పగిద్దాం. అతనికి అడ్డం వచ్చిన వాళ్ల సంగతి నేను చూస్తా” అని తప్పించుకో చూస్తే నవ్వి కృష్ణుడు “నువ్వు తప్ప అంతటి పరాక్రమశాలిని చంపగలిగే వాడు ఇంకెవడూ లేడు. నీకు వేరే దారి లేదు” అని నచ్చ చెప్పాడు. చివరికి “అప్పటికి ఎలా కావాల్సుంటే అలా ఔతుందిలే” అని మెత్తబడ్డాడు అర్జునుడు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

పదవ రోజు

సూర్యోదయ సమయం. పాండవులు అమితోత్సాహంతో యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ముందుగా శిఖండి. అతనికి రెండుపక్కల భీమార్జునులు. వెనక అభిమన్యుడు, ద్రౌపదేయులు. వాళ్లకి రెండు వైపుల చేకితానుడు, సాత్యకి. వాళ్ల దగ్గర్లో ధృష్టద్యుమ్నుడు, ఇతర పాంచాల రాకుమారులు. వాళ్ల వెనక ధర్మరాజు. అతనికి పక్కల కవలు. వీళ్ల సైన్యాల్ని పొదువుకుని విరాటుడు, ద్రుపదుడు, కేకయపంచకం, ధృష్టకేతుడు.

మనవైపు ముందుగా భీష్ముడు. అతని చుట్టూ నీ కొడుకులు. ద్రోణుడు, అశ్వత్థామ వాళ్లకి ఇరుపక్కల. కృపుడు, కృతవర్మ, భగదత్తుల్తో మధ్యలో నీ పెద్దకొడుకు. అతని చుట్టూ బృహద్బలుడు, కాంభోజుడు. ఆ వెనక త్రిగర్తులు.

ఇలా దిట్టమైన వ్యూహాల్తో రెండు సైన్యాలు కదిలినయ్. దేవాసుర సమరంలా భీకరరణం మొదలైంది. కవలు కౌరవసైన్యం మీదికి దూకి చెల్లాచెదురు చేస్తుంటే భీమార్జునులు పదండి పదండని ప్రోత్సహిస్తుంటే పాండవసేన పరమోత్సాహంతో కదలటంతో కల్పాంతభైరవుడిలా భీష్ముడు బాణవర్షం కురిపించసాగాడు. శిఖండి భీష్ముడి మీద మూడస్త్రాలు వేస్తే అతను శిఖండి వంక చూడకుండానే “శిఖండినీ! బ్రహ్మ నిన్ను ఆడదానిగా పుట్టించాడు. ఇప్పుడు మగవేషం వేసుకొచ్చినంత మాత్రాన నేను నీతో పోరతానా? నువ్వు వెయ్యి బాణాలెయ్యి, నవ్వేస్తానే తప్ప నీ మీద విల్లెక్కుపెట్టను” అన్నాడు. దానికి రోషం వచ్చి శిఖండి “రాజులందర్నీ గెలిచావంట, పరశురాముడితోనే యుద్ధం చేసి మెప్పించావంట, నాతో మాత్రం చెయ్యలేవా? ఇవాళ నీ వీరత్వం ఏమిటో బయటపెడతా” అని అతని మీద బాణాలేశాడు. అది చూస్తున్న అర్జునుడు, “ఇదేదో దైవప్రేరణలా వుంది. శిఖండి ఇలా మాట్టాట్టం ఇదివరకెప్పుడూ వినలేదు” అనుకుంటూ శిఖండిని ఇంకా పుర్రెక్కించాడు, ఇన్ని మాటలని ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే జనం నవ్వరా? నేనుండగా నీకు భయం వద్దు. భీష్ముడి మీద బాణాలెయ్ అంటూ. ఐతే భీష్ముడు పక్కకి తొలిగి పాంచాలబలాల మీదికి దూకాడు. అర్జునుడు కౌరవసేనని కార్చిచ్చులాగా కాల్చటం మొదలుపెట్టాడు. నీ కొడుకు దైన్యంగా భీష్ముడికి మొరపెట్టుకున్నాడు మన సేన ఎన్ని తిప్పలు పడుతుందో చూస్తున్నావా అని. దానికి భీష్ముడు, “పదివేలమంది దొరల్ని చంపుతానని నీకు మాట ఇచ్చా, అది నిలబెట్టుకున్నా. ఈరోజు యుద్ధం చూస్తుంటే నేనో పాండవులో ఇవాల్టితో తేలిపోయేట్టు కనిపిస్తుంది. ఐతే వాళ్లా దైవబలం వున్నవాళ్లు, నాలాటి ఒక మనిషి చేతిలో చస్తారా? ఏదేమైనా కానీ నా చేతుల బలం చూపిస్తా, చూడు” అంటూ పాండవసేనావనాన్ని ఈ వైపు నుంచి తనూ కాల్చటం మొదలుపెట్టాడు.

అర్జునుడు శిఖండితో, “నువ్వు భీష్ముణ్ణి వదలొద్దు. నీ వెనక నేనున్నా. ధైర్యంగా పద” అంటూంటే ధృష్టద్యుమ్నుడు విని అందర్నీ భీష్ముణ్ణి చుట్టుముట్టమని పిలిచి చెప్పాడు. అప్పుడు పాండవపక్షంలో పెద్దవీరులంతా భీష్ముడి మీదికి వెళ్లబోతుంటే నీ సేనలోని యోధవరులు వెళ్లి వాళ్లతో తలపడ్డారు. ఇరువర్గాల యుద్ధం చూస్తున్న దేవతల అనిమేషత్వం సార్థకమయ్యింది. శిఖండిని ముందుంచుకుని భీష్ముణ్ణి తరుముతున్న అర్జునుడికి దుశ్శాసనుడు అడ్డుపడి భీకరంగా పోరాడు. అర్జునుడి దెబ్బకి అతను మూర్ఛపడితే సారథి రథాన్ని భీష్ముడి వెనక్కి తోలుకుపోయాడు. ఐతే అంతలోనే తెలివి తెచ్చుకుని తిరిగొచ్చి అర్జునుడితో తలపడ్డాడతను. అర్జునుడు అతిరౌద్రంగా అతని విల్లు తుంచి, ఒళ్లంతా గాయాలు చేసి, గుర్రాల్ని నొప్పిస్తే అతనక్కణ్ణుంచి పారిపోయాడు. ఇక అర్జునుడు భీష్ముడికి అడ్డంగా వున్న వాళ్లందర్నీ చంపసాగాడు. అదిచూసి ద్రోణుడతనికి అడ్డుపడటానికి వేగంగా వస్తుంటే ధర్మరాజు అతన్ని ఎదుర్కున్నాడు. ద్రోణుణ్ణి అక్కణ్ణుంచి కదలనివ్వకుండా పోరాడుతుంటే ద్రోణుడు దగ్గర్లో వున్న కొడుకుని పిలిచాడు “దివ్యబాణాల తంత్రం తడబడుతున్నది, మంత్రాలు తప్పుతున్నయ్, వింటిచెయ్యి ఒణుకుతుంది, మనసు వశం తప్పుతున్నది, శకునాలు బాగాలేవు, అర్జునుడి పంతం ఈరోజుతో నెరవేరేట్టుంది. నన్నా వీళ్లిక్కడి నుంచి కదలనిచ్చేట్టు లేరు. ఇది ఎవరమూ ప్రాణాలు దాచుకునే సమయం కాదు, వెళ్లి భీష్ముణ్ణి రక్షించు” అని పంపాడతన్ని.

అక్కడ శిఖండిని ముందుంచుకుని అర్జునుడు భీష్ముణ్ణి చంపటానికి అనువుగా వుండేట్టు భీముడు కౌరవసేనని చెల్లాచెదురు చేస్తున్నాడు. అదిచూసి భగదత్తుడు, కృపవర్మ, ఇలా మొత్తం పదిమంది మహారథులు అతన్ని ఎదుర్కున్నారు. వాళ్లందరితో అతనొక్కడే పోరటం చూసి అర్జునుడు సాయంగా వచ్చి వాళ్లని తిప్పలు పెడుతుంటే సుశర్మ, ఇంకా ఆ చుట్టుపట్ల వున్న రాజుల్ని భీమార్జునుల మీదికి పంపాడు దుర్యోధనుడు. ఇలా అంతమందీ భీమార్జునుల మీద తలపడితే అభిమన్యుడు, సాత్యకి సైన్యాల్తో అక్కడికి వచ్చి వాళ్లనెదుర్కున్నారు. ఈలోగా భీష్ముడొకపక్క పాండవసేనని నుగ్గుచేస్తూ వీరవిక్రమం చూపుతూ విహరిస్తున్నాడు.

మధ్యాన్నమయింది.

“పదిరోజుల నుంచి ఉగ్రంగా ఉత్తమక్షత్రియుల్ని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నా, అలిసినట్టనిపిస్తుంది, ఈ శరీరం ఇంక వదలటం మంచిది” అని ఆలోచిస్తున్నాడు భీష్ముడు. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ ధర్మరాజు పక్కకి చేరి “నువ్వు నా మేలు కోరేవాడివైతే ఇప్పుడే మీరంతా కలిసి నామీద పడి శిఖండిని ముందు పెట్టుకుని చంపండి, ఆలస్యం చెయ్యొద్దు” అన్నాడు. ధర్మజుడు దగ్గర్లో వున్న ధృష్టద్యుమ్నుడితో “విన్నావుగా భీష్ముడి మాట? భీమార్జునుల్తో చెప్పి అందర్నీ ఒక్కసారిగా భీష్ముడి మీదికి వెళ్లమని చెప్పు” అని చెప్పాడు. అలా అంతా కలిసి అతని మీదికి వెళ్తుంటే నీ కొడుకులు, ఇతర రాజులు భీష్ముడికి అడ్డంగా వచ్చి యుద్ధం సాగించారు. అర్జునుడు దారి చేసుకుని భీష్ముడి వైపుకు వెళ్తుంటే దుశ్శాసనుడు అడ్డం వచ్చాడు. ఐతే సవ్యసాచి అతన్ని తీవ్రంగా బాణాల్లో ముంచేస్తే వెనక్కి తగ్గి భీష్ముడి వెనక్కు చేరాడు. అర్జునుడు శిఖండితో, “అడుగో భీష్ముడు, బాణాలెయ్, బాణాలెయ్” అంటూంటే ఇంతలో మన యోధులు భీష్ముణ్ణి దాటుకుని అర్జునుడి మీదికి దూకారు. శిఖండి భీష్ముడి మీద బాణాలేశాడు గాని అతను నవ్వుతూ మిగిలిన వాళ్లతో యుద్ధం సాగించాడు. అర్జునుడి బాణపరంపరకి మన యోధులు చెల్లాచెదురయారు. అది చూసి నీ కొడుకు అందర్నీ పిలిచి అర్జునుడి మీదికి పురికొల్పాడు. కళింగ, మాళవ, బాహ్లిక, విదేహ, శూరసేన బలాలు అర్జునుడి మీదికి కదిలినయ్. ఐతే దివ్యాస్త్రాల్తో అతను వాటిని ఛేదించాడు. అప్పుడు దుశ్శాసనుడు కృప, శల్య, వివింశతి, వికర్ణుల్ని కూడగట్టుకుని భీష్ముడికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. పార్థుడు వాళ్లందర్నీ విరథుల్ని చేశాడు. అదిచూసి దుర్యోధనుడు తన తమ్ములందరితో వచ్చి అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. పోరు ఘోరమైంది.

అభిమన్యుడు మొదలైన పాండవ కుమార వీరుల్తో పొంగుతున్న పాండవసేనని చూసి ఒక దివ్యాస్త్రం తీశాడు భీష్ముడు. అది వెయ్యబోయేంతలో ఎదురుగా శిఖండి కనపడేసరికి దాన్ని వదిలేశాడు. ఇంతలో విరాటుడి తమ్ముడు శతానీకుడు ఆవేశంగా భీష్ముణ్ణి ఎదుర్కుని వాడి బాణాల్తో అతన్ని నొప్పించాడు. కోపించి అతని తల నరికాడు భీష్ముడు. అదిచూసి పాండవసేన అల్లకల్లోలమైంది. ఇంకా ఊరుకోవటం భావ్యం కాదు, భీష్ముడి పని ముగించమని అర్జునుణ్ణి ప్రోత్సహించాడు కృష్ణుడు.

శిఖండి బాణాలేస్తుంటే వాటి వెనకనే తనూ ఓ నిశితబాణమేసి భీష్ముడి విల్లు విరిచాడు అర్జునుడు. అదిచూసి మన బలగంలో మహావీరులు అర్జునుడి మీదికి దూకుతుంటే పాండవబలం వాళ్లు వాళ్లని ఎదుర్కున్నారు. అందరికీ అన్నిరూపులుగా శరసమాధానాలు చెప్తూ, మరోవంక భీష్ముడు ఎన్ని విల్లుల్ని తీసుకుంటే అన్నిట్నీ విరుస్తూ, శిఖండిని కాచుకుంటూ, భీష్ముణ్ణి తరుముతూ, సవ్యసాచి భీష్ముడి సారథిని చంపి కేతనాన్ని కూల్చాడు. భీష్ముడు మనసులో అనుకున్నాడూ, “కృష్ణుడు లేకుంటే ఈ పాండవులందర్నీ నేనొక్కణ్ణే జయిద్దును, ఐతే కృష్ణుణ్ణి తీసుకుని పాండవులు వస్తే నన్నెలా చంపొచ్చునో వాళ్లకి చెప్పా, ఆ మాట నిలబెట్టుకుంటా” అని. ఆకాశాన్నుంచి దేవతలు కూడ “ఇదే సరైన మార్గం” అని అతనితో అన్నారు. అది అతనికీ నాకూ మాత్రమే వినపడింది. అప్పుడు సూక్ష్మజలశీకర మారుతం అతని మీద వీచింది, దేవదుందుభులు మోగినయ్. అవీ మా ఇద్దరికే తెలిసినయ్.

ఐనా యుద్ధం చెయ్యకపోవటం ధర్మం కాదు గనక బాణాలేయటం సాగించాడు భీష్ముడు. శిఖండి అతని మీద వేస్తున్న బాణాలు అతన్ని ఏమీ చెయ్యలేకపోతుంటే వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదికి క్రూరనారాచాలు ప్రయోగించాడు. చుట్టుపక్కలే వున్నా నీ కొడుకులు భీష్ముణ్ణి రక్షించటానికి రాలేక చూస్తుంటే నీ తండ్రి నీ పెద్దకొడుకుతో “ఈ అర్జునుణ్ణి చూడు, ఈ మహావీరుణ్ణి గెలవటం దేవాసురులకైనా అసాధ్యం. మనలాటి సామాన్యుల వల్ల ఔతుందా? వీడు తప్ప మిగిలిన వాళ్లందర్నీ నేనొక్కడినే గెలవగలను” అంటూండగా శిఖండి వేసినట్టుగా అతని వెనక నుంచి అర్జునుడు భీష్ముడి మీదికి నిశితాస్త్రాలు వేశాడు. భీష్ముడు దుశ్శాసనుడితో “పిడుగుల్లాటివి, సూటిగా శరీరాన్ని చొచ్చేవి, యమదూతల్లాటివి – ఇలాటి బాణాలు శిఖండికి సాధ్యం కావు, ఇవి అర్జునుడివే, అనుమానం లేదు” అంటూ ఇంకో విల్లు తీసుకుని అర్జునుడి మీద బాణాలేస్తే అతనా వింటినీ విరిస్తే వాలూ పలకా తీసుకుని రథం దిగబోతుంటే అర్జునుడు తన సైన్యాల్ని కేకేసి పిలిచి “నేనుండగా మీకేం భయం వద్దు, భీష్ముణ్ణి పొడవండి, చంపండి” అనరిచాడు. అదిచూసి మన సేన భీష్ముడికి అడ్డుపడబోతుంటే అర్జునుడు వాళ్లని కదలకుండా బాణాల్తో ముంచుతుంటే అతని సేనలో వాళ్లు అదే అదనుగా శరీరం మీద వేలెడైనా ఖాళీ లేకుండా భీష్ముడి ఒంటినిండా బాణాలు నాటారు. అర్జునుడూ ఘోరమైన అస్త్రాల్తో భీష్ముణ్ణి కింద పడేశాడు.

అందరూ అవాక్కులై చూస్తుండగా భీష్ముడు తల తూర్పు దిక్కుగా నేలకేసి ఒరిగాడు. అతని శరీరం నేలకి తాకకుండా బాణాలే తల్పం సమకూర్చినయ్. “అయ్యయ్యో దక్షిణాయనంలో ఈ మహానుభావుడు, పుణ్యశాలి మరణిస్తున్నాడే” అని దేవతలు కటకటపడుతుంటే భీష్ముడు, “దేవతలారా, ఆందోళన వద్దు. అందుకే ప్రాణాల్ని శరీరంలోనే ఉంచాను. నా తండ్రి నాకు అవధ్యుడిగా, స్వచ్ఛంద మరణం కలిగేట్లు వరాలిచ్చాడు. అందువల్ల నా అనుమతి లేకుండా నన్నెవరూ చంపలేరు, నా ప్రాణాలు నా వశాలు” అని సమాధానపరిచాడు. ఇంతలో అతని తల్లి గంగాదేవి పంపగా ఆ విషయమే చెప్పటానికి హంసల రూపంలో వచ్చిన మునులు కూడ అది విని ఆనందించి వెళ్లారు.

దుర్యోధనుడు పంపితే దుశ్శాసనుడు వెళ్లి భీష్ముడు పడిన సంగతి ద్రోణుడికి చెప్పాడు. అదివిని అతను మూర్ఛపోయి మెల్లగా తెప్పరిల్లి అక్కడికి బయల్దేరాడు. పాండవసేనలు సంతోషంతో బొబ్బలు, అరుపులు పెట్టారు, తూర్యధ్వనులు మోగించారు. ఇటువైపు ఏడుపులు, హాహాకారాలు వినపడ్డయ్. యుద్ధం చెయ్యటానికి చేతులు రాక అందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు. సూర్యాస్తమయం అయింది.

అదంతా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో “నాది గుండో రాయో గాని నీమాటలన్నీ విని కూడ ఇంకా పగలకుండా వున్నది. ఇంకా నువ్వు చెప్పాల్సినవి వున్నాయా?” అనడిగాడు.

దానికి సంజయుడు “అప్పుడందరూ కవచాలు, ఆయుధాలు విడిచి యుద్ధం విషయం వదిలి పితామహుడి చుట్టూ కూర్చున్నారు. అర్జునుడొక్కడే ధనుర్బాణాల్తో వచ్చాడు. తనకు తలకింద ఎత్తు కావాలని భీష్ముడు నీకొడుకుల్తో చెప్తే వాళ్లు తలగడల కోసం పంపారు. అతను చిరునవ్వుతో అర్జునుణ్ణి పిలిచాడు. అర్జునుడు గాండీవం పక్కన పెట్టి కళ్లనుంచి అశ్రువులు కారుస్తూ అతని దగ్గరికి వెళ్లాడు. శరతల్పంతో సరిగా తలగడకి కూడ బాణాలు ఏర్పాటు చెయ్యమని చెప్తే అలాగేనని వెళ్లి అర్జునుడు గాండీవం తీసుకుని మూడు బాణాల్ని అభిమంత్రించి భూమిలో నాటాడు. అవి సరిగ్గా తనకు తలగడగా సరిపోయాయని భీష్ముడు ఆనందించాడు.

అక్కడున్న వాళ్లందర్నీ చూస్తూ, “ఉత్తరాయణం వచ్చేవరకు నేనిలాగే వుంటాను, కనక నాకు గట్టి రక్ష ఏర్పాటు చెయ్యండి” అని చెప్తే వెంటనే కౌరవులూ పాండవులూ కూడ తగిన వాళ్లని ఆ పనికి నియోగించారు. చికిత్సకులు వచ్చి శల్యచికిత్స చేస్తామంటే భీష్ముడు వాళ్లని వారించి పంపాడు. భీష్ముడు దాహం అడిగితే పరిగెత్తుకెళ్లి అనేకమంది నీళ్లు తీసుకొచ్చారు కాని అతను “శరతల్పగతుడినైన నేను తేజోమయాస్త్రాలతో వెలికి తీసిన నీళ్లు మాత్రమే తాగాలి” అంటే అందరూ బిత్తరపోయి చూశారు. అతను అర్జునుణ్ణి పిలిచి ఈపనికి నువ్వే సమర్థుడివని చెప్తే అతను అలాగేనని తాతకి ప్రదక్షిణం చేసి తేజోమయమైన బాణాన్ని పర్జన్యమంత్రంతో మంత్రించి భూమిలో నాటితే దివ్యగంధంతో కూడిన ధార బయటికొచ్చింది. ఆ నీటితో భీష్ముణ్ణి సంతృప్తుణ్ణి చేశాడు అర్జునుడు.

అప్పుడు భీష్ముడు నీ కొడుకుతో “కృష్ణార్జునులు కారణజన్ములు, వాళ్లని గెలవటం ఎవరికీ తరం కాదు. ఈ యుద్ధం మాని వాళ్లకి ఇంద్రప్రస్థంతో అర్థరాజ్యం ఇచ్చి కొందరైనా బతికి బట్టకట్టండి” అని చెప్తే కౌరవపాండవులందరూ మౌనంగా విని అతనికి నమస్కరించి సెలవు తీసుకుని వారి వారి నివాసాలకి వెళ్లారు.

ఆ తర్వాత కర్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్లి భక్తి వినయాల్తో పాదప్రణామం చేసి “నామీద కోపం విడిచి వాత్సల్యంతో నాకు తగిన మాటలు చెప్పు” అని అడిగితే అతన్ని గౌరవంగా దగ్గరికి పిలిచి ఆ చుట్టుపక్కల వున్న వాళ్లందర్నీ దూరంగా పంపి ఇలా అన్నాడు భీష్ముడు – “పిల్లలు నీ మూలాన చెడుతున్నారన్న రోషమే తప్ప నువ్వంటే నాకు కోపం కాదు. పైగా నువ్వు కౌంతేయుడివని వ్యాసుడు ఇదివరకే చెప్పాడు. ఆ పాండవులతో వైరం వద్దు, నువ్వూ వాళ్లతో కలువు” అని చెప్పాడు. ఐతే రాధేయుడు మాత్రం “ఇదంతా నేనూ ఇదివరకు విన్న విషయమే. ఐనా దుర్యోధనుడు నాకు ఇంతకాలం ఎంతో గౌరవం ఇచ్చాడు, అతన్ని వదలటం భావ్యం కాదు. అలాగే పాండవుల్ని నేను సమయం దొరికినప్పుడల్లా అవమానించాను. సర్వమూ దైవాధీనం. నా శక్తి కొద్దీ నేను యుద్ధం చేసి రారాజు ఋణం తీర్చుకుంటాను. వేరే మాట లేకుండా నాకు అనుజ్ఞ ఇవ్వు” అన్నాడు. “నాకు తెలియదా, అలాగే. దుర్యోధనుడికి ఏది ప్రియమో అది చెయ్యి. మనస్సులో ఎలాటి అనుమానాలూ వద్దు. అనుజ్ఞ ఇస్తున్నా” అని అతన్ని పంపించాడు భీష్ముడు.

జనమేజయుడితో వైశంపాయనుడు ఇలా చెప్పాడు – భీష్ముడి అంపశయ్య గురించి వివరంగా విన్న ధృతరాష్ట్రుడు ఆ తర్వాతి యుద్ధ క్రమం చూడమని సంజయుణ్ణి రణభూమికి పంపాడు. కొడుకు విజయం గురించిన వార్త అతనెప్పుడు తీసుకువస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు రాత్రివేళ సంజయుడు తిరిగివచ్చాడు. హడావుడిగా అంతఃపురం ప్రవేశించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి యుద్ధవిశేషాలు చెప్పటం ప్రారంభించాడు.

“అలా ఆ రాత్రి నీకు భీష్ముడి యుద్ధం గురించి నేను వినిపించి తెల్లవారు జామున తిరిగి కౌరవ శిబిరాలకు వెళ్లేసరికి మన సైన్యంలో భీష్ముడు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అందరూ విషణ్ణవదనాల్తో ఇప్పుడిక మనని రక్షించగలిగింది కర్ణుడొకడే అని అతన్ని తల్చుకోసాగారు. నీకు గుర్తుంది కదా – భీష్ముడు తనని కేవలం అర్థరథుడని తక్కువచేసి చెప్పినందుకు చిన్నబుచ్చుకుని కర్ణుడు “నువ్వు యుద్ధానికి పోతే నేను ఆ చాయలకు కూడ రాను, నువ్వు గెలిస్తే నేను వనవాసానికి పోతా, నిన్ను వాళ్లు గెలిస్తే అప్పుడు నేనొచ్చి వాళ్లని గెలుస్తా” అని ప్రతిజ్ఞ చేసి వున్నాడు కనక అప్పటివరకు అతను యుద్ధం చెయ్యలేదు.

పదకొండవ రోజు


ఇక ఆ రోజు తెల్లవారటం తోనే పురాన్నుంచి బయల్దేరి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు కర్ణుడు. “దమం, సత్యం, తపం, దానం, శీలం, అస్త్ర వీర్య శౌర్యాల్లో సాటిలేని భీష్ముణ్ణి పోగొట్టుకున్నాం, ఎంత దౌర్భాగం!” అని కన్నీళ్లతో వాపోయాడు. అది విని మిగిలిన వాళ్లు కూడ బిగ్గరగా ఏడ్చేశారు.

ఐతే అంతలోనే అతను తన్నుతాను సంభాళించుకుని “మీరంతా చూస్తూండగా మేరువు లాంటి ధీరుడు భీష్ముడు నేలకొరిగాడు. ఐతే మీ కళ్ల పండుగ్గా నేను ఆ పాండవ బలగాల్ని నాశనం చేసి పాండవుల్ని చంపి రాజ్యాన్ని దుర్యోధనుడికి కట్టబెడతా. అది కాని పక్షంలో నా శౌర్యపాటవాల్తో భీష్ముణ్ణి మరిపింపజేసి చివరికి ఆయన దగ్గరకే చేరతా. అదైనా ఇదైనా అంతకన్నా కావలసిందేముంది?” అని తన సారథిని పిలిచి మణిగణోజ్జ్వలమైన రథాన్ని సిద్ధం చెయ్యమని చెప్పాడు. అతను తీసుకొచ్చిన రథం ఎక్కి భీష్ముడున్న చోటికి వెళ్లాడు.

కొంత దూరంలో రథం ఆపి పాదచారిగా ఆయన దగ్గరికి చేరాడు. “మహానుభావా, రాధేయుణ్ణి వచ్చాను, నన్ననుగ్రహించి నాతో మంచి మాటలు మాట్లాడు. ఇన్నాళ్లూ – వింటేనే గుండెలు బద్దలయ్యే ఆ పాంచజన్య దేవదత్త శంఖధ్వానాల నుంచి, కళ్లకి ఆతురత కలిగించే కపిధ్వజం వెలుగుల నుంచి, చండ గాండీవ నిర్ముక్త అద్భుతాస్త్రాల నుంచి, నువ్వు కాబట్టి కౌరవసేనని కాపాడావు కాని మరొకరికి సాధ్యమా? ఆ మహాశివుడితోనే బాహాబాహీ ముష్టాముష్టీ పోరాడిన గాండీవిని అడ్డుకోగలిగిన వాడు నువ్వుగాక ఇంకెవరు?” అనంటుంటే మెల్లగా కళ్లు తెరిచాడు భీష్ముడు. ఆదరంగా అతన్ని చూస్తూ, “దుర్యోధనుడు ఎలాగో కౌరవులకి నువ్వలాగ. పుట్టుకతో వచ్చే చుట్టరికాల కంటే స్నేహబాంధవ్యం అధికం కదా! ఇప్పుడిక కౌరవులకు నువ్వు దిక్కువై ఆ రారాజుకి విజయం చేకూర్చు. వెళ్లు” అని దీవించాడు. అతని పాదాలకు వినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు కర్ణుడు.

దుర్యోధనుడు కర్ణుడికి ఎదురు వెళ్లి “నీ రాకతో మనసేనకి మళ్లీ కళ వచ్చింది. ఇక ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో చెప్పు” అన్నాడు. దానికి కర్ణుడు “నువ్వు చెప్తే నేను వింటా, ఏమిటి నీ ఆలోచన?” అనడిగాడు. “ఇప్పుడు మనకు ఓ సేనాపతి కావాలి. ఎవరైతే బాగుంటుంది?” అనడిగాడు దుర్యోధనుడు. “నీ సైన్యంలో సేనాని కాదగ్గ వాళ్లు ఎందరో ఉన్నారు. ఐతే ఒకరిని ఎన్నుకుంటే మిగిలిన వాళ్లకి అసూయ కలగొచ్చు. అలా కాకుండా అందరికీ నచ్చే వ్యక్తి కావాలి. ద్రోణుడు అలాటివాడు. ఎవ్వరూ కాదనరు. అతనే అర్హుడు కూడ” అని చెప్పాడు కర్ణుడు.

దుర్యోధనుడు తగిన రాజుల్ని తనతో కూర్చుకుని ద్రోణుడి దగ్గరకు వెళ్లి వినయంగా అతనితో – “నీ గుణశీల సంపదల్ని, శస్త్రాస్త్ర వైభవాన్ని భీష్ముడు ఎప్పుడూ పొగిడేవాడు. దేవసేనని నడిపి రాక్షసుల్ని జయించిన కుమారస్వామిలా ఈ కురుసైన్యానికి సర్వసైన్యాధిపత్యం వహించి మమ్మల్ని గెలిపించు” అని అందర్నీ చూపిస్తూ అతన్ని వేడుకున్నాడు. దానికి ద్రోణుడు, “ఏదో వేదాలు, వాటి అంగాలు కాస్తో కూస్తో నేర్చుకున్నా తప్పితే ధైర్యాది గుణాలు నాకేం తెలుసు? ఐనా మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి కురురాజు కోరిక తీర్చటానికి సిద్ధపడుతున్నా. ఈ సైన్యాధిపత్యం స్వీకరించి నా దివ్యాస్త్రాలతో పాండవుల అంతు చూస్తా” అన్నాడు. దుర్యోధనుడు ఆనందించి కనకకలశాల్లో పావనజలాలు తెప్పించి మంగళధ్వనుల మధ్య సైన్యాధిపత్య పట్టాన్ని అతనికి కట్టాడు. రాజులంతా శంఖాలు పూరించారు, భేరీ మృదంగ నాదాలు మిన్ను ముట్టినయ్.

అలా సర్వసైన్యాధ్యక్షుడై అద్భుత మహాస్త్రాలతో, అనివార్య శౌర్యంతో ఒక అక్షౌహిణికి పైగా పాండవసేనని చంపి, ఎందరో మేటి దొరల్ని మట్టి గరిపి, చివరికి దుష్టుడైన ధృష్టద్యుమ్నుడి చేతిలో ద్రోణుడు మరణించాడు” అని సంజయుడు చెప్పటంతో ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడయాడు. అతికష్టం మీద తెప్పరిల్లి “అంత మహిమాన్విత శస్త్రాస్త్ర కోవిదుడు ఆ దౌర్భాగ్యుడి చేత పడుతుంటే మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు? అసలెలా జరిగిందిది? ఇంక దుర్యోధనుడు గెలుస్తాడన్న ఆశలు అడియాశలే కదా! అయ్యయ్యో, దుర్మతులైన నా కొడుకుల మూలాన అంతటి మహానుభావుడు బలై పోయాడే! పాపం, ఆ అశ్వత్థామ ఇదంతా చూస్తూ ఎలా భరించగలిగాడో” అని విలపిస్తూ మూర్ఛ పడ్డాడు.

అక్కడి స్త్రీలు ఆక్రందనలు చేస్తూ వచ్చి అతన్ని ఎత్తి పరుపు మీద పడుకోబెట్టి శిశిరోపచారాలు చేస్తే మెల్లగా తేరుకున్నాడు. లేచి కూర్చుని అన్నాడూ – “నరనారాయణులు రథిక సారథులుగా వున్న రథానికి తిరుగెక్కడ? కవలలు మహాశూరులు. సాత్యకి గొప్ప పరాక్రమవంతుడు. పాంచాలుడు ఉత్తమౌజుడు బాహుబలుడు. శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ధీరుడు. శిఖండి అఖండపరాక్రముడు. అభిమన్యుడు అపరరుద్రుడు. యాదవరాజు చేకితానుడు మానధనుడు. ద్రౌపదేయులు ఐదుగురూ అజేయులు. కేకయులు ఐదుగురైనా వెయ్యిమంది పెట్టు. యుయుత్సుడు వీరయోధుడు. ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణవధకి. ఘటోత్కచుడు వికటభీకరుడు. ఎవరికీ అలివి కానివాడు భీముడు. ధర్మరాజు గుణగరిష్టుడు. ఇక లోకరక్షణపరుడై యదువంశాన పుట్టి వ్రేపల్లెలో బాల్యం నటించి కంసాది రాక్షసుల్ని తుంచి అవలీలగా ఇంద్రుడి పారిజాతాన్ని ఇంటిపెరటికి తెచ్చుకున్న ఆ కృష్ణుడు వాళ్ల పక్షాన వున్నాడు. ఇలాటి బలగాన్నా మనవాళ్లు గెలిచేది? భీష్మ ద్రోణుల రక్షణ లేని కౌరవసైన్యం గాండీవి శరాలకి బలికావటం తప్పదు. ఇంక వినటానికీ చెప్పటానికీ ఏముంది గనక” అని నిట్టూర్పు నిగిడిస్తూ కూర్చుని “ఐనా ద్రోణుడి యుద్ధపరాక్రమాన్ని వివరించి చెప్పు, అది వినైనా సంతోషిస్తా” అనడిగాడు ధృతరాష్ట్రుడు.

సంజయుడు ఆ వృత్తాంతం అంతా చెప్పటం ప్రారంభించాడు.

అలా సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణుడు సంతోషంగా నీ కొడుకుతో, “భీష్ముని తర్వాత నన్ను పెద్దని చేశావు, ఈ మంచి పనికి ఫలంగా నీకో వరం ఇస్తా, ఏం కావాలో కోరుకో” అన్నాడు. దుర్యోధనుడు కర్ణదుశ్శాసనాదుల్తో ఆలోచించుకుని వచ్చి “నువ్వు వరం ఇచ్చేట్లయితే ఒకటి కోరతాను. ధర్మరాజుని ప్రాణాల్తో పట్టి తెచ్చి నాకప్పగించు చాలు” అని కోరాడు. ద్రోణుడు ఆశ్చర్యంతో, “ఆహా, ధర్మరాజుకి అజాతశత్రుడన్న పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడర్థమౌతున్నది. అతన్ని చంపమని కాకుండా ఇలా ప్రాణాల్తో కావాలని కోరుకుంటున్నావ్. అలా వాళ్లని ఓడించి ఆ తర్వాత అర్థరాజ్యం ఇద్దామనా నీ సంకల్పం?” అనడిగాడు ద్రోణుడు కుతూహలంగా.

దుర్యోధనుడు గర్వంగా తన ఆలోచనని అందరూ వినేట్టు చెప్పాడిలా – “ధర్మరాజుని చంపితే ఇక అర్జునుడు మననందర్నీ చంపకుండా ఆపటం ఎవరి తరమూ కాదు; ఒకవేళ ఎలాగోలా పాండవులందర్నీ చంపగలిగామనుకున్నా కృష్ణుడు మనల్ని వదలడు; రాజ్యాన్ని కుంతికైనా కట్టబెడతాడు. ఇదంతా లేకుండా ధర్మజుణ్ణి పట్టుకుని మళ్ళీ జూదం ఆడించి అడవులకి పంపామా, ఇక వాళ్ల పీడ శాశ్వతంగా విరగడైపోతుంది.”

ద్రోణుడి మనసు కలుక్కుమంది. తనిస్తానన్న వరానికి ఏదన్నా లొసుగు పెడదామని ఆలోచించాడు. తీవ్రంగా ఆలోచించగా ఒక దారి దొరికింది. అన్నాడూ, “అర్జునుడుండగా ధర్మరాజుని పట్టుకోవటం దుష్కరం. కాబట్టి మీరు అర్జునుడు చుట్టుపక్కల లేకుండా చూడండి, అప్పుడు ధర్మజుడు గనక యుద్ధరంగంలో గట్టిగా నిలబడితే నేనతన్ని పట్టి నీకిస్తా”. ఇక ధర్మరాజు దొరికినట్టేనని నీ కొడుకులు మురిసిపోయారు. నీపెద్దకొడుకు ఆ విషయాన్ని మనసైన్యమంతటా దండోరా వేయించాడు.

పాండవుల చారులు వెంటనే ఆ విషయం ధర్మరాజుకి చెప్పారు. అతను అర్జునుడితో, “విన్నావుగా ద్రోణుడి వరం? అది వమ్ము చెయ్యాలి మనం. ఎప్పుడూ నన్ను వదలకుండా చుట్టుపక్కలే వుండు” అని చెప్పాడు. అర్జునుడు “నిన్ను వదిలివెళ్లటం గురువుని చంపటంతో సమానం. అలా చేస్తానా? నా మేన ప్రాణం వున్నంతవరకు ద్రోణుడే కాదు ఆ రుద్రుడు వచ్చినా నిన్ను పట్టలేడు. కౌరవుల దురాశ తప్ప ఇదేం ఆలోచించాల్సిన విషయం కాదు” అని ధైర్యవచనాలు పలికాడు.

సైన్యాలు కదిలినయ్. పాండవులు క్రౌంచవ్యూహంతో వస్తే మన సైన్యం శకటవ్యూహంతో ఎదిర్చింది. మన సేనాముఖాన కర్ణుడిని చూసి అందరికీ ధైర్యం, ఉత్సాహం కలిగినయ్. ఎప్పుడెప్పుడు ఒకరొకరితో యుద్ధం చేస్తామా అని కర్ణార్జునులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఉజ్జ్వల రథమ్మీద ద్రోణుడు బయల్దేరి శత్రుసైన్యం మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు మన సైన్యం మీదికి పరుగు తీశాడు. ద్రోణుడు అత్యంత చాకచక్యంతో పాండవ బలగానికి అన్ని దిక్కులా తానే కనిపిస్తూ పీనుగుపెంటలు పోశాడు. ధర్మరాజు ద్రోణుడిని ఎదిరించటానికి అర్జునుణ్ణి, ధృష్టద్యుమ్నుడిని తరిమాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీద వివిధాస్త్రాలు సంధించాడు. ఐతే ద్రోణుడు వృద్ధుడైనా కుమారస్వామిని తలపిస్తూ ఉన్మత్తుడిలా యుద్ధం చెయ్యసాగాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి సారధిని రక్తసిక్తుణ్ణి చేస్తే మనవాళ్లు అనేకమంది యోధులు అతని మీద పడ్డారు. అదిచూసి అర్జునుడు వడిగా వాళ్లందర్నీ వారించి గాయాలు చేశాడు. శకుని సహదేవుడితో తలపడ్డాడు. అతని కేతనాన్ని కూల్చి గుర్రాల్ని గాయపరిస్తే సహదేవుడు కోపించి అతని రథం నుగ్గుచేశాడు. శకుని పెద్దగదతో కిందికి దూకి అతని సారథిని చంపితే అతనూ ఒక గదతో దూకి తలపడ్డాడు.

మరోవంక విరాటుడు తన బలాల్తో కర్ణుడితో పోరాడు. కర్ణుడు కించిత్ కోపంతోనే రథ, తురగ, రథిక సహితంగా ఆ బలగాన్ని చించిచెండాడాడు. మరోవంక ద్రుపదుడూ భగదత్తుడు తారసిల్లారు. ఇంకోచోట పౌరవుడు అభిమన్యుడితో తలపడి అతన్ని బాణాల్లో ముంచెత్తాడు. అభిమన్యుడు రౌద్రంగా వాడి వింటినీ కేతనాన్నీ తుంచి గుర్రాల్నీ సారథినీ నొప్పించి వాడి తల నరకటానికి ఒక వాడిశరాన్ని తొడుగుతుండగా హడావుడిగా కృతవర్మ రెండమ్ముల్తో ఆ వింటినీ బాణాన్నీ విరిచాడు. అభిమన్యుడు పలకా వాలూ తీసుకుని నేలమీదికి దూకి పౌరవుడి గుర్రాల్ని చంపి సారథిని పడదన్ని గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్టు వాడి జుట్టు పట్టుకుని వేటు వెయ్యబోయేంతలో సైంధవుడు పదునైన ఖడ్గాన్ని తీసుకుని అతని మీదికి పరిగెత్తాడు.

వాణ్ణి చూసిన అభిమన్యుడు పౌరవుణ్ణి వదిలి సైంధవుడి మీదికి కదిలాడు. ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది. అభిమన్యుడి పలక దెబ్బకి సైంధవుడు బాధతో అరుస్తూ వెనక్కి పారిపోయాడు. “పోరా పిరికిపందా” అంటూ అభిమన్యుడు తన రథం మీదికి దూకి సైంధవ సైన్యాన్ని తునాతునకలు చేశాడు. సైంధవుడి పరిస్థితి చూసి మన రాజులు చాలామంది ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడ్డారు. శల్యుడు అతని మీదికి ఒక శక్తిని విసిరేస్తే అతను దాన్ని అవలీలగా పట్టుకుని తిరిగి శల్యుడి మీదికే విసిరేశాడు. దాంతో శల్యుడి సారథి చచ్చాడు.

పాండవపక్షం దొరలంతా ఆనందంగా అభిమన్యుడిని పొగుడుతుంటే సహించక నీ కొడుకులు అతనిమీద అంపవృష్టి కురిశారు. సారథి చచ్చిన శల్యుడు రౌద్రుడై గద తీసుకుని అభిమన్యుడి మీదికి బయల్దేరాడు. అభిమన్యుడు కూడ ఒక గద తీసుకుని “రా నీ అంతు చూస్తా” అంటూ శల్యుణ్ణి ఎదుర్కున్నాడు. ఐతే అంతలోనే శరవేగంతో అక్కడికి వచ్చిన భీముడు అభిమన్యుణ్ణి పక్కకి నెట్టి తనే శల్యుడితో తలపడ్డాడు.

ఇద్దరూ ఎవరికి వారే సాటి అన్నట్టు భీషణంగా గదాయుద్ధం సాగించారు. వాళ్ల మండలప్రచారాలు, విచిత్రగదా ప్రసారణాలు చూస్తూ అంతా బొమ్మల్లా నిలబడ్డారు. అలా ఎంతోసేపు సాగిందా గదారణం. చివరికి ఇద్దరూ పరస్పర ప్రహారాల్తో కింద పడ్డారు. కృతవర్మ వచ్చి శల్యుణ్ణి పైకెత్తి దూరంగా తీసుకుపోయాడు. భీముడు తెలివి తెచ్చుకుని లేచి గద సారిస్తూ విజయోత్సాహంతో మల్లచరుస్తూ తను గెలిచానని ప్రకటించుకుంటుంటే నీ కొడుకులది భరించలేక ఒక్కసారిగా భీముడి మీదికి దూకారు. ఐతే ఇంతలో ధర్మజ సహితంగా పాండవగణాలు వచ్చి వాళ్లని ఎదుర్కున్నయ్.

అలా పాండవసేనలు ఉత్సాహంగా యుద్ధం చేస్తుంటే కర్ణుడి కొడుకు వృషసేనుడు వాళ్ల మీదికి లంఘించి నానా తిప్పలూ పెట్టాడు. దానికి కోపించి నకులుడి కొడుకు శతానీకుడు అతన్ని తాకాడు. వృషసేనుడతని కేతనాన్ని కూల్చి వింటిని విరిస్తే మిగిలిన ద్రౌపదేయులు ఒక్కపెట్టున అతని మీదికి ఉరికారు. ఐతే అశ్వత్థామ వాళ్లందర్నీ ఎదుర్కుని అనేకాస్త్రాల్తో వాళ్లని వేధిస్తే ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య బలగాల్తో వచ్చి వాళ్లకి సాయంగా నిలిచాడు. ఇలా వచ్చిన పాండవసైన్యం ధాటికి మనసేన నిలవలేకపోతుంటే ద్రోణుడు వీరావేశంతో “ఇప్పుడు నేను ధర్మజుణ్ణి వారించకపోతే కౌరవసేన నిలబడదు. నా ముందు వీళ్లెంత? అర్జునుడిక్కూడా బాణవిద్య నేను నేర్పిందే కదా! పద, చేతుల తీట తీరేట్టు రథికజనాన్ని వేటాడాల్సిన సమయం ఇది” అని సారథిని పురిగొల్పి ధర్మరాజుతో తలపడ్డాడు.

పాండవయోధులంతా ధర్మరాజుకి అడ్డంగా నిలబడి ద్రోణుడితో పోరుతుంటే వాళ్లని లెక్కచెయ్యకుండా ద్రోణుడు విజృంభించి అందర్నీ ఎన్నో విధాలుగా బాధించి అడ్డొచ్చిన చక్రరక్షకుల తలల్ని నరుకుతూ ధర్మరాజు మీదికి దూకి పట్టుకోబోతుంటే పాండవసేన గగ్గోలుగా “ద్రోణుడు ధర్మరాజుని పట్టుకుంటున్నాడు, ఇంకేముంది ఈ పూటతో ఇక యుద్ధం ఐపోయినట్టే” అని అరుస్తుంటే భూకంపం వచ్చేలా దిగ్దంతులు బెంబేలు పడేలా వేగంగా వస్తూ కౌరవసైన్యాన్ని తన బాణపరంపరల్తో ముంచెత్తుతూ అర్జునుడు ఆచార్యుణ్ణి తాకాడు.

కౌరవసేనానీకం మొత్తం ఒక్కసారిగా అతన్ని కప్పితే గాండీవి ఘోరాకారంతో శరవర్షం కురిసి సేనని అల్లకల్లోలం చేశాడు. అతని బాణాల్తో ఆకాశం నిండిపోయి ఎవరెవరో తెలియనంతగా చిక్కటి చీకటి అలుముకుంది. సంధ్యాసమయం కూడ అయింది. ద్రోణుడు సేనని సమకూర్చుకుని వెనక్కి తిరిగాడు. జయతూర్య స్వనాల్తో పాండవులు శిబిరాలకి కదిలారు.

పన్నెండో రోజు.

పొద్దున్నే మనబలాలు యుద్ధానికి సన్నద్ధమయినయ్. ద్రోణుడు లజ్జావిషాదాల్తో దుర్యోధనుణ్ణి చూసి, “అర్జునుడు దగ్గర్లో వుంటే ధర్మరాజుని పట్టటం సాధ్యం కాదని ముందే చెప్పా కదా. మనలో ఎవరైనా ఒకరు అర్జునుణ్ణి దూరంగా తీసుకుపోయి అతన్ని అక్కడే ఉంచగలిగితే ఇంకెవరడ్డమైనా సరే నేను ధర్మజుణ్ణి పట్టిస్తా” అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న త్రిగర్త రాజు సుశర్మ “రారాజా, నీకు నేను ఎప్పుడో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఇది సమయం. ఇవాళ యుద్ధంలో ఉంటే త్రిగర్తులుండాలి లేకుంటే అర్జునుడుండాలి, అంతే” అన్నాడు. అతని తమ్ములూ వంత పలికారు. తుండి, కేరళ, మాళవ, ఇతర దేశాల వాళ్లు పదివేలమంది రాజులు వాళ్లకి తోడయ్యారు. స్నానాలు చేసి అగ్నుల్ని పూజించి ప్రతిజ్ఞలు చేశారు.

ద్రోణుడు గరుడవ్యూహం సమకూర్చాడు. త్రిగర్తాదులు అర్జునుడి దగ్గరకి వెళ్లి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. అర్జునుడు అన్నతో “ఇలా వీళ్లు రమ్మని పిలిస్తే పట్టించుకోకుండా వుండటం ధర్మం కాదు. వెళ్లి వీళ్లని చించి చెండాడటానికి నాకు అనుమతివ్వు. నీకేమీ కాదు, భయం అక్కర్లేదు” అన్నాడు. “ద్రోణుడి ప్రతిజ్ఞ నీకు తెలిసిందే. మరి అది నిజం కాకుండా చెయ్యటానికి ఏదో ఉపాయం ఆలోచించి వెళ్లు” అన్నాడతనితో ధర్మరాజు. అర్జునుడు పాంచాలరాజు సత్యజిత్తుని చూపించి, “ఇతను మహావీరుడు. ఇతను ఉన్నంతసేపు నీకేమీ భయం వుండదు. ఒకవేళ ఇతను మరణిస్తే మాత్రం నువ్వు యుద్ధభూమిలో వుండొద్దు, ఎలాటి సందేహమూ పెట్టుకోకుండా బయటికి వెళ్లు” అని చెప్పి అర్జునుడు త్రిగర్తుల్తో యుద్ధానికి బయల్దేరాడు. అర్జునుడలా వెళ్లటం చూసి మనసైన్యాలు ఉప్పొంగినయ్.

ధర్మరాజు గరుడవ్యూహానికి ప్రతిగా మండలార్థవ్యూహం కట్టించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి “ఇవాళ నువ్వు నీ సంగరపాండిత్యం అంతా చూపాలి సుమా” అని చెప్తే అతను, “అంతకన్నానా, నువ్వే చూద్దువుగా” అంటూ కౌరవసైన్యం మీదికి కదిలాడు. ఎదురుగా వస్తున్న ద్రోణుడు అతన్నే మొదట చూడటం అపశకునంగా భావించి కొంచెం ఖిన్నుడై పక్కకు వెళ్లి పాంచాలబలంతో తలపడ్డాడు.

ఇక త్రిగర్తులు అర్జునుడి కోసం చూస్తూ అర్థచంద్రాకారంగా నిలబడ్డారు. దూరం నుంచి వాళ్లని చూపిస్తూ అర్జునుడు కృష్ణుడితో “వీళ్లని చూశావా, కొవ్వి చావుకి సిద్ధంగా వున్నారు. దుర్మార్గులైనా నా దివ్యాస్త్రాల్తో చచ్చి సుగతికి పోయే ప్రాప్తం వుంది వీళ్లకి” అంటూ దేవదత్తం పూరిస్తే దాని భీకరధ్వనికి ఒక్కసారిగా మానుల్లా నిలబడిపోయారు ధైర్యం నీరై కారుతుంటే. మెల్లగా తెలివి తెచ్చుకుని అతని మీదికి ఒక్కపెట్టున దూకి బాణాలు వేస్తే అతను చకచక పదిహేనువేల రథాల వాళ్లని పరలోకాలకి పంపాడు. అప్పుడు సుబాహుడు, సుశర్ముడు, సురథుడు, సుధన్వుడు కలిసి అతన్ని తాకారు. ఆ వీరుడు సునాయాసంగా వాళ్ల జెండాలు తుంచి పనిలో పనిగా సుధన్వుడి శిరసునీ ఖండించాడు. ఇదిచూసి సైన్యం కకావికలైంది. సుశర్మ అందర్నీ కేకేసి “దుర్యోధనుడి ముందు చేసిన ప్రతిజ్ఞలు ఇంతలోనే మరిచిపోయారా?” అని అదిలిస్తే మెల్లగా కూడసాగారు. కృష్ణుడు రథాన్ని రకరకాల విన్యాసాల్తో నడుపుతుంటే అర్జునుడా సంశప్తక సైన్యాన్ని ఊచకోత కోశాడు.

ఇంతలో నారాయణగోపాలకులు దుర్యోధనుడు కృష్ణుడితో సమానంగా తమని కోరుకున్నందుకు ఆ ఋణం తీర్చుకుంటామని కృష్ణార్జునుల మీద దాడి చేశారు. గాండీవి తనకి విశ్వకర్మ ఇచ్చిన ఒక మహాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగిస్తే దాని ప్రభావంతో వాళ్లు ఒకరినొకరు అర్జునుడనుకుని నరుక్కుని చంపుకున్నారు. అస్త్రం శాంతించింది. చావగా మిగిలిన వాళ్లు అతనితో తలపడ్డారు. అతను అవలీలగా అ హతశేషుల్నీ హతుల్ని చేస్తుంటే తుండి, మగధ, కేరళ, మచ్ఛిల్లిక రాజులు ఒక్కసారి అతని మీద దూకారు. అర్జునుడు ఆ బలగాల్నీ చీల్చి చెండాడుతుంటే సంశప్తకులు రథాల్ని విడిచి గుర్రాలమీద అతన్ని చుట్టుముట్టారు. ఆ దుమ్మూ ధూళికి కృష్ణుడికి అర్జునుడు కనపడక “అర్జునా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఇక్కడ ఏమీ కనపడటం లేదు” అని వ్యాకులపాటుతో పిలిస్తే వాయువ్యాస్త్రంతో ధూళినీ వాళ్లనీ చెదరగొట్టి కృష్ణుడికి కట్టెదుట కనిపించి ఆనందం కలిగించాడతను. ఆ తర్వాత అర్జునుడు ప్రళయావసాన ఫాలాక్షుడై సంశప్తక మూకల్ని గుంపులు గుంపులుగా నాకానికి పంపించాడు.

ఇక్కడిలా ఉండగా అక్కడ ధనురాచార్యుడు ధర్మజ సైన్యాన్ని చిందరవందరగా తరిమాడు. నీ కొడుకు దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుడితో తలపడి ఘోరంగా పోరి ద్రోణుడికి ప్రీతి కలిగించాడు. ఇరువైపుల నుంచి కుమారవర్గాలు కూడ రంగంలో దూకి పోరినయ్. ఐతే ద్రోణ తీవ్రమారుతానికి పాండవబలగం మేఘంలా చితికిపోయింది. రణరంగం గుర్రాలు, భటుల పీనుగుల్తో నిండి రౌద్ర భీభత్స కరుణ భయానక రసహేతువైంది. రక్తం కాలవలై పారింది.

ద్రోణుడు మహోత్సాహంతో ధర్మరాజు మీదికి బయల్దేరాడు. పాండవబలం బిక్కుబిక్కుమన్నది. ఐతే ధర్మజుడు ధైర్యంగా గురువు మీద రకరకాల బాణాలు ప్రయోగించాడు. ఇంతలో పాంచాల రాజు సత్యజిత్తు ద్రోణునిపై ఎగిసి పది శరాల్తో అతన్ని నొప్పించి మరోపది బాణాల్తో అతని సారథిని గుచ్చాడు. ద్రోణుడతని వింటిని విరిచాడు. సత్యజిత్తు వేగంగా ఇంకో విల్లు తీసుకుని ముప్పై బాణాలేశాడు. వృకుడనే మరో పాంచాల రాకుమారుడు సత్యజిత్తుతో కూడుకుని ద్రోణుడి మీద అరవై అమ్ములు వేశాడు. కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ ద్రోణుడు వాళ్లిద్దరి శరీరాల్నీ నిశితశరాల్తో తూట్లు పొడిచాడు. ఐనా వాళ్లు వేగంగా అతని రథాన్ని డీకొట్టి సారథి తూలిపడి కేతనం అల్లాడేట్టు చేశారు. ద్రోణుడు విలాసంగా నవ్వుతూ సత్యజిత్తుని పదిబాణాల్తో గాయాలు చేసి వృకుడి తల ముక్కలు చేసి సత్యజిత్తు వింటిని నరికాడు. అతను భయపడకుండా మరోవిల్లు తీసుకుని తలపడ్డాడు. ఇలా ద్రోణుడు విరచటం, అతను ఇంకో వింటితో ఎదురుతిరగటం మరీ మరీ జరిగాక ఇంకిలా లాభం లేదని ద్రోణుడొక అర్థచంద్రబాణ ప్రయోగంతో అతని తల నరికాడు. ఆ బాహుబలానికి జడుసుకుని ధర్మరాజు పారిపోసాగాడు.

అతని వెంట పడ్డ ద్రోణుడిని విరాటుడి సోదరుడు సూర్యదత్తుడు ఎదుర్కున్నాడు. ఐతే ద్రోణుడతన్ని వెంటనే పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఏరులై పారే రక్తపు మడుగుల్లోంచి ధర్మరాజుని ద్రోణుడు తరుముతుంటే యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి అడ్డుకున్నారు. సాత్యకి, క్షత్రధర్ముడు కూడ వాళ్లతో కలిశారు. అది చూసి ధర్మరాజు వెనక్కి తిరిగి ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు ముందుండగా తనూ ద్రోణుడితో మళ్లీ యుద్ధం ఆరంభించాడు. అప్పుడు మనవైపు రాజులు, రాకుమారులు ద్రోణుడికి సాయంగా వెళ్లారు. ద్రోణుడు వసుదానుణ్ణి క్షేముణ్ణి వేగంగా యముడి దగ్గరికి పంపి మిగిలిన వాళ్లని బాణపరంపరల్లో ముంచెత్తి ధర్మరాజు మీదికి వెళ్తే అతను యుద్ధరంగాన్నుంచి నిష్క్రమించాడు. మిగిలిన వాళ్లూ అతని ధాటికి ఆగలేక బిక్కచచ్చి బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారు.

అదంతా చూస్తున్న దుర్యోధనుడు ఉల్లాసంగా కర్ణుడితో “చూస్తున్నావా, పెనుగాలికి కూలే మొక్కల్లా పాండవసైన్యం ఎలా పారిపోతున్నారో! భీముణ్ణి చూడు ఎలా నీరుగారిపోయి నీరసంగా వున్నాడో! ఇక ద్రోణుడు కనిపిస్తే చాలు ఆ చాయల లేకుండా పోతారీ పిరికిపందలు” అన్నాడు. దానికి కర్ణుడు “అది సరికాదు. నేనిలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు సుమా! పాండవులు అంత తేలిగ్గా ఓడరు. వాళ్లు మహావీరులు. పైగా ఇన్నాళ్లూ వాళ్లకి జరిగిన పరాభవాల్ని తల్చుకుని ప్రాణాలు పోయేవరకు పోరతారు కాని వెనక్కి తిరగరు. వాళ్లు కూడగట్టుకుని ద్రోణుణ్ణి చుట్టుముట్టక ముందే మనం అతనికి సాయంగా వెళ్లటం మంచిది” అని చెప్పాడు. అతనిలా అంటూండగానే ధర్మజ, భీమ, నకుల, సహదేవులు ద్రుపద, విరాట, యాదవ బలాలు తోడు రాగా ద్రోణుడి మీదికి నడిచారు.

ఇలా వచ్చిన పాండవబలం ద్రోణుడిని కప్పేసింది. అతనెక్కడున్నాడో ఎలా వున్నాడో తెలీక నీ కొడుకు కంగారు పడ్డాడు. మనవైపు రాజులంతా వెళ్లి శత్రువుల్ని ఢీకొన్నారు. ద్రోణుణ్ణి చంపాలని వాళ్లూ రక్షించాలని మనవాళ్లూ తీవ్రంగా పోరాడారు. దేవదానవ సంగ్రామాన్ని తలపిస్తూ పోరు ఘోరమైంది.

ఇంతలో నీ కొడుకు ఏనుగు మీద వచ్చి భీముడితో తారసిల్లాడు. భీముడు కోపించి ఆ మత్తేభం కుంభాన్ని మర్దించి దుర్యోధనుణ్ణి బాణాల్తో నొప్పించాడు. అప్పుడు వంగ దేశాధిపతి తన ఏనుగుతో భీముణ్ణి తాకాడు. మహాకోపంతో భీముడా ఏనుగుని కింద పడేసి దాంతో పాటే పడుతున్న వాడి తలని నరికితే అది బంతిలా ఎగిరిపడింది. దాంతో మనబలం కకావికలైంది.

నరకుడి కొడుకు భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుని భీముడి మీదికి తిప్పాడు. నీకు తెలుసుగా, ఇంద్రుడా ఏనుగు మీద రాక్షసుల్ని జయించాడొకప్పుడు. ఆ గజం భీముడి మీదికి వెళ్తుంటే పాండవసేన గగ్గోలు పెట్టింది. ఆ భద్రగజం పాండవసేనలో ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నుగ్గునుగ్గు చేసింది. వాళ్ల సేనలో మహారథులంతా దాన్ని వారించటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సాత్యకి అడ్డొచ్చి బాణాలు సారిస్తే అదతని రథమ్మీదికి వెళ్తే అతను లాఘవంగా దూకి తప్పించుకున్నాడు; అతని రథం చూర్ణమైంది. భీముడు, అభిమన్యుడు, యుయుత్సుడు, ఇతర మహాయోధులంతా వీరం బీరమై దిక్కుతోచక నిలబడ్డారు.

అంతకుముందు భగదత్తుడి ఏనుగు చేస్తున్న భీభత్సాన్ని దూరాన్నుంచి విన్న భీభత్సుడు కృష్ణుడితో “మనం అక్కడికి వెళ్లకపోతే ఇప్పుడా ఏనుగుని ఆపటం అక్కడ ఎవరి తరమూ కాదు, త్వరగా అక్కడికి పోదాం పద” అన్నాడు. కృష్ణుడు రథాన్ని అటు తిప్పాడు. ఐతే పద్నాలుగు వేల మంది సంశప్తకులు వాళ్లని చుట్టుముట్టారు. అటు వెళ్లటమా ఇక్కడే ఉండి వీళ్ల అంతు తేల్చటమా అని ఆలోచిస్తూ అర్జునుడు ముందు వాళ్లని చంపటమే యుక్తమని వెనక్కి తిరిగి దివ్యాస్త్రాలతో ఆ బలగాల్ని చించిచెండాడాడు. కృష్ణుడు మళ్లీ పాండవసైన్యం వైపుకి రథం మరల్చాడు. ఐతే ఈసారి సుశర్మ, అతని సోదరులూ కమ్ముకుని, “అర్జునా ఇలా పిలిచిన వాళ్లతో యుద్ధం చెయ్యకుండా వెళ్లటం ధర్మమా?” అంటే, అతను కృష్ణుడితో, “ఏమిటిప్పుడు నా కర్తవ్యం? నువ్వే చెప్పు” అనడిగితే అతను మాట్లాడకుండా రథాన్ని సంశప్తకుల వైపుకి తిప్పాడు. మొహాన చిరునవ్వుతో అర్జునుడు సుశర్మ తమ్ముల్ని త్వరితంగా యముడి దగ్గరికి పంపి అతన్ని మూర్ఛితుణ్ణి చేసి “అటు చూడు, మనసేన పారిపోతున్నది, భగదత్తుడి ఏనుగు వీరవిహారం చేస్తున్నది. త్వరగా అక్కడికి పోనివ్వు” అంటూండగానే మహావేగంగా రథాన్ని అక్కడికి తిప్పాడు కృష్ణుడు. క్షణక్షణానికి దగ్గరౌతున్న అర్జునుడి దేవదత్త శంఖధ్వానం, గాండివ గుణధ్వని, సింహనాదం అన్నీ కలిసి పాండవబలానికి ఊరట కలిగించినయ్.

వస్తూనే అర్జునుడు భగదత్తుడి మీద, అతని ఏనుగు మీద శరవర్షం కురిపించాడు. భగదత్తుడు సుప్రతీకాన్ని అర్జున రథం మీదికి తోలాడు. దాని తాకిడికి కృష్ణార్జునులు మరణించారనే అనుకున్నారందరూ. పాండవబలగం గగ్గోలైంది. భీతుడై కృష్ణుడు రథాన్ని వేగంగా పక్కకి తిప్పితే గుర్రాలు దాన్ని యుద్ధభూమి బయటికి లాక్కుపోయినయ్. అర్జునుడు అవాక్కయ్యాడు. ఐతే కృష్ణుడిని ఏమీ అనలేక గజం వంక చూస్తూ రథం అటు పోనియ్ అని మాత్రం అనగలిగాడు రోషంగా. కృష్ణుడు అలాగే చేశాడు. భగదత్తుడు కృష్ణుడి మీద బాణాలేశాడు. అలిగి అర్జునుడతని విల్లు విరిచి అతని ఒంటికి అనేక బాణాలు నాటాడు. భగదత్తుడు కోపంతో పద్నాలుగు తోమరాలు అర్జునుడి మీద ప్రయోగిస్తే అతను వాటిని పొడి చేసి ఏనుగు కవచాన్ని నుగ్గు చేశాడు.

భగదత్తుడొక శక్తిని కృష్ణుడి మీద వేస్తే దాన్ని మూడు ముక్కలుగా నరికాడు పార్థుడు. అర్జునుడతని గొడుగుని విరిస్తే వాడు అర్జునుడి కిరీటాన్ని కొట్టాడు. ఒకవంక వాడి కదనకౌశలాన్ని మెచ్చుకుంటూనే మరోవంక క్రోధంతో ఏడు క్రూరనారాచాల్తో వాణ్ణి నొప్పించాడు అర్జునుడు. వాడు వీరావేశంతో తన అంకుశాన్ని అభిమంత్రించి అర్జునుడి వక్షానికి గురిచేసి వేస్తే కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా నిలబడి ఆ మహాస్త్రాన్ని తన వక్షమ్మీద ధరించాడు. దానికి అర్జునుడు చిన్నబుచ్చుకుని “ఇదేం పని, నా అదృష్టం కొద్ది సారథ్యం చేస్తానన్నావు, చేస్తున్నావు. మిగిలిన పనుల్లో నువ్వు వేలుపెడితే అందరి ముందు నా పరువేం కావాలి? ఐనా ఏమనుకుని ఏం లాభం!” అని నిష్టూరమాడితే, పూర్వం యోగనిద్రలో వున్న విష్ణువుని భూదేవి కామించటం, అతని వరం వల్ల ఆమెకు నరకుడు పుట్టటం, వాడికి వైష్ణవాస్త్రం విధేయం కావటం, అదిప్పుడు భగదత్తుడిది కావటం, దాన్ని తను తప్ప ఇంకెవరూ భరించలేకపోవటం చెప్పి అర్జునుణ్ణి అనునయించాడు. “ఆ దివ్యాస్త్రం వృథా కావటంతో వాడిప్పుడు బిత్తరపోయి చూస్తున్నాడు. ఇదే సరైన అదును. నేను వాడి తండ్రిని చంపినట్టు నువ్వు వాడిని అంతం చెయ్యి” అని అతన్ని ప్రోత్సహించాడు. అర్జునుడు తేరుకుని గాండీవ గుణాన్ని సారించి దృఢముష్టితో ఒక దివ్యబాణం వేస్తే అది కొండల్ని పిండి చేసిన వజ్రాయుధంలా సుప్రతీకాన్ని వధించింది. నేలకూలుతున్న ఆ ఏనుగు మీద నుంచి పడుతున్న భగదత్తుడి శిరస్సుని ఒక అర్థచంద్ర శరంతో తుంచాడు అర్జునుడు.

ఇలా దంతిని, భగదత్తుణ్ణి అంతం చేసి అర్జునుడు అడ్డులేక విక్రమిస్తుంటే శకుని తమ్ములు వృషకుడు, అచలుడు అతని మీదికి దూకారు. అతను వృషకుడి రథాన్ని గుర్రాలు, సారథి, ధ్వజం, ఛత్రం, చామరాలతో సహా నుగ్గు చేస్తే వాడు పరుగున అచలుడి రథం ఎక్కాడు. వాళ్లకి అడ్డంగా వచ్చిన ఐదువందల మంది గాంధారరథికుల్ని అర్జునుడు అమరలోకానికి పంపాడు. ఒకే రథాన్నుంచి వాళ్లిద్దరూ అర్జునుడి మీద బాణాలేస్తే అతనా ఇద్దర్నీ సునాయాసంగా చంపాడు. నీ కొడుకులు కళ్లనీళ్లు కుక్కుకున్నారు.

రోషంతో శకుని అర్జునుడితో తలపడ్డాడు. మాయావి కనుక రకరకాల మాయలు పన్నాడు. దాంతో రాళ్లూ చెట్లూ రకరకాల ఆయుధాలూ అర్జునుడి మీద పడినయ్. సర్పాలు శార్దూలాలు మీద దూకినయ్. ఐతే దివ్యాస్త్రవేది ఐన అర్జునుడి ముందు ఆ మాయలు సాగలేదు. అర్జునుడు నవ్వుతూ “జూదంలో నీ మాయలు పనిచేస్తాయేమో గాని యుద్ధంలో కాదు మామా, ఇక్కణ్నుంచి పారిపో” అంటూ వాలుబాణాలతని శరీరాన నాటితే సిగ్గూలజ్జా లేకుండా శకుని దూరంగా పరిగెత్తాడు. చూస్తున్నవాళ్లంతా గొల్లున నవ్వారు.

అప్పుడు భీముడు, సాత్యకి తన రెండుపక్కల వుండగా అర్జునుడు ద్రోణుడున్న చోటికి బయల్దేరాడు. వీరోత్సాహంతో పాండవసైన్యం కదిల్తే ద్రోణుడి చాటుకి చేరింది మనసైన్యం. దుర్యోధనుడు అందరినీ కూడగట్టుకుని ద్రోణుడికి సాయంగా వెళ్లాడు. పాండవులు, కౌరవులు తలపడ్డారు. ఇంతలో చావగా మిగిలిన సంశప్తకులు, నారాయణగోపాలకులు కూడ కూడకట్టుకుని వచ్చి అర్జునుణ్ణి పిలిస్తే అతను వాళ్లతో యుద్ధానికి వెళ్లాడు. ద్రోణుడు ఎటు వెళ్తే అటు ధృష్టద్యుమ్నుడు అతనికి ఎదురై పోరాటం సాగించాడు. ఎటుచూసినా భీకరసమరమే.

భీమార్జునులు మరోవంక మనసేనని దండిస్తుంటే అందరూ కర్ణా కర్ణా నువ్వే దిక్కని కర్ణుడి దగ్గరికెళ్లారు. అతను వాళ్లకి ధైర్యం చెప్పి అర్జునుడితో తలపడి ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే వారుణాస్త్రంతో దాన్ని వారించాడు ఫల్గుణుడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కూడ అతనితో ఢీకొన్నారు. అతనా ముగ్గురి విళ్లనీ విలాసంగా విరిచాడు. అర్జునుడతన్ని ఏడుబాణాల్తో నొప్పించి, అతన్ని దాటి వెళ్లి తనతో తలపడ్డ అతని తమ్ములు ముగ్గుర్ని యముడి దగ్గరికి పంపాడు. భీముడు రథం మీంచి దూకి గదతో అతని బంధువులు పదివేలమందిని చెల్లాచెదురు చేసి రథం ఎక్కి మరో వింటితో కర్ణుడి మీదికి బాణాలు సంధించాడు. సాత్యకీ, ధృష్టద్యుమ్నుడు కూడ అతని మీద విరుచుకుపడ్డారు. ఇదిచూసి కర్ణుడికి సాయంగా దుర్యోధనుడు, ద్రోణుడు, సైంధవుడు వచ్చి పాండవ బలగాన్నెదిరించారు. సంగ్రామం ఘోరమైంది. కొంతసేపటికి సూర్యుడు అస్తమించాడు. మనబలాలు ఫల్గుణుడి పరాక్రమాన్ని, ద్రోణుడి ప్రతిజ్ఞాభంగాన్ని చెప్పుకుంటూ వెనక్కి తిరిగినయ్.

పదమూడవ రోజు


తెల్లవారింది. నీ కొడుకు విషాదవదనంతో అందరికీ వినపడేట్టు ద్రోణుడితో అన్నాడు – “ధర్మరాజుని పట్టిస్తానని నాకు వరం ఇవ్వటం ఎందుకు, దాన్ని తీర్చలేక ఇప్పుడిలా అందరి ముందు నువ్వూ నేనూ చులకన కావటం ఎందుకు? ఇలా నన్ను వెర్రివాణ్ణి చేస్తే నీకు ఒరిగిందేమిటి?” అని. ఆ మాటలు నచ్చకపోయినా బాధపడకుండా ద్రోణుడన్నాడూ – “నరనారాయణులు అక్కడుంటే ధర్మరాజుని పట్టటం సాధ్యమా? ఇవాళ ఏం చేస్తానో చూద్దువు గాని, ఎలాగైనా అర్జునుణ్ణి దూరంగా తీసుకువెళ్లే మార్గం చూడు. ఇచ్చిన మాట తప్పుతానా?”

అప్పుడు సంశప్తకులు మేం తప్ప అతన్ని పక్కకి తీసుకెళ్లి అక్కడే యుద్ధంతో తీరికలేకుండా ఉంచగలిగే వాళ్లు ఇంకెవరూ లేరు అని వెళ్లి మళ్లీ అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచారు. అర్జునుడలా వెళ్తే ద్రోణుడు పద్మవ్యూహం సంఘటించాడు. దానికి అనేక రాజులు దళాలు. రాజకుమారులు కేసరాలు. కర్ణ దుశ్శాసనుల్తో దుర్యోధనుడు కర్ణిక. వలయాకారంగా వుంటుంది గనక కొందరు దాన్ని చక్రవ్యూహం అని కూడ అంటారు. ఆ వ్యూహానికి ముఖస్థానాన ద్రోణుడు దర్పంతో నిలబడ్డాడు. అవసరమైన చోట్లలో రక్తమాల్యాలు ధరించి సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, నీకొడుకులు, మనవలు నిలిచారు. పాండవసైన్యం భీకరంగా వచ్చి ద్రోణుణ్ణి తాకింది. ఐతే అతని బాణధాటికి నిలబడి ఎవరూ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించలేక పోయారు.

ధర్మరాజు కల్లోలపడ్డాడు. ఈ ఆపద నుంచి బయట పడెయ్యగలిగింది ఎవరా అని చుట్టూ వెదుకుతుంటే ఉత్సాహ, శౌర్య సంపదల్లో దుర్నిరీక్ష్యుడైన అభిమన్యుడు కనపడ్డాడు. అతన్ని చూసి వీడు తప్ప ఇంకెవరూ ఈ మొగ్గరాన్ని నుగ్గు చెయ్యలేరని నిశ్చయించాడు ధర్మరాజు. “దీన్ని భేదించటం అర్జునుడికీ నీకూ కృష్ణుడికీ ప్రద్యుమ్నుడికీ మాత్రమే తెలుసు. కనుక నువ్విప్పుడు దీన్ని ఛేదించి మన పరువు కాపాడు” అనడిగాడు. దానికతను చిరునవ్వు ముఖంతో “మా తండ్రి నాకు దీన్ని భేదించే మార్గం చెప్పాడు. కనుక వ్యూహాన్ని విచ్ఛిన్నం చేసి లోనికి వెళ్లి శత్రుబలగాల్ని చించి చెండాడతా. కాని శత్రువులు మూకుమ్మడిగా చుట్టుముడితే బయటికొచ్చే దారి మాత్రం నాకు తెలీదు. ఐనా దానికేముంది, అవసరాన్ని బట్టి ఏదో చేస్తాలే. నేను ఈ మొగ్గరాన్నెలా ప్రవేశిస్తానో చూద్దువుగా” అన్నాడు ఉల్లాసంగా.

దానికి ధర్మజుడు “నువ్వు తెరిస్తే నీవెనకే మేమూ వస్తాం. అదే నువ్వు మాకిచ్చే వరం” అని చెప్పాడు. భీముడు కూడ, “నువ్వు ముందు ఈ వ్యూహం లోకి కొంచెం దారి చెయ్యి చాలు, నేనూ సాత్యకీ ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడు విరాటుడు నీ వెనకే వచ్చి దాన్ని చెల్లాచెదురు చేసేస్తాం” అన్నాడు. దానికి అభిమన్యుడు, “ధర్మజుడు ఇంత ప్రీతిగా అడిగి గౌరవిస్తే, ద్రోణుడు మెచ్చేట్టు ఆ మొనని పిండి చెయ్యకుండా ఉంటానా? కొడుకుని కని అర్జునుడూ సుభద్రా పొందిన ఆనందం వమ్ము చేస్తానా? వయసులో చిన్నవాడినైనా గోపకుడినై కౌరవమూకల్ని గోవుల్లా తోలి చూపిస్తా. మామకి, తండ్రికి ప్రియం చేస్తా. సుయోధనుడు బిత్తరపోయేట్టు చేస్తా” అన్నాడు ఉబుకుతున్న ఉత్సాహంతో. ధర్మరాజు “నీ ధైర్యం, శౌర్యం, బలం, కీర్తి వర్ధిల్లుతాయ”ని దీవించాడు.

అభిమన్యుడు తన సారథితో రథాన్ని ద్రోణుడి మీదికి పోనివ్వమన్నాడు. ఆ సుమిత్రుడు అనుమానంగా “నువ్వా బాలుడివి. అనేక యుద్ధాల్లో ఆరితేరిన ద్రోణాదులు తొలియుద్ధం చేస్తున్న నీ చేతిలో ఓడుతారనుకోవటం అత్యాశేమో” అంటే “ద్రోణాదులే కాదు ఇంద్రాదులొచ్చినా, ఆ ఫాలాక్షుడే స్వయంగా పూనుకున్నా నేను జయిస్తా. ఏం భయమక్కర్లేదు, పద” అని అదిల్చి ద్రోణుడి కెదురుగా బయల్దేరాడు. అతని వెనకే మిగతా సేన కదిలింది. ద్రోణాదులు వాళ్లనెదుర్కుని పోరారు. ఐతే మెరుపు మెరిసినట్టు బాణవర్షంలో ద్రోణుణ్ణి ముంచి అతన్ని దాటి మొగ్గరం లోకి జొరబడ్డాడు అభిమన్యుడు.

ఇలా భేదించటం మహా కష్టమైన ఆ పద్మవ్యూహాన్ని అవలీలగా ఛేదించి ప్రవేశించిన అభిమన్యుడు తన శరపరంపరల్తో కౌరవసేనని కల్లోలసముద్రం చేశాడు. విరిగిన రథాలు, తెగిన తలలు, ముక్కలైన కేతనాలు, చెల్లాచెదురుగా పడ్డ చేతులు, కాళ్లు, గుర్రాలు, ఏనుగులు – వ్యూహం కాస్తా విచ్చి చితికి దీనదశకి చేరుకుంది. ఇది చూసి సహించలేక నీ కొడుకు అతని మీదికి దూకబోతుంటే ద్రోణుడు చెయ్యి ఊపి పెద్దరాజుల్ని కేకేసి “దుర్యోధనుడు అభిమన్యుడి వాత పడకుండా అడ్డుపడండి, మీ శౌర్యపరాక్రమాలు చూపండి” అని ఎలుగెత్తి చెప్తూ తన రథాన్ని అటుకేసి మళ్లించాడు.

కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, సౌబలుడు, పౌరవుడు, శల్యుడు, వృషసేనుడు దుర్యోధనుడికి అడ్డుగా నిలిచి అభిమన్యుడితో తలపడ్డారు. నోటి కండ లాక్కుంటే దూకే పులిలా విజృంభించి అభిమన్యుడు వాళ్లని చెల్లాచెదురు చేశాడు. లేళ్లగుంపులా పారుతున్న ఆ యోధానుయోధుల్ని చూసి వీణ్ణి వారించటం వీళ్ల వల్ల అయే పనికాదని స్వయంగా తనే అందుకు పూనుకున్నాడు ఆచార్యుడు. పారిపోతున్నవాళ్లు కూడ అతన్ని వచ్చి కలిశారు. ఐతే అభిమన్యుడు అందరినీ సమాధానపరిచి తన నిశితశరాల్తో శరీరాలు తూట్లు పొడుస్తుంటే దుర్యోధనుడు సేనకి చెయ్యి ఊపి పిలిచాడు. బలవంతులైన అనేకమంది దొరలొచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు.

అభిమన్యుడు తన మీదికి ఆవేశంగా వచ్చిన అశ్మకుణ్ణి రథంతో సహా నుగ్గుచేశాడు. అదిచూసి విరుగుతున్న బలాల్ని కూడకట్టి ద్రోణాదులు, నీ కొడుకులు కొందరు అభిమన్యుడితో తలపడితే అతను వాళ్లందరికీ గాయాలు చేసి కర్ణుడి వెంట పడ్డాడు. అతను వేసిన ఒక క్రూరనారాచం కర్ణుడి కవచాన్ని చొచ్చి గాయం చేస్తే అతను కటకట పడ్డాడు. అభిమన్యుడు నీ కొడుకుల్నందర్నీ కూడ అలాగే చేస్తే వాళ్లు వెనక్కి తగ్గారు. శల్యుడు వేగంగా వచ్చి తాకితే అంతే వేగంగా అతన్ని మూర్ఛితుణ్ణి చేస్తే నీ బలాలు ద్రోణుడు వారిస్తున్నా వినకుండా దిక్కులేకుండా పారిపోయినయ్. శల్యుడలా ఐతే అతని తమ్ముడు కోపోద్రేకంతో పది తీవ్రబాణాల్తో అభిమన్యుణ్ణి గుచ్చాడు. దాంతో అభిమన్యుడు కాలయముడై వాడి గుర్రాల్ని చంపి, సారథిని కూల్చి, పతాకని పటుక్కున విరిచి, వాడి రెండు ఘనబాహువుల్నీ తుంచి, వేగంగా వాడి దగ్గరికి వెళ్లి భల్లంతో వాడి తల నేల దొర్లించాడు.

కౌరవవీరానీకం కలిసికట్టుగా అతన్ని కమ్ముకుంది. ఐనా అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ అన్ని రూపులా తానే బలుపిడుగులు కురిసే ప్రళయమేఘంలా భల్లాలు, అంజలికాలు, క్షురాలు, ప్రకూర్మాలు, నఖరాలు – ఇలా నానా రకాల ఆయుధాల్తో మనసేనని అల్లకల్లోలం చేస్తుంటే విచ్చి పారే సైన్యాన్ని ఆపలేక ఆచార్యుడు నివ్వెరపోయి చూస్తూ నిలబడ్డాడు. ఐతే అలా విరిగిన మనసేనని పోనివ్వకుండా వెంట తరిమి అభిమన్యుడు తన రథాన్ని కొరివి తిప్పినట్టు చుట్టూ తిప్పుతూ పీనుగుపెంటలు చేశాడు.

అప్పుడా కుమారుడి వీరవిక్రమాన్ని చూసి ద్రోణుడు ముచ్చటపడ్డాడు. దుర్యోధనుడికి బుద్దొచ్చేలా అతనికి వినపడేట్టు కృపుడితో ఇలా అన్నాడు – “ఈ విజయాత్మజుడు చూశావా, ఒక్కడే మన బలంలో వున్న యోధానుయోధులందర్నీ కలిపి ఎలా మట్టిగరిపిస్తున్నాడో!” అది విని అతిదీనంగా చూస్తూ నవ్వుగానినవ్వు నవ్వుతూ నీ కొడుకు తన చుట్టూ వాళ్లతో అన్నాడు -“ఈ ధనురాచార్యుడి మాటలు వింటున్నారా – ఒక్క బాలుణ్ణి, వెర్రివెధవని ఎంత పెద్ద చేసి పొగుడుతున్నాడో? అర్జునుడి మీది పక్షపాతం చూపించుకుంటున్నాడు గాని ద్రోణుడే తల్చుకుంటే వీడిలా చెలరేగ్గలడా? అది తెలీక వీడు ఇదంతా తన పోటుతనం అనుకుంటున్నాడు. అందరూ కలిసి దూకి వీడి అంతు చూడండి.” అది విని అందరూ అభిమన్యుడి మీదికి వెళ్లబోతుంటే దుశ్శాసనుడు వాళ్లని ఆపి “వీడి సంగతి చూడటానికి ఇంతమంది ఎందుకు, నేనొక్కణ్ణే వీణ్ణి అంతం చేస్తా. అది విని కృష్ణార్జునులూ చస్తారు. దాంతో మన పగ తీరిపోతుంది,” అని ఒక్క అరుపు అరిచి ఆవేశంగా అభిమన్యుణ్ణి తాకాడు.

కరలాఘవాలు, శరలాఘవాలు, విచిత్ర రథప్రచారాల్తో వాళ్లిద్దరూ యుద్ధం సాగించారు. మిగిలిన వాళ్లంతా ప్రేక్షకులై చూస్తున్నారు. అభిమన్యుడు నీ కొడుకు విల్లు తుంచి భల్లాల్తో ఒళ్లు తూట్లు చేసి “అప్పుడు సభలో ధర్మరాజుకి బాధ కలిగించేట్టు నువ్వన్న మాటలకి ఫలితం ఇప్పుడు చూపిస్తా నీకు, పిరికిపందా! పారిపోకుండా కొంచెం సేపు నిలబడి తలపడు. నిన్ను చంపి నన్ను పెంచిన వాళ్ల ఋణం తీర్చుకుంటా” అని అతని వీపు సంధి ఎముకల్లో ఒక వాలాన్ని, వక్షాన మరికొన్ని వాలాల్ని గుచ్చితే ఎప్పుడో చచ్చిన పీనుగులా రథమ్మీద చేరగిలపడ్డాడతను. సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అది వరకు అభిమన్యుడి వెనకనే వచ్చి వ్యూహం లోకి జొరబడి అడ్డుపడిన బలాల్తో పోరుతూ తలలెత్తిచూస్తూ అభిమన్యుడి యుద్ధం గమనిస్తున్న పాండవులు అది చూసి ఆనందంతో అరిచారు.

దుర్యోధనుడు బాధగా కర్ణుణ్ణి చూసి వీడు దుశ్శాసనుణ్ణి ఎలా గాయపరిచాడో చూశావా అంటే అర్థం చేసుకుని అతను తన బలాల్తో అభిమన్యుడి మీదికి నడిచి దివ్యాస్త్రాలు వేస్తే అభిమన్యుడు లెక్కచెయ్యకుండా అతనితో తలపడితే యుద్ధంలో కర్ణుడు అలిసిపోవటం చూసి అతని తమ్ముడు అభిమన్యుడి మీద బాణపరంపరలు విసిరాడు. క్రోధంతో అభిమన్యుడు ఓ భల్లంతో వాడి శిరస్సుని ఖండించాడు. అది చూసి కర్ణుడు పక్కకి తొలిగిపోతే అతని సైన్యం అభిమన్యుణ్ణి కప్పుకుంది. అతను వాళ్లని చిందరవందర చేసి కర్ణుడి వెంటపడితే అతను భయంతో పారిపోయాడు. అతన్ని చూసి సైన్యం కూడ కకావికలైంది. అప్పటికీ ద్రోణుడు పేరుపేరునా పిలిచి కర్ణా నిలబడు, కృపా ఇలా పారిపోతే ఎలా, బాహ్లికా ఇలా భయపడటం తగునా, రారాజా నీ బలం ధైర్యం చూపి నిలబడు అంటూ ఎంత పురికొల్పినా ఎవరూ అతన్ని పట్టించుకోనేలేదు.

అభిమన్యుడు ఉత్సాహంతో సింహనాదం చేసి శంఖం మోగించి విల్లుతాడు సారించి తనివి తీరక ఆ దొరలందర్నీ తరిమి తరిమి కొట్టాడు. రణరంగం దారుణమైంది. ఎటు చూసినా అవయవాలు, శవాలు, నెత్తుటి మడుగులు. అప్పటి మధ్యాహ్న సూర్యుడూ తనూ ఒకరే ఐనట్టు ఆ బాలుడు తీవ్రుడై మన సైన్యాన్ని కాల్చి మసిచేశాడు.

ఇది వింటున్న ధృతరాష్ట్రుడికి ఒక సందేహం కలిగింది “సంజయా, బాలుడొక్కడే అంతమంది మహారథుల్తో పోరుతుంటే పాండవుల్లో ఒక్కరు కూడ వాడికి తోడుగా రాక పోవటం ఎలా జరిగింది?” అనడిగాడు. దానికి సంజయుడు “పాంచాల యాదవ పాండ్య కేకయ విరాట సైన్యాలు తోడురాగా మన సేనల్ని అల్లకల్లోలం చేస్తూ అభిమన్యుడి వెనకే కదిలొచ్చిన పాండవసైన్యాన్ని సైంధవుడు అడ్డుకున్నాడు” అని చెప్తే ధృతరాష్ట్రుడు “అలా పాండవుల్ని అడ్డుకోవటానికి సైంధవుడెంత తపస్సు చేశాడో కదా, లేకుంటే అదెలా సాధ్యం?” అన్నాడు. “నువ్వన్నది నిజమే. పాండవులు అరణ్యాల్లో ఉన్నప్పుడు ద్రౌపది విషయంలో తనకి జరిగిన అవమానానికి బాధపడి పరమేశ్వరుణ్ణి గురించి గాఢతపస్సు చేశాడతను. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే పాండవుల్ని నివారించే వరం కోరుకుంటే ఆ మహాదేవుడు ఒక్కరోజు అర్జునుడు తప్ప మిగిలిన పాండవులందర్నీ నివారించే వరం ఇచ్చాడు. అందువల్ల అతనికి ఆరోజు ఆ గౌరవం దక్కింది” అని యుద్ధక్రమం చెప్పటం కొనసాగించాడు సంజయుడు.

సింధుదేశపు స్థిరవారువాలు కట్టిన రథమ్మీద వరగర్వంతో నిలిచి నీ అల్లుడు సైంధవుడు సాత్యకిని, భీముణ్ణి, ధృష్టద్యుమ్నుణ్ణి, విరాటుణ్ణి, శిఖండిని, ద్రుపదుణ్ణి, ద్రౌపదీయుల్ని, కేకయుల్ని, ధర్మరాజుని – అందర్నీ తనొక్కడే ఎదుర్కుని వారించి ముప్పుతిప్పలు పెట్టాడు. అంతకుముందు అభిమన్యుడి విక్రమానికి నుగ్గైన రథాలు, జంతుకళేబరాలు కూడ వాళ్ల మార్గాన్ని దుర్గమం చేశాయి. ఇంతలో అభిమన్యుడి ధాటికి పారిపోతున్న మన సేనలు కూడ వచ్చి సైంధవుణ్ణి కలిసి పాండవబలగాల్ని కదలకుండా చేసినయ్.

అక్కడ ద్రోణుడు అతిప్రయత్నం మీద కొన్ని బలగాల్ని కూర్చుకుని అభిమన్యుడిని తాకాడు. వాళ్లలో కర్ణుడి కొడుకు వృషసేనుడు అభిమన్యుడి మీద బాణవర్షం కురిపిస్తే అతను క్రోధంతో వాడి సూతుణ్ణి చంపి, విల్లు తుంచి, గుర్రాల ముఖాల్ని బాణాల్తో గుచ్చితే పీనుగులా పడివున్న అతన్ని తీసుకుని గుర్రాలు దూరంగా పరిగెత్తినయ్. ఐతే అభిమన్యుడు వదలకుండా వాణ్ణి తరుముతూ వెంటపడితే వసాతి అనే రాజు అతన్నెదుర్కుని ఆరు బాణాలేశాడు. అభిమన్యుడు వాణ్ణి ఒక బాణంతో పడేస్తే వాడు కిందపడి తన్నుకుని చచ్చాడు.
మన సైన్యం మళ్లీ కొంత కూడకట్టుకుని అతన్ని చుట్టుముడితే అభిమన్యుడు లేళ్ల మీదికి దూకే బెబ్బులి లాగా దొరికిన వాళ్లని దొరికినట్టు రాజుల్ని ఊచకోత కోశాడు. సైన్యం అతలాకుతులమౌతుంటే శల్యుడి కొడుకు రుక్మరథుడనేవాడు మీకేం భయం వద్దు, నేను వీణ్ణిప్పుడే చంపుతానని అతని ఉరాన తొమ్మిది అమ్ములు, భుజాన రెండు నాటి ఇంకా వెయ్యబోయేంతలో అభిమన్యుడు ఒక శరంతో వాడి చేతిని మరోరెంటితో వాడి తలనీ నరికేశాడు. అదిచూసి రుక్మరథుడి స్నేహితులు అనేకమంది రాజులు ఒక్కమారుగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. దాంతో అభిమన్యుడి కథ ముగిసిందని నీ కొడుకు ఆనందించాడు.

ఐతే అభిమన్యుడు అలా చుట్టుముట్టిన వాళ్ల మీద గాంధర్వి ఐన ఒక మాయని ప్రయోగించాడు. అది అదివరకు అర్జునుడి తపస్సుకి మెచ్చి తుంబురాదులు ఇచ్చింది. దానివల్ల ఆ రాజులకి అనేకమంది రథికులు వచ్చి తమతో తలపడుతున్నట్టు అనిపించి దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరయారు. ఈలోగా అభిమన్యుడు తన రథాన్ని గిరగిర తిప్పుతూ వాళ్లని నానా తిప్పలు పెట్టాడు. వాళ్లు పారిపోయారు. ఇది సహించలేక నీ కొడుకు స్వయంగా అతన్నెదుర్కుని కొంతసేపు యుద్ధం చేశాడు కాని అభిమన్యుడి ప్రతాపానికి ఆగలేక వెనక్కి తప్పుకున్నాడు.

చివరికి దుర్యోధనుడు కూడ అలా వెనక్కి తగ్గేసరికి నీ కొడుకులు దిగాలు పడిపోయారు. అప్పుడు దుర్యోధనుడు తిరిగి మన సేనల్ని కూడుకుని అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, బృహద్బలుడు, సౌబలుడు తోడుగా అభిమన్యుణ్ణి ఎదుర్కున్నాడు.

ఇంతలో నీ మనవడు లక్ష్మణుడు సింగపుకొదమలా అభిమన్యుడి పైకి దూకితే కొడుకు ఒంటిగా అభిమన్యుడితో యుద్ధం చెయ్యటం చూసి దుర్యోధనుడు కంగారు పడుతుంటే అక్కడున్న మనవాళ్లంతా అభిమన్యుడి మీద బాణాలు కురిపించారు. ఐతే అభిమన్యుడు ఘోరశరాల్తో వాళ్లని వారిస్తూనే “తెలిసి తెలిసి నాతో తలపడ్డావ్, ఇంకెక్కడికి తప్పించుకుంటావ్” అంటూ అతని వక్షాన, బాహువుల్లో బాణాలు నాటి మణికుండలాల్తో ప్రకాశించే అతని తలని నరికి నేల పడేశాడు. మన సైన్యం గొల్లుమంది. ఆ దృశ్యం చూసిన నీ కొడుకు ఆగ్రహోదగ్రుడై “ఇంక వీణ్ణి వదలొద్దు పొడవండి చంపండి” అనరిచాడు. మన మహారథులంతా నిశితశరాల్తో అభిమన్యుడిని ముంచెత్తారు.

అతను వాళ్ల అమ్ముల్ని వమ్ము చేసి సైంధవుడితో పాండవులు యుద్ధం చేస్తున్న వైపుకి తన రథాన్ని నడుపుతుంటే నిషాదులు, కాళింగులు గజబలాల్తో అతన్ని అడ్డుకున్నారు. అతను వాళ్లతో ఘోరంగా పోరుతూంటే వెనక మిగిలిన పెద్ద యోధులంతా మళ్లీ అతన్ని చుట్టుముట్టారు. అక్కడ సైంధవుడు కూడ పాండవబలాల్ని లోపలికి కదలనివ్వకుండా ఎంతో చాకచక్యంతో పోరాడుతున్నాడు.

అభిమన్యుడు ద్రోణుణ్ణి పదిహేను బాణాల్తో, ఎనభై బాణాల్తో కృతవర్మని, పది విశిఖాల్తో అశ్వత్థామని, ఒక్క పెద్ద నారసంతో కర్ణుణ్ణి నొప్పించి కృపుడి రథాన్ని విరిచి బృహద్బలుడికి ముప్పై బాణాలు నాటి వాళ్ల చుట్టూ వున్న అనేకమంది రాజుల్ని యముడి దగ్గరికి పంపాడు. బృహద్బలుడు ఎన్నో బాణాలేస్తే అతను వాడి వింటిని, జెండాని విరిచి, సారథిని గుర్రాల్ని చంపాడు. వాడో క్రూరమైన కత్తితో కిందికి దూకి తలపడబోతే అభిమన్యుడు విసిరిన ఒక భల్లం వాడి వక్షాన్ని చీల్చింది, వాడు పరలోకాలకి పోయాడు. వాడి బంధువులు అనేకమంది కమ్ముకుంటే ఇంతలో ఆ దగ్గర్లో వున్న కర్ణుణ్ణి చూసి అతనితో తలపడ్డాడు అభిమన్యుడు. వాళ్లిద్దరూ భయంకరంగా పోరాడారు. మగధపతి సుశర్మ కొడుకు అశ్మంతకుడు వచ్చి తాకితే సారథి, గుర్రాలు, రథికుడు – అందరి తలలూ వరసగా నరికి అభిమన్యుడు సింహనాదం చేశాడు.

అదిచూసి భరించలేక దుశ్శాసనుడి కొడుకు అభిమన్యుడి మీదికి లంఘించి నాలుగు బాణాల్తో గుర్రాల్ని, ఒకదానితో అతని సారథిని, పదిబాణాల్తో అతని శరీరాన్ని నాటితే అభిమన్యుడు “ఇంతకుముందే నీ తండ్రి ఓడిపోయి పారిపోయాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్. నువ్వెక్కిడికి పోతావో చూస్తా” అంటూ ఏడు నిశితశరాల్తో పీడించి ఒక గొప్ప నారసాన్ని బలంగా వేస్తే హడావుడిగా అశ్వత్థామ దాన్ని మధ్యలోనే ఖండించాడు. ఐతే అభిమన్యుడతని వంక నైనా చూడకుండా నీ మనవడి విల్లు తుంచి సారథిని చంపి ఆరు బాణాలు వక్షాన నాటితే వాడు గబాల్న ఇంకో రథమ్మీదికి ఉరికాడు.

అప్పుడు శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు అనే మేటిరాజులు అతన్ని తాకితే అభిమన్యుడు క్షణంలో వాళ్లందర్నీ ఖండఖండాలు చేసి ఇక దుర్యోధనుడి వైపుకి కదిలాడు. అదిచూసి కర్ణుడు ద్రోణుడితో “వీరరథికుల్ని చెండాడుతూ వీడిప్పుడు రారాజు మీదికే వెళ్తుంటే నువ్విలా ఊరికే ఉండటం భావ్యమా” అని నిష్టూరమాడి దుర్యోధనుడికి అడ్డుగా వెళ్లాడు.

ద్రోణుడు అక్కడున్న యోధులందరితో “అర్జునుడెంతో వీడంత, వయసుకి చిన్నే గాని తేలిగ్గా దొరికేవాడు కాదు. మనందరం కలిసి ఒక్కసారిగా వీణ్ణి ఎదుర్కుందాం” అని ప్రోత్సహిస్తే వాళ్లు అభిమన్యుడితో తలపడ్డారు. ఈలోగా అభిమన్యుడి దెబ్బకి హతాశుడై కర్ణుడు, “అర్జునుడితో మనం ఇదివరకు యుద్ధాలు చెయ్యలేదా, ఎన్నడూ ఇలా దెబ్బలు తిన్నది లేదు” అంటే ద్రోణుడు చిన్న నవ్వు నవ్వి అన్నాడూ -“అర్జునుడికి నేను కవచధారణమనే విద్యని నేర్పాను, అది వీడు నేర్చుకున్నాడు. దాని మూలాన వీడి చేతిలో ధనుస్సుండగా ఎదురుపడి వీణ్ణి నొప్పించటం దేవతలకైనా సాధ్యం కాదు. వంచనతో మనం ఒక్కసారిగా వీడి విల్లు విరిచి, సారథిని చంపి, రథం నుగ్గుచేస్తే కాని మనకి అవకాశం కలగదు. నువ్వలా చెయ్యగలవా?”

అది విని కర్ణుడు అభిమన్యుడికి భయపడి వెనక్కి తగ్గినట్టు నటించి వెనగ్గా తిరిగి వచ్చాడు. అభిమన్యుడి ఎదుట వున్న వాళ్లు అతని దృష్టి మరలకుండా అతనితో పెనుగుతుంటే వెనక నుంచి ఒక వాడి బాణంతో అతని విల్లు విరిచాడు కర్ణుడు. అదే సమయమని ద్రోణుడు అశ్వాల్ని కూల్చాడు. కృపుడు సారథిని చంపాడు. అలా నిరాయుధుడు, విరథుడు ఐన అభిమన్యుణ్ణి శకుని, కృతవర్మ, శలుడు, బాహ్లికుడు, అశ్వత్థామ, ఇంకా అనేకులు అస్త్రశస్త్రాల్తో చిక్కుపరిచారు. ఐతే అభిమన్యుడు వాలుని పలకని తీసుకుని పైకెగిరాడు. రథాలు, గుర్రాలు, ఏనుగుల మీద దూకుతూ విహరిస్తుంటే ఎవరి మీద దూకుతాడోనని అందరూ గగ్గోలు పడ్డారు.

ద్రోణుడు ఒక బల్లెంతో వాలుని విరిచాడు. కర్ణుడు పలకని ముక్కలు చేశాడు. అభిమన్యుడు తన రథమ్మీద వున్న చక్రాన్ని చేతబట్టి అడ్డున్న సైన్యాన్ని చంపుతూ ద్రోణుడి మీదికి పరిగెత్తుతుంటే శకుని, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన వాళ్లు ఒక్కుమ్మడిగా ఆ చక్రాన్ని ముక్కలు చేశారు. అతను వేగంగా గద తీసుకుని అశ్వత్థామ మీదికి దూకితే అశ్వత్థామ రథమ్మీంచి దూకి వెనక్కి పరిగెత్తాడు. అభిమన్యుడతని సారథిని గుర్రాల్ని గదతో మోది సౌబలుడి వైపుకి నడిచాడు. అడ్డుపడిన గాంధార రాజుల్ని చంపి వసాతి బంధువులు పదిమందిని వాళ్ల ఏనుగులతో సహా పీనుగుల్ని చేశాడు.

అంతటి భీభత్సమైన సమరం సాగిస్తూ విరథుడై, విల్లు లేక, ఒంటిగా చాలా అలిసిపోయివున్నాడతను. శరీరం స్వాధీనం తప్పుతున్నది, తూలుతున్నది. ఐనా పళ్లబిగువున, మనోనిశ్చయంతో దీక్షగా తనని తప్పించుకు పోయే వాళ్లని అవమానిస్తూ ఎదుర్కున్న వాళ్లని చంపుతూ వీరవ్రతం సాగించాడు. ద్రోణాది ప్రముఖులు దూరంగా నిలబడి చూస్తున్నారు ఏం చెయ్యాలో తోచక. ఆ స్థితిలో అతన్ని చంపటానికి వాళ్లెవరూ సాహసించలేకపోయారు.

అప్పుడు దుశ్శాసనుడి కొడుకు రథం మీద అక్కడికి వస్తే తన గదతో వాడి సారథిని గుర్రాల్ని చంపాడు అభిమన్యుడు. వాడు క్రోధంతో ఒక గద తీసుకుని అతన్ని ఎదుర్కున్నాడు. చూచేవారికి అద్భుతమూ శోకమూ కలుగుతుండగా ఉగ్రంగా రణం సాగించి ఒకరొకరి శరీరాల్ని మాంసపు ముద్దలుగా మోదుకుని తుదిశ్వాస విడిచే వరకు రాజధర్మాన్ని పాటించి కన్నుమూశారిద్దరూ.

నెత్తుటినేల ఎర్రటి ఆకాశమైంది. అందులో చంద్రుడిలా అభిమన్యుడు. ఆయుధఖండాలు, భూషణాలు, మణులు తారల్లా వున్నాయి.

సముద్రం లాటి యుద్ధభూమిలో యోగనిద్రలో వున్న విష్ణువులా పవళించివున్నాడతను.

పాండవబలం శోకసంద్రమైంది. మన సైన్యం సంతోషంతో బొబ్బలు పెట్టింది.

“అనితర సాధ్యమైన పరాక్రమ విక్రమంతో ఆచార్యాది మహాయోధులందర్నీ అల్లకల్లోలపరిచి వీరస్వర్గం అందుకున్న అభిమన్యుడి గురించి మనం కలత పడకూడదు. శత్రువుల్ని చంపి గెలుపు సాధించటమే మన కర్తవ్యం” అని ధర్మరాజు తన సేనకి ధైర్యవచనాలు చెప్పాడు.

సంధ్యాసమయం ఐంది. యుద్ధభూమంతా నెత్తుటిగడ్డలా కనిపించింది. పిశాచాలు, నిశాచరులు రక్తపానం చేస్తూ మాంసాలు తింటూ ఆడుతూ పాడుతున్నారు. సైన్యాలు శిబిరాలకి చేరుకున్నయ్.

సమరవేషాలు తీసేసి శూన్యాకారాల్తో ధర్మజాదులు శోకసంతప్తులయారు. ధర్మరాజు “నన్ను సంతోషపరచాలని యోధానుయోధుల రక్షణలో ఉన్న నిర్భేద్యమైన సైనిక వ్యూహాన్ని ఛేదించి ఒంటరిగా ఎందరో మహారథుల్ని వధించాడు. దుశ్శాసనుణ్ణి ఓడించి చతురంగబలాల్ని తూర్పారబట్టాడు. ఇది మరెవరికైనా సాధ్యమయే పనేనా? ఇప్పుడు అర్జునుడు వచ్చి కొడుకెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పగలన్నేను? కృష్ణుడికి అతని చెల్లెలికి ఎంత దుఃఖం తెచ్చిపెట్టాను ! బాలుడే, సుకుమారుడే, యుద్ధాల్లో అనుభవం లేనివాడే, అలాటి వాణ్ణి చూస్తూ చూస్తూ మొన చీల్చమని పంపిన నన్ను ఏమనుకోవాలి? వాడితో నేను కూడ పోయివుంటే బాగుండేది, ఇప్పుడు అర్జునుడికి నా మొహం ఎట్లా చూపిస్తాను? ఇంద్రుడంతటి వాడే సాయం కోరి వస్తే వెళ్లి కాలకేయాది రాక్షసుల్ని సంహరించిన వాడి కొడుకు శత్రువుల చేత చిక్కి మరణించాడని అతనికి మచ్చ తెచ్చిపెట్టాను కదా. ఇప్పుడీ మాట విని అర్జునుడేం చేస్తాడో! బతికితే రాజ్యం వస్తుందని, మరణిస్తే స్వర్గం, సద్గతి కలుగుతాయని చెప్పుకునే మాటలన్నీ ఇలా మన ఆత్మీయులు పోయినప్పుడు కలిగే దుర్భరశోకం ముందు వట్టిమాటలుగానే అనిపిస్తయ్. నిరర్థకాలుగా కనిపిస్తయ్” అంటూ తనని తను రకరకాలుగా నిందించుకుంటూంటే వ్యాసమహాముని ప్రత్యక్షమై అతనికి మృత్యుదేవతా మహత్యాన్ని, షోడశమహారాజుల చరిత్రల్ని వినిపించి కొంత ఉపశమింపజేసి అంతర్ధానమయాడు.

అర్జునుడు సంశప్తక సేనా వనాన్ని అనలుడిలా హరించి వస్తూ “కృష్ణా, నాకెందుకో దుశ్శకునాలు తోస్తున్నయ్, మనసు కీడు శంకిస్తున్నది. ఒకవేళ ద్రోణుడి చేతికి ధర్మరాజు చిక్కలేదు గదా” అన్నాడు విచారంగా. “నీ సోదరులంతా కుశలమే. మరేదో అశుభం జరిగింది, మనం వెళ్లి తెలుసుకుందాం” అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ తమ శిబిరానికి చేరారు. అక్కడంతా విషణ్ణవదనాల్తో అర్జునుణ్ణి తప్పించుకు తిరగటం చూసి “కృష్ణా, ఏదో జరక్కూడనిది జరిగింది. నవ్వు మొహంతో రోజూ కనిపించే అభిమన్యుడు కనిపించటం లేదు. నా మనస్సు కలత చెందుతున్నది” అంటే కృష్ణుడు సమాధానం చెప్పకుండా వూరుకున్నాడు. అర్జునుడు హడావుడిగా ధర్మరాజు శిబిరానికి వెళ్లాడు.

అక్కడ ధర్మరాజుని చుట్టుకుని పెద్దలంతా వున్నారు కాని అభిమన్యుడు కనిపించలేదు. కంపించే గొంతుతో –

“ఇంతమంది ఇక్కడ ఉన్నా అభిమన్యుడు మాత్రం కనపడడు. ఈ మౌనం వదిలి ఏమైందో చెప్పండి. ద్రోణుడు పద్మవ్యూహం పన్నితే దాన్ని భేదించటానికి వాణ్ణి పంపుదామనే పనికిమాలిన ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఏమిటి? అలా మీరు పంపితే పోయి ఒక్కడే వాళ్ల చేతికి చిక్కలేదు గదా? వాడికి ప్రవేశించటమే చెప్పాను గాని నిర్గమించటం తెలియదని మీకు తెలీదా?

దివ్యశరాఢ్యుడు, సంగరకేళీనిపుణుడు వాణ్ణి పడేసిన వాడు ఎవడు?

ఐనా వాణ్ణి పడెయ్యటం ఏ ఒక్కడి వల్లా కాదు, ఇదేదో పదిమంది కలిసి చేసిన కుట్ర ఫలితం.

అయ్యో, నాలాటి మందభాగ్యుడికా అలాటి విలువైన పుత్రరత్నం దక్కేది? ఐనా మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు వాడికి సాయపడకుండా?

అంతమంది శత్రువులు ఒక్కటై నానా శస్త్రాస్త్రాల్తో నరుకుతుంటే నన్ను తలుచుకుని తోడుగా రాలేకపోయానని ఎంత కలవరపడ్డాడో ! కాదు కాదు, అంతటి మహావీరుడు ఎప్పుడూ అలా ఆలోచించడు. ఐనా అంతమంది ఒక్కసారి మీదపడి బాలుణ్ణి వధించేముందు నన్ను గాని కృష్ణుణ్ణి గాని తలుచుకోలేదా ఆ దుర్మార్గులు?

సంశప్తకుల్తో ఘోరపోరాటం సాగిస్తున్నప్పుడు యుయుత్సుడు తండ్రినేమీ చెయ్యలేక ఇలా చిన్నపిల్లవాణ్ణి పదిమంది కలిసి అన్యాయంగా చంపుతారా అని కౌరవుల్ని ఆక్షేపించటం విన్నట్టనిపించింది కాని అప్పుడంతగా పట్టించుకోలేదు, కృష్ణుడు విని వుండడా, అంత ముఖ్యమైన విషయమైతే చెప్పడా అని. అప్పుడైనా వచ్చివుంటే వాణ్ణి రక్షించుకుని వుండేవాణ్ణేమో”

అంటూ రకరకాలుగా పలవిస్తూ మాట్టాడుతున్న అర్జునుణ్ణి పొదివిపట్టుకుని కృష్ణుడు “ఇలా ఉండటం నీకు తగదు. శూరుల జీవితాలు ఇలాటివే కదా – శత్రువుల్ని తుంచి ఇక్కడ యశస్సు, పైన స్వర్గమూ పొందిన కొడుకుని చూసి ఆనందించాలి గాని బాధ పడతారా నీలాటి జ్ఞానులు? నీ దుఃఖం చూసి మిగిలిన వాళ్లెంత చిన్నబోయారో చూడు” అంటే “అలాగే, వాడి యుద్ధప్రకారం నాకు వివరించి చెప్పండి. వాడి చావుకి కారణమైన వాళ్లని త్వరగా వాడి దగ్గరికి పంపించాల్సిన పని వుంది నాకు. ఐనా ఇంతమంది మహారథులు మనలో వుండి ఒక్కరూ వాడికి తోడు కాలేకపోవటం నమ్మ శక్యంగా లేదు. మిమ్మల్ని మీ మగతనాల్ని నమ్మి వాణ్ణి మీకప్పగించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. అసలిలాటి బలహీనులు, భీరువులు మీకు తోడు ఈ గదలూ ఖడ్గాలూ విల్లమ్ములూ ఎందుకు సింగారానికి కాక?” అని గద్దిస్తుంటే నోరెత్తి మాట్టాడాటానికి ఎవరూ సాహసించలేకపోయారు. కృష్ణుడొక్కడే అనునయవాక్యాలు పలికాడు.

చివరికి ధర్మరాజు సాంత్వనస్వరంతో -“నువ్వు సంశప్తకుల్తో పోరుకి పోతే ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేం వెళ్లి అతనితో తలపడ్డాం గాని అతని బాణాగ్ని జ్వాలకి తట్టుకోలేక వెనక్కి తిరిగాం. అప్పుడు నాకు గుర్తొచ్చింది అభిమన్యుడికి పద్మవ్యూహ భేదనం తెలుసునని. వాడు దాన్ని భేదిస్తే వాడి వెనకే మేమందరం వెళ్లాలని బయల్దేరాం. వాడు త్రుటిలో దాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. ద్రోణాదులు వాడిని చుట్టుముడితే సాయంగా మేం వెళ్తుంటే రుద్రవరగర్వంతో సైంధవుడు మమ్మల్నడ్డుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మేం వాణ్ణి దాటలేకపోయాం.

అభిమన్యుడు ద్రోణ, కర్ణ, కృతవర్మ, కృప, అశ్వత్థామాది మహావీరుల్ని చిక్కుపరిచి కురుసేనని కాల్చి కర్ణాదుల్ని పరిగెత్తించి బృహద్బల లక్ష్మణుల్ని సంహరించి అనేకమంది రాజుల్ని మర్దించి చివరికి విరథుడై పదాతిగా గదతో తూగాడుతూనే యుద్ధం చేస్తూ దుశ్శాసనుడి కొడుకు వస్తే వాడి రథాన్ని నుగ్గు చేసి వాడూ గదతో వస్తే ఇద్దరూ మహాఘోరంగా గదాయుద్ధం చేసి ఒకరి చేతిలో ఒకరు మరణించారు” అని చెప్పేసరికి అర్జునుడు గుండె చెదిరి మూర్ఛితుడయ్యాడు. అప్పటివరకు అతనిలో మినుకుమినుకుమంటున్న కొద్దిపాటి ఆశ కూడ ఆ మాటల్తో ఆరిపోయింది.

కృష్ణుడు, ధర్మరాజు అతన్ని పట్టుకుని ఉపచారాలు చేస్తే లేచి మహోద్వేగంతో “ఇదే నా ప్రతిజ్ఞ, అందరూ వినండి. రేపు నేను సింధురాజుని చంపి తీరతాను. వాడు భయపడి ధర్మజుణ్ణి గాని, కృష్ణుణ్ణి గాని, నన్ను గాని శరణు వేడితేనో లేకపోతే అసలు యుద్ధానికే రాకపోతేనో తప్ప దీనికిక తిరుగులేదు. ఇలా చెయ్యలేకపోతే నేను గురుద్రోహులు, బ్రహ్మహంతకులు, మద్యపానరతులు పోయే దుర్గతులకి పోతా. అంతే కాదు, రేపు సూర్యాస్తమయం లోగా నేను వాణ్ణి చంపకపోతే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తా” అంటూ కఠోరప్రతిజ్ఞ చేసి, గాండీవాన్ని తెప్పించి దాని గుణధ్వని మోగించాడు. కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం పూరించారు.

ఆ పాంచజన్య దేవదత్తాల ధ్వనులకు మనసేనలు తల్లడిల్లినయ్. వేగపు చారులు పరుగున వచ్చి అర్జున ప్రతిజ్ఞని వినిపించారు. సైంధవుడి గుండె ఝల్లుమంది. తన చుట్టాల్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి శిబిరానికి వెళ్లాడు.

“అక్కడికి నేనొక్కణ్ణే అభిమన్యుడి చావుకి కారణమైనట్టు అర్జునుడిలా నా వెంట పడటం ఏమిటి? ఇప్పుడు నన్ను రక్షించగలిగే వాళ్లెవరింక? ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా వెళ్తా, నాకు సెలవిప్పించండి” అన్నాడు.

ఇలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యటం తనకి ఉపయోగపడొచ్చని గ్రహించాడు దుర్యోధనుడు. “మేం అందరమూ నీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డం వేస్తాం. నీకేం భయం అక్కర్లేదు, రాజధర్మం తప్పకుండా రేపు యుద్ధరంగానికి రా.” అని భరోసా ఇచ్చాడు. సైంధవుడు కొంత శాంతించాడు.

ఐనా అనుమానం పూర్తిగా పోక వాళ్లని వెంటబెట్టుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. ద్రోణుడు కూడ “నా బాణాలతో కోట కట్టి నిన్ను రక్షిస్తా. అర్జునుడు నిన్నేమీ చెయ్యలేకుండా ఒక గొప్ప దురవగాహమైన వ్యూహాన్ని పన్నుతా. కనక రాజధర్మానికి హాని కలక్కుండా యుద్ధానికి రా. పైగా రాచపుటక పుట్టి శరీరం మీద ఇంత ప్రేమ పెంచుకోవటం మంచిది కాదు. అందరూ ఏదో ఒక రోజు వెళ్లేవాళ్లే కదా” అని బోధిస్తే ఒప్పుకున్నాడు. మన శిబిరాల్లో తూర్యఘోషలు మిన్ను ముట్టినయ్.

ధర్మరాజు రాజులందర్నీ వాళ్ల శిబిరాలకి పంపాడు. కేవలం అతని సోదరులు, కృష్ణుడే అక్కడున్నారు. కృష్ణుడు అర్జునుడితో “నాతో మాట మాత్రం చెప్పకుండా అందరూ వింటుండగా ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశావ్. సూర్యాస్తమయంలోగా వాణ్ణి చంపటం అంత తేలిగ్గాదు. ద్రోణుడొక అద్భుతమైన వ్యూహాన్ని పన్ని వాణ్ణి దాని వెనక దాచబోతున్నాడని మన చారులు చెప్తున్నారు. వాళ్ల మహావీరుల్ని ఒక్కొక్కర్ని ఓడించటమే కష్టం, అలాటప్పుడు వాళ్లందరూ కలిసి ఒకే పనికి నడుం కడితే అందర్ని ఉమ్మడిగా ఓడించటం ఇంకెంత కష్టమో ఆలోచించావా?” అన్నాడు.

ప్రతిగా అర్జునుడు నవ్వాడు. “కృష్ణా, నా గురించి వాళ్లకి తెలుసు, వాళ్ల సంగతి నాకు తెలుసు. నేనా సైంధవుణ్ణి చంపటానికి తరుముతుంటే ఎవరూ అడ్డం ఆగలేరు. చూస్తుండు. గాండీవం సాధనం, సమరకర్త అర్జునుడు, సారథి అబ్జనాభుడు. అలాటి రథాన్ని ప్రతిఘటించటం హరుడి వల్ల కూడ కాదు, వీళ్ల సంగతి చెప్తావెందుకు? నీ అండ ఉండగా ఈ కార్యం సాధించటం అనివార్యం. ఈ పూటకి వెళ్లి నిద్ర పో, పొద్దున్నే మళ్లీ సారథ్యం పని ఉంది” అని మాట్లాడుకుంటూ పట్టరాని కోపంతో వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ నడిచారు.

కృష్ణుడి కోరిక మేరకు కొద్దిరోజుల క్రితమే అక్కడికొచ్చి వున్న సుభద్రని, ఉత్తరని అనునయించమని అర్జునుడు కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు సుభద్ర మందిరానికి వెళ్లి శోకిస్తున్న ఆమెతో “రాచకూతురికి వీరపత్ని కావటం, కొడుకుని కనటం, వాణ్ణి మహావీరుణ్ణి చెయ్యటం, ధర్మాలు. నువ్వు ఈ మూటిలో ప్రసిద్ధి పొందావు. రాచధర్మాన్నాచరించి శత్రువుల్ని వధించి వీరస్వర్గం పొందిన కొడుకు గురించి విచారపడొచ్చునా? తగుమాటల్తో నీ కోడలి దుఃఖాన్ని ఉపశమింప చెయ్యి. నీ భర్త రేపా సైంధవుణ్ణి చంపి మనందరికీ సంతోషం కలిగిస్తాడు” అని చెప్పాడు. ఐతే ఆమె శోకం ఆపుకోలేక కొడుకుని తలుచుకుని బిగ్గరగా ఏడ్చింది. ద్రౌపది కూడ వచ్చి సుభద్ర, ఉత్తరలతో తనూ కలిసి విలపించింది. ముగ్గురూ నేల మీద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి హృదయవిదారకంగా ఆక్రందించారు. తనూ శోకమానసుడైనా కృష్ణుడు ఎలాగో వాళ్లని సమాధానపరిచి అర్జునుడి శిబిరానికి వచ్చాడు.

పవిత్రజలాల్తో ఆచమనం చేశాడు. దర్భశయ్యని చేసి అక్షతలు, గంధ పుష్పాల్తో దాన్ని అలంకరించి ఆయుధాల్ని అర్చించి చుట్టూ పెట్టి అర్జునుణ్ణి మధ్యలో కూర్చోబెట్టాడు. “నువ్వు రోజూ రాత్రివేళ చేసే దేవపూజ ఇప్పుడు చెయ్యమం”టే అర్జునుడు తను రోజూ చేసే శివపూజ మార్గాన ధూప దీప నైవేద్యాలు కృష్ణుడికి సమర్పించాడు. కృష్ణుడవి స్వీకరించి అతన్ని దీవించి సుఖనిద్ర చేయమని చెప్పి తన సారథి దారుకుడిని తీసుకుని తన శిబిరానికి వెళ్లాడు.

మర్నాడు జరపవలసిన కార్యం గురించి ఆలోచిస్తూ కొంతసేపు పడుకున్నాడు కృష్ణుడు. తర్వాత లేచి దారుకుడితో “దూరం ఆలోచించకుండా అర్జునుడు ఘోరప్రతిజ్ఞ చేశాడు. దీన్ని తీర్చటం సామాన్యమైన విషయమా? వ్యవహారం అడ్డుతిరిగితే అర్జునుడు లేకుండా నేనుండటం అసాధ్యం. ఆరు నూరైనా నూరు ఆరైనా రేపు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరేట్టు చేస్తా. అవసరమైతే నేనే యుద్ధం చేసి అడ్డమైన వాళ్లందర్నీ హతమారుస్తా. నువ్వు వెళ్లి మన రథాన్ని సిద్ధం చెయ్యి. యుద్ధ రంగానికి దగ్గర్లో ఉండు. నా పాంచజన్య ధ్వని నీకు గుర్తు. అది వినబడితే వెంటనే నా దగ్గరకు వచ్చెయ్యి” అని వివరించాడు. దానికి దారుకుడు “అలాగే చేస్తా. ఐతే నువ్వూ అర్జునుడు పూనుకుని సైంధవుణ్ణి చంపబోతుంటే మిమ్మల్ని అడ్డుకోగలిగిన వాళ్లు ఎవరున్నారక్కడ?” అని అతని ఉద్రేకాన్ని కొంత ఉపశమింప చేశాడు. ఏ రకమైన పాంచజన్యధ్వని సంకేతమో ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు.

అక్కడ అర్జునుడు దర్భశయ్య మీద కలత నిద్రలో ఉన్నాడు. అతనికో కల వచ్చింది. అందులో కృష్ణుడు కనపడ్డాడు. “నీకు రేపు యుద్ధంలో పాశుపతాస్త్రం అవసరం కలగొచ్చు. ఆ మహాస్త్రం మంత్రాన్ని, పిడికిట పట్టే విధానాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అందుకు పరమశివుణ్ణి తలుచుకో” అని చెప్తే అర్జునుడు ఆచమనం చేసి పరమేశ్వర ధ్యానం చేస్తుంటే ఇద్దరూ ఆకాశాని కెగిరారు. దార్లో అనేక విశేషాలు చూస్తూ కైలాసగిరిని చేరారు. ప్రమథనాథుణ్ణి దర్శించి ప్రణమిల్లారు. అంతకుముందు నిత్యార్చన ప్రకారంగా కృష్ణుడికి తను సమర్పించిన గంధ మాలాక్షతలు ఇక్కడ శివుడి శరీరం మీద అర్జునుడికి కనిపించినయ్. శివకేశవుల అభేదాన్ని అలా చూసి ఆశ్చర్యపడ్డాడతను. పరమేశ్వరుడు వాళ్లకి స్వాగతం పలికి ఎందుకు వచ్చారని అడిగాడు. పాశుపతం ఇమ్మని కోరమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అతనలాగే చేశాడు. పరమశివుడు వాళ్లతో “ఆ సరోవరంలో నా ధనుర్బాణాలున్నయ్, వెళ్లి తీసుకురండి” అని చెప్పాడు. వాళ్లు వెళ్లి చూస్తే విషజ్వాలలు కక్కుతూ మహోరగాలు వాళ్లకి కనిపించినయ్. అవే దివ్యబాణాలని గ్రహించి వాళ్లు పాదప్రక్షాళనం చేసుకుని శతరుద్రీయం జపిస్తే అవి వాటి పూర్వాకారాలు ధరించినయ్. వాళ్లా ధనుర్బాణాల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడొక మహాబలశాలి ఐన బాలుడు ఆ వింటిని తీసుకుని శరాన్నెక్కు పెడితే అర్జునుడతన్ని చూసి ఆ పద్ధతి నేర్చుకున్నాడు. అప్పుడే శివుడు కూడ అతనికి మంత్రోపదేశం చేశాడు. అలా అర్జునుడప్పుడు మంత్రం, ప్రయోగవిధానంతో సహా పాశుపతాస్త్రాన్ని సంపూర్ణంగా అందుకున్నాడు. ఇద్దరూ పరమేశ్వరుడి సెలవు తీసుకుని తిరిగివచ్చారు. అర్జునుడు కల నుంచి లేచి చూస్తే తెల్లవారుతున్నది.

అవతల కృష్ణుడు మిగిలిన రాత్రంతా అర్జునుడికి తనను ఉన్న అనుబంధం గురించి, మర్నాడు యుద్ధంలో జరిపించవలసిన కార్యక్రమం గురించి దారుకుడితో మాట్లాడుతూనే గడిపాడు.

పద్నాలుగవ రోజు


ఉదయాన్నే ధర్మరాజు దేవార్చన చేసి కొలువు తీరాడు. తమ్ముళ్లు, రాజులు వచ్చారు. కృష్ణుడు కూడ అక్కడికి వచ్చాడు. ధర్మరాజు అతనితో “నువ్వు ఇప్పటికి ఎన్నో సార్లు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు అర్జునుడి ప్రతిజ్ఞ మనసులో పెట్టుకుని మాకు జయం కలిగించు” అని ప్రార్థించాడు. “ఇవాళ అర్జునుడు వైరి సేనల్ని పిండిపిండి చేసి సైంధవుడి తల నరుకుతాడు. ఇది నిశ్చయం” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. ఇంతలో అర్జునుడక్కడికి వచ్చి తన స్వప్న వృత్తాంతం వినిపించాడు. అందరూ ఆశ్చర్యంతో ఆ పరమేశ్వరుణ్ణి తల్చుకుని నమస్కరించారు.

కృష్ణుడు రథానికి జయప్రదాలైన మంత్రాలు ప్రయోగించాడు. అర్జునుడు దానికి ప్రదక్షిణం చేసి అధిరోహించాడు. నొగల్లో కృష్ణుడు, అర్జునుడి పక్కన సాత్యకి కూర్చున్నారు. కొంత దూరం వెళ్లాక అర్జునుడు సాత్యకికి ధర్మరాజు రక్షణ భారం అప్పగించి పంపించాడు.

ద్రోణుడు ఇరవైనాలుగు కోసుల పొడవు, పది కోసుల వెడల్పుతో శకటవ్యూహం కట్టి అందులో పశ్చిమార్థంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. దాని పక్కనే సూచీవ్యూహాన్ని పన్నాడు. సైంధవుణ్ణి ఆ సూచీవ్యూహం మూలంలో సేనకి వెనక భాగంలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థ్హామ, వృషసేనుడు, కృపుడు అతని పక్కన వుండేట్టు ఏర్పరచి నిలబెట్టాడు. వాళ్లకి బలంగా పద్నాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథాలు, లక్ష గుర్రాలు, పదిలక్షల పదాతులు ఉన్నారు.

ఆ మహావ్యూహాన్ని ఖేచరులు కూడ మెచ్చుకున్నారు. ఒక్క దుర్మర్షణుడు మాత్రం అర్జునుడి అంతు చూట్టానికి నేనొక్కణ్ణి చాలు అంటూ వ్యూహం బయటికి వెళ్లి దానికి ముందు పదిహేడు వందల విండ్లంత దూరాన తన సైన్యంతో నిలబడ్డాడు. ద్రోణుడు శకటవ్యూహం ముఖస్థానాన నిలిచాడు. దుర్యోధనుడు, మన సైన్యాన ఇతర దొరలు సంతృప్తిగా తలలు పంకించారు. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలుపుతూ భయంకరంగా అర్జునుడు దూసుకు వచ్చాడు. అతనికి కొద్దిగా వెనగ్గా ధృష్టద్యుమ్నుడు, నకులుడి కొడుకు శతానీకుడు మొగ్గరం పన్ని నిలిచారు. అర్జునుడు తన రథాన్నాపి దేవదత్తం ఒత్తితే పాంచజన్యరవం కూడ దానికి తోడైంది.

దుర్మర్షణుడు వీరావేశంగా తన బలగంతో అర్జునుడి మీదికి దూకాడు. అదిచూసి అర్జునుడు “మదంతో ముందుకి దూకుతున్నాడు, వీడే మనకివాళ తొలిముద్ద” అని వాణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడు ఒక్కడే కదా అని దుర్మర్షణుడి సైన్యం అతన్ని చుట్టుముట్టి వివిధ శస్త్రాస్త్రాల్తో ముంచెత్తింది. అతనా సైన్యాన్ని చిందరవందర చేసి భీభత్సంగా నాశనం చేస్తే దుర్మర్షణుడు వెనక్కు తిరిగి పారిపోయాడు. వాడితో పాటే వాడి సైన్యాలూ పరిగెత్తినయ్.

అది చూసి సహించక యువరాజు దుశ్శాసనుడు అర్జునుడితో తలపడ్డాడు. అతన్ని చూసి అర్జునుడు ఒక పెలుచ నవ్వు నవ్వాడు. దేవదత్తాన్ని పూరించి గాండీవజ్యానాదం దిక్కుల పిక్కటిల్లగా అతని సైన్యాన్ని ఊచకోత కోశాడు. పీనుగుపెంటలైన సేనని చూసుకుని దుశ్శాసనుడు పారిపోతుంటే విజయుడు వదలక తరిమాడు. “పారిపోతే చావు తప్పుతుందా? అప్పుడు సభలో అవాకులూ చవాకులూ పేలి ఇప్పుడు నీ చావుకి తెచ్చుకున్నావ్” అంటూ అతని వీపున పది అమ్ములు నాటితే వెనక్కి తిరిగైనా చూడకుండా పరిగెత్తాడు దుశ్శాసనుడు. సైంధవుడి విషయం తలుచుకుని వాణ్ణి అప్పటికి వదిలేసి వ్యూహం వైపుకి తిరిగొచ్చాడు అర్జునుడు.

వచ్చి ద్రోణుడికి కొద్ది దూరంలో రథాన్ని ఆపి కృష్ణుడి అనుజ్ఞ తీసుకుని ఆచార్యుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. “నా మంచి కోరేవాళ్లలో పాండురాజు, ధర్మజుడు, కృష్ణులతో సాటివాడివి నువ్వు. నీ దృష్టిలో నేనూ అశ్వత్థామ ఒక రకంగా పెరిగాం. సైంధవుణ్ణి చంపాలనే నా ధర్మబద్ధమైన ప్రతిజ్ఞని సాధించటానికి ఈ వ్యూహంలో చొరటానికి నాకు అనుమతివ్వు.” ఆ మాటలకి చిన్న నవ్వుతో ద్రోణుడు నన్ను గెలవకుండా నువ్వు సైంధవుణ్ణి ఎలా చేరతావ్ అంటూ అతని మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడతనితో యుద్ధం చెయ్యటానికి ద్రోణుడి నుంచి అనుజ్ఞ తీసుకుని తొమ్మిది నారాచాలు వేస్తే వాటిని దార్లోనే తుంచాడు ద్రోణుడు. తుంచి వేగంగా కృష్ణార్జునుల మీద అనేక బాణాలేస్తే అతని విల్లు విరచటానికి అర్జునుడు బాణం వెయ్యబోయేంతలో అతని వింటితాటిని తెగ్గొట్టాడు ద్రోణుడు. అర్జునుడు మరొక తాటిని సంధించేలోగా చిరునవ్వుతో అతన్ని బాణవర్షంలో ముంచాడు ద్రోణుడు. అర్జునుడికి అమిత క్రోధం కలిగింది. వర్షపు చినుకుల్లా బాణాలు కుమ్మరిస్తూ ద్రోణుణ్ణి దాటి సైన్యం లోకి వెళ్లి కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని నరకటం సాగించాడు.

ద్రోణుడు వచ్చి అతనికి అడ్డుపడి అతని వక్షానికి గురిగా పెద్ద నారసాన్ని వేస్తే కొంచెం తూలి నిలదొక్కుకున్నాడు అర్జునుడు. ద్రోణుడి మీద నానాబాణాలేశాడు. ద్రోణుడు కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలు గుప్పించాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పోరుతుంటే ఇదే అదునని మన సైన్యం కొంత అర్జునుడి మీదికి దూకింది. ఇలా వృద్ధుడైనా అర్జునుడితో పోటీగా యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి చూసి కృష్ణుడు “ఈయనతో యుద్ధం ఇక చాలు, మనం శకటవ్యూహం లోకి జొరబడదాం, ఇదే కర్తవ్యం” అని అర్జునుడితో అంటే “నీ ఇష్టం” అని పార్థుడంటే ద్రోణుడికి ప్రదక్షిణంగా రథాన్ని పోనిచ్చాడు కృష్ణుడు. అదిచూసి నవ్వుతూ ద్రోణుడు “అర్జునా, ఇలాటివి ఎక్కడైనా చూశామా, శత్రువుని జయించకుండా ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళటమేనా?” అంటే “నువ్వు గురువువి గాని నాకు శత్రువువెలా ఔతావ్? యుద్ధంలో నువ్వు కోపం తెచ్చుకుని నిలిస్తే నిన్ను గెలవటం నాకే కాదు ఆ హరుడికైనా సాధ్యమా?” అంటూ ఆగకుండా సాగాడు.

ఇలా మన సైన్యం లోకి వచ్చిన అర్జునుడి తోనే అతని చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడ ప్రవేశించారు. అప్పుడు కృతవర్మ, కాంభోజుడు, శ్రుతాయువు ఉన్నచోటనే ఉండి తలలెత్తి అర్జునుడి రథాన్ని, దాని వెనకనే తరుముకొస్తున్న ద్రోణుణ్ణి చూసి అర్జునుడి మీద దూకాలనుకునేంతలో నారాయణగోపాలకులు అర్జునుణ్ణి పొదివి యుద్ధం చెయ్యసాగారు. అతను వాళ్లందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే ద్రోణుడు వచ్చి అమ్ములవాన కురిపిస్తే అర్జునుడు అతన్ని నేరుగా ఎదుర్కోకుండా అతను వేసిన బాణాల్ని మధ్యలోనే నరికేశాడు. ఐతే ద్రోణుడు వదలకుండా అర్జునుడి మీద ఇరవై ఐదు, కృష్ణుడి మీద డెబ్బై నారసాల్ని కురిపిస్తే వాటన్నిటిని వారించలేక పక్కకి దాటి కృతవర్మ బలాల్ని దాడిచేశాడు అర్జునుడు. ఇంక చేసేది లేక ద్రోణుడు వెనక్కి తిరిగి తన పూర్వస్థానానికి వెళ్లాడు.

కృతవర్మ అర్జునుణ్ణి ఎదుర్కున్నాడు. అతను కృష్ణార్జునులు ఒక్కొకరి మీద అరవై బాణాలేస్తే అర్జునుడు అతని వింటిని విరిచి ఇరవయ్యొక్క బాణాల్తో అతన్ని నొప్పించాడు. అతనింకొక విల్లు తీసుకుని ఐదుబాణాలు విజయుడి వక్షాన నాటితే కృష్ణుడు “ఆ పక్క ఆలస్యమౌతున్నది, వీడేం మనకి చుట్టమా పక్కమా తొందరగా ముగించు” అంటే వాణ్ణి కీలుబొమ్మలా మూర్ఛపుచ్చి కిందపడేశాడు అర్జునుడు. అప్పుడిక కాంభోజసైన్యాన్ని కలగిస్తూ దారి చేసుకుని వెళ్తుంటే మూర్ఛ లేచి కృతవర్మ అర్జునుడి చక్రరక్షకుల్ని అడ్డుకున్నాడు.

కౌరవసేనని చీల్చుకు వెళ్తున్న అర్జునుణ్ణి శ్రుతాయుధుడు ఎదిరించాడు. అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదిహేడు అమ్ములు వేసి ఒక బాణాన కేతువుని కొట్టాడు. క్రీడి తొంభై బాణాల్తో వాణ్ణి వారిస్తే వాడు డెబ్భై ఐదు అతని మీద వేశాడు. కోపంతో అర్జునుడు వాడి విల్లు తుంచి ఏడు శరాల్తో వాడి ఉరాన్ని చొప్పించాడు. వాడు తీవ్రంగా ఇంకో విల్లు తీసుకుని తొమ్మిది బాణాల్తో అర్జునుడి చేతుల్ని వక్షాన్ని కొడితే ఎలనవ్వుతో పార్థుడు వాడి సారథిని, అశ్వాల్ని చంపి డెబ్భై క్రూరశరాల్తో వాణ్ణి నొప్పిస్తే వాడొక పెద్దగదని తీసుకుని రథం దిగి అర్జునుడి రథమ్మీదికి పరిగెత్తాడు.

మహారాజా! ఆ శ్రుతాయుధుడు వరుణవరప్రసాది. ఆ గద వాడికి వరుణుడిచ్చింది. ఆ గద వాణ్ణి అజేయుణ్ణి చేస్తుందని, ఐతే యుద్ధం చెయ్యని వాళ్ల మీద దాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతిరిగి వాడినే చంపుతుందని వరుణుడు వాడికి చెప్పాడు కాని పోయే కాలం వచ్చినవాడికి అవి గుర్తుండవు కదా, వాడా గదతో కృష్ణుణ్ణి మోదాడు. అది కృష్ణుణ్ణి ఏమీ చెయ్యకపోగా అతనికి పూలమాలికలా అయింది. వెంటనే పిడుగులా శ్రుతాయుధుణ్ణి హతమార్చింది. అంతకు ముందే అర్జునుడు వాడి బాహువుల్ని ఖండిస్తే వాడో పర్వతంలా కింద పడ్డాడు. అదిచూసి వాడి సేనలు, ఆ చుట్టుపక్కల వున్న మిగతా రాజుల సేనలూ చెల్లాచెదురైనై.

అప్పుడు కాంభోజుడు సుదక్షిణుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు కుపితుడై పద్నాలుగు బాణాల్తో వాడి సూతుణ్ణి, గుర్రాల్ని, వింటిని, కేతనాన్ని నరికి ఒక నిశితాస్త్రంతో వాడి గుండె పగిలేట్టు కొట్టాడు. మొదల్నరికిన చెట్టులా వాడు కూలాడు. సుదక్షిణుడి చావుతో శూరసేనుడు, శిబి, వసాతి చుట్టుముడితే అర్జునుడు బాణవర్షంతో వాళ్ల ఆరువేల రథాల్ని నుగ్గుచేశాడు. వాళ్లు పారిపోయారు.

శ్రుతాయువు, అయుతాయువు రెండు వైపుల నుంచి వేలకొద్ది బాణాలు కురిపిస్తూ అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శ్రుతాయువు తోమరంతో అర్జునుణ్ణి దిమ్మదిరిగేట్టు కొట్టాడు. దానికితోడు అయుతాయువు కూడ శూలంతో పొడిచాడు. సొమ్మసిల్లి అర్జునుడు తన కేతనం పట్టుకుని తూలితే కృష్ణుడతన్ని తెలివిలోకి రప్పించాడు. కురుసైన్యంలో సింహనాదాలు చెలరేగినై. తెలివి తెచ్చుకున్న అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగిస్తే అది ఆ ఇద్దర్నీ అంగాంగాలు ఖండించి చంపింది. వాళ్ల అనుచరులు ఐదువందల మంది రథికుల్ని కూడ వధించింది. అది చూసి వాళ్ల కొడుకులు నియుతాయువు, దీర్ఘాయువు ఏమైతే అదైందని అతని మీద పడితే త్వరితంగా వాళ్లని కూడ తండ్రులకి తోడు పంపించేశాడు.

దుర్యోధనుడు మ్లేచ్ఛబలాల్ని అతని మీదికి పురిగొల్పితే వాళ్లు మహాసాహసంతో అతనితో పోరారు. ఐతే అతను కార్చిచ్చులా ఆ బలాల్ని కాలుస్తుంటే అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు ఉద్రేకంగా అర్జునుడి నొగల్ని తాకేంత దగ్గరికి తన రథాన్ని నడిపితే అర్జునుడతని వింటిని తుంచి గుర్రాలని కూల్చాడు. వాడొక భీకరమైన గదని తీసుకుని కృష్ణుణ్ణి కొడితే అర్జునుడా గదని విరిచాడు. వాడు మరో గదతో లంఘిస్తే వేగంగా వాడి భుజాల్ని కంఠాన్ని తుంచాడు.

ఇలా ద్రోణుణ్ణి దాటుకుని, కృతవర్మని చీకాకు పెట్టి, శ్రుతాయుధుణ్ణి దండాయుధుడి దగ్గరికి పంపి, కాంభోజుణ్ణి కాటికి పంపి, శ్రుతాయువుని గతాయువుగా చేసి నీ సైన్యంలోకి చొచ్చుకుపోయి వీరయోధుల ప్రాణాల్ని తన బాణాల్తో బయటికి లాగేస్తున్న అర్జునుణ్ణి చూసి దుర్యోధనుడు కుతకుతలాడాడు. ఒంటిగా రథాన్ని తోలుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతన్ని నానా దుర్భాషలాడాడు – “నిన్ను అవలీలగా దాటి మన సైన్యం లోకి జొరబడి అతలాకుతలం చేస్తున్న అర్జునుడి వంక కన్నెత్తైనా చూడవు. పాండవపక్షపాతీ! పాము రక్షణలో వున్న కప్పల్లా వున్నాం, నిన్ను నమ్ముకుని. ఏదో కంటితుడుపుగా నాకు వరమిచ్చావ్, ఏం సాధించావ్? నువ్వేదో రక్షిస్తావని సైంధవుడు సైన్యంలోనే వున్నాడు. వాణ్ణి చంపించటానికి పూనుకున్న తేనె పూసిన కత్తివి నువ్వు” అంటూ. అంతలోనే సంభాళించుకుని, “బాధలో నేనన్న మాటలు పట్టించుకోవద్దు. ఎలాగైనా సైంధవుణ్ణి రక్షించు” అని వేడుకున్నాడు.

దానికి ద్రోణుడు “నాకేం బాధలేదు, నాకు నువ్వూ అశ్వత్థామ వేరువేరు కారు. ఇప్పుడు నేను సేనాముఖాన్ని విడిచి లోనికి వెళ్తే పాండవబలగాలు మన సేనల్ని చెల్లాచెదురు చేస్తయ్, సైంధవుడికి కూడ ముప్పు రావొచ్చు. అదీగాక నేను ధర్మరాజుని బంధించాల్సిన పని కూడ వుంది కదా! పైగా, నేను వృద్ధుణ్ణి, అర్జునుణ్ణి వెంటబడి తరమలేను. నువ్వూ అతనూ కుర్రవాళ్లు. కొంతమందిని వెంట తీసుకు వెళ్లి అతనితో నువ్వే తలపడి ఆపరాదూ” అన్నాడు. “నిన్నూ కృతవర్మనీ ఓడించి, అనేక మంది రాజుల్ని హతమార్చిన అర్జునుణ్ణి నేను ఎదుర్కోవాలా? కాదూ కూడదూ అదే ఇప్పుడు కర్తవ్యం అంటే నా పరువు పోని మార్గం చెప్పు, అలాగే చేస్తా” అన్నాడు దుర్యోధనుడు. “నువ్వన్నది నిజమే. ఐతే నీకో మహత్తు చూపిస్తాను. ఇదుగో ఈ బంగారు కవచానికి కవచధారణ విద్యని ఆవహింపజేసి ఇస్తున్నాను. దీన్ని ధరిస్తే ఎవరి బాణాలూ నిన్ను ఏమీ చెయ్యలేవు. దీన్ని బ్రహ్మ ఇంద్రుడికిస్తే అతను అంగిరసుడికి, అంగిరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికి, అగ్నివైశ్యుడు నాకు ఇచ్చారు” అని దాన్ని తొడిగి దీవించి పంపాడు ద్రోణుడు. దాంతో సుయోధనుడు సంతుష్టుడై చమూసమూహాల్తో అర్జునుడి మీదికి బయల్దేరాడు.

ఇక్కడ పాండవబలాలు మన మొగ్గరం మీదికి దండెత్తినయ్. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడితో ఘోరంగా పోరాడు. మనవైపు నుంచి మేటిదొరలు అక్కడికి చేరారు. ఇరువైపుల వారు ఒకర్నొకరు తలపడ్డారు. వికర్ణుడు, వివింశతి, చిత్రసేనుడు – భీముడితో కలబడ్డారు. బాహ్లికుడు ద్రౌపదేయుల్తో. దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవుల్ని, సోమదత్తుడు శిఖండిని, అలంబుసుడు ఘటోత్కచుణ్ణి ఎదుర్కున్నారు. సైంధవుడికి తోడుగా వుంటూనే అప్పుడప్పుడు మొన ముందుకి కూడ వచ్చి చూసిపోతున్న శల్యుడు అక్కడే వున్నాడప్పుడు. ధర్మజుడితో అతను తలపడ్డాడు. అందరూ ఇక రేపు లేదన్నట్టు శక్తంతా కూడగట్టి శరయుద్ధాలు చేస్తున్నారు. ఐతే ద్రోణాచార్యుడి రక్షణలో మన వ్యూహం పటిష్టంగా నిలబడటం చూసి సహించలేక ధృష్టద్యుమ్నుడు మహాక్రోధంతో ద్రోణుడి గుర్రాల్ని తాకేంత దగ్గరకి తన రథాన్ని నడిపించి ఒక వాలుని పలకని తీసుకుని ద్రోణుడి రథమ్మీదికి గెంతి చిత్ర విచిత్ర విన్యాసాల్తో అతని బాణాలు తనకి తగలకుండా చూసుకుంటూ అతన్ని చేరబోతూ వాలుతో గుర్రాల్ని కొట్టి గాయాలు చేశాడు. ఐతే ఆ అదునులో ద్రోణుడతని వాలుని విరిచి సారథిని గుర్రాల్ని చంపి ఒక పదునైన నారసాన్ని అతని మీదికి వేస్తే – వేగంగా సాత్యకి దాన్ని మధ్యలోనే నరికి సింహం చేతిలో చిక్కిన లేడిని రక్షించినట్టు ధృష్టద్యుమ్నుణ్ణి అక్కణ్ణుంచి తప్పించాడు.

దానికి ద్రోణుడు కోపించి సాత్యకి మీద క్రూరశరాలు ప్రయోగించాడు. సాత్యకి కూడ తన సారథితో “ద్రోణుడి అభిమతం ధర్మరాజుని పట్టటం. అతనికా అవకాశం ఇవ్వకుండా మనం అతనితో తలపడదాం” అని తన రథాన్ని ద్రోణుడికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ తీవ్ర బాణజాలాల్తో చూసేవాళ్లకి కళ్లపండగ్గా సమానంగా పోరారు. అతని లాఘవానికి ద్రోణుడు కూడ సాత్యకిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ద్రోణుడి వింటిని సాత్యకి రెండుగా నరికితే అతను మరో విల్లు తీసుకుంటే దాన్ని కూడ సాత్యకి నరికాడు. ఇలా అతను ఎన్ని తీసినా సాత్యకి నరుకుతూనే వుంటే అంతా విస్తుపోయారు. ఇక సహించలేక ద్రోణుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే సాత్యకి వారుణాస్త్రంతో దాన్నెదుర్కున్నాడు. ఆకాశంలో ఆ రెండు అస్త్రాలూ ఘోరంగా పోరి కొంతసేపటికి శాంతించినయ్. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి అండగా వచ్చి నిలిస్తే దుశ్శాసనుడు ముందుండగా మన కుమారవర్గం వాళ్లని తాకింది.

అక్కడ దారంతా పీనుగుపెంటలు చేస్తూ అర్జునుడు సైంధవుడున్న చోటికి దగ్గరౌతున్నాడు. అప్పుడు అవంతీశ్వరులు విందానువిందులు ఒకే రథమ్మీద వచ్చి అర్జునుణ్ణి అడ్డుకున్నారు. అర్జునుడి బాణాల్ని లెక్కచెయ్యకుండా అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద అనేక శరాలు పంపారు. ఐతే అర్జునుడు తీవ్రవేగంతో సారథిని, గుర్రాల్ని చంపి, కేతనాన్ని కూల్చి దాంతో పాటే విందుడి తలనీ నేలకూల్చాడు. అన్న చావు చూసి అనువిందుడు రోషంతో గద తీసుకుని రథాన్నుంచి దూకి పరిగెత్తి కృష్ణుడి ఫాలాన మోదాడు. అర్జునుడు తటాల్న వాడి గద విరిచి కాళ్లూ చేతులూ తలా నరికి యుద్ధభూమికి బలిచ్చాడు. వాడి సేనలు ధైర్యంగా నిలబడి చుట్టుముడితే విజయుడు వాటిని నాశనం చేసి కదిలాడు.

ఐతే సమయం మధ్యాన్నాన్ని మించటం, అర్జునుడూ అతని గుర్రాలూ అలిసినట్టు కనిపించటం, సైంధవుడున్న చోటు ఇంకా చాలా దూరం వుండటంతో మనసైన్యంలో ఉత్సాహం కలిగింది. అందరూ సింహనాదాలు చేశారు. అర్జునుడు కృష్ణుడితో, “గుర్రాలకి చాలా బాణాలు గుచ్చుకుని వున్నయ్, ఇంకా చాలా దూరం వెళ్లాల్సుంది. వాటికి కాస్త విశ్రాంతి ఇచ్చి, ఆ బాణాల్ని లాగి వైద్యం చేస్తే మంచిదేమో” అంటే అలాగే చేశాడు కృష్ణుడు. అర్జునుడు పాదచారిగా ఉండటం చూసి మనబలాలు అతన్ని చుట్టుముట్టటానికి ప్రయత్నించినయ్. ఐతే అతను నవ్వుతూ తీవ్రాస్త్రాల్తో మన బలాల్ని వారించి నెత్తుటికాలవలు పారించాడు. కృష్ణుడతనితో “గుర్రాలు దాహంతో అలమటిస్తున్నయ్. వీటికిప్పుడు మనం నీళ్లు పెట్టాలి. ఎలా?” అంటే అర్జునుడు నవ్వి, “ఇవిగో నీళ్లు” అంటూ ఒక దివ్యాస్త్రంతో నేల చీల్చి కొలను తయారుచేసి బాణాల్తో దానికి గట్టు అమర్చాడు. కృష్ణుడు గుర్రాల్ని తరిమి నీళ్లు తాగించి ఆ నీటిలో అంతలోనే పెరిగిన గడ్డిని పెట్టి సేద తీర్చాడు. ఇద్దరూ మళ్లీ రథం మీద ఎక్కి బయల్దేరారు.

అదంతా చూసిన మన సేన అవాక్కై అర్జునుడి మీదికి వెళ్లాలనే ఆలోచనైనా లేకుండా దిగాలు పడి చూస్తున్నది. ఇంతలో దుర్యోధనుడక్కడికి వచ్చి కవచధారణ వల్ల భయపడకుండా కృష్ణార్జునుల రథానికి అడ్డంగా నిలబడ్డాడు. అదిచూసి కృష్ణుడు “వీడి వాలకం ఆశ్చర్యకరంగా వుంది. మీ పరాభవాలన్నిటికి మూలకారణం వీడు. తనంతట తను ఇలా నీకు బలికావటానికి వచ్చి నిలబడ్డాడు. వీణ్ణి అంతం చెయ్యి” అని ప్రోత్సహిస్తే అర్జునుడు దేవదత్తం వూదాడు, కృష్ణుడూ పాంచజన్యం మోగించాడు. “దుర్యోధనుడిక చచ్చాడు, చచ్చాడ”ని మన వాళ్లు కలవరపడ్డారు. ఐతే దుర్యోధనుడు “మనకేం భయం లేదు. వీళ్ల అంతు నేను చూస్తా, చూస్తూ వుండండి” అని మన వాళ్లకి ధైర్యం చెప్పి “అర్జునా, నువ్వు నిజంగా పాండురాజుకి పుట్టినవాడివే ఐతే ఇప్పుడు నీ మగతనం చూపించు” అని దూషిస్తూ అతని మీద, కృష్ణుడి మీద, గుర్రాల మీద, కేతనం మీద బాణాలేశాడు. అర్జునుడు వేసిన బాణాలతన్ని తాకను కూడ లేదు.

కృష్ణుడు విషాదంతో “అర్జునా ఏమిటిది, నీ గాండీవం మొక్కబోయిందా, నీ చేతుల్లో శక్తి సన్నగిల్లిందా? గురి సరిగా వుందా? పిడికిలి సరిగా పడుతున్నావా? ఏమీ అర్థం కావటం లేదే!” అంటే “అది కవచధారణ మహిమ. ఇదివరకు ఆచార్యుడు నాకొక్కడికే అది చెప్పాడు, ఇప్పుడు వీడికి కూడ చెప్పినట్టున్నాడు. ఐనా దాన్నెలా పనికిరాకుండా చేస్తానో చూడు. అంగీరసుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రం ఇచ్చాడు, దాన్ని అతను నాకిచ్చాడు. అది అన్ని కవచాల్ని భేదిస్తుంది” అంటూ ఆ మహాస్త్రాన్ని సమంత్రకంగా విడిస్తే – ఇంతలో హఠాత్తుగా అశ్వత్థామ అడ్డుకుని దాన్ని సర్వాస్త్రఘాతి ఐన మరో అస్త్రంతో ఖండించాడు. అర్జునుడు అవాక్కయాడు. ” ఆ అస్త్రాన్ని ఒక్కసారే ప్రయోగించాలి, దాన్ని అశ్వత్థామ నిష్ఫలం చేశాడు. ఐనా పోయిందేం లేదు, నా వింటి బలిమితోనే అతన్ని ఓడిస్తా” అన్నాడు. ఇంతలో దుర్యోధనుడు వాళ్లిద్దర్నీ తొమ్మిదేసి బాణాల్తో నొప్పిస్తే అర్జునుడు వేగంగా అతని సారథిని, గుర్రాల్ని చంపి, రథాన్ని విరిచి అతని చేతుల్ని బాణాల్తో గాయం చేశాడు. తన చేతులలా గాయం కావటంతో వికల మనస్కుడయాడు దుర్యోధనుడు. ఆ కవచం ఇంక పనిచెయ్యదనుకుని దాన్ని తీసేసి మరో మామూలు కవచాన్ని తొడుక్కున్నాడు.

అర్జునుడలా దుర్యోధనుడితో పోరుతుంటే సైంధవుడి చుట్టూ వున్న వాళ్లు దుర్యోధనుడిని కాపాడటానికి అతనికి తోడై వచ్చారు. అది కూడ తమకు అనుకూలమైన పరిణామమేనని కృష్ణార్జునులు ఆనందించారు. వృషసేనుడు, శలుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు ఒక్క పెట్టున వాళ్లని చుట్టుముట్టారు. వాళ్ల వెనక దాక్కుని సైంధవుడూ అర్జునుడి మీదికి బాణపరంపరలు కురిపిస్తున్నాడు. అర్జునుడెంత తీవ్రశస్త్రాస్త్రాల్తో పోరాడినా వెనుతిరక్కుండా వాళ్లూ రణం సాగించారు.

మరోవంక ద్రోణుడు, మన ఇతర దొరల్తో ధర్మరాజు, అతని తమ్ములు, ధృష్టద్యుమ్నాది వీరులు యుద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ద్రోణ ధర్మజుల యుద్ధం చాలా ఆసక్తికరంగా సాగింది. ద్రోణుడి శరవర్షంతో ధర్మరాజు రథాన్ని కమ్మేస్తే “ఇంకేముంది, ధర్మరాజు ద్రోణుడికి చిక్కాడ”ని సేనలు గగ్గోలు పడ్డారు. ధర్మరాజు ఆ బాణాల్ని విరిచి తీవ్ర రశ్మితో మండే ఓ గొప్ప శక్తిని ద్రోణుడి మీదికి విరిరాడు. అతను దాన్ని బ్రహ్మాస్త్రంతో నిర్జించాడు. అంతతో ఆగక తనకేసి వస్తున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని ధర్మజుడు కూడ బ్రహ్మాస్త్రంతోనే ఉపసంహరించాడు. అంతేకాకుండా ఐదు బాణాల్తో ద్రోణుడి వింటిని నరికాడు. ద్రోణుడు గద విసిరాడు. ధర్మరాజు కూడ ఉగ్రజ్వాలల్తో మండే గదని విసిరితే ఉగ్రాకృతితో ద్రోణుడతని గుర్రాల్ని చంపి వింటినీ జెండానీ రథాన్నీ విరిచాడు.

ధర్మరాజు రథం దిగి నిరాయుధుడై చేతులు పైకెత్తి దీనుడై ద్రోణుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. అలా దీనంగా నిలబడ్డ ధర్మరాజుని చూస్తూ చూస్తూ ఏమీ చెయ్యటానికి చేతులు రాక ద్రోణుడు పక్కన ఉన్న సైన్యం మీదికి దృష్టి మరల్చాడు. ఈ లోగా వచ్చిన సహదేవుడి రథం మీదికి పరుగున ఎక్కి బతుకు జీవుడా అని పారిపోయాడు ధర్మరాజు. తృటిలో జరిగిపోయిన ఈ సంఘటనని గమనించక మిగిలిన రథికులు యుద్ధం కొనసాగిస్తున్నారు. అలంబుసుడు భీముడితో తలపడి “నేను లేనప్పుడు మా అన్న బకాసురుణ్ణి చంపావు, ఇప్పుడు నీ అంతు చూస్తా” అంటూ అతని మీద రకరకాల మాయలు ప్రయోగిస్తే భీముడు దివ్యాస్త్రాల్తో వాటిని పటాపంచలు చేశాడు. దాంతో ఆ రాక్షసుడు పారిపోయాడు. అదిచూసి ద్రోణుడు పాండవవీరుల్ని ఎదిరించి నిలబెట్టి పోరాడాడు. ఘటోత్కచుడు ద్రోణుడితో తలపడుతుంటే అలంబుసుడు అడ్డుగా వచ్చి అతన్నెదుర్కున్నాడు. సాత్యకి అలంబుసుడితో తలపడబోతుంటే ఘటోత్కచుడతన్ని పక్కకి నెట్టి తనే వాడితో యుద్ధానికి పూనుకున్నాడు. అలంబుసుడు వేగంగా అతని మీద చక్రాన్ని విసిరితే ఘటోత్కచుడు గదతో దాన్ని పొడి చేశాడు. అలంబుసుడు రకరకాల శక్తుల్ని ప్రయోగిస్తే అర్థచంద్ర బాణాల్తో నాశనం చేశాడు ఘటోత్కచుడు.

అలా ఆ ఇద్దరు రాక్షసులూ వివిధాయుధాల్తో, మాయల్తో, మాయారూపాల్తో పోరాడుతుంటే పాండవులు, వాళ్ల హితులూ కలిసి అలంబుసుడి మీద శరపరంపరలు కురిపించారు. వాడు మాయాబలంతో ఆ శరాల్ని తప్పించుకుని భీముడి మీద ఇరవై ఐదు, ధర్మరాజు మీద మూడు, సహదేవుడు, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు ఒక్కొకరి మీద ఐదేసి, నకులుడి మీద డెబ్భై మూడు బాణాలేసి బొబ్బ పెట్టాడు. ఘటోత్కచుడు వాడి రథమ్మీదికి దూకి సారథిని చంపి రథాన్ని ముక్కలు చేశాడు. విరథుడై కిందికి దూకి వాడు తన మాయాబలంతో బాణవర్షం కురిపిస్తే ఘటోత్కచుడు కూడ రథం దిగి మాయాశరాల్తో వాటిని విరిచి గదతో వాడిని మోదాడు. అలంబుసుడు గాయపడ్డాడు. కత్తి తీసుకుని ఆకాశానికెగిరాడు. ఘటోత్కచుడు కూడ అదేపని చేశాడు. ఇద్దరూ చిత్ర విచిత్ర గతుల్తో యుద్ధం చేసి భూమికి దిగి ఒకరొకరి కంఠాలకి గురిగా కత్తులు విసిరితే అవి రెండూ ఒక దానికొకటి కొట్టుకుని కింద పడినయ్.

దాంతో రాక్షసులిద్దరూ మల్లయుద్ధానికి పూనుకున్నారు. అనేక ప్రకారాల పిడిగుద్దుల్తో, పోటుల్తో, వేటుల్తో వాళ్ల ప్రావీణ్యాన్ని చూపుతూ అద్భుతంగా పోరారు. సేనలన్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాయి. చివరకు అలంబుసుడు కొంత అలసి పోవటంతో ఘటోత్కచుడు విజృంభించి వాణ్ణి కింద పడేసి తను పైనెక్కి మోకాళ్లు, మోచేతులు, పిడికిలి దెబ్బల్తో వాణ్ణి ముద్దముద్దగా కొట్టి వాడి తొడ ఎముకల్ని నుగ్గునుగ్గుగా చితక్కొట్టి కాల్తో వాడి పీక నులిమి చంపి పోటుతనంతో రంకె వేశాడు. పాండవబలంలో సింహనాదాలు, వాద్యఘోషలు చెలరేగినై. ఘటోత్కచుడు ధర్మరాజుకి నమస్కరిస్తే అతను సంతోషంగా వాణ్ణి కౌగిలించుకుని మూర్ధాఘ్రాణం చేశాడు.

మరోవంక సాత్యకి ద్రోణుడితో తలపడి పోరుతున్నాడు. ఇరవై ఐదు పిడిబాణాల్తో సాత్యకి ద్రోణుణ్ణి కొడితే మూడు నారసాల్తో ద్రోణుడతన్ని తిప్పికొట్టాడు. సాత్యకి నూటైదు బాణాలేస్తే ద్రోణుడు తొమ్మిది అమ్ములేశాడు. అంతతో ఆగక ద్రోణుడు వంద శరాల్తో అతన్ని నొప్పిస్తే సాత్యకి తూలి తిరిగి వెయ్యలేక చూస్తుంటే మనవాళ్లు ఆనందంగా అరిచారు. అది ధర్మరాజు విన్నాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి “పిట్టని తాటికి కట్టి ఆడించే బాలుడి లాగా ద్రోణుడు సాత్యకిని తిప్పలు పెడుతున్నాడు. భీముణ్ణి తీసుకుని నువ్వక్కడికి వెళ్లి అతన్ని రక్షించు” అని తొందర పెట్టాడు. వాళ్లు హుటాహుటిన సాత్యకిని దాటి వెళ్లి ద్రోణుడితో తలపడ్డారు.

ఇంతలో ధర్మరాజుకి పాంచజన్య ధ్వని వినపడింది. కాని దాని వెనకే గాండీవ గుణ ధ్వని వినపడలేదు. అతనికి కంగారు కలిగింది. సాత్యకిని పిలిచాడు. డగ్గుత్తికతో “పాంచజన్యం పదేపదే వినిపిస్తున్నది. విజయుడొక్కడే సైంధవ వధకి కౌరవసైన్యం లోకి వెళ్లాడు. అతనికేమైనా అయిందేమోనని నాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. మన బలంలో అతన్ని రక్షించ గలిగేవాడివి నువ్వొక్కడివే. అర్జునుడు నీకు ఆప్తుడు, గురువు. నువ్వు పక్కనుంటే చాలు కౌరవుల్ని జయిస్తానని అర్జునుడు ఎప్పుడూ చెప్తూ వుంటాడు. వెళ్లి నీ శరదర్పంతో కురుబలాన్ని దాటుకుని అర్జునుణ్ణి చేరు. నా మనసు చల్లబడేట్టు చెయ్యి. ఇది నా ప్రార్థన, మన్నించు” అని వేడుకున్నాడు.

అందుకు సాత్యకి “నీ మాట కాదంటానా? ఐతే అర్జునుడు పొద్దున వెళ్లేటప్పుడు నన్ను నీకు రక్షగా వుండమని పదేపదే చెప్పాడు. ఇక్కడ నిన్ను ద్రోణుడు పట్టుకుంటే అక్కడ సైంధవుణ్ణి చంపీ ఉపయోగం లేదు కదా?” అంటే, ధర్మరాజు “నా గురించి నీకేం చింత అక్కర్లేదు. ఇక్కడ ద్రుపదుడు, విరాటుడు, కేకయులు, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు, శిఖండి – ఇలా ఎందరో మహావీరులున్నారు, ఇక ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణ సంహారానికి. నువ్వు నిశ్చింతగా అర్జునుడికి సహాయంగా వెళ్లు” అని చెప్పాడు. సాత్యకి, “ఐతే గుర్రాలకి నీళ్లు పెట్టించి, రథం సిద్ధం చేయించి బయల్దేరతా” అని దారుకుడి తమ్ముడు సారథిగా రథం సిద్ధం చేస్తుంటే తను వెళ్లి స్నానం చేసి ఆప్యాయంగా కొంత మధువు తాగి పెళ్లికి వెళ్తున్నట్టు రథం ఎక్కి ఎక్కుపెట్టిన ధనువుని, ముచ్చటైన అమ్ముల్ని తొడల మీద పెట్టుకుని బయల్దేరాడు. భీముడు కూడ తనతో రాబోతుంటే అతన్ని వారించి ధర్మరాజు పక్కనే ఉండమని చెప్పి లేళ్ల గుంపుల్ని చూసే పెద్దపులిలా మన సేన వంక చూస్తూ కదిలాడు సాత్యకి.

సాత్యకి అర్జునుడి దగ్గరికి బయల్దేరితే ద్రోణుడతని వెంట పడ్డాడు. ద్రోణుణ్ణి ఆపటానికి పాండవబలాలు అతనితో తలపడబోతే మనబలంలో వీరులు వాళ్లని ఢీకొన్నారు. సాత్యకి, ద్రోణులు ఘోరంగా పోరసాగారు. “నీ గురువు అర్జునుడు నాకోడిపోయి పక్కకి తిరిగి లోపలికి పోయాడు. నువ్వూ అలా చేద్దామనుకుంటున్నావేమో, అది సాగనివ్వను. నిలబడి యుద్ధం చెయ్యి” అని గర్జించాడు ద్రోణుడు. “ధర్మరాజు కోరిక మీద అర్జునుడి దగ్గరికి వెళ్తున్నా. ఆలస్యం చెయ్యటం మీలాటి పెద్దలకు భావ్యం కాదు” అని అతన్ని వేడుకున్నాడు సాత్యకి. ఐనా వినక ద్రోణుడు రణం సాగిస్తుంటే సాత్యకి సారథితో “ద్రోణుడు మనల్ని పోనివ్వడు. మనమే పక్కకి తప్పుకు పోవాలి. ఇటు బాహ్లికుడి సైన్యం వుంది, అటు అంగరాజ్య సైన్యం. ఆ పక్క దాక్షిణాత్య సేన. వీటిలో ఒకదాన్లోకి వెళ్దాం పద” అంటే అతను అంగ సైన్యం వైపుకి కదిలాడు. ద్రోణుడు వదలకుండా వెంటపడ్డాడు. సాత్యకి ఆ సైన్యాన్ని చీల్చుకుని వెళ్తుంటే కృతవర్మ అడ్డుపడ్డాడు. అదిచూసి సంతుష్టుడై ద్రోణుడు వెనక్కి తిరిగి తన స్థానానికి వచ్చాడు.

కృతవర్మ సాత్యకి వింటిని విరిచాడు. అతను ఇంకో విల్లు తీసుకుని కృతవర్మ చేతులు గాయాలు చేసి అతని సారథిని చంపాడు. కృతవర్మ తనే రథం తోలుకుంటూ ధైర్యంగా నిలబడ్డాడు. ఐతే అతను సాత్యకి వెంట వెళ్లకుండా పక్కనే వున్న భీముడి బలగాల మీద విరుచుకు పడ్డాడు. సాత్యకి ముందుకి సాగి కాంభోజసేనలోకి చొరబడ్డాడు. ఆ సేనలో వున్న దొరలు అతన్నెదుర్కున్నారు.

ద్రోణుడు కృతవర్మకి మరో సారథిని ఏర్పరచి అతని స్థానానికి అతన్ని పంపి తను సాత్యకి వెంట బయల్దేరాడు. అదిచూసి ధర్మరాజుతో వున్న రాజులు ద్రోణుణ్ణి వెనక నుంచి తాకారు. ఐతే కృతవర్మ వాళ్లకి అడ్డుపడి కదలకుండా ఆపి చీకాకు పరిచాడు. అదిచూసి భీముడు సోదరపుత్రమిత్ర సహితంగా కృతవర్మ మీదికి దూకాడు. ఐతే అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్లందరికీ సమాధానాలు చెప్తూ సేనని గగ్గోలు పరిచాడు. శిఖండి కృతవర్మతో తలపడితే కృతవర్మ అతని వింటిని విరిచి గాయం చేస్తే సారథి రథాన్ని అక్కడినుంచి దూరంగా తోలుకుపోయాడు. దాంతో మత్స్య, చేది, కేకయ సైన్యాలు చెల్లాచెదురైనై.

దూరాన్నుంచి అది చూస్తున్న సాత్యకి అర్జునుడికి సాయంగా తర్వాత వెళ్లొచ్చు, ముందు ధర్మజుడికి రక్షణ ముఖ్యం అని ద్రోణుడితో యుద్ధం ఆపి రథాన్ని వెనక్కి తోలుకుని వచ్చి కృతవర్మని అటునుంచి ఢీకొన్నాడు. ఒక భల్లంతో కృతవర్మ విల్లుని తుంచాడు. నాలుగిటితో గుర్రాల్ని చంపాడు. దీప్తివంతమైన ఒక బాణంతో సూతుడి తల నరికాడు. అలా కృతవర్మ పొగరు దించి ఉల్లాసంగా వెనక్కి తిరిగాడు సాత్యకి. త్రిగర్త సైన్యం అడ్డుకోబోతే వాళ్లని ఊచకోత కోశాడు. పాండవసైన్యం ఉత్సాహంగా ఉరకలేస్తుంటే ద్రోణుడు సాత్యకిని తరమటం మాని ఆ సైన్యాన్ని అడ్డుకున్నాడు.

సాత్యకి దారికి అడ్దంగా జలసంధుడనే మగధరాజు ఏనుగు మీదెక్కి నిలబడ్డాడు. సాత్యకి శరప్రవాహంతో ఆ ఏనుగునాపితే జలసంధుడు సాత్యకి వింటిని విరిచాడు. విరిచి ఏభై బాణాలతని వక్షాన నాటాడు. సాత్యకి కోపించి ఒక గట్టివిల్లు తీసుకుని వాడి విల్లు నరికి అరవై అమ్ములు వాడి శరీరానికి నాటాడు. జలసంధుడు చలించకుండా ఒక తోమరంతో సాత్యకి చేతిని కొట్టి కత్తిని విసిరి అతని వింటిని విరిచాడు. పట్టరాని క్రోధంతో సాత్యకి మరో విల్లు తీసుకుని వాడి చేతులు, తల నరికి కేక పెట్టాడు. దాంతో అక్కడి సైన్యం కకావికలై పారిపోతుంటే చూసి ద్రోణుడు కృతవర్మని తన స్థానంలో వుంచి మళ్లీ సాత్యకితో తలపడ్డాడు. అతన్ని చూసి నీ కొడుకులు దుర్మర్షణుడు, దుస్సహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు సాత్యకిని చుట్టుముడితే దుర్యోధనుడు కూడ వచ్చి వాళ్లతో కలిశాడు. అప్పుడు ద్రోణుడు తృప్తిగా సేనాముఖానికి తిరిగి వెళ్లాడు. ఐతే సాత్యకి అందరికీ అన్నిరూపులై యుద్ధం చేస్తూ దుర్యోధనుడి పతాకని కూల్చి సారథిని చంపి వింటిని విరిస్తే దుర్యోధనుడు కిందికి దూకి పరిగెత్తాడు. దగ్గర్లో వున్న చిత్రసేనుడి రథం ఎక్కాడు. దూరాన్నుంచి ఆ కోలాహలం విని కృతవర్మ వేగంగా అక్కడికి వచ్చాడు. సాత్యకి కూడ తన రథాన్ని అతనికి ఎదురుగా తిప్పించాడు. ఇద్దరూ ఘోరంగా రణం సాగించారు.

అప్పుడు సాత్యకి అతని గుర్రాల్ని, సూతుణ్ణి గాయపరిచి విల్లు తుంచి మిరుమిట్లు గొలిపే నారసాన్ని అతని ఒంట్లోంచి దూరిపోయేట్టు విసిరితే చచ్చినట్టు మూర్ఛపోయి పడ్డాడు కృతవర్మ. వాడు చచ్చాడని తృప్తిగా తన ప్రయాణం సాగించాడు సాత్యకి. ఐతే ఇంతలోనే కృతవర్మ తెప్పరిల్లి తన స్థానానికి పోయి భీమాదుల్తో తలపడితే ద్రోణుడతన్ని తన స్థానానికి పంపి తను తిరిగి సాత్యకి వెంట బయల్దేరాడు. మళ్లీ ఇద్దరికీ ఘోరరణమైంది. ద్రోణుడతని వింటిని విరిచాడు, అతను గద విసిరేశాడు, ద్రోణుడు భల్లంతో దాన్ని పగిల్చాడు, సాత్యకి ఇంకో విల్లు తీసుకుని బాణవర్షం కురిశాడు. ద్రోణుడు తీవ్రంగా ఒక శక్తిని వేశాడు, అది విధివశాత్తు సాత్యకికి కాకుండా అతని రథానికి తగిలింది. సాత్యకి అతని భుజాన్ని గాయం చేశాడు. ద్రోణుడు కోపోద్దీపుడై అతని విల్లు తుంచి సారథిని మూర్ఛపుచ్చాడు. తనే రథం తోలుకుంటూ యుద్ధం చేశాడు సాత్యకి. ఇంతలో అతని సారథి లేస్తే నిశితబాణాల్తో ద్రోణుడి సారథిని చంపాడతను. గుర్రాలా రథాన్ని లాక్కుని పరిగెత్తినయ్. చివరికి ద్రోణుడు వాటిని స్వాధీనపర్చుకుని ఇక చేసేది లేక తన సేనల్ని కూడగట్టుకుని తిరిగి సేనాముఖానికి వెల్లి నిలిచాడు.

అర్జునుడున్న వైపుకి వేగంగా బయల్దేరాడు సాత్యకి. అతన్ని సుదర్శనుడనే రాజు అడ్డుకున్నాడు. ఐతే సాత్యకి చకచకా వాణ్ణి పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఎదురుగా కిరాత, శక, బర్బర, పారద, యవన మ్లేచ్ఛసేనలు కనిపించినయ్. వాటిని నాశనం చేసి వెళ్తుంటే ఆగు సాత్యకీ ఆగు అని అరుస్తూ దుర్యోధన, దుశ్శాసన, చిత్రసేన, వివింశతి, శకుని, దుస్సహ, దుర్ధర్షణ, క్రథ ప్రభృతులు అతని వెంటబడితే తన సారథిని రథం కాస్త నిదానంగా తోలమని చెప్పి వాళ్లు వచ్చేవరకు ఆగి తీవ్రశరాల్తో అందర్నీ నొప్పించి ఓ క్రూరాస్త్రంతో దుర్యోధనుడి విల్లు తుంచి సారథిని చంపితే అతని అశ్వాలు రథాన్ని దూరంగా లాక్కుపోయినయ్. మిగిలిన వాళ్లంతా ఆ రథం వెంట పరిగెత్తితే తన దారిన తను సాగాడు సాత్యకి.

దుర్యోధనుడు క్రోధంతో పంపితే అంబష్ట, టేంకణ, పారద దేశాల సేనల్తో దుశ్శాసనుడు వేగంగా సాత్యకిని చేరుకుని చుట్టుముట్టాడు. సాత్యకి ఆ బలాల్ని చెల్లాచెదురు చేశాడు. దుశ్శాసనుడు తన సేన చేత అతని మీద రాళ్లవర్షం కురిపించాడు. సాత్యకి వాటిని ముక్కలు చేసి వేసిన వాళ్లకే తగిలేట్టు చేశాడు. ఆ తర్వాత తన బాణాల్లో దుశ్శాసనుణ్ణి ముంచితే అతనూ అతని సేనలూ ద్రోణుడి దగ్గరికి పరిగెత్తినయ్.

దుశ్శాసనుణ్ణి చూసి ద్రోణుడు “యువరాజులుంగారికి క్షేమమే కదా, సైంధవుణ్ణి అర్జునుడింకా చంపాడా లేదా? ఇప్పుడిలా సాత్యకి దెబ్బలకే పరిగెత్తే వాడివి రేపు అర్జునుడికో భీముడికో చిక్కితే ఇంక నీ గతేం కాను? అప్పుడు సభలో ద్రౌపది దగ్గర చూపించిన ప్రతాపం అంతా ఏమైందిప్పుడు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పాండవులకి వాళ్ల రాజ్యం ఇప్పించు నీ అన్నతో చెప్పి. ఐనా నువ్వు ముందుంటే యుద్ధం చెయ్యటానికి సిద్ధంగా వున్న రాజుల్ని పెట్టుకుని సాత్యకితో యుద్ధం చెయ్యాలా ఇలా నా దగ్గరికి పరిగెత్తుకు రావాలా?” అని చీవాట్లు పెడితే వినపడనట్టు నటించి సేనల్తో తిరిగి సాత్యకి వైపుకి వెళ్లాడు దుశ్శాసనుడు.

ద్రోణుడు పాండవసైన్యం మీదికి కవిసి చించిచెండాడాడు. ద్రుపదుడి కొడుకు వీరకేతుడు ఉగ్రుడై ద్రోణుణ్ణి తాకి అతని సారథిని నొప్పించి అతని ఒంటికి ఐదుబాణాలు నాటితే ద్రోణుడొక చండాస్త్రంతో వాణ్ణి నేలకూల్చాడు. వాడి అన్నలు తమ్ములు చిత్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు ద్రోణుణ్ణి కమ్ముకుంటే అతను వెంటనే వాళ్లందర్నీ పరలోకాలకి పంపాడు. దాంతో దుఃఖితుడై ధృష్టద్యుమ్నుడు క్రూరనారాచాల్తో ద్రోణుడి వక్షాన్ని కొట్టాడు. మన సేనలు హాహాకారాలు చేసినయ్. ద్రోణుడు మూర్ఛపోయాడు. పలకా వాలూ తీసుకుని అతని తల నరకటానికి ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి రథమ్మీదికి లంఘించాడు. ఐతే అంతలో తెలివొచ్చి ద్రోణుడు చేతికందుబాట్లో వున్న బాణాల్తోనే ధృష్టద్యుమ్నుడిని పొడిచాడు. ఊహించని ఈ ఎదురుదాడికి ఖంగుతిని బాణాలు గుచ్చుకున్న బాధతో విలవిల్లాడుతూ వెనక్కి తిరిగాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణుడు లేచి అతని సారథిని చంపితే గుర్రాలు ధృష్టద్యుమ్నుణ్ణి దూరంగా లాక్కుపోయినయ్. ద్రోణుడి ధైర్య స్థైర్య సాహసాలు చూస్తున్న పాండవసైన్యాలు అతన్నేమీ చెయ్యలేక చిందరవందరయినయ్.

ఇక ద్రోణుడి చేత చివాట్లు తిని వెళ్లిన దుశ్శాసనుడు సాత్యకిని తాకాడు. అతనికి తోడుగా దుర్యోధనుడు త్రిగర్త బలాల్ని పంపాడు. ఆ సంశప్తకుల్లో మూడువేల రథాల మొనగాళ్లు సాత్యకిని కమ్ముకుంటే అతను లాఘవంగా అందులో ఐదువందల మందిని అప్పటికప్పుడే యముడి దగ్గరికి పంపాడు. దాంతో త్రిగర్త సేనలు ద్రోణుడి నీడకి పారినయ్. దుశ్శాసనుడు మాత్రం నిలబడి సాత్యకి మీద బాణవర్షం కురిపించాడు. సాత్యకి అతని విల్లు విరిస్తే అతనో శక్తిని విసిరాడు. సాత్యకి దాన్ని ముక్కలు చేశాడు. ఇంకో వింటితో దుశ్శాసనుడు సాత్యకిని నొప్పించాడు. సాత్యకి కోపంతో అతని జెండాని, సారథిని, గుర్రాల్ని నాశనం చేసి, కేవలం భీముడి ప్రతిజ్ఞని మనసులో తలుచుకుని అతన్ని చంపకుండా వదిలి తన దారిన సాగాడు. ఇలా ఒకవంక సాత్యకి చేత, మరోవంక అర్జునుడి చేత మనసైన్యం, ఇంకోవంక ద్రోణుడి చేతిలో వాళ్ల సైన్యం శలభాల్లా మాడిపోతున్నాయి.

ఇంతలో ద్రోణుడి యుద్ధం చూడటానికి దుర్యోధనుడు సేనాముఖానికి వచ్చాడు. పాండవసేనలు ఇంకా పోరాడుతుండటం చూసి ఒక్కడే వాళ్ల వ్యూహం లోకి చొచ్చుకుపోయి ధర్మజ, భీమ, నకుల, సహదేవ, ద్రుపద, విరాట, ద్రౌపదేయ, కేకయ, ధృష్టద్యుమ్నుల మీద వరసగా బాణాలు వర్షించాడు. ధర్మరాజు కోపంతో అతని వింటిని నరికాడు. ఐతే ద్రోణుడు ఆ వెనకే వుండి పాండవవర్గం వారందర్నీ శరపరంపరల్లో ముంచితేల్చాడు. దుర్యోధనుడు తిరిగి సైంధవుడి సంరక్షణకి వెళ్లాడు.

కేకయరాజు బృహత్క్షత్రుడు ద్రోణుడితో పోరాడి మరణించాడు. శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడప్పుడు ద్రోణుడితో తలపడ్డాడు. వాళ్లిద్దరికి భీభత్స సమరం జరిగింది. ద్రోణుడొక వాలికనారసాన్ని ధృష్టకేతుడి హృదయంలో గుచ్చాడు. పెద్ద అరుపు అరిచి కింద పడి చచ్చాడు వాడు. అదిచూసి కోపోద్రిక్తుడై వాడి కొడుకు ద్రోణుణ్ణి కమ్ముకున్నాడు. ఐతే ద్రోణుడు వాణ్ణి అవలీలగా చంపాడు. ఆ వెనక జరాసంధుడి కొడుకు ఢీకొడితే వాణ్ణీ వేగంగా యమపురికి పంపించాడు. భీముడు ధృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడితో తలపడమని ప్రోత్సహిస్తే అతనా పని చేసే లోగా క్షత్రవర్మ అడ్డు వచ్చి ద్రోణుడి వింటిని విరిస్తే అతను వేగంగా మరో విల్లు తీసుకుని వాడి పేరు తుడిచేశాడు. దాంతో చేకితానుడు వందబాణాల్తో ద్రోణుణ్ణి నొప్పించి సూతుణ్ణి, గుర్రాల్ని బాధిస్తే ద్రోణుడు కళ్లలోంచి నిప్పులు కురిపిస్తూ ఓ నిశిత బాణాన్ని అతని భుజానికి నాటి సారథిని చంపాడు. గుర్రాలతని రథాన్ని లాక్కుపోయినయ్.

ఇంతలో ధర్మరాజు “అర్జునుడికి తోడుగా సాత్యకిని పంపా, అతను లోపలికి వెళ్లటం చూశా. మరి ఆ ఇద్దరూ ఎలా వున్నారో తెలియటం లేదు. తన తమ్ముడికి తోడుగా సాత్యకిని పంపాడు గాని మరి ఆ సాత్యకి ఏమయ్యాడో అన్న ఆలోచనే ఇతనికి లేదని చుట్టుపక్కల వాళ్లు నన్నుకోవచ్చు. కాబట్టి భీముణ్ణి కూడ పంపటం ఉత్తమం” అనుకుని అతని దగ్గరికి వెళ్లి అర్జునుడు, సాత్యకి ఎలా వున్నారో చూసి సింహనాదం ద్వారా తనకి తెలియజెయ్యమని కోరాడు. భీముడు ధర్మరాజు రక్షణని ధృష్టద్యుమ్నుడికి అప్పగించి కదిలాడు. నీ కొడుకులు అనేకమంది భీముడి మీదికి దూకారు. అతను ఆనందంగా లేళ్ల గుంపుని చూసిన పులిలా వాళ్ల మీద పడి ముందుగా ముగ్గుర్ని మృత్యువుకి బలిచ్చాడు. వాళ్లు అభయుడు, రౌద్రకర్ముడు, దుర్విమోచనుడు. ఐనా పారిపోకుండా మిగిలిన వాళ్లు పోరుతుంటే వాళ్లలో విందుడు, అనువిందుడు, సుశర్ముడు, సుదర్శనుల్ని కూడ తోడు పంపాడు.

ఈ సంరంభం చూసి ద్రోణుడక్కడికి వచ్చి భీముడితో తలపడ్డాడు. వీడు కూడ అర్జునుడి లాగానే తప్పించుకుపోతాడేమోనని “నన్ను గెలిస్తే తప్ప నువ్వీ వ్యూహాన్ని ప్రవేశించలేవు. నీ తమ్ముడు కూడ నా అనుమతి తీసుకునే వెళ్లాడు” అంటే భీముడు నిప్పులు రాలుస్తూ “అర్జునుడికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. ఇంద్రాదులడ్డైనా తనెక్కడికి పోవాలంటే అక్కడికి పోగలడు. నీ మీద గౌరవం కొద్ది నిన్ను పొగిడి వెళ్లాడు, అంతే. నేను అలాటివాణ్ణి కాను. నా విరోధికి జయం కూర్చటానికి కష్టపడుతున్న నిన్ను వదుల్తానా?” అని గదని తిప్పి విసిరే సరికి అంతటి వృద్ధుడూ ద్రోణుడు చెంగున రథం నించి దూకి తప్పుకున్నాడు. సారథి, గుర్రాల్తో సహా రథం నుగ్గునుగ్గయింది. భీముడు మన సైన్యం లోకి ప్రవేశించాడు. నీ కొడుకులు కొందరు అతన్ని ఆపటానికి ప్రయత్నించారు కాని అతని తీవ్రతకి తట్టుకోలేక తప్పుకున్నారు.

ఇంతలో ద్రోణుడు మరో రథం ఎక్కి భీముణ్ణి తరుముతూ వచ్చి భీముడి మీద బాణవృష్టి కురిపించాడు. భీముడు గభాల్న రథం దిగి ద్రోణుడి బాణాలు మొహానికి తగలకుండా తల కిందికి వంచుకుని వెళ్లి ఒక చేత్తో ద్రోణుడి రథం నొగలు పట్టుకుని రథాన్ని గిరగిర తిప్పి విసిరేశాడు. రథం ముక్కలయింది. ద్రోణుడు మరో రథాన్ని వెతుక్కుని ఊసురోమని తన పూర్వస్థానానికి తిరిగెళ్లాడు.

ఈ ఉదంతం చూసిన మిగిలిన సేనలేవీ భీముడి చాయలకి కూడ వెళ్లలేదు. భోజబలాలు, కాంభోజసైన్యాలు, యవన, మ్లేచ్ఛ బలగాలు అతను ముందుకు వెళ్తుంటే పక్కలకొదిగి చూస్తూ నిలబడినయ్. అలా వెళ్లి భీముడు సాత్యకి విక్రమాన్ని గమనిస్తూ సాగి కౌరవయోధానికాన్ని చెండాడుతున్న అర్జునుణ్ణి చూసి సింహనాదం చేశాడు. అతన్ని చూసి ప్రేమతో కృష్ణార్జునులు కూడ గర్జారవాల్తో గగనాన్ని నింపారు. ధర్మరాజు అవన్నీ విని తృప్తుడై ఆనందించాడు.

కర్ణుడు భీముణ్ణి ఎదిరించాడు. అతను నూటైయాభై బాణాలు భీముడి మీద వేస్తే భీముడు అరవైమూడు శరాలు పరిచాడు. భీముడు కర్ణుడి విల్లు తుంచితే అతను ఠక్కున మరోవిల్లు తీసుకుని భీముణ్ణి గాయపరిచాడు. భీముడు క్రుద్దుడై ఆ వింటినీ విరిచి సూతుణ్ణి గుర్రాల్ని కూడ చంపాడు. విరథుడై రాధేయుడు వృషసేనుడి రథం దగ్గరికి పరిగెత్తాడు. మన సేన కకావికలమైంది. దుర్యోధనుడు పట్టరాని దుఃఖంతో ద్రోణుడి దగ్గరకి రథం తోలుకు వెళ్లాడు. “అక్కడ అర్జునుడు, సాత్యకి, భీముడు మనసేనని చంపుతున్నారు, సైంధవుడికి దగ్గరౌతున్నారు. అర్జునుణ్ణి పోనిచ్చావు సరే, మిగిలిన ఇద్దర్నీ వదిలెయ్యాలా? నిన్ను గెలవటం ఎవరి తరం? ఐనా సాత్యకి చేతిలో కూడ ఓడిపోయానన్న కీర్తి కోసం ఈ పని చేశావా? సరే, ఇదంతా ఎందుకు – ఇప్పుడు కర్తవ్యం ఏమిటో కూడ నువ్వే చెప్పు” అన్నాడు నిష్టూరంగా. “సైంధవుణ్ణి రక్షించుకోవటం తక్షణ కర్తవ్యం. నువ్వు కర్ణాదుల్తో కలిసి ఆ ముగ్గుర్నీ కదల్నివ్వకు. ఇక్కడ నేను సేనాముఖానే వుండి ఇంకెవరూ లోపలికి రాకుండా చూస్తా. వెళ్లు” అని ద్రోణుడంటే నీరసంగా తనని తనే ప్రోత్సహించుకుంటూ కదిలాడు దుర్యోధనుడు.

అంతకుముందు కృతవర్మ అర్జునుడి చక్రరక్షకులైన యుధామన్యుడు, ఉత్తమౌజుల్ని ఆపాడని చెప్పా కదా, ఆ తర్వాత వాళ్లు వ్యూహం బయటపడి పోరుతూ అర్జునుడు ఎక్కడున్నాడో కపిధ్వజాన్ని చూసి గుర్తించి మరోవంకగా వ్యూహాన్ని ఛేదించి అర్జునుడికి దగ్గరగా వెళ్తుంటే చూసి దుర్యోధనుడు వాళ్లని అడ్డుకున్నాడు. రణం దారుణమైంది. ఉత్తమౌజుడు నీ కొడుకు వింటిని విరిచి అరిచాడు. విరిచి అతని వక్షానికి గురి పెట్టి నిశితాస్త్రాల్ని సంధిస్తే దుర్యోధనుడు మరోవిల్లు తీసుకుని వాడి గుర్రాల్ని, సారథిని చంపాడు. వాడు పరిగెత్తి యుధామన్యుడి రథం ఎక్కాడు. ఎక్కి వెంటనే నీ కొడుకు సారథిని, గుర్రాల్ని చంపితే దుర్యోధనుడది లెక్కచెయ్యకుండా గద తీసుకుని వెళ్లి వాళ్ల గుర్రాల్ని సూతుణ్ణి ముద్దలు చేశాడు. వాళ్లు రథం దిగి పక్కకి తప్పుకున్నారు. శల్యుడు వచ్చి సుయోధనుణ్ణి ఎక్కించుకున్నాడు. ఆ చక్రరక్షకులు మన సైన్యంలో ఎవరో ఇద్దరు రథికుల్ని చంపి వాళ్ల రథాలు తీసుకుని అర్జునుడి దగ్గరికి బయల్దేరారు.

అక్కడ సారథి చస్తే గుర్రాలు రథాన్ని పక్కకి తోలుకుపోయిన కర్ణుడు తిరిగి వచ్చి భీముణ్ణి కేకేసి పిలిస్తే అతను వెనక్కి తిరిగి వచ్చి కర్ణుడితో తలపడ్డాడు. ఇద్దరికీ ఘోరసమరం జరిగింది. భీముడు కర్ణుడి వింటిని ముక్కలు చేసి గుర్రాల్ని చంపి బొబ్బపెడితే దుర్యోధనుడు దుర్జయుణ్ణి భీముడి మీదికి పంపాడు. వాడు తీవ్రంగా భీముడితో తలపడి నిశితసాయకాల్తో అతన్ని నొప్పించి సారథికి గుర్రాలకి గాయాలు చేస్తే భీముడు క్రోధంతో వాడి గుర్రాల్ని, సూతుణ్ణి చంపి వాడి తల నరికాడు. ఇదంతా ఎదురుగా చూస్తున్న కర్ణుడు భోరుమని ఏడ్చాడు. ఇంకోరథం సిద్ధం చేసుకుని భీముడి మీదికి విజృంభించాడు. కర్ణుడేసిన ఒక పదునైన నారాచం భీముడి వక్షం చొచ్చుకు వెళ్లి వెనక భూమిలో దిగబడింది. ఐనా తొణక్కుండా భీముడొక గదతో అతని తురగాల్ని చంపి కేతువుని సారథిని నేలకూల్చాడు. అలా విరథుడైనా రాధేయుడు భీముణ్ణి తన బాణపరంపరల్లో ముంచెత్తాడు.

దుర్యోధనుడు కర్ణుణ్ణి రక్షించటానికి దుర్ముఖుణ్ణి పంపాడు. వాడు వెళ్లి భీముణ్ణి అడ్డుకుంటే భీముడో వంక కర్ణుడితో యుద్ధం చేస్తూనే తొమ్మిది అమ్ముల్తో వాడి ప్రాణాలు తీశాడు. అది చూసి కర్ణుడు కన్నీళ్లు కారుతుంటే శోకాతురుడై చచ్చినవాడి రథం ఎక్కి భీమున్నెదుర్కున్నాడు. ఐతే భీముడు మూడు వాడినారసాల్ని అతని ఉరాన నాటితే భయంతో రథం తోలుకుని పారిపోయాడు కర్ణుడు. అతని పాటు చూసి సహించలేక నీ కొడుకులు దుర్మర్షణుడు, దుర్మదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు ఒక్కసారిగా భీముడి మీదికి దూకారు. వాళ్లని చూసి కర్ణుడు కూడ తిరిగివచ్చి కలిశాడు. ఐతే ఒక్కొకరి మీద ఆరేసి మెరుగుతూపులు వేసి నీ ఐదుగురు కొడుకుల్నీ యముడికి బలిచ్చాడు భీముడు. కర్ణుడు “ఛీ, ఏమిటీ బతుకు? ఇక ఈ భీముడి అంతు చూడాల్సిందే” అని నిశ్చయించుకుని అతనితో ఘోరంగా తలపడ్డాడు. ఐతే భీముడు మళ్లీ అతని సారథినీ గుర్రాల్నీ కూల్చితే విరథుడై నేల మీద నిలబడే యుద్ధం సాగించాడు కర్ణుడు.

దుర్యోధనుడు పంపితే నీ కొడుకులు చిత్రుడు, విచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు భీముణ్ణి చుట్టుముట్టారు. యధాప్రకారంగానే భీముడు వాళ్లని పరలోకాలకి ప్రయాణం కట్టించాడు. ఇంతలో మరోరథం తీసుకుని కర్ణుడు భీముడితో తిరిగి తలపడ్డాడు. మిగతా వాళ్లంతా యుద్ధం చాలించి చూస్తున్నారు. ఒకరికొకరు తీసిపోకుండా పోరారు వాళ్లిద్దరు. ఐతే మనవైపు వాళ్లు కూడ భీముడి భీమవిక్రమాన్ని పొగుడుతుంటే సహించలేక దుర్యోధనుడు తన దగ్గరున్న యోధుల్ని, తమ్ముల్ని కర్ణుడికి సాయంగా పంపాడు. శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు అలా కర్ణుడి రక్షణకి వచ్చి అతన్ని దాటి వెళ్లి భీముడితో తలపడి అంపవర్షం కురిపించారు. ఐతే భీముడు ఏడు తీవ్ర బాణాల్తో ఆ ఏడుగుర్నీ పరిమార్చి సింహనాదం చేశాడు. దూరాన్నుంచి అదివిని ధర్మరాజు అది భీముడి విజయానికి సంకేతం అని తెలుసుకుని ఆనందించాడు.

కర్ణ భీముల రణం మహాభీషణమైంది. బాణాలు ఒకొకదానికి మధ్య ఎడం లేకుండా కర్ణుడు వేస్తుంటే భీముడు అన్నిటినీ విరుస్తూ కర్ణుడి మీదికి శరాలు ప్రయోగిస్తున్నాడు. కోపమే తన రూపంగా కర్ణుడు భీముడి వింటిని తుంచి గుర్రాల పగ్గాల్ని తెగ్గొట్టాడు. అవి కాడితో పెనుగులాడసాగాయి. అంతలో భీముడి పతాకని కూల్చి సారథిని గాయపరిచాడు. సారథి రథాన్ని అర్జునుడి చక్రరక్షకుల వెనక్కి తీసుకుపోయాడు. భీముడు అధైర్యపడకుండా ఒక శక్తిని విసిరితే కర్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. భీముడు వాలూ పలకా తీసుకుని దూకితే పలకని నరికాడు కర్ణుడు. కత్తితో కర్ణుడి విల్లు విరిచాడు భీముడు. కర్ణుడు మరో విల్లు తీశాడు. మహాక్రోధంతో కత్తి చేతపట్టి భీముడతని రథమ్మీదికి ఎగిరాడు. జెండా పడిపోకుండా వుంచటానికి వుంచిన పీఠం కింద నక్కి కూర్చున్నాడు కర్ణుడు. భీముడికి కనిపించలేదు. పారిపోయాడో లేక రథం కింద దాక్కున్నాడో అని భీముడు కిందికి దూకి చూడబోతే హఠాత్తుగా లేచి రథాన్ని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ రకరకాల అస్త్రాల్తో భీముణ్ణి కొట్టసాగాడు కర్ణుడు. నిరాయుధుడిగా వున్న భీముడు అంతకుమునుపు అర్జునుడి చేతిలో చచ్చిన ఏనుగులు, గుర్రాలే ఆయుధాలుగా అతని మీద విసురుతూ తిరుగుతుంటే కర్ణుడు వాటన్నిటినీ తునకలు చేస్తూ అతని వెంటబడ్డాడు. భీముడు గుర్రాల శవాల గుట్ట వెనక నక్కి అలిసిపోయి రోజుతుంటే కర్ణుడతని దగ్గరికి వెళ్లి కుంతికిచ్చిన మాట ప్రకారం అతని మీద బాణాలెయ్యకుండా నవ్వుతూ వింటికొనతో అతని పొట్టలో పొడుస్తూ “తిండిపోతువి నీకు యుద్ధమెందుకు, హాయిగా ఇంటికి పోయి తిని పడుకోరాదూ? యుద్ధం చెయ్యాలనిపిస్తే ఎవరన్నా తక్కువ వాళ్లని చూసుకుని చెయ్యి గాని నాలాటి వాళ్లతోనా నీకు యుద్ధం? అదుగో కృష్ణార్జునులు అక్కడ వున్నారు, అక్కడికి పోయి బతుకు” అని తిడితే ఇంతలో కృష్ణుడి సలహా మీద అర్జునుడక్కడికి వచ్చి కర్ణుడి మీద శరాలు పరిపిస్తే వాటిని అశ్వత్థామ ఖండించాడు. అర్జునుడు అశ్వత్థామ మీదికి వెళ్లబోతే అతను ఏనుగుల గుంపు వెనక్కి తప్పుకున్నాడు. భీముడు పరాభవంతో ఖిన్నుడై అర్జునుడి దగ్గరకు వెళ్లాడు. ఈలోగా అతని సారథి మరో రథం తెచ్చాడు.

సాత్యకి కూడ అల్లంత దూరాన కృష్ణార్జునుల్ని చూసి సంతోషంతో, అడ్డొచ్చిన మనసేనల్ని ఛేదిస్తూ వాళ్ల వైపుకి సాగాడు. అతనొక్కడే అలా ద్రోణాదుల్ని దాటి క్షేమంగా అక్కడికి రావటం చూసి కృష్ణుడు గర్వపడ్డాడు. అంతలో అలంబుసుడనే రాజు సాత్యకికి అడ్డు తగిలి కొంతసేపు భీకరయుద్ధం చేశాడు. ఐతే అతను పదునైన బాణాల్తో వాడి తల నేల కూల్చాడు. త్రిగర్తు లనేకులు అతని మీద దూకారు. దొరికిన వాళ్లని దొరికినట్టు చంపితే మిగిలిన వాళ్లు పారిపోయారు. అలాగే శూరసేన సైనికులు, కళింగులు కూడ ఆపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

అలా అర్జునుడి దగ్గరికి చేరుతూ రొప్పుతున్న సాత్యకిని చూసి కృష్ణుడు “ధర్మరాజు నీ క్షేమం కోసం పంపితే వచ్చినట్టున్నాడు నీ శిష్యుడు. చూశావా, ఒక్కడే కృతవర్మాదుల్ని, చివరికి ద్రోణుణ్ణి కూడ ఎలా దాటుకుని వచ్చాడో !” అని ఆనందిస్తే అర్జునుడు “ఇది మంచిది కాదు, ఇతన్ని నేను ధర్మరాజు రక్షణకి ఉంచి వచ్చా. ఇప్పుడక్కడ ద్రోణుడు ధర్మజుణ్ణి పట్టబోతే అడ్డుకునేదెవరు? పైగా ఇతనింత సేపు యుద్ధం చేసి అలిసిపోయి వున్నాడు. అక్కడ చూడు, భూరిశ్రవుడు సాత్యకితో తలపడటానికి సిద్ధమౌతున్నాడు, వాడు సామాన్యుడు కాడు. సాత్యకికి గొప్పచిక్కే వచ్చిపడింది” అంటూండగా ఆ భూరిశ్రవుడు సాత్యకికి అడ్డంగా వచ్చి నిలబడు నిలబడమని అదిల్చాడతన్ని. “నిన్ను ఇక్కడి దాక పంపిన ఆ ధర్మరాజుకి తలవంపులు కలిగిస్తా. నువ్వు దార్లో చంపిన వాళ్ల బంధువులకి ప్రీతి కలిగిస్తా. ఎదురుగా చూస్తూ వున్న కృష్ణుడికి దుఃఖం కలిగిస్తా. నీకు విద్య నేర్పిన కిరీటికి నా పోటుతనం చూపిస్తా. నీ అంతు చూస్తా, ఇంకెక్కడికి పోతావ్, రా” అన్నాడు రోషంగా.

సాత్యకి నవ్వాడు. “నాతో యుద్ధం చెయ్యటానికి కావాలని వచ్చే వాళ్లంటే నాకు పండగే. నోటికొచ్చినట్టు పేల్తున్నావ్, నీ నాలిక్కోస్తా” అని బదులిచ్చాడు. ఇలా ఇద్దరూ తిట్టుకుంటూ యుద్ధం సాగించారు. రథాలు విరుచుకున్నారు. పలకలూ కత్తులూ తీసుకుని కిందికి దూకి కత్తియుద్ధం చేసి అలిసిపోయి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రకరకాల విన్యాసాల్తో కొనసాగించారు. అదీ ఐపోయి చివరికి మల్లయుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో భూరిశ్రవుడిదే పైచెయ్యిగా వున్నట్టు గమనించాడు కృష్ణుడు.

“నీకోసం ఇక్కడి దాకా వచ్చిన సాత్యకి ఇప్పుడు అలిసిపోయి చిక్కుల్లో వున్నాడు. వాణ్ణి రక్షించటం నీ కర్తవ్యం. త్వరపడు” అని అర్జునుడితో చెప్పాడు. ఇంతలో భూరిశ్రవుడు సాత్యకిని కింద పడేసి పైనెక్కి గుద్దులు గుద్దుతున్నాడు. “ఇంకా ఆలస్యం దేనికి, నీ శిష్యుణ్ణి రక్షించుకో” అని తొందరపెట్టాడు కృష్ణుడు. “అలాగే చేస్తా. ఇక్కడా మనల్ని సేనలు చుట్టుముడుతున్నయ్, వాళ్లని సంభాళించాలి. సాత్యకినీ కాపాడాలి. రెండూ సాధిస్తా చూడు” అన్నాడు అర్జునుడు. ఇంతలో భూరిశ్రవుడు సాత్యకి గుండెల మీద రెండు మోకాళ్లు తొక్కిపట్టి తళతళ మెరిసే కత్తి తీసి పైకెత్తి వాడి మెడ నరకబోతుంటే కృష్ణుడు “వెయ్యి, వెయ్యి” అని హడావుడిపెడుతుంటే అర్జునుడు మహావేగంగా తొడిగి ఒక గొప్పబాణాన్ని బలంగా వేస్తే దానికి భూరిశ్రవుడు పైకెత్తిన కత్తిచెయ్యి మహాభుజంగంలా తెగిపడింది.

ఆరని కోపంతో వాడు తననలా చేసిన వాడు అర్జునుడని గ్రహించి “నీవంక చూడలేదు నేను, ఇంకొకడితో యుద్ధం చేస్తున్నా. ఇలాటి నీచపు పని నీలాటి వాడికి తగిందా? ఈ దురాలోచన నీకు చెప్పిందెవరు – నీ గురువా ఇంద్రుడా రుద్రుడా? కృష్ణుడింత పాపపు పని చెయ్యనిస్తాడా?” అని ఆక్షేపిస్తే “రాజులు పోరేప్పుడు వాళ్ల బంధువులు వచ్చి సాయం చెయ్యటంలో తప్పేముంది? సాత్యకి ఎంతో శ్రమ చేసి వచ్చి అలిసిపోయి వుంటే అతని మీద కాలుదువ్వి చంపాలని చూశావ్, నేనుండగా అతన్ని చంపటం ఎవరి తరం? ఐనా అధర్మపరులై అభిమన్యుణ్ణి చంపిన నీలాటి వాళ్లేనా ఇలాటి మాటలు మాట్లాడేది?” అని అతని నోరు మూయించాడు అర్జునుడు. నీ కొడుకులు, చుట్టుపక్కల వున్న రాజులు కూడ భూరిశ్రవుణ్ణి సమర్ధిస్తే వాళ్లనీ అదే విధంగా సమాధాన పరిచాడు అర్జునుడు.

బాధపడుతున్న భూరిశ్రవుణ్ణి చూసి “క్షత్రధర్మం మూలాన నీలాటి మహాత్ముడికి ఇలాటి కష్టం కలిగింది. నా ప్రతిజ్ఞ నీకు తెలుసు. అసలు మనందరి కష్టాలకీ మూలకారణం దుర్యోధనుడు. వాడు నరకానికి పోతాడు, నువ్వు సద్గతి పొందు” అని ఊరడిస్తే అతను సాత్యకిని వదిలి ప్రాయోపవేశం చెయ్యటానికి ప్రాణాయామ పరాయణుడై యోగయుక్తుడయాడు. అంతలో సాత్యకి ఓపిక తెచ్చుకుని లేచి కత్తి తీసుకుని అందరూ వద్దు వద్దని అరుస్తున్నా వినక భూరిశ్రవుడి శిరస్సు ఖండించాడు. అభిమన్యుణ్ణి కౌరవులెలా అన్యాయంగా చంపారో అందరికీ ఉపన్యసించాడు. “అయ్యయ్యో ఎంత ఘోరం” అనే వాళ్లు, “కోపంలో ఏం చేస్తామో మనకే తెలీదు” అనే వాళ్లు, “అంతా విధి” అనే వాళ్లు అయారక్కడి సైనికప్రేక్షకులు.

ధృతరాష్ట్రుడది విని ఆశ్చర్యపోయాడు. “అదేమిటి, ద్రోణుడు, కృతవర్మ లాటి మహారథుల్ని అవలీలగా దాటగలిగిన సాత్యకి భూరిశ్రవుడి చేతిలో ఇలా పరాజయం, పరాభవం పొందటం వింతగా లేదూ! ఎందుకిలా జరిగిందో” అంటే దానికి సంజయుడు “దానికో పెద్ద కథ వుంది – చంద్రవంశ వర్ధనుడు యయాతి. అతని కొడుకు యదుడు. అతని పరంపరలో పుట్టిన వాడు దేవమీఢుడు. అతని కొడుకు శూరుడు, అతనికి పుట్టినవాడు వసుదేవుడు. అతను రూప గుణాల్లో అందరి మన్ననలూ పొందుతూ పెరుగుతున్నాడు.

అప్పుడు దేవకుడనే రాజు తన కూతురు దేవకికి స్వయంవరం చాటించాడు. యదు వంశం వాడైన శిని వసుదేవుడి కోసం దేవకిని పరాక్రమంతో జయించి తెస్తుంటే అక్కడ కూడిన మిగిలిన రాజులంతా అతనితో యుద్ధంలో ఓడారు కాని బాహ్లికుడి కొడుకు ఒక్క సోమదత్తుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. వాళ్లు పరస్పరం రథాల్ని విరుచుకుని కత్తులతో కింద దూకి యుద్ధం చేశారు. అప్పుడు శిని సోమదత్తుణ్ణి గెలిచి వాడి జుట్టు పట్టుకుని కింద పడేసి, బాగా తన్ని కనికరంతో చంపకుండా మాత్రం వదిలేశాడు. ఆ అవమాన భారంతో సోమదత్తుడు ఎవరికీ మొహం చూపించలేక అడవులకి పోయి ఈశ్వరుడి గురించి చాలా కాలం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయే నాటికి శిని, అతని కొడుకు కూడ కాలం చేశారు. కనక శిని మనవణ్ణి యుద్ధంలో కింద పడేసి తన్నే కొడుకు కావాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. అలా పుట్టిన వాడు భూరిశ్రవుడు. అందుకే వాడి చేతిలో శిని మనవడైన సాత్యకి అవమానం పాలయ్యాడు” అని విశదీకరించాడు. భారతయుద్ధ కథా ప్రకారాన్ని మళ్లీ అందుకున్నాడు.

అలా భూరిశ్రవుడు చావటంతో సైంధవుడి వైపుకి బయల్దేరాడు అర్జునుడు. అశ్వత్థామ, దుర్యోధనుడు, ఇతర మహారథులు అతన్ని అడ్డుకున్నారు. ఇక సాత్యకితో కర్ణుడు తలపడ్డాడు.

ఆ రోజు ముందు రాత్రి కృష్ణుడు తన సారథి దారుకుడికి తన రథం సిద్ధంగా చేసి వుంచమని, తను ఎప్పుడు పాంచజన్యాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఊదితే అప్పుడు తన దగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు, గుర్తుంది కదా. ఇక్కడ సాత్యకి భూరిశ్రవుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సోమదత్తుడి వరం గురించి తనకి ముందే తెలుసు గనక అలా పాంచజన్యాన్ని ఊదాడు కృష్ణుడు. అది విన్న వెంటనే దారుకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనే పేర్లున్న దివ్యాశ్వాల్తో కట్టిన రథాన్ని అక్కడికి తీసుకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడా రథాన్ని సాత్యకికి ఇచ్చాడు.

దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ రథం ఎక్కి అర్జునుడికి సాయంగా వెళ్లబోతున్న సాత్యకిని కర్ణుడు వారించాడు. సాత్యకికి తోడుగా చక్రరక్షకుల్ని ఉంచి కృష్ణార్జునులు సైంధవుడున్న దిక్కుకి కదిలారు. కర్ణుడూ సాత్యకీ ఒకరికొకరు తీసిపోకుండా అతిఘోరరణం చేశారు. ఆకాశసంచారులు కూడ ఇలాటి యుద్ధం ఇదివరకెప్పుడూ చూడలేదని చెప్పుకున్నారు. అప్పుడు సాత్యకి ఒక భీకరశక్తితో కర్ణుడి ఒళ్లు తూట్లు పొడిచి సూతుణ్ణి, కేతనాన్ని, గుర్రాల్ని, రథాన్ని నుగ్గు చేశాడు. దుర్యోధనుడు, అతని తమ్ములు బొమ్మల్లా చూస్తుండిపోయారు. అంతలోనే తెప్పరిల్లి ఒక్కసారిగా సాత్యకిని చుట్టుముడితే అతను తన దివ్యాశ్వాల్ని చిత్రవిచిత్ర భ్రమణాల్తో తిప్పుతూ అందరికి అన్ని దిక్కులా తనే అయి ముప్పుతిప్పలు పెట్టాడు.

అంతకుముందు కర్ణుడి చేత తిట్లు తిన్న భీముడు అవమానభారంతో కుంగిపోతూ అర్జునుడి దగ్గరికి వెళ్తే అర్జునుడది చూస్తూ సహించలేక కర్ణుణ్ణి కేకేసి “ఏరా కర్ణా భీముణ్ణలా నోటికొచ్చినట్టు తిట్టావే, ఇన్ని సార్లు ఓడావు నిన్నెవరమైనా తిట్టామా? యుద్ధంలో గెలుపోటములు సామాన్య విషయాలు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన ఇంత గర్వం ఎందుకు నీకు? ఇంతకు ముందే సాత్యకి చేతిలో ఓడావు కదా, ఇంతలోనే మర్చిపోయావా? తులువా, నీ కులం, గుణం చూపించుకున్నావు కదా! నేను లేనప్పుడు అధర్మంగా అభిమన్యుడి విల్లు నరికావ్, నువ్వు చూస్తుండగనే ధర్మంగా నీ కొడుకు వృషసేనుణ్ణి చంపుతా చూస్తూ వుండు. అంతేకాదు, ఆ పాపంలో పాలున్న మిగిలిన వాళ్ల గతి కూడ ఎలా వుండబోతుందో నువ్వే చూద్దువు గాని” అని అతని వెంట పడ్డాడు అర్జునుడు.

దుర్యోధనుడు కర్ణుడితో “పొద్దు వాలబోతున్నది. మనం ఎలాగోలా అర్జునుణ్ణి ఇంకాసేపు ఇక్కడే ఉంచగలిగామంటే చాలు, ప్రతిజ్ఞ ప్రకారం వాడు అగ్నిప్రవేశం చేస్తాడు, దాంతో మిగిలిన పాండవులూ ప్రాణాలు తీసుకుంటారు, రాజ్యం మనదే ఔతుంది. శల్యుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు, నేను నీకు తోడుగా వుంటాం, అర్జునుణ్ణి నిలబెట్టు చాలు” అని బతిమాలాడు. దానికి కర్ణుడు “భీముడి బాణాల దెబ్బలకి ఒళ్లంతా గాయాలై ఎటుచూసినా నొప్పులే. ఐనాగాని నీ కోరిక తీర్చటానికి ఒళ్లు దాచుకోకుండా పోరాడతా, నేనుండగా అర్జునుణ్ణి కదలనివ్వను” అని తలపడ్డాడు కర్ణుడు.

భీముడు, సాత్యకి చెరో వైపుండగా మధ్యలో అర్జునుడు గాలి తోడైన అగ్నిలాగా విజృంభించి మన సైన్యాల్ని కాల్చాడు. మన వైపు నుంచి దుర్యోధనుడు, కర్ణుడు, వృషసేనుడు, శల్యుడు, కృపుడు, అశ్వత్థామ పోరుతున్నారు. వాళ్ల వెనక నుంచి సైంధవుడు కూడ అర్జునుడి మీదికి బాణాలు కురిపిస్తున్నాడు. అది చూసి అర్జునుడు సైంధవుణ్ణి పట్టుకోటానికి వెళ్తుంటే అతనికి కర్ణుడడ్డుపడ్డాడు. సాత్యకి, భీముడు అతని మీద శరవర్షం కురిపిస్తున్నారు. ఐతే కర్ణుడు తన బాణపరంపరల్తో ఆ ముగ్గుర్నీ ఆపాడు.

అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి తొమ్మిది బాణాల్తో వక్షాన్ని కొట్టి అతని ప్రాణాలు తీసే ఘనవిశిఖాన్ని వేస్తే త్వరితంగా అశ్వత్థామ ఒక అర్థచంద్ర బాణంతో దాన్ని మధ్యలోనే తుంచాడు. దుర్యోధనుడు మన వాళ్లందర్నీ కర్ణుడికి తోడుపడమని అరిచి చెప్పాడు. అందరూ చుట్టుముట్టేంతలో అర్జునుడు కర్ణుడి గుర్రాల్ని కూల్చి, సారథిని చావగొట్టి బాణపరంపరతో అతని అంగాలన్నీ తూట్లు పొడిస్తే కర్ణుడికి నీరసం వచ్చి తూలుతుంటే అశ్వత్థామ అతన్ని తన రథం మీదికి లాక్కున్నాడు. అశ్వత్థామ, శల్యుడు అర్జునుడితో తలపడ్డారు. కృపుడు, వృషసేనుడు కూడ వాళ్లని కలిశారు. వెనక నుంచి సైంధవుడు కూడ బాణాలేస్తున్నాడు.

ముందున్న వాళ్లందరికీ సమాధానాలిస్తూనే అర్జునుడు సైంధవుడితో యుద్ధం ప్రారంభించాడు. సైంధవుడు అర్జునుడి గుర్రాల్ని, జెండాని, గాండీవాన్ని బాణాల్తో కొట్టి అర్జునుడికి గాయాలు చేశాడు. అర్జునుడతని వరాహధ్వజాన్ని సారథి తలని ఒక్కసారే నేలకూల్చాడు. ఇంతలో కృప, అశ్వత్థామ, శల్య, వృషసేనులు ప్రాణాల మీద ఆశలు వదిలి సైంధవుడికి అడ్డం పడ్డారు. సైంధవుణ్ణి చంపే అవకాశం కనపడక అర్జునుడు పొద్దువంకా కృష్ణుడి వంకా చూస్తుంటే కృష్ణుడు “ఇక ధర్మయుద్ధం అని పెట్టుకుంటే కుదరదు, నేనో ఉపాయం చేస్తాను. సూర్యాస్తమయం ఐనట్లు చీకటి కమ్మిస్తాను. వాళ్లంతా యుద్ధం మానేసి సంబరం చేసుకుంటుంటే నువ్వు వాడి తల నరుకు” అని చెప్పాడు. ” చివరికిలా పరాక్రమం అంతా వృథా ఐంది కదా” అని అర్జునుడు దిగులు పడ్డాడు.

కృష్ణుడు మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పాడు. మనసైన్యాలు ఆనందంగా కేకలు పెట్టినయ్. సైంధవుడు తల పైకెత్తి పడమర దిక్కుకి చూస్తున్నాడు. “అడుగో, రథమ్మీద నిలబడి పడమరకి చూస్తున్నాడు, వాడి తల వెంటనే నరుకు” అని అటు చూపుతూ తొందరచేశాడు కృష్ణుడు. గంధమాల్యాదుల్తో అర్చించి తెచ్చిన ఒక నిశితశరం అర్జునుడు సంధిస్తే అది పిట్టని పట్టే డేగలాగా వాడి తలని లాగేసింది. కృష్ణుడు త్వరితంగా “అర్జునా, ఆ తల నేల మీద పడటం ప్రమాదం. నేను చెప్పేవరకు దాన్ని ఆకాశంలోనే ఆడించు” అని అరిచాడు. అర్జునుడు దాన్ని బంతిలాగా ఆకాశంలో తిప్పటం సాగించాడు.

ఇంతలో మాయాతిమిరం తొలిగింది. సూర్యుడు మళ్లీ కనిపించాడు.

మనవాళ్లంతా అమితకోపంతో అర్జునుడి మీదికి దూకారు. అర్జునుడు వాళ్లందర్నీ ఎదుర్కుని పోరాడుతూ సైంధవుడి తలని కింద పడకుండా కొడుతూ “కృష్ణా దీన్ని ఇంకా ఎంతసేపు ఇలా ఆడించాలి? ఎక్కడ పడెయ్యాలి?” అని అడిగితే కృష్ణుడు “వృద్ధక్షత్రుడనే సింధుదేశాధీశుడు సంతానం కోసం తపస్సు చేసి వీణ్ణి కన్నాడు. వీడు పెరుగుతుండగా ఒకరోజు అశరీరవాణి యుద్ధంలో వీడి తల నేలకూలుతుందని చెప్తే వృద్ధక్షత్రుడు తన తపోబలంతో వీడి తలని ఎవడు నేలబడేస్తాడో వాడి శిరస్సు వెయ్యిముక్కలయ్యేట్టు చాటి వీడికి పట్టం కట్టి తను అడవులకి పోయి ఈ శమంతకపంచకం చుట్టుపక్కల్నే తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వీ తలని అతని తొడ మీద పడెయ్యాలి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రానికే సాధ్యం, దాన్ని ప్రయోగించు” అని బోధిస్తే భక్తిపూర్వకంగా అర్జునుడా మహిమాన్వితాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం శరపరంపర ఆకారంలో వచ్చి ఆ తలని తీసుకుని వృద్ధక్షత్రుడి ఆశ్రమంలోకి చొరబడి అక్కడ జపం చేసుకుంటున్న అతని తొడ మీద పడేసింది. దానికతను దిగ్గున లేచి తలని కిందికి తోస్తే అతని తలా వెయ్యివక్కలైంది. తిరిగి వచ్చిన అస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించాడు.

అర్జునుడి ఆ అద్భుతచర్యకి అందరూ నివ్వెరపోయారు. నీ కొడుకులు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. భీముడు సింహనాదం చేశాడు. అది విని ధర్మజుడు విజయుడి ప్రతిజ్ఞ నెరవేరిందని ఆనందించాడు. పాండవబలాలు తూర్యనినాదాల్తో మారుమోగినయ్. సైంధవుడి చావుతో కృపుడు, అశ్వత్థామ అర్జునుడి మీద మహోగ్రంగా శరవర్షాలు కురిపించారు. అర్జునుడు వాటిని ఖండించి కోపం తెచ్చుకోకుండానే వాళ్లని బాణపరంపరల్తో బాధించాడు. ఆ బాణాల ధాటికి కృపాచార్యుడు మూర్ఛపడితే అతని సారథి రథాన్నక్కడి నుంచి తోలుకుపోయాడు. అశ్వత్థామ కూడ పక్కకి తప్పుకున్నాడు. మిగిలిన రథికులెవరూ సవ్యసాచితో పోరుకి ముందుకి రాలేదు. ఐతే తన బాణాల్తో కృపాచార్యుణ్ణి మూర్ఛ పుచ్చినందుకు చాలా నొచ్చుకున్నాడు అర్జునుడు. కృష్ణుడు అతన్ని కౌగిలించుకుని ఆనాటి యుద్ధంలో అతని పరాక్రమాన్ని పొగిడాడు. శత్రువులెవరూ యుద్ధానికి కవ్వించక పోవటంతో ధర్మరాజు దగ్గరికి బయల్దేరారు అర్జునుడు, భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు.

మనవాళ్లు శోకాక్రాంతులై ఏడుస్తూ వెనుదిరిగారు.

దుర్యోధనుడు శోకంతో, విస్మయంతో, “నిజంగా అర్జునుడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడితే అతన్నెదిర్చి నిలవగలిగే వాళ్లెవరూ లేరని తేలిపోయింది. ఇంకిప్పుడేమిటి చెయ్యటం?” అనుకుంటూ ద్రోణుడి దగ్గరికి వెళ్లి “అన్నదమ్ముల్తో, శిఖండితో కలిసి ఇప్పటికి మనసైన్యంలో ఏడు అక్షౌహిణుల్ని చంపాడు అర్జునుడు. ఇవాళే ఎంతోమంది గొప్పదొరలు అతని చేతిలో మరణించారు. వాళ్ల ఋణం తీర్చుకునేట్టు పాంచాల, పాండవబలగాల్ని మనం చంపామా అంటే అదీ లేదు. నీకు అనుగుశిష్యుడని అర్జునుణ్ణి నువ్వేమీ చెయ్యవ్. ఒక్క కర్ణుడు మాత్రం వీరుడై ఒళ్లు దాచుకోకుండా ప్రయత్నం చేస్తున్నాడు, ఐనా సైంధవుణ్ణి పోగొట్టుకున్నాం” అని గోడు వెళ్లబోసుకున్నాడు.

ఆ మాటలకి ఆచార్యుడు కటకట పడ్డాడు. “మనసుని తూట్లు పొడిచే మాటల్తో పని జరుగుతుందా? అర్జునుణ్ణి జయించటం ఎవరివల్లా కాదని నీకు ఎన్ని సార్లు చెప్పాను? అభిమానం కోసం పోరాడుతున్నా తప్ప భీష్ముడు పడినప్పుడే మనకి గెలుపు సాధ్యం కాదని నాకనిపించింది. గాండీవం నుంచి వచ్చే బహుపటిష్టమైన బాణాల్నుంచి నిన్ను రక్షించటానికి ఇది జూదం కాదు. అప్పుడు విదురుడు ఎంతగా వారిస్తున్నా వినక పుణ్యవతి ద్రౌపదికి మీరు చేసిన పాపానికి ఫలం అనుభవించక తప్పుతుందా? నామమాత్రమైనా కనికరం లేకుండా వాళ్లని అడవులకి పంపి ఆ తర్వాత వాళ్లు తిరిగొచ్చి అడిగిన అర్థరాజ్యం కూడ ఇవ్వకుంటే ఇలా వచ్చిన యుద్ధంలో వాళ్లతో పోరాటానికి సిద్ధమయ్యా, నేనూ ఒక బ్రాహ్మణ్ణేనా? ఒక పక్క పాంచాల, పాండవ బలాల పొగరు చూసి నాకు ఒళ్లు మండుతుంటే ఇలా సూటిపోటి మాటల్తో ఇంకా ఉడికిస్తావు, ఏం పని ఇది? సరే, ఏమన్నా కానీ, మనలో ఈ రాత్రికి యుద్ధం చేసే ఉత్సాహం ఉన్న వాళ్లని కూడగట్టు. నేను నా బాహాశక్తితో పాంచాలబలగాల్ని అంతం చెయ్యకుండా కవచం తియ్యను. నా చేతిలో చావకుండా తప్పించుకున్న వాళ్లని చంపమని అశ్వత్థామకి చెప్పు” అంటూ గాఢనిశ్చయంతో మన సైన్యాన్ని రాత్రియుద్ధానికి సమాయత్తం చేశాడు ద్రోణుడు.

దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి “మహాపటిష్టమైన వ్యూహాన్ని కట్టి అర్జునుణ్ణి మాత్రం లోపలికి పంపాడు, ఈ ద్రోణుణ్ణెలా నమ్మటం? అలా లోపలికి వచ్చి వాడు మనరాజుల్ని చంపి సైంధవుణ్ణి వధించాడు. తన మాట నమ్మి మనం సైంధవుణ్ణి యుద్ధభూమికి తీసుకొచ్చాం. ఇతని సంగతి ముందే అనుకుని వుంటే వాణ్ణి ఇంట్లోనే వుంచేవాళ్లం, మనసైన్యానికి ఇంత నష్టమూ జరిగేది కాదు. అసలీ ద్రోణుడు మనకవసరమా?” అన్నాడు రోషంగా. కర్ణుడతన్ని “తన ఓపిక్కొద్దీ యుద్ధం చేస్తున్నాడు, పాపం ఆ ద్రోణుణ్ణి అనటం ఎందుకు? విధి బలీయం. సైంధవుడికి చావు మూడింది, పోయాడు. యుద్ధం చెయ్యటం మన ధర్మం, అది చేద్దాం. విచారం వద్దు” అని అనునయించాడు.

రెండుసైన్యాలూ మళ్లీ తలపడ్డయ్.

సైంధవుడి చావు దుఃఖంతో విరక్తిగా రారాజు పాండవసైన్యం వైపుకి వెళ్తుంటే ద్రోణుడు, కృపుడు, కర్ణుడు అతనికి అడ్డంగా వెళ్లి అతన్ని దాటుకుని పాండవసైన్యంలోకి చొచ్చుకుని భీకరయుద్ధం ఆరంభించారు. పాండవసైన్యంలో దొరలంతా దుర్యోధనుణ్ణి చుట్టుముట్టారు. ధర్మరాజు మహాక్రోధంతో నీ కొడుకు విల్లు విరిచి అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. “దుర్యోధనుడు చచ్చాడ”ని వాళ్ల బలాలు ఉప్పొంగినయ్. అంతలోనే దుర్యోధనుడు తెలివి తెచ్చుకుని ధర్మరాజుని ఎదిరిస్తే మన బలగాలు శాంతించినయ్, వాళ్లు తత్తరపడ్డారు. శిబి అనే రాజు ద్రోణుడి చేతిలో మరణించాడు. అదివరకు భీముడు భానుమంతుణ్ణి చంపిన కోపంతో భానుమంతుడి కొడుకు భీముణ్ణెదిరిస్తే అతను వాడి రథమ్మీదికి దూకి కాళ్లతో చేతుల్లో కుమ్మి వాణ్ణి తండ్రి దగ్గరికి పంపాడు. కర్ణుడు, అతని సోదరులు భీముడి మీదికి ఉరికారు. భీముడు ధ్రువుడి రథమ్మీదికి గెంతి పిడికిటితో వాణ్ణి చావబొడిచాడు. జయరాతుడి మీదికి వెళ్లి వాణ్ణీ వాడి సారథినీ చెరో చేత్తో పట్టి విసిరి కొట్టి చంపాడు. కర్ణుడొక శక్తిని వేస్తే భీముడు దాన్ని పట్టుకుని తిరిగి కర్ణుడి మీదికి విసిరాడు; శకుని దాన్ని మధ్యలో విరిచాడు. నీకొడుకులు దుర్మదుడు, దుష్కర్ణుడు అనేక బాణాలతని మీద ప్రయోగిస్తే దుర్మదుడి రథాన్ని పట్టి సారథిని చంపితే వాడు దుష్కర్ణుడి రథం ఎక్కాడు. ఒక్క తన్నుతో ఆ రథాన్ని పడేసి అందరూ చూస్తుండగా కాల్తో ఒకణ్ణి చేత్తో ఒకణ్ణి తన్ని చంపాడు. అలా భీకరాకారంతో భీముడు విజృంభిస్తే మనవాళ్లంతా పారిపోయారు. భీముడు తన సేన వైపుకి చూసి అక్కడ ధర్మరాజు కనిపిస్తే అతనికి నమస్కారం చేశాడు; ఆ భీకరమూర్తిని చూట్టానికి వాళ్లకీ భయం వేసింది.

ఇదంతా చూసి ద్రోణుడు భీముడితో తలపడ్డాడు. కర్ణాదులతనికి తోడయ్యారు. అది చూసి నీకొడుకులు కూడ వాళ్లని కలిశారు. అటువైపు నుంచి విరాటుడు, సాత్యకి, ఇతర రాజులు భీముడికి తోడుగా వచ్చి చేరారు. అప్పుడు సోమదత్తుడు సాత్యకికి దగ్గర్లో వుండి అతనితో, “ప్రాయోపవేశం చేసిన నాకొడుకు భూరిశ్రవుణ్ణి రాజధర్మం విడిచి చంపావ్, ఇప్పుడు నేన్నిన్ను చంపుతా చూడు” అని సింహనాదం చేసి శంఖం పూరించాడు. దానికా సాత్యకి “వాణ్ణి చంపిన పద్ధతి నీకు నచ్చకపోతే నిన్ను చంపే పద్ధతి అందరికీ నచ్చేట్టు చంపుతాలే, రా” అని తలపడ్డాడు. సోమదత్తుడికి తోడుగా దుర్యోధనుడు చేరాడు, అతనితోపాటు శకుని తన బలాల్తో వచ్చి చేరాడు. అలా వాళ్లంతా సాత్యకిని చుట్టుముడితే అతనికి సాయంగా ధృష్టద్యుమ్నుడు తన సైన్యంతో వచ్చాడు. ఇరువర్గాలకి పోరు ఘోరమైంది. సాత్యకి బాణాలకి సోమదత్తుడు మూర్ఛపోతే అతని సారథి రథాన్ని పక్కకి తోలుకుపోయాడు.

సాత్యకి గర్వం అణుస్తానని అశ్వత్థామ వెళ్తుంటే ఘటోత్కచుడతన్ని అడ్డుకున్నాడు. నీ కొడుకు, కర్ణుడు, మిగతా వాళ్లూ ఘటోత్కచుడితో తలపడ్డారు. వాడి దెబ్బకి అందరూ తప్పుకుంటే గురుపుత్రుడొక్కడే ఎదిర్చి నిలబడ్డాడు. ఆ రాక్షసుడి కొడుకు అంజనపర్వుడు అశ్వత్థామని ఎదిరిస్తే అశ్వత్థామ వాడి వింటిని విరిచి, రథాన్ని నుగ్గుచేశాడు. వాడు కత్తి తీసుకుంటే దాన్ని నరికాడు. గద వేస్తే దాన్ని ముక్కలు చేశాడు. ఆకాశానికెగిరి పాషాణవర్షం కురిపిస్తే దాన్ని నివారించాడు. ఇంకో రథాన్నెక్కి వాడొస్తే వాడి తల తెంచాడు.

కొడుకు చావుతో ఘటోత్కచుడు మహాక్రోధంతో అశ్వత్థామని తాకాడు. అశ్వత్థామ బాణాల్తో తత్తరబిత్తరైన పాండవబలగాల్ని అదే అదనుగా చంపమని దుర్యోధనుడు కృపకృతవర్మకర్ణవృషసేనుల్ని, దుశ్శాసనుణ్ణి పంపాడు. ఘటోత్కచుడు అశ్వత్థామ మీద ఒక పరిఘని విసిరితే అతను దాన్ని పట్టుకుని తిరిగి విసిరేస్తే ఘటోత్కచుడు తన రథం మీంచి దూకి ధృష్టద్యుమ్నుడి రథం ఎక్కాడు. ఆ పరిఘ అతని రథాన్ని, గుర్రాల్ని, సారథిని నుగ్గు చేసింది. ఒకే రథం నుంచి ఘటోత్కచ ధృష్టద్యుమ్నులు అశ్వత్థామతో పోరారు. ఇంతలో భీముడు వాళ్లకి తోడుగా వచ్చాడు. అశ్వత్థామ నవ్వుతూ ఆ ముగ్గురితో తలపడ్డాడు. అశ్వత్థామ బాణాలకి ఘటోత్కచుడు మూర్ఛపోతే ధృష్టద్యుమ్నుడు రథాన్ని పక్కకి తీసుకెళ్లాడు. ధర్మరాజు, భీముడు, సాత్యకి అశ్వత్థామని తాకారు. మూర్ఛ తేరుకుని ఇంకో రథమ్మీద ఘటోత్కచుడు కూడ వచ్చాడు. మనవైపునుంచి సోమదత్తుడు, బాహ్లికుడు, ఇతర రాజులు వాళ్లతో తలపడ్డారు.

సంజె చీకట్లు కమ్ముతున్నయ్. ఐనా ఆభరణాల జిలుగులు, చురకత్తుల తళతళలు కొంత వెలుగునిస్తుంటే యుద్ధం కొనసాగిస్తున్నారు. సాత్యకి, సోమదత్తుడు పట్టుదలగా పోరాడుతున్నారు. తన బావమరిదికి తోడుగా భీముడు వచ్చి ఓ ఉగ్రబాణంతో సోమదత్తుణ్ణి కొట్టాడు. అదే సమయాన ఒక భగభగమనే నారసంతో సాత్యకీ, బలమైన ముద్గరంతో ఘటోత్కచుడూ కొట్టేసరికి సోమదత్తుడు సోలిపడ్డాడు. అదిచూసి ఆగ్రహించి అతని తండ్రి బాహ్లికుడు సాత్యకితో తలపడితే అతనికి అడ్డుగా వెళ్లి భీముడు బాణాలేస్తే బాహ్లికుడు ఓ ఉగ్రశక్తిని భీముడి మీదికి విసిరాడు. దాని దెబ్బకతను తూలి, అంతలోనే నిలదొక్కుకుని ముద్గరంతో అతన్ని బాదాడు. ఆ వేటుకి బాహ్లికుడి తల వయ్యలైంది. వజ్రాయుధానికి పగిలిన కులపర్వతంలా కూలాడా కురువృద్ధుడు. మనసైన్యాలు హాహాకారాలు చేసినయ్.

నీ కొడుకులు పదిమంది భీముణ్ణి చుట్టుముడితే పది బాణాల్తో వాళ్ల ప్రాణాలు తీశాడతను. కర్ణుడి తమ్ముడు వృకరథుడు విక్రమిస్తే వాణ్ణి, పన్నెండుమంది సౌబల సోదరుల్ని కూడ మట్టుబెట్టాడు. శూరసేన, వసాతి, మాళవ, త్రిగర్త, బాహ్లిక సైన్యాలు అతని మీద దూకినయ్. ధర్మరాజు తన కుమారగణంతో సైన్యాన్ని తీసుకుని వచ్చి తలపడ్డాడు. ఇటు దుర్యోధనుడు ద్రోణుణ్ణి పురికొల్పాడు. అతను ఉత్సాహంగా ధర్మజుణ్ణి తాకి వాయవ్య, యామ్య, వారుణ, ఆగ్నేయాస్త్రాలు వరసగా వేస్తే ధర్మజుడు ప్రత్యస్తాల్తో వాటిని నిర్మూలించాడు. ఆవేశంగా ఐంద్రాస్త్రం వేస్తే ధర్మజుడు దాన్ని కూడ అలాగే ఆపాడు. ద్రోణుడు కోపించి సకలభూతభయంకరమైన బ్రహ్మాస్త్రం వేస్తే ధర్మరాజు కూడ బ్రహ్మాస్త్రంతో దాన్ని ఉపశమించాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో తలపడ్డాడు.

ద్రోణుడు ద్రుపద సైన్యం మీదికి ఉరికాడు. ఐతే భీమార్జునులు అతన్నడ్డుకున్నారు. అదే అదునుగా మత్స్య, కేకయ సైన్యాలు మన సేనని చిందరవందర చేసినయ్. దుర్యోధనుడు కర్ణుణ్ణి వాళ్ల మీదికి పురికొల్పాడు. “అర్జునుణ్ణి, భీమాదుల్ని చంపటానికి నేనొక్కణ్ణి చాలు, చూద్దువుగా నా పోటుతనం!” అని కర్ణుడంటే ఆ పక్కనే ఉన్న కృపాచార్యుడు చిన్న నవ్వు నవ్వాడు. “ఔనౌను, నీ మగతనం తెలియందా? ఘోషయాత్రలో, గోగ్రహణంలో బాగానే బైటపడింది కదా! పాండవుల్తో నీ యుద్ధం ఎప్పుడూ చూడని వాళ్లకి చెప్పినట్టు చెప్తున్నావ్. ఇదివరకు ఒంటరిగా వచ్చిన అర్జునుడి చేతిలో ఓడిన వాళ్లమే అందరమూ! ఇప్పుడతను అన్నల్తో, ఘటోత్కచుడితో కలిసి యుద్ధం చేస్తుంటే మనం ఎలా గెలుస్తామంటావ్?” అని ఎత్తిపొడిచాడు.

కర్ణుడు కోపంతో “ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలిక కోస్తాను, బాపనవాడా ! ఎప్పుడూ అర్జునుణ్ణి, అటువైపు వాళ్లని పొగట్టమే కాని ఇటు ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు, నేను నీకు లెక్కకి రాకపొయ్యామా?” అని తన మేనమామ కృపుణ్ణి తిడుతుంటే సహించలేక తీవ్రకోపంతో అశ్వత్థామ వాలుని తీసి కర్ణుడి మీదికి దూకితే దుర్యోధనుడతనికి అడ్డు పడ్డాడు. కృపుడు కూడ అతన్ని ఆపాడు. ఐనా అశ్వత్థామ పెనుగుతుంటే కర్ణుడు “వదులు రారాజా, వాడి సంగతి నేను చూస్తా, రానీ” అంటే కృపుడు “దుర్యోధనుడి మొహం చూసి ఊరుకుంటున్నా, ఇంక మాటలొద్దు, వెళ్లిక్కణ్ణుంచి” అని గద్దించాడు కర్ణుణ్ణి. అప్పుడు నీ కొడుకు అశ్వత్థామతో “నీ తండ్రి, నువ్వు, నీ మామ, కర్ణుడు, శల్యుడు, సౌబలుడు వీరాధివీరులు, నాకు రాజ్యం ఇప్పించేవాళ్లు. యుద్ధరంగంలో మోహరించివున్నప్పుడు మీలో మీరిలా పోట్లాడితే ఎలా? నన్ను క్షమించి శాంతించు” అంటే అప్పటికి అశ్వత్థామ శాంతించాడు. కర్ణుడూ ప్రసన్నుడై శత్రువుల మీద దృష్టి సారించి, అల్లెతాటిని మోగించాడు.

పాండవ సైన్యాలు కర్ణుణ్ణి కమ్ముకున్నయ్. అతను వేగంగా బాణాలు సారిస్తూ వాళ్లని చించి చెండాడుతుంటే అర్జునుడు వచ్చి ఎదుర్కున్నాడు. ఇద్దరికీ ఘోరసమరమైంది. అర్జునుడతని రథాన్ని విరిచి, సూతుణ్ణి చంపి, వింటిని విరిస్తే సిగ్గు లేకుండా కృపుడి రథం ఎక్కి పారిపోయాడతను.

అది చూసి మన సైన్యం పరిగెత్తుతుంటే దుర్యోధనుడు “పారిపోవద్దు, అర్జునుడి సంగతి నేను చూస్తా” అని ఉరుకుతుంటే కృపుడు మేనల్లుడితో “అగ్నిలో దూకబోయే మిడత లాగా దుర్యోధనుడు అర్జునుడితో తలపడబోతున్నాడు. ఒకసారతని చేతికి చిక్కితే ఇతన్ని రక్షించటం మన తరమా? ముందు నువ్వు దుర్యోధనుణ్ణి ఆపు, నేను అర్జునుడి సంగతి చూస్తా” అన్నాడు. అశ్వత్థామ “అర్జునుడి సంగతి నేను చూస్తాగా, నీకింత సాహసం ఎందుకు?” అని దుర్యోధనుడితో అంటే అతను “నీ తండ్రికీ నీకూ పాండవులంటే ప్రీతి, వాళ్లనేమీ చెయ్యరు. ఎందుకిదంతా, మీరు పాంచాలబలంతో యుద్ధం చెయ్యండి. పాండవుల విషయంలో మా తిప్పలేవో మేం పడతాం” అన్నాడు నిష్టూరంగా.

“గురువుకీ నాకూ పాండవులంటే ఇష్టమనేది నిజమే. ఐతే ఒకసారి యుద్ధానికి వచ్చాక అవి అడ్డువస్తాయా? మా శక్తి కొద్దీ మేం యుద్ధం చేస్తున్నాం, ఇన్ని యుద్ధాలు చూశాక కూడ నువ్వు నమ్మకపోతే ఎలా? మేం లేకుండా నువ్వొక్కడివే వెళ్లి గెలవటానికి పాండవులు అంత తక్కువ వాళ్లా? మేమూ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు వున్నాం కదా, నీకు జయం తెచ్చిపెడతాం. ఇప్పుడే నేను వెళ్లి పాంచాలబలగం పనిపడతాను. పాండవులు అడ్డొస్తే వాళ్లతోనూ పోరతాను. చూస్తూండు” అని అతన్ని దాటుకుని అర్జునుడి వైపుకి వెళ్తే అటు అర్జునుడికి అడ్డంగా వచ్చి పాంచాల, కేకయ సేనలు అశ్వత్థామని చుట్టుముట్టినయ్.

అశ్వత్థామ ఆ సేనల్ని చెల్లాచెదురు చేస్తుంటే ధృష్టద్యుమ్నుడు అతనితో తలపడ్డాడు. ఐతే అశ్వత్థామ అతన్ని నానాతిప్పలు పెట్టి అతని చుట్టూ వున్న రాజుల్ని చంపి సింహనాదం చేస్తే పాంచాల బలాలు పరిగెత్తినయ్. ధర్మజ భీములు తమ బలాల్తో అతని మీద దాడి చేశారు. ఇటునుంచి దుర్యోధనుడు, ద్రోణుడు అక్కడికి చేరారు. ఇరుపక్షాలకీ పోరు ఘోరమైంది. భీముడు అంబష్ట, శిబి, వంగ దేశాల బలాల్ని నాశనం చేస్తుంటే అర్జునుడు మగధ, మద్ర, వంగ, అంబష్ట బలగాల్ని మరోవంక నుంచి తాకాడు. ద్రోణుడు కోపంతో వాయవ్యబాణంతో పాండవవ్యూహాల్ని చెల్లాచెదురు చేస్తే భీమార్జునులిద్దరూ ద్రోణుడితో తలపడ్డారు.

ఇంతలో సోమదత్తుడు సమరోత్సాహంతో పాండవసేనల్ని అదిలిస్తూ పరాక్రమిస్తే సాత్యకి అతనితో పోరుకి సిద్ధమయ్యాడు. సాత్యకి వింటిని అర్థబాణంతో నరికి ముప్ఫై ఏడమ్ములు అతనికి నాటాడు సోమదత్తుడు. ఇంకో విల్లు తీసుకుని ఐదమ్ములు అతనికి నాటి, అతని ధ్వజాన్ని కూల్చి ధనుస్సుని విరిచాడు సాత్యకి. అతను ఇంకో విల్లు తీసుకుంటే దాన్ని భీముడు విరిచాడు. ఘటోత్కచుడు పరిఘని విసిరితే దాన్ని నరికాడు సోమదత్తుడు. ఇంతలో అతని సారథిని గుర్రాల్ని చంపి అతని ప్రాణం కూడ తీశాడు సాత్యకి.

చచ్చిన సోమదత్తుణ్ణి చూసి మనవాళ్లు సాత్యకి మీదికి దూకితే ధర్మరాజు వచ్చి వాళ్లని చెల్లాచెదురు చేశాడు. ద్రోణుడొచ్చి అతని విల్లు నరికి జెండా విరిచి ఒంట్లో బాణాలు గుచ్చితే ధర్మరాజు ఇంకో విల్లు తీసుకుని పదునైన నారసాల్ని నాటితే ద్రోణుడు మూర్ఛ వచ్చి రథం మీద పడ్డాడు. త్వరలోనే తేరుకుని విజృంభించాడు ద్రోణుడు. ధర్మజుడి మీద వాయుదైవత్యం ఐన శరం వేస్తే అతనూ అదే అస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. ఈలోగా కృష్ణుడు ధర్మరాజుతో “నిన్ను బంధిస్తానని ప్రతిజ్ఞ చేసిన ద్రోణుడితో ఈ పోరాటం ఏమిటి? నువ్వు మన వ్యూహానికి వెళ్తే ఇక్కడ భీముడు యుద్ధం చేస్తాడులే. అసలు ద్రోణుణ్ణి చంపటానికే పుట్టినవాడు ధృష్టద్యుమ్నుడున్నాడు, అతను ద్రోణుడితో తలపడటం ఇంకా మంచిది,” అంటే అతను కొంచెం సేపు ఆలోచించి అటు వెళ్తే ద్రోణుడు ద్రుపద సైన్యాన్ని చెదరగొట్టసాగాడు.

ధర్మరాజు వెళ్లి భీముడికి సాయం అయాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు వాళ్లవైపు నుంచి, కృప, కర్ణ, ద్రోణులు మనవైపు నుంచి తలపడ్డారు. చీకట్లో ఎవరెవరో సరిగా తెలియకపోతే తమ తమ పేర్లు, బిరుదులు అరిచి చెప్తూ యుద్ధాలు సాగిస్తున్నారు. పాండవబలాల పోటుకి మన సైన్యం చిక్కుపడి చీకటి వల్ల కూడుకోవటం కష్టమైతే ద్రోణుడు అప్పటికప్పుడు ఒక వ్యూహాన్ని పన్ని అందర్నీ ఒకచోట చేర్చాడు. దానికి అగ్రభాగాన తను; అశ్వత్థామ, సౌబలుడు చెరోపక్క, మధ్యలో శల్యుడు, వెనక దుర్యోధనుడు.
దుర్యోధనుడు తన కాల్బలాన్ని ఆయుధాలు పక్కనపెట్టి దివిటీలు పట్టుకు నిలబడమని ఆజ్ఞాపించాడు. ఒక్కో రథానికి ఐదు, ఏనుక్కి మూడు, గుర్రానికి ఒకటి చొప్పున పెట్టించాడు. జెండాలు సరిగా కనిపించేట్టు కొన్ని పెట్టించాడు. వ్యూహానికి ముందు, పక్కల ఎత్తుగా కొన్ని దివిటీల్ని ఉంచాడు. పాండవపక్షం కూడ అలాగే చేసింది. అలా యుద్ధభూమి అంతా కాంతివంతమై పగటిని తలపించింది.

దుర్యోధనుడు తమ్ముల్తో “శల్యుడు, కృతవర్మ తోడుగా మీరు ధృష్టద్యుమ్నుడి నుంచి ద్రోణుణ్ణి కాపాడండి. అప్పుడతను పాండవసైన్యం సంగతి చూస్తాడు. కర్ణుడు అర్జునుణ్ణి, నేను భీముణ్ణి గెలుస్తాం. పదండి” అని బయల్దేరితే రెండు సైన్యాలు ఢీకొన్నయ్. రెండువైపుల నుంచి మహారథులు ఒకరొకరితో తలపడ్డారు. కృతవర్మ ధాటికి ఆగలేక ధర్మరాజు యుద్ధభూమి నుంచి బయటికెళ్తే మన బలాలు ఆర్చినయ్. భూరి, సాత్యకి పోరాడారు. ఓ భల్లంతో భూరి విల్లు తుంచాడు సాత్యకి. అతను ఇంకో వింటితో సాత్యకి విల్లు విరిచి బాణాలు నాటాడు. మండిపోయి సాత్యకి ఒక శక్తిని విసిరి భూరిని చంపాడు. అశ్వత్థామ సాత్యకి వెంటపడితే ఘటోత్కచుడతన్ని ఆపి తలపడ్డాడు. ఘటోత్కచుడు వేసిన పదిబాణాలు వేగంగా అతని వక్షాన గుచ్చుకుంటే అశ్వత్థామ విల్లు ఆధారంగా పట్టుకుని తూలాడు. తూలి, తెలివి తెచ్చుకుని ఉగ్రకోపంతో ఒక వాలికనారసాన్ని వాడి వక్షాన నాటితే వాడు మూర్ఛపోయాడు, వాడి సారథి రథాన్ని పక్కకి తోలుకుపోయాడు.

భీమదుర్యోధనులు తారసపడ్డారు. భీముడతని ధనువుని జెండాని విరిస్తే ఇంకో విల్లు తీసుకుని భీముడి విల్లు విరిచి ఒంటికి బాణాలు గుచ్చాడు నీ కొడుకు. భీముడు ఇంకో వింటితో ఏడు నారసాలు అతని శరీరంలో నాటి, విల్లు తుంచి, దుర్యోధనుడు మళ్లీ మళ్లీ విళ్లెత్తితే వాటినీ తుంచి ఒక గదతో సూతుణ్ణి గుర్రాల్ని చంపితే మహాభీతితో దుర్యోధనుడు పారిపోయాడు. భీముడు ఎలుగెత్తి అరిచాడు. దుర్యోధనుడు మరణించాడని మన సేన కలవరపడింది. ఇంతలో ఇంకొక రథం ఎక్కి వచ్చి అతను వాళ్లని శాంతింపజేశాడు.

కర్ణ సహదేవులు మరోచోట పోరుతున్నారు. కర్ణుడతని విల్లు తుంచితే అతను మరొకటి తీసుకున్నాడు. కర్ణుడు గుర్రాల్ని, సారథిని చంపితే అతను ఖడ్గం తీసుకుని బయల్దేరుతుంటే కర్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. అతను గద విసిరితే దాన్ని నవ్వుతూ ఖండించాడు. శక్తి వేస్తే దాన్ని, చక్రం విసిరేస్తే దాన్నీ కూడ పొడి చేసి నిశ్చేష్టుడై చూస్తున్న సహదేవుణ్ణి కుంతిమాటల వల్ల ఇంకేమీ చెయ్యకుండా కడుపులో వింటికొనతో పొడుస్తూ “నీకన్న శక్తివంతుల్తో యుద్ధం ఎందుకు నీకు? అదుగో అర్జునుడున్నాడక్కడ, వెళ్లి అతని వెనక దాక్కో” అని తిట్టి వెళ్లిపోయాడు. సహదేవుడు బతుకు మీది రోతతో తన్ని తను తిట్టుకుంటూ వెళ్లి ఇంకో రథం ఎక్కాడు.

శల్యుడు విరాటుడి తమ్ముడు శతానీకుణ్ణి చంపి విరాటుణ్ణి మూర్ఛపుచ్చితే అతని సారథి రథాన్ని తోలుకుపోయాడు. అర్జునుడు శల్యుడితో తలపడబోతుంటే హలాయుధుడనే రాక్షసుడు అతన్ని అడ్డగించాడు. అర్జునుడు వాడి విల్లుని, కేతువుని, సారథిని, గుర్రాల్ని చంపితే వాడు కత్తిని విసిరాడు. అర్జునుడు దాన్ని విరిచి వాడి మీద నాలుగొందల బాణాలేశాడు. మహాభయంతో వాడు పుంజాలు తెంపుకు పరిగెత్తాడు.

మరోవంక కర్ణ సాత్యకులు యుద్ధం చేస్తున్నారు. కర్ణుడి కొడుకు వృషసేనుడు సాత్యకి మీద అనేక బాణాలేస్తే సాత్యకి వాలమ్ముల్తో వాణ్ణి మూర్ఛితుణ్ణి చేశాడు. కొడుకు పాటు చూసి కర్ణుడు కోపంతో సాత్యకిని శరపరంపరల్తో బాధించాడు. ఇంతలో వృషసేనుడు లేచి తండ్రిని కలిశాడు. ఐతే ఆ ఇద్దరితోనూ భీకరంగా పోరాడు సాత్యకి. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో “అర్జునుడు దూరంగా వున్నాడు, మిగిలిన పాండవులు కూడ దగ్గర్లో లేరు. వీణ్ణి అభిమన్యుడి దార్లో పంపటానికి ఇదే సరైన సమయం. పెద్ద బలగంతో వీణ్ణి చుట్టుముడదాం. ఐతే అది చూసి అర్జునుడు రాకుండా మనవాళ్లని కొంతమందిని అర్జునుడి మీదికి పంపు” అని సలహా చెప్పాడు. దుర్యోధనుడికీ అది నచ్చి శకునిని పదివేల ఏనుగులు, అన్నే రథాల్తో దుశ్శాసన, సుబాహు, దుష్ప్రధర్షణ, దుర్విషహులు తోడుగా అర్జునుడు, అతని అన్నదమ్ముల మీదికి పంపాడు. దుర్యోధన కర్ణులు పెద్ద బలగంతో సాత్యకిని చుట్టుముట్టారు. ఐతే అతను ఏమాత్రం జంకక మన సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. ఇక పట్టలేక దుర్యోధనుడు తన రథాన్ని అతని రథం దగ్గరికి తోలించి అతనితో తలపడ్డాడు. సాత్యకి అతని గుర్రాల్ని, సూతుణ్ణి చంపాడు. దుర్యోధనుడు మరో రథం మీదికి వెళ్లాడు. సాత్యకి దెబ్బకి అతన్ని చుట్టుముట్టిన సైన్యాలు చెల్లాచెదురైనై.

ఇలా ఒకచోట సాత్యకి, మరోచోట అర్జునుడు, మూడోవంక ధృష్టద్యుమ్నుడు విజృంభించి మన బలాల్ని నాశనం చేస్తూ శంఖాలు ఊదుతూ ఉల్లాసంగా ఉంటే సహించలేక కర్ణుడు క్రోధరూపంతో పాండవబలగాల పని పట్టాడు. అతని ధాటి చూసి ధర్మరాజు భయపడ్డాడు. ఎలాగైనా అతన్ని ఆపమని అర్జునుణ్ణి అడిగాడు. కర్ణుడి మీదికి రథం పోనీమని అర్జునుడంటే కృష్ణుడు నిశాసమయాన రాక్షసులకి శౌర్యధైర్యాలు పెరుగుతాయి కనక ఘటోత్కచుడికి ఈ పని అప్పగిద్దాం అని ఘటోత్కచుణ్ణి పిలిస్తే అతను యుద్ధోల్లాసంతో వచ్చాడు. కృష్ణార్జునులు అతన్ని వెళ్లి కర్ణుణ్ణి జయించి రమ్మని చెప్తే అలాగేనని వెళ్లాడు.

ఇంతలో జటాసురుడి కొడుకు అలంబుసుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి నాకు పాండవుల్తో పాత వైరం వుంది, నేను ఘటోత్కచుడితో యుద్ధం చేస్తానని అడిగితే అతన్నభినందించి పంపాడు దుర్యోధనుడు. వాడు కర్ణుణ్ణి దాటుకుని వెళ్లి ఘటోత్కచుడితో తలపడ్డాడు. ఆ రాక్షసులిద్దరు రకరకాల మృగరూపాల్లో మాయాయుద్ధం చేశారు. చివరికి బాహా బాహీ పెనుగుతుంటే ఘటోత్కచుడు వాణ్ణి పట్టి పడేసి వాడి రొమ్ము పాదంతో చితక తొక్కి తల విరిచి నెత్తురోడుతున్న ఆ శిరసుని దుర్యోధనుడి రథం మీద పడేశాడు. “ఇలాగే కొంచెం సేపట్లో కర్ణుడి తల కూడ పడేస్తా, చూస్తుండు” అని దుర్యోధనుణ్ణి హెచ్చరించి తన రథం ఎక్కి కర్ణుడి మీదికి వెళ్లాడు.

ఇక కర్ణ ఘటోత్కచులకి భీకరసమరం జరిగింది. చండశరజాలాల్తో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పెనిగారు. రక్తసిక్తాలైన శరీరాల్తో ఆ రాత్రి వేళ వెలిగారు. రాధేయుడొక దివ్యాస్త్రం వేస్తే ప్రత్యస్త్రంతో ఘటోత్కచుడు విరిచి మాయాసైన్యాన్ని సృష్టించి వదిలాడు. మన సేనలు కకావికలైనై. కాని కర్ణుడు మాత్రం మడమ తిప్పకుండా నిలిచాడు. అస్త్రబలంతో ఆ మాయని మాయం చేశాడు. వాడు చక్రం వేస్తే దాన్ని తునకలు చేసి గద విసిరితే దాన్ని ముక్కలు చేసి వాడు ఆకాశానికెగిరి రాళ్లూ చెట్లూ కురిస్తే వాటిని పిండిచేసి నిలబడ్డాడు. వాడు రథం ఎక్కి వస్తే గుర్రాలు, సారథితో సహా దాన్ని నుగ్గు చేశాడు. మాయాముఖం నుంచి వాడు అమ్ములు కురిపిస్తే అన్నిటిని వమ్ము చేశాడు. అనేకశిరస్సుల మహాకారంతో వస్తే దాన్ని కూల్చాడు. ఒక్కడే ఎన్నో రూపాల్లో వస్తే వాటిని మాయం చేశాడు. పర్వతమై వస్తే దాన్ని పొడి చేశాడు. ఐనాగాని వాడు చతురంగబలాల్ని సృష్టించి నిశితశరాల్తో కర్ణుణ్ణి నొప్పించి ఆశ్చర్యకరంగా అతని వింటిని విరిచాడు.

ఈలోగా బకాసురుడి తమ్ముడు అలాయుధుడు దుర్యోధనుడి దగ్గరికి తన సైన్యంతో వచ్చి భీముడితో పాటు అతని బంధువులందర్నీ మింగుతానని చెప్పాడు. ఇక్కడ ఘటోత్కచుడి చేతిలో కర్ణుడి చావు దగ్గరపడిందని మన వాళ్లందరూ గగ్గోలు పెడుతున్నారు. దుర్యోధనుడు అలాయుధుణ్ణి తొందరగా వెళ్లి ఘటోత్కచుడితో తలపడమని పంపాడు. రూపాల్లో, వయసులో, ఆయుధాల్లో సమానులుగా వున్న ఆ రాక్షసులిద్దరూ ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు. కర్ణుడు భీముడి మీదికి పోతే అతను కొడుకు అలాయుధుడి చేతిలో ఏమౌతాడోనని కర్ణుణ్ణి పట్టించుకోకుండా అలాయుధుడితో తలపడ్డాడు. వాడి సేనలు భీముణ్ణి కమ్ముకుంటే అతను చిరునవ్వుతో వాళ్లని చిందరవందర చేశాడు. అలాయుధుడు మాత్రం నిలిచి భీముడితో పోరాటం సాగిస్తూ తన బలాల్ని పాంచాలసైన్యం మీదికి పంపించాడు.

కృష్ణుడు అర్జునుడితో “నిశాయుద్ధంలో నిశాచరులు విజృంభించి పోరుతున్నారు. నకుల, సహదేవ, సాత్యకులని వాళ్లతో తలపడమను; శిఖండి ధృష్టద్యుమ్నుల్ని కర్ణుడి మీదికి పంపు; ద్రోణుడు, అతనితో ఉన్న రాజుల సంగతి నువ్వు చూడు” అని మంత్రాంగం చెప్పాడు. ఇంతలో అలాయుధుడు భీముడి విల్లు విరిచి అతనింకో విల్లు తీసుకునేలోగా సారథిని గుర్రాల్ని నొప్పిస్తే భీముడు గదతో కిందికి దూకితే వాడూ గద తీసుకుని ఎదుర్కున్నాడు. వాళ్లిద్దరూ గదలు పొడిపొడి చేసుకుని చేతికి దొరికిన రథాంగాలు, గజదంతాలు మొదలైన వాటితో పోరుతుంటే కృష్ణుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్న ఘటోత్కచుణ్ణి పిలిచి అలాయుధుడి అంతు చూడమని పంపాడు.

అలాయుధుడు ఒక పరిఘతో కొడితే ఘటోత్కచుడు దిమ్మతిరిగి తూగాడు. అంతలోనే మేలుకుని గద తిప్పి వేస్తే అది అలాయుధుడి రథాన్ని నుగ్గు చేసింది. వాడు ఆకాశానికెగిరి నెత్తురువాన కురిపించాడు. ఘటోత్కచుడూ పైకెగిరి వాడి మాయకి ప్రతిమాయ చేశాడు. వాడు కిందికి దిగాడు. ఇద్దరూ వాలిసుగ్రీవుల్లా భీషణంగా పోరాడారు. వాడు కత్తిపట్టి దూకితే ఘటోత్కచుడు వాడి తలపట్టి నిలబెట్టి ఆ కత్తితో వాడి తలే నరికాడు. ఆ తలని దుర్యోధనుడి ముందు పారేశాడు. తనని తన తమ్ముల్ని గట్టెక్కిస్తాడనుకున్న ఆ అలాయుధుడిలా నీచంగా చావటంతో దుర్యోధనుడు నివ్వెరపోయాడు. మనవాళ్లు గతాశులయారు.

ఒక్క కర్ణుడు మాత్రం నిర్భయంగా నిలబడి పాండవ చమూసమూహాన్ని గడగడలాడిస్తున్నాడు. ఘటోత్కచుడు వెళ్లి అతనితో తలపడ్డాడు. కర్ణుడతని గుర్రాల్ని చంపితే రథంతో సహా మాయమయ్యాడు వాడు. ఎక్కడ ప్రత్యక్షమై ఎవర్నేం చేస్తాడో అని భయంతో మనసైన్యం గడగడ వణుకుతున్నది. వాడు మేఘంలా వచ్చి ఉరుములు మెరుపుల్తో రకరకాల ఆయుధాల్ని వర్షించాడు. వాడికి తోడుగా ఇతర రాక్షస నాయకులూ అలాగే మేఘాలై వచ్చారు. ఐతే కర్ణుడు తన దివ్యాస్త్రాల్తో ఆ మాయల్ని మటుమాయం చేశాడు. అప్పుడక్కడ కర్ణుడున్నందుకు మనసేనలు ఎంతగానో ఆనందించినయ్. అందరూ అతన్ని “ఈ రాక్షసుణ్ణి చంపి మమ్మల్ని బతికించి నువ్వూ బతుకు. నీ కవచకుండలాలు తీసుకుని నీకు ఇంద్రుడిచ్చిన మహాశక్తిని వాడి మీద ప్రయోగించు. బతికుంటే బలుసాకు తినొచ్చు” అని ప్రార్థించారు. ఇంతలో ఘటోత్కచుడు కర్ణుడి రథాన్ని విరగ్గొట్టి గదతో మోదితే ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే మార్గం లేదని నిశ్చయించి ఇంద్రుడిచ్చిన మృత్యువు తోబుట్టువు లాటి ఘోరశక్తిని తీసి వింటికమర్చి దాని ఘంటారవాలు ఆకాశాన్ని తాకుతుంటే వేగంగా పారిపోబోతున్న వాడి మీద అంతకన్నా వేగంగా ప్రయోగించాడు కర్ణుడు.

ఆ శక్తి ముందుగా ఘటోత్కచుడి మాయని మింగి మరుక్షణంలో క్రూరంగా వాడి వక్షాన్ని చొచ్చి విచ్చి చీల్చి వెనగ్గా బయటికి వచ్చి ఆకాశాని కెగిసింది. ఆ శక్తి శక్తికి సోలుతూ వాడు నడుం పట్టుకుని బోర్లాపడి నాలుక బయటపెట్టి రక్తం వరదలు పారుతుండగా వికృతమైన మొహంతో ప్రాణం విడిచాడు. శంఖాలు, భేరులు, సింహనాదాలు చెలరేగినై మనసైన్యంలో. నీకొడుకు పట్టరాని ఆనందంతో కర్ణుణ్ణి కౌగిలించుకుని కొనియాడాడు. కౌంతేయులు అమితదుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ చూస్తుండిపోయారు.

ఒక్క కృష్ణుడు మాత్రం మహానందంతో సింహనాదం చేసి శంఖం పూరించి సంతోషనృత్యం చేస్తూ రథం దిగి అర్జునుణ్ణి కౌగిలించాడు.

అర్జునుడు అయోమయంగా “చెట్టంత ఘటోత్కచుణ్ణి పోగొట్టుకుని సేనంతా విచారంలో మునిగి తేలుతుంటే నీకీ ఆనందం ఏమిటి?” అని అడిగితే, “ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉంటే నిన్ను బతికించుకోవటం దుష్కరం అని ఇన్నాళ్లూ నాకు నిద్రలేదు. మనిద్దరం కలిసి కూడ అతన్నేమీ చెయ్యగలిగే వాళ్లం కాదు. అసలతని సహజ కవచకుండలాలు వుండి వుంటే అతన్ని జయించటం అసాధ్యం అయేది. వాటిని తీసుకుని నీ తండ్రి ఈ శక్తినిచ్చాడు. అదీ ఇప్పుడు ఘటోత్కచుడి కోసం ఖర్చయి పోయింది. ఇక నువ్వు కర్ణుణ్ణి చంపగలవ్. నీకోసం ఇదివరకే నేను ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుల్ని చంపా. వాళ్లూ వుండి వుంటే ఇక మనం గెలవటం అసాధ్యమయేది. ఇలా నీమార్గం సుగమమైంది. పైగా ఘటోత్కచుడు ఎంతైనా రాక్షసుడు, ఎప్పుడో ఒకప్పుడు నేను వాణ్ణీ చంపాల్సొచ్చేది. ఇక ఆ అవసరం కలగదు. ఎలా చూసినా ఇది సంతోషసమయం, దుఃఖసమయం కాదు” అని వివరించాడు.

సావధానంగా వింటున్న ధృతరాష్ట్రుడికి ఒక సందేహం వచ్చింది – “మరి అంత శక్తివంతమైన శక్తిని ఇన్నాళ్లూ కర్ణుడు అర్జునుడి మీద ఎందుకు వెయ్యలేదు? అతన్ని చంపితే అప్పటితోటే యుద్ధం ఐపోయివుండేది కదా !” దానికి సంజయుడు, “అది నిజమే, తొలిరోజు నుంచి కర్ణుడికి అందరం ఆ మాట చెప్పేవాళ్లం, అతనూ ఇవాళ వేస్తాను చూడండి అని వెళ్లేవాడు. అదేం మాయో, యుద్ధం మొదలయ్యాక మాకెవరికీ ఆ విషయమే గుర్తొచ్చేది కాదు. తిరిగి శిబిరాలకి వెళ్లాక షరా మామూలే. ఐతే, ఘటోత్కచుడు చచ్చాక సాత్యకి కృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగితే అతను తన మాయ వల్ల అలా జరిగేదని సాత్యకికి చెప్పాడు. చెప్పి ‘అర్జునుడితో నా స్నేహానికి సమానమైనవి ఈ ప్రపంచంలో ఏవీ లేవు, ఇక ఈ రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోతా’ అన్నాడు” అని వివరించాడు. దానికి ధృతరాష్ట్రుడు “అంతటి మహాశక్తిని గడ్డిపరక ఘటోత్కచుడి మీద వ్యర్థం చేసుకున్నాం, అంతా మన ఖర్మ. తర్వాతేం జరిగిందో చెప్పు” అన్నాడు. సంజయుడు కథని కొనసాగించాడు.

ఘటోత్కచుడి చావుతో డీలాపడి ధర్మరాజు తన రథం మీద చతికిలపడ్డాడు. కృష్ణుడతన్ని అనునయించాడు. ధర్మరాజు ఘటోత్కచుడు అదివరకు కావ్యక వనంలో, గంధమాదన యాత్రలో చేసిన సహాయాలు తలుచుకుని బాధపడ్డాడు. అంతలోనే పట్టరాని కోపంతో “అసలు అన్నిటికీ కారణం కర్ణుడు. మొన్న దొంగనాటకంతో అభిమన్యుడి విల్లు విరిచి వాణ్ణి చంపించాడు. ఇప్పుడిలా నాకెంతో ప్రీతి కలిగించే కొడుకుని పొట్టనపెట్టుకున్నాడు. అలాగే అప్పుడూ ఇప్పుడూ వాడికి సాయం చేసినందుకు ద్రోణుణ్ణి కూడ వదలను. భీముడు ద్రోణుడి సంగతి చూస్తాడు, నే వెళ్లి కర్ణుడు అంతు చూస్తా” అని ఆవేశంగా లేచి శంఖం పూరించి సారథిని కర్ణుడి మీదికి రథాన్ని తోలమన్నాడు. కృష్ణుడు గబగబా తన రథం ఎక్కి అర్జునుడితో “కర్ణుడితో తలపడాలని ఆవేశంతో వెళ్తున్నాడు ధర్మరాజు. మనం అతన్ని ఆపాలి” అంటూ రథం అటు తిప్పాడు.

కర్ణుడి వైపుకి బయల్దేరిన ధర్మరాజుకి ఎదురుగా వ్యాసమహాముని ప్రత్యక్షమై దీవించి “ధర్మం ఎటు వైపో జయం కూడ ఆవైపుకే. ఇవాల్టినుంచి ఐదోరోజు నీకు సామ్రాజ్యం దొరకబోతున్నది. ప్రశాంతంగా తమ్ముళ్లు, బంధువుల్తో నీ రణధర్మం నిర్వహించు” అని అంతర్ధానమయాడు. ధర్మరాజు శాంతించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి ద్రోణుడి మీద యుద్ధానికి పంపాడు. మళ్లీ ఘోరసమరం ఆరంభమైంది. ఐతే సైన్యాలు నిద్రతో జోగటం గమనించి అర్జునుడు అందర్నీ కేకేసి పిలిచి ఇప్పుడు నిద్రపోయి చంద్రోదయం అయాక లేచి మొదలెడదాం అని చెప్తే అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఎలా వున్నవారు అలాగే నిద్రలోకి జారిపోయారు.

కొంతసేపటికి చంద్రుడు వచ్చి పండువెన్నెలలు పరచటం మొదలెట్టాడు. రెండుసైన్యాలు మేలుకుని తిరిగి యుద్ధానికి తలపడినయ్. దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతని సమరకౌశలాన్ని పొగిడి “ఇంతవాడివి నీకు పాండవులొక లెక్కా? ఐనా శిష్యులని నువ్వు ఉపేక్ష చేసి వాళ్లని చావుదెబ్బలు కొట్టటం లేదు. మామీద నీ దయ అలా ఉంటే ఇంక మేం చేసేదేముంది?” అని వాపోయాడు. ద్రోణుడికి ఒళ్లు మండిపోయింది. “అర్జునుడు శిష్యుడనే కదా అగ్ని ఖాండవ వనాన్ని ఒదులుకుంది? ఘోషయాత్ర నాడు నిన్ను బంధించిన గంధర్వులు నిన్నొదిలేసి పారిపోయింది అతను వాళ్ల శిష్యుడనే కదా? నివాతకవచులు, కాలకేయాదులు అందుకనేగా అతనికి ఓడింది? ఎందుకిలాటి మాటలు?” అని ఝాడిస్తే దుర్యోధనుడూ కోపంగా “అర్జునుడితో యుద్ధం నీ వల్ల కాదనేగా, ఐతే నీకు తగిన వాళ్లతో నువ్వు పోరాడు. నేను దుశ్శాసన, శకుని, కర్ణులతో వెళ్లి అర్జునుడి అంతు చూస్తా” అని విసవిసా అక్కణ్ణుంచి కదిలాడు. ద్రోణుడు “అలాగే, ఇంతకాలం అన్ని రకాల భోగానుభవాలు చూశావ్, ఇప్పుడు అర్జునుడితో యుద్ధం ఎలా వుంటుందో కూడ చూడు పో” అని పాంచాల బలగాల వైపుకి ఉరికితే దుర్యోధనాదులు పాండవసైన్యం మీదికి వెళ్లారు. తొలిసంజె వెలుగులు వస్తున్నయ్.

మనమొన నించి ముందుకి వెళ్లిన దుర్యోధనాదుల్ని చూసి “మనం వీళ్లని వెనక్కి తరుముదాం పద” అని కృష్ణుడంటే అలాగేనన్నాడు అర్జునుడు. భీముడూ అతనికి ఉత్సాహం కలిగించాడు. తనని చుట్టుముట్టిన కౌరవబలగాల్ని అతను అన్ని దిక్కులా తానే ఐ చిందరవందర చేశాడు.

అదే సమయంలో మిగిలిన వాళ్లందరికి దూరంగా ఉత్తర దిక్కున ఒక్కడే ఉన్న ద్రోణుణ్ణి చూసి పాండవబలాలు కంగారు పడిపోయినయ్. అక్కడ వున్న పాంచాలసైన్యాల్ని రోషంలో అతనేం చేస్తాడోనని అక్కణ్ణుంచి వచ్చెయ్యమని పాండవసైన్యంలో వారు పిలిస్తే పాంచాలసైన్యంలో దొరలు అందుకు మండిపడుతూ ఎలాటి భయమూ లేకుండా ద్రోణుడి మీదికి కవిశారు.

ఐతే అసలే రోషంగా వున్న ద్రోణుడు ద్రుపదుడి ముగ్గురు మనవల్ని చంపి పూలు కోసినట్టు దొరల తలలు కొయ్యటం మొదలెట్టాడు. అడ్డొచ్చిన ద్రుపదుణ్ణీ, విరాటుణ్ణీ కూడ యముడి దగ్గరికి పంపేశాడు. పాంచాల, మత్స్య సైన్యాలు కకావికలైనై. దుఃఖావేశంతో ధృష్టద్యుమ్నుడు “ఇవాళ ద్రోణుణ్ణి చంపకపోతే నేను కులాచార ధర్మాన్ని తప్పినవాణ్ణౌతా” అని ప్రతిజ్ఞ చేసి పాంచాలసేనల్తో ద్రోణుడి మీదికి దూకాడు. దుర్యోధనుడు, కర్ణుడు ద్రోణుడికి అడ్డం వచ్చి అతనితో పెనిగారు. అటువైపు నుంచి భీముడు, సాత్యకి వచ్చి కలిశారు. రెండుబలాలు ఘోరయుద్ధం చేసినయ్.

పదిహేనవ రోజు


ఇంతలో తెల్లవారింది. అందరూ కాలోచితకృత్యాలు ముగించుకుని తిరిగొచ్చి రణం కొనసాగించారు. ఎండ తాకిడి, నిద్రలేమి, మండుతున్న ఆకలి – వేటినీ లెక్కచెయ్యకుండా వేడి పౌరుషాల్తో తలపడ్డారు. ద్రోణార్జునులు ద్వంద్వయుద్ధంలో ఒకరికొకరు తీసిపోకుండా అన్నిటా సమానంగా పోరారు. ఒకరి దివ్యాస్త్రాల్ని మరొకరు ఉపసంహరించారు, అదొక ఆటలా ఇద్దరూ ఆడారు. ఆకాశచారులు రెప్పవెయ్యకుండా చూశారు వాళ్ల పోరాటాన్ని. ఇలా గెలుపోటములు లేకుండా కొంతసేపు సాగాక ఇద్దరూ వేరే పక్కలకి వెళ్లి అక్కడి సైన్యాల్తో తలపడ్డారు.

ద్రోణుడి చేతిలో పాంచాలబలం చావుదెబ్బలు తిన్నది. అర్జునుడు తప్ప మిగతా పాండవులు ఒకచోట చేరారు. “ధర్మపరుడై అర్జునుడు అతన్ని ఓడించడు. ద్రోణుణ్ణి నిలవరించే వాళ్లు మనలో ఇంకెవరూ లేరు. ఎలా?” అని తికమక పడుతుంటే కృష్ణుడు తమ రథాన్ని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లి అర్జునుడితో “ద్రోణుణ్ణి ఆపటానికి ఒకటే దారుంది – అతని కొడుకు చనిపోయాడని చెప్తే అతను యుద్ధం మానేస్తాడు, అప్పుడతన్ని చంపొచ్చు” అంటే అర్జునుడు అందుకు ఒప్పుకోలేదు, మిగిలిన వాళ్లు సరేనన్నారు.

భీముడి చేతిలో అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు చచ్చింది. అతను హడావుడిగా ద్రోణుడి దగ్గరికెళ్లి అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అతను గుండెలు జల్లుమని అంతలోనే కొడుకు అస్త్రవిద్యాకౌశలాన్ని తల్చుకుని అతనికేమీ అయుండదని నిశ్చయించుకుని రణం సాగించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి మూడు చెరువుల నీళ్లు తాగించి మిగిలిన పాంచాలబలగాల్ని ఊచకోత కోస్తుంటే అతనికెదురుగా సప్తర్షులు ప్రత్యక్షమయారు. “బ్రాహ్మణుడివై వుండి, వేదవేదాంగాలు తెలుసుకుని ఇలా యుద్ధం చెయ్యొచ్చునా? ఇప్పటికి చేసింది చాలు, ఇక అస్త్రాలు వదిలి ఇక్కణ్ణుంచి కదిలే కాలం వచ్చింది” అని చెప్పి అంతర్ధానమయారు.

భీముడి మాటల్ని తల్చుకుని నిజంగా అశ్వత్థామకి ఏమైనా అయిందేమో ధర్మరాజునడిగి కనుక్కుందామని చూస్తుంటే కృష్ణుడు ధర్మరాజుతో “ఇతనింకా యుద్ధం చేస్తే మనం బతకం. ప్రాణరక్షణ సమయంలో అబద్ధం తప్పు కాదు. కనక అతని కొడుకు చచ్చాడని చెప్పు” అని చెప్పి పంపాడు. భీముడు కూడ, “నేను అశ్వత్థామ అనే ఏనుగుని చంపాను, కాబట్టి అది నెపంగా నువ్వు చిన్న అబద్ధం చెప్పొచ్చు” అని ప్రోత్సహించాడతన్ని. ధర్మజుడికి ఒక వంక పాపభయం, మరో వంక యుద్ధవిజయం కనిపిస్తున్నాయి, ఎటు మొగ్గాలో తేల్చుకునే సమయం వచ్చింది. చివరికి రాజ్యకాంక్షే గెలిచి అతనికి ఓపికున్నంత పెద్ద గొంతుతో “అశ్వత్థామ మరణించాడు” అని అరిచి చెప్పి ద్రోణుడికి వినపడకుండా మెల్లగా “ఏనుగే” అని ఊరుకున్నాడు ధర్మరాజు !

ద్రోణుడికి గుండె జారిపోయింది. నోరు తడారిపోయింది. మునులు చెప్పిన మాటలు చెవుల్లో వినిపిస్తున్నయ్. అంత్యకాలం ఆసన్నమైందని తెలుస్తూంది. ఎదురుగా ధృష్టద్యుమ్నుడున్నాడు. వీరావేశంగా అతని మీద బాణాలేస్తున్నాడు. చూస్తూ చూస్తూ అతన్నలా ఉపేక్షించి ఊరుకోలేక, మంత్రాలు పనిచెయ్యక దివ్యాస్త్రాలు వెళ్లకపోయినా పట్టుదలగా ద్రోణుడతనితో యుద్ధం సాగించాడు. అతని విల్లు, రథం, గుర్రాలు, సారథిని నుగ్గు చేశాడు. గదతో వస్తే దాన్ని ముక్కలు చేశాడు. పలకా వాలూ పట్టుకుంటే వాటిని విరిచాడు. అతని ఒంటికి తీవ్రనారాసాల్ని నాటాడు. అదిచూసి దూరంగా కృప, కర్ణ, కృతవర్మల్తో పోరుతున్న సాత్యకి ఒక క్రూరమైన బాణంతో ద్రోణుణ్ణి కొట్టాడు. భీముడక్కడికి అతివేగంగా వచ్చి ధృష్టద్యుమ్నుణ్ణి పక్కకి తీసుకుపోతుంటే ద్రోణుడు “పో పొండిరా” అని విదిల్చాడు వాళ్లని.

ధృష్టద్యుమ్నుడు ఎదురుగా లేకపోయేసరికి అతని మనసు యధాపూర్వంగా ప్రశాంతమయింది.

అలా నాలుగు రోజుల ఒక రాత్రి, ఐదవరోజు ఇరవై గడియల పాటు సర్వసేనాధిపతిగా మన సైన్యాన్ని రక్షిస్తూ దేవతలక్కూడా ఆశ్చర్యం కలిగించేలా యుద్ధం చేసి తృప్తుడై మన సేన వైపుకి తిరిగి “కర్ణా, కృపా, దుర్యోధనా, నా శక్తి కొద్ది ఇన్నాళ్లు యుద్ధం చేసి ఇక నిశ్చింతగా సుగతికి వెళ్తున్నా. ఆయుధాల్ని విడుస్తున్నా. మీరు తెలివిగా జీవించండి” అని అరిచి చెప్పి ఆయుధాలు విసిరేసి రథం మీద యోగనిష్టలో కూర్చున్నాడు ద్రోణుడు.

అంతలో ఒక నిశితఖడ్గాన్ని చేతపట్టి వేగంగా పాదచారిగా ద్రోణుడి వైపుకి ధృష్టద్యుమ్నుడు వెళ్తుంటే రెండుసైన్యాలు హాహాకారాలు చేసినయ్. ద్రోణుడు తేజోరూపంలో తన శరీరాన్ని విడిచి పైకి వెళ్లాడు. ఆ దృశ్యం నాకు కళ్లార కనిపించింది. కృష్ణార్జునులు, ధర్మరాజు, కృపాచార్యుడు కూడ అది చూశారు. ఇంకెవరికీ ఆ జ్యోతి కనిపించలేదు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి రథం మీదికి ఎగిరాడు. ద్రోణుడి శవం జుట్టు గట్టిగా పట్టుకుని వద్దు వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, తప్పు రా అని ధర్మరాజు బోధిస్తున్నా వినకుండా అతని తల నరికి దాన్నీ, మొండాన్నీ కిందికి తోశాడు. శతవృద్ధుడు అస్త్రాచార్యుడలా పాండవపక్షం అధర్మవర్తనతో అస్తమించాడు.

ఆచార్యుడి చావుతో మన సేనలు అలమటించినయ్. పెద్ద పెద్ద దొరలంతా ఇంక మనకి దారేదీ అని వాపోయారు. సామాన్యసైనికులు దిక్కు తెలియకుండా పరిగెత్తారు. మరోవంక యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఈ కలకలం ఏమిటా అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. ఏం జరిగిందని అతన్నడిగితే నోట మాటరాక పాలిపోయిన మొహంతో నిలబడ్డాడు దుర్యోధనుడు. చివరికి కృపాచార్యుడు ఏడుపు గొంతుతో జరిగిందంతా టూకీగా వివరించాడతనికి.

అశ్వత్థామ కళ్లు క్రోధంతో, దుఃఖంతో ఎర్రబడినయ్. కన్నీళ్లు జలజల కారినయ్. చేత్తో తుడుచుకుంటూ దుర్యోధనుడితో అన్నాడూ – “చావులు లేవా, యుద్ధాల్లో చావరా, మహానుభావుడు అస్త్రగురువుని ఒక హీనుడు ఇలా జుట్టు పట్టుకుని తలగొట్టటం ఎక్కడన్నా ఉందా? నాకీ విషయం తెలీకుండా ఉంటుందనుకున్నాడా వాడు? నన్నింతగా అవమానిస్తాడా? తండ్రిని ఇలాటి అవమానకరమైన మరణాన్నుంచి రక్షించలేని నా దివ్యాస్త్రాలెందుకు, తగలెయ్యనా? దీనికి మూల కారణం ధర్మరాజు. అతని మీద నేనెలా పగ తీర్చుకుంటానో కదా ! ఐనా నా ప్రతిజ్ఞ విను. కృష్ణుణ్ణి, పాండవుల్ని నా భుజబలంతో, దివ్యాస్త్రాల్తో ముప్పుతిప్పలు పెడతా. దేవతలొచ్చినా సరే, వాళ్ల సేనానీకాన్ని అల్లకల్లోలం చేసేస్తా. నా గురించి నేను చెప్పుకోకూడదు, ఎలా చేస్తానో నువ్వే చూద్దువు. నా తండ్రి నారాయణుణ్ణి ఆరాధించి ఒక మహిమాన్వితాస్త్రాన్ని పొందాడు, అది నాకిచ్చాడు. దాన్ని ప్రయోగిస్తా. అది విరోధులందర్నీ మట్టుపెడుతుంది.” ఆ మాటల్తో పొంగి మన యోధులు శంఖాలు పూరించారు. భేరీమృదంగ నాదాలు మిన్ను ముట్టినయ్. మన సైన్యాలు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరినయ్.

ఆ మహారవం విని ధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు. ద్రోణుడు పడిన వార్త విని కూడ కౌరవసైన్యం ఎందుకంత ఉత్సాహంగా ఉరకలేస్తుందని అర్జునుణ్ణడిగితే దానికతను “తన తండ్రిని శత్రువులు అధర్మంగా చంపారని విని అశ్వత్థామ ఊరుకుంటాడనుకున్నావా? అతను మహిమాన్విత అస్త్రాలున్నవాడు. అమానుష విక్రముడు. అతని మూలానే కౌరవసైన్యాలలా ఉత్సాహంగా వున్నయ్. ఐనా నిన్ను శిష్యుడని, ధార్మికుడని, సత్యవ్రతుడని ఎంతో ఆదరంగా అడిగిన గురువుకా నువ్విలా అబద్ధం చెప్పేది? నీ మాట వినే ఆయన కొడుకు నిజంగా చనిపోయాడనుకున్నాడు. ఇంత హీనంగా ప్రవర్తించి తెచ్చుకున్న రాజ్యం వల్ల పేరొస్తుందా, వృద్ధి కలుగుతుందా? మనం లోకానికి వెలి కాలేదా? పైగా అలా అస్త్రసన్యాసం చేసిన వాణ్ణి, వద్దు వద్దని నేను గొంతు పగిలేట్టు అరుస్తూ వారిస్తున్నా వినకుండా జుట్టు పట్టి తలని నరికాడు కదా ఇతను! ఈ ధృష్టద్యుమ్నుడి అంతు చూడకుండా ఆ అశ్వత్థామ వదుల్తాడా? ఇప్పుడు మనసైన్యాన్ని నాశనం చెయ్యటానికి, ఈ ధృష్టద్యుమ్నుడి తల కొయ్యటానికి ప్రళయరుద్రుడిలా వస్తున్న అతన్ని ఎదుర్కోవటం నీకూ, వీళ్లకీ సాధ్యమైన పనా?” అని దెప్పిపొడుస్తుంటే భీముడతని మీద మండిపడ్డాడు.

“యుద్ధం చెయ్యటానికి వచ్చి ఇలా ధర్మపన్నాలు పలుకుతావేం? నిండుసభలో పాంచాలికి వాళ్లు చేసిన అన్యాయం ముందు మనం వాళ్లకి ఎన్ని చేసినా దిగదుడుపే. ఒక పక్క మన మీదికి దూకుతున్న శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలా అని మేం తలలు పట్టుకుంటుంటే పుండు మీద కారం చల్లే ఈ మాటలేమిటి?” అన్నాడతనితో.

ధృష్టద్యుమ్నుడు కూడ “మన సామాన్య సైనికుల మీద దివ్యబాణాలేసి వాళ్లని ఊచకోత కోస్తున్నాడే, ఈ ద్రోణుడు ధార్మికుడా? ఐనా అతన్ని చంపటానికే పుట్టాను నేను, మరి చంపితే దాన్లో అధర్మమేమిటి? ధర్మరాజు ఎప్పుడూ అసత్యం ఆడడు, నేను ధర్మం తప్పను. నువ్వు మాత్రం కురుపితామహుడు భీష్ముణ్ణి, నీ తండ్రికి ఆప్తమిత్రుడైన భగదత్తుణ్ణి చంపలేదా? శిష్యవంచకుడు గనక గురుడు చచ్చాడు. ఇంక చాలు, శత్రుసైన్యాన్ని గెలుద్దాం పద” అని సంభాషణని దారి మళ్లించటానికి ప్రయత్నించాడు.

అలా మాట్టాడుతున్న ధృష్టద్యుమ్నుణ్ణి ఏమీ చెయ్యలేక ఈసడించుకున్నాడు అర్జునుడు. కన్నీళ్లు కారుస్తూ, నిట్టూర్చి “ఇంకా ఎందుకీ రోత మాటలు?” అని మాత్రం అనగలిగాడు. కృష్ణుడు, ధర్మరాజు సిగ్గుతో తలలు వంచుకున్నారు.

ఒక్క సాత్యకి మాత్రం పట్టరాని కోపంతో “గురువుకి అంత పరాభవం చేసినా నీ నాలిక రాలదు, నీ తల పగలదు. ధర్మరాజు ఎదుట కాబట్టి బతికిపోయావ్, లేకపోతే నీ అంతు చూసేవాణ్ణి. ఆ శిఖండి మూలాన భీష్ముడు పడ్డాడు. దానికి అర్జునుణ్ణి నిందిస్తావా? భీష్ముడి కోరిక మీరక ఆయన మీద అర్జునుడు బాణాలేశాడు, అతనికీ నీకూ పోలికా? అసలు నువ్వూ శిఖండీ పుట్టి పాంచాలకులానికే కళంకం తెచ్చిపెట్టారు” అని ధృష్టద్యుమ్నుణ్ణి తిట్టిపోశాడు.

దానికతను పగలబడి నవ్వాడు. “మరొకరు కొడితే చెయ్యి తెగి నిష్టూరపడుతున్న భూరిశ్రవుణ్ణి బుద్దిలేకుండా చంపావే, అది వీరుడు చేసే పనేనా? అతను నిన్ను కింద పడేసి గుండెల మీద ఎక్కితే ఏమన్నా చెయ్యగలిగావా? అంత పోటుగాడివే, ద్రోణుడు మన సైన్యాల్ని చిందరవందర చేస్తుంటే అతనికి అడ్డం పడ్డావా? ఇంకా మాట్టాడావంటే నీ తల నరుకుతా. .. ఐనా ఇప్పుడిదంతా ఎందుకు, అదుగో శత్రుసైన్యం వస్తున్నది, దాని సంగతి చూద్దాం పద” అన్నాడతనితో.

ఆ మాటలు సాత్యకిని శాంతింపజెయ్యకపోగా అతని కోపాన్ని పెంచినయ్. వింటిని రథం మీద విసిరేసి గద తీసుకుని “ఒక్క వేటుతో నీ అంతు చూస్తా రా” అని ధృష్టద్యుమ్నుడి మీదికి వెళ్తుంటే కృష్ణుడు భీముణ్ణి అతన్ని పట్టుకోమని పంపితే భీముడు వెనకనుంచి అతని రెండు చేతులూ పట్టుకుని ఆపాడు. భీముడి చేతుల్లోంచి తప్పించుకోవటానికి సాత్యకి పెనుగులాడుతుంటే “వదులు వాణ్ణి, వాడి సంగతి నేను చూస్తాగా. నేనేం ఒంటిచేతి భూరిశ్రవుణ్ణి కాను” అన్నాడు ధృష్టద్యుమ్నుడు తన్నులాటకి తనూ కాలుదువ్వుతూ. చివరికి ధర్మరాజు, కృష్ణుడు అతికష్టం మీద వాళ్లని శాంతపరిచారు.

పాండవసైన్యం దాపులకి వచ్చాక అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఆ మహాస్త్రం భీకరాకారంతో బయల్దేరింది. దాన్నుంచి అనేక రకాల ఆయుధాలు మంటలు విరజిమ్ముతూ బయటికొచ్చి పాండవసైన్యం మీదికి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా కమ్ముకున్నయ్. సైన్యాన్ని నాశనం చెయ్యసాగినయ్.

అర్జునుడు అదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టు కదలకుండా ఊరుకున్నాడు.

ధర్మరాజు అతనికి వినపడేలా సాత్యకి, ధృష్టద్యుమ్నుల్తో “నిండు సభలో పాంచాలికి పరాభవం జరుగుతుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నాడు, బాలుడైన అభిమన్యుణ్ణి పదిమందితో కలిసి చంపాడు, సైంధవుణ్ణి చంపటానికి పోయిన అర్జునుడికి సాయంగా వెళ్తున్న నిన్ను పోనీకుండా అడ్డు పడ్డాడు. అలాటి ధర్మపరుడైన ద్రోణుడికి నేనెక్కడ సమానం ఔతాను? నేనిప్పుడే నాలుకలు చాచుకుంటూ వస్తున్న ఆ అగ్నిలోకి పోతా, మీరు మీ మీ బలాల్తో ఎటన్నా పారిపోండి. అప్పుడు గాని అర్జునుడి మనసు చల్లబడదు” అని పరోక్షంగా అర్జునుణ్ణి దెప్పిపొడిచాడు.

అప్పుడు కృష్ణుడు పెద్దగా అందరికీ వినపడేట్టు “సైనికులారా, వెంటనే అందరూ గుర్రాలు, ఏనుగులు దిగి ఆయుధాల్ని కింద పెట్టి భూమ్మీద నిలబడండి. అప్పుడు ఈ అస్త్రం మిమ్మల్నేమీ చెయ్యదు. ఈ మహాస్త్రానికి ఇదే మందు” అని చెప్తే అందరూ అలాగే చేశారు. ఒక్క భీముడు మాత్రం “వీరులారా, ఒక అస్త్రానికి భయపడి ఆయుధాలు వదిలేస్తారా? నేనుండగా మీకేం భయం వద్దు. నేనీ అస్త్రం అంతం చూస్తాగా” అంటూ అశ్వత్థామతో తలపడితే కోపగించుకుని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఇంకా ప్రజ్వలింప చేశాడు.

మిగిలిన వాళ్లంతా ఆయుధాలు వదిలెయ్యటంతో అది నేరుగా భీముడి మీదికి బయల్దేరింది. అర్జునుడు హడావుడిగా వరుణాస్త్రం వేశాడు. దాంతో నారాయణాస్త్ర ప్రభావం కొంత తగ్గింది. వెనక్కి తగ్గకుండా అశ్వత్థామ దాన్నింకా పెంచాడు. భీముడి రథాన్ని కార్చిచ్చులా కమ్ముకుందది. కృష్ణార్జునులు పాదచారులై పరిగెత్తుకెళ్లి భీముణ్ణి కిందికి దిగమన్నారు. భీముడు కదలనని భీష్మించుక్కూచున్నాడు. ఇంకిలా కాదని వాళ్లిద్దరూ భీముడి ఆయుధాల్ని లాగిపారేసి అతన్ని రథం మీంచి కిందికి తోశారు.

అలా అంతా కిందకి దిగి నిలబడటంతో నారాయణాస్త్రం శాంతించింది.

“ఆ అస్త్రాన్ని మళ్లీ వెయ్” అని అశ్వత్థామని ప్రోత్సహించాడు దుర్యోధనుడు. “అది ఒక్కసారే ప్రయోగించాలి, మళ్లీ ప్రయోగిస్తే మననే కాలుస్తుంది. కృష్ణుడు మోసంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. ఓడిన వాళ్లు చచ్చిన వాళ్లతో సమానం గనక వాళ్లంతా ఆయుధాలు పారేస్తే ఆ అస్త్రం పనైపోయింది” అని నిట్టూర్చాడు అశ్వత్థామ. ఐనా నిరుత్సాహపడకుండా ధృష్టద్యుమ్నుణ్ణి తాకి వాడి సారథిని, గుర్రాల్ని, కేతువుని నేలకూల్చాడు. సాత్యకి అడ్డొస్తే ఒక్క బాణంతో అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. అదిచూసి భీమార్జునులు అతని మీద దూకారు.

అశ్వత్థామ అమితక్రోధంతో ఆగ్నేయాస్త్రం వేశాడు. దాన్నుంచి భీకరాగ్ని జ్వాలలు వచ్చి ఒక అక్షౌహిణి పాండవసైన్యాన్ని అప్పటికప్పుడే మట్టుపెట్టినయ్. దాని దెబ్బకి భీమార్జునులు చచ్చారని మనవాళ్లు ఆనందంతో అరిచారు. వేరే దారిలేక అర్జునుడు అన్ని అస్త్రాల్ని ఉపసంహరించగలిగే బ్రహ్మాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగిస్తే అది అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని హరించింది. కృష్ణార్జునులు శంఖాలు పూరించి పాండవసైన్యానికి ఊరట కలిగించారు.

ఆగ్నేయాస్త్రం విఫలం కావటంతో అశ్వత్థామ వికలుడయ్యాడు. “పనిచెయ్యని దివ్యాస్త్రాల్తో నేను చేసే యుద్ధం ఏమిట”ని రోషంగా వింటిని విసిరి పారేసి ఒక్కడే కాలినడకన కదిలిపోయాడు.

ఐతే దార్లో అతనికి వేదవ్యాసుడు ప్రత్యక్షమయాడు. దేవతలకైనా ఆప శక్యంకాని తన ఆగ్నేయాస్త్రాన్ని నరుడెలా ఆపగలిగాడని అతన్ని అడిగాడు అశ్వత్థామ. వ్యాసుడు దయతో అతనికి నరనారాయణుల వృత్తాంతం చెప్పి వాళ్లు అవసరమైనప్పుడు అవతరించి దుష్టసంహారం చేస్తుంటారని, ఇప్పుడు కృష్ణార్జునులుగా వున్నది వాళ్లేనని విశదీకరించాడు. పైగా పూర్వజన్మలో అశ్వత్థామ మట్టితో శివుడి ప్రతిమని చేసి దాన్ని నిష్టతో పూజించాడని, వాళ్లు శివుణ్ణి లింగాకృతిగా ఆరాధించారని, అర్చలో ఆరాధించటం కంటె లింగాన్ని పూజించటం ఎన్నో రెట్లు ఉత్తమం కనక వాళ్లని తను జయించలేకపోయాడని వ్యాసుడతనికి వివరించాడు. అశ్వత్థామ శాంతించి యుద్ధభూమికి తిరిగి వచ్చి సూర్యాస్తమయం కావటంతో సేనల్ని శిబిరాలకి మళ్లించాడు.

ఇలా ద్రోణరక్షణలో కౌరవసేనల యుద్ధక్రమాన్ని ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పి తిరిగి యుద్ధభూమికి వెళ్లాడు సంజయుడు.

రెండురోజుల తర్వాత మళ్లీ అంతఃపురానికి తిరిగొచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆదేశంతో అతని పక్కన కూర్చున్నాడు. “పౌరుషం పందెంగా కౌరవపాండవ సైన్యాలు రెండురోజులుగా చేసిన యుద్ధం అంతా చూసివచ్చా. పాండవ చమూసమూహాన్ని చిల్లిగవ్వకి లెక్కచెయ్యకుండా భీకరరణం సాగించి చివరికి తన సహజశత్రువు అర్జునుణ్ణి ఓడించలేక అతని బాహువిక్రమానికి బలై కర్ణుడు కన్నుమూశాడు” అని చెప్పి భరించరాని దుఃఖంతో, డగ్గుత్తికతో “అంతేకాదు, భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి అతని రక్తం తాగాడు. ఇంక మనసైన్యంలో విజయాశ అడుగంటిపోయింది” అని చెప్పి వలవల ఏడ్చాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడికి గుండె గుభేల్ మంది. దుర్యోధనుడు కూడ మరణించాడనుకున్నాడు. ఏడ్చి సొమ్మసిల్లి మూర్ఛపోయాడు. అంతఃపుర నారీజనం కూడ శోకసంద్రంలో మునిగి మూర్ఛపోయారు. సంజయుడు, అంతకుముందే అక్కడికి వచ్చి వున్న విదురుడు చన్నీళ్లు చల్లి, వీవనల్తో విసిరి మెల్లగా వాళ్లని సేదతీర్చారు.

ధృతరాష్ట్రుడు “సంజయా, నాకు నువ్వు చెప్పింది సరిగా వినపడలేదు. మళ్లీ ఒక్కసారి మనసైన్యంలో ఎవరెవరు బతికున్నారో స్పష్టంగా చెప్పు” అనడిగితే సంజయుడు “మనసేనలో అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు, కొందరు కురుకుమారులు, కొందరు కర్ణుడి కొడుకులు, ఇంకొంతమంది వీరయోధులు వున్నారు. వీళ్లని కూడగట్టుకుని జయాన్ని సాధించాలనే పట్టుదలతో దుర్యోధనుడు ముందుకి కదులుతున్నాడు” అని చెప్పాడు. దుర్యోధనుడు బతికే వున్నందుకు కొంత ఊరట పట్టాడు ధృతరాష్ట్రుడు. ఐనా కర్ణుడి మరణాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ – “కృష్ణార్జునుల్ని లెక్కచెయ్యని బలశాలి, అఖిల దివ్యాస్త్ర సంపన్నుడు కర్ణుడు. అతన్ని చూసుకునే పాండవుల్ని గెలుస్తానని దుర్యోధనుడి ధైర్యం. అలాటి వాడే పడ్డాడని విన్నా నా గుండె పగలదు. ఇంతమంది బంధువులు, హితులు పోయారని వినటానికే నేనున్నా. ఇక దుర్యోధనుడు గెలవటం అసాధ్యం. మనలో మనకి యుద్ధం ఎందుకు అని బుద్ధి చెప్పాడు ధర్మరాజు. శరతల్పం మీదనుంచి గాండీవి అస్త్రవైభవాన్ని అందరికీ కళ్లారా చూపించి ఇప్పటికైనా సంధి చేసుకోమని చెప్పాడు భీష్ముడు. మీరాజు మాత్రం ఎవరిమాటా వినక ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు.” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.

ఐతే కర్ణుడు ఓడిపోవటం ఎలా సాధ్యమైందో అతనికి అర్థం కాలేదు – “పరశురాముడి దగ్గర సంపాదించిన బ్రహ్మాస్త్రం వుంది. సర్పముఖాస్త్రం వుంది. ఇంకా అనేక దివ్యాస్త్రాలున్నయ్. ఐనా కర్ణుడు అర్జునుణ్ణి గెలవలేకపోవటం ఎలా సాధ్యం? అతని రథం విరిగిందా? సారథి చచ్చాడా? అస్త్రాలు పనిచెయ్యలేదా? లేకపోతే పాండవులు భీష్మ ద్రోణుల్లాగే అతన్ని కూడ అధర్మంగా చంపారా?” అని ఆత్రంగా అడుగుతుంటే సంజయుడు “అన్నీ నీకు వివరంగా చెప్తా. సావధానంగా విను” అంటూ తన కథనాన్ని కొనసాగించాడిలా.

ద్రోణుడు పడ్డాక అశ్వత్థామ విజృంభించి దివ్యాస్త్రాల్తో పోరి సూర్యాస్తమయం కావటంతో యుద్ధం ముగించాడు. శిబిరాలకి తిరిగి వెళ్లాక తక్షణ కర్తవ్యం ఏమిటని దుర్యోధనుడు అతన్ని అడిగితే కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించమని సలహా ఇచ్చాడతను. ముఖ్యులైన రాజుల్తో కలిసి నీకొడుకు కర్ణుడి దగ్గరికి వెళ్లి తనతో మైత్రికి చిహ్నంగా సర్వసైన్యాధ్యక్ష పట్టం కట్టుకుని తనకి రాజ్యం సంపాయించి పెట్టమని అతన్ని కోరాడు. కర్ణుడందుకు ఆనందంగా అంగీకరించి బంధు మిత్ర సహితంగా అర్జునుణ్ణి చంపి రారాజుకి రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. పవిత్ర నదీజలాలు తెప్పించి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పుణ్యాహఘోషల మధ్య, వందిమాగధుల ఆశీస్సుల మధ్య, అతనికి పట్టం కట్టాడు దుర్యోధనుడు. కర్ణుడు విరివిగా దానాలు చేశాడు. మనవాళ్లందరూ కర్ణుడిక తమని గట్టెక్కించి విజయం చేకూర్చి పెడతాడని ఉవ్విళ్లూరుతూ రాత్రి సుఖనిద్రలు చేశారు.

నేను ఇక్కడికి వచ్చి ద్రోణ వృత్తాంతం చెప్పి తిరిగి వెళ్లేసరికి సూర్యోదయం ఔతున్నది.

పదహారో రోజు.


తన తొలినాటి యుద్ధానికి రాధేయుడు మకరవ్యూహం పన్నాడు. దానికి తుండంగా తను నిలబడ్డాడు. శకుని, ఉలూకుడు కళ్లు. శిరోభాగాన అశ్వత్థామ. కంఠాన నీ చిన్నకొడుకులు. ఉదరం దుర్యోధనుడు. ఎడమపాదం నారాయణ గోపాలకుల్తో కృతవర్మ. కుడిపాదం త్రిగర్త, దాక్షిణాత్య సైన్యాల్తో కృపాచార్యుడు. వెనక ఒక కాలు నానాదేశ సేనల్తో శల్యుడు. మరో కాలు పెద్ద సైన్యంతో సుషేణుడు. తోక మహాసైన్యంతో చిత్రుడు, అతని తమ్ముడు చిత్రసేనుడు. మిగిలిన వాళ్లు అక్కడక్కడ నిలబడ్డారు.

అదిచూసి ధర్మరాజు అర్జునుడితో “చూస్తున్నావా, ఇప్పుడిక దుర్యోధనుడి ఆశలన్నీ కర్ణుడి మీదే. మన కష్టాలన్నిటికి మూలకారణమైన వీణ్ణి నీ పౌరుషం చూపి చంపే సమయం వచ్చింది. వీడు చచ్చాడా ఇక దుర్యోధనుడు నీరుకారి పోతాడు. నీ సమరకౌశలం చూపించి విజయం దక్కించుకో” అని ఉత్సాహపరిచాడు.

అర్జునుడు అర్థచంద్ర వ్యూహం నిర్మించాడు.

రెండు సైన్యాలు తీవ్రంగా తాకినయ్. ఇంతకు ముందెప్పుడూ చూడనంత ఘోరంగా సాగింది పోరు. వాళ్ల వైపు నుంచి సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ద్రౌపదేయులు మన వైపు ప్రభద్రక, చేది, పాండ్య, చోళ, మగధ, వంగ దేశాల బలాల్తో తలపడ్డారు.

ఒక మదగజాన్నెక్కి భీముడు మన సేనల మీదికి రౌద్రాకారుడై కదిలాడు. అతన్ని చూసి కులాతదేశపు రాజు క్షేమధూర్తి తన బలాల్తో ఏనుగు మీద వెళ్లి తలపడ్డాడు. రెండు ఏనుగులూ ఒకదాంతో ఒకటి తలపడినయ్. క్షేమధూర్తి భీముడికి తీసిపోకుండా పోరాడాడు. బాణాల్తో, నారసాలతో, శక్తుల్తో, తోమరాల్తో మోదుకున్నారిద్దరు. క్షేమధూర్తి ఏడు తోమరాల్ని భీముడి రొమ్ము మీద నాటాడు. భీముడు ఉగ్రంగా ఒక తోమరాన్ని అతని మీదికి విసిరితే మధ్యలో కరూశరాజు దాన్ని ఖండించి అరవై బాణాల్తో భీముడికి గాయాలు చేశాడు. ఐతే భీముడు కరూశరాజుని పట్టించుకోకుండా క్షేమధూర్తి గజాన్ని బాణవర్షంలో ముంచాడు. అది వెనక్కి తిరిగి పరిగెత్తటం మొదలెట్టింది. వదలకుండా భీముడు వెంటపడ్డాడు. అతి ప్రయత్నం మీద క్షేమధూర్తి దాన్ని భీముడికి ఎదురుగా తిప్పి భీముణ్ణెదుర్కున్నాడు. భీముడతని విల్లు విరిచి అతన్నీ అతని ఏనుగునీ నొప్పిస్తే అతను వేగంగా మరో విల్లు తీసుకుని భీముడి మీద, అతని ఏనుగు మీద బాణపరంపరలు కురిపించాడు. దాంతో భీముడి ఏనుగు ముందుకు ఒరిగింది. ఒక పెద్ద గద తీసుకుని కిందికి ఉరికాడు భీముడు. గదాఘాతంతో ఒక్కదెబ్బకి వాడి ఏనుగుని చంపాడు. క్షేమధూర్తి కత్తి దూసి దూకితే గదతో వాణ్ణి వాడి ఏనుగు పక్కనే పీనిగని చేశాడు భీముడు.

మనమొన విచ్చిపోయింది. పాండవ సైన్యం చొచ్చుకు వస్తుంటే కర్ణుడు దాన్ని ఎదిరించి నిలిపాడు. మన సైన్యం అతనికి అండగా నిలిచింది. అటునుంచి పాండవులు వచ్చారు. నకులుడతనితో తలపడ్డాడు. సాత్యకి కైకేయులైన విందానువిందుల్తో. భీముడు అశ్వత్థామతో. చిత్రసేనుడు శ్రుతకర్మతో. ప్రతివింధ్యుడు చిత్రుడితో. ధర్మరాజు దుర్యోధనుడితో. అర్జునుడు సంశప్తకులతో. ధృష్టద్యుమ్నుడు కృపుడితో. శిఖండి కృతవర్మతో. శ్రుతకీర్తి శల్యుడితో. సహదేవుడు దుశ్శాసనుడితో.

విందానువిందులు సాత్యకితో ఘోరయుద్ధం చేశారు. వాళ్లతని విల్లు విరిస్తే మరో విల్లు తీసుకుని అతను వాళ్ల విళ్లని విరిచాడు. ఒక భల్లంతో అతను అనువిందుడి తల కొట్టాడు. రత్నకుండలాల్తో ప్రకాశిస్తూ ఎగిరిపడిందది. అదిచూసి విందుడు వీరావేశంతో అతనితో పెనిగాడు. ఇద్దరూ సారథుల్ని చంపుకున్నారు. గుర్రాల్ని ఖండించుకున్నారు. విళ్లని విరుచుకున్నారు. కత్తులు తీసుకుని కిందికి దూకి బహు చిత్ర విచిత్రాలైన మండలప్రచారాల్తో సమరం సాగించారు. అదును చూసుకుని సాత్యకి విందుణ్ణి రెండు ముక్కలుగా నరికాడు. అలా ఆ ఇద్దర్నీ చంపి యుధామన్యుడి రథం ఎక్కి వెళ్లి మరొక రథం అమర్చుకుని వచ్చి కేకయ బలాల మీదికి కదిలాడు సాత్యకి.

మరోవంక నీ మనవడు శ్రుతకర్మ చిత్రసేనుణ్ణి యముడి దగ్గరకి పంపాడు. ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు చిత్రుడితో తలపడితే చిత్రుడొక శక్తిని ఉగ్రంగా వేశాడు. ప్రతివింధ్యుడు దాన్ని నాలుగు ముక్కలు చేస్తే చిత్రుడొక గద విసిరి అతని గుర్రాల్ని సారథిని చంపాడు. అదే గదతో అతని చేతిని ముద్ద కింద కొట్టాడు. దాంతో ప్రతివింధ్యుడు మహోగ్రంగా ఒక తోమరాన్ని వేగంగా విసిరితే అది చిత్రుడి శరీరాన్ని దూసుకుని వెళ్లింది, వాడొక పర్వతంలా కూలాడు.

భీమాశ్వత్థామలు ఒకరికొకరు తీసిపోకుండా ఘోరసమరం చేసి ఇద్దరూ మూర్ఛపోయారు. వాళ్ల సారథులు రథాల్ని రణరంగం బయటికి తోలుకుపోయారు. అర్జునుడి కొడుకు శ్రుతకీర్తి శల్యుడితో తలపడ్డాడు. ఇద్దరూ కళ్లు మిరుమిట్లు గొలిపే సమరం సాగించారు. శల్యుడతని విల్లు విరిస్తే మరో వింటితో వాడు శల్యుడి మీద అరవై నాలుగు అమ్ములేశాడు. శల్యుడా వింటినీ విరిచాడు. వాడు గద విసిరితే దాన్ని ముక్కలు చేశాడు. శక్తి వేస్తే దాన్ని నుగ్గు చేశాడు. ఓ భల్లంతో సారథి శిరస్సుని ఖండించాడు. శ్రుతకీర్తి గుర్రాలతని రథాన్ని యుద్ధభూమి బయటకి లాక్కుని పరిగెత్తినయ్. అలాగే సహదేవుడితో సమరం సాగిస్తున్న దుశ్శాసనుడు కూడ అతని దెబ్బకి మూర్ఛపోతే సారథి అతని రథాన్ని బయటికి తోలుకుపోయాడు.

నకులుడు, కర్ణుడు మరోవంక యుద్ధం చేస్తున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రాల్ని మరొకరు ఉపసంహరిస్తూ ఒకరి బాణాల్ని ఒకరు విరుస్తూ పోరాటం తీవ్రంగా సాగించారు. చివరకు కర్ణుడు కోపోద్దీప్తుడై అతని సారథిని చంపి గుర్రాల్ని కూల్చి వింటిని విరిచి రథాన్ని నుగ్గుచేస్తే పలకా వాలూ తీసుకుని దూకాడు నకులుడు. కర్ణుడు వాటిని చెక్కలు చేశాడు. గద ఎత్తితే దాన్ని తుంచాడు. పరిఘ పట్టుకుని పరిగెత్తుకు వస్తే ఆ పరిఘని ముక్కలు చేశాడు. అప్పుడిక క్రూరబాణాల్తో కర్ణుడతన్ని వేధిస్తుంటే సిగ్గూ లజ్జా లేకుండా పరిగెత్తి పారిపోసాగాడు నకులుడు. ఐతే కర్ణుడతన్ని వదలక వెంటబడి తన వింటి తాటిని అతని మెడకి వేసి లాగుతూ కుంతికిచ్చిన మాట ప్రకారం చంపకుండా తిట్టి పంపించాడు. నకులుడు లజ్జతో తలవంచుకుని వెళ్లి ధర్మరాజు రథం ఎక్కాడు.

కర్ణుడు పాంచాలబలాల మీద దూకి వాటిని పంచబంగాళం చేశాడు. మరోవంక పాండవుల పక్షాన చేరిన నీ కొడుకు యుయుత్సుడు పర్వతం లాటి ఉలూకుడితో తలపడ్డాడు. ఉలూకుడతని వింటిని విరిస్తే యుయుత్సుడింకో గట్టివిల్లు తీసుకుని అరవైనాలుగమ్ముల్తో అతన్ని కొట్టి పదమూడు సాయకాల్తో అతని సారథిని నొప్పించి అతివేగంగా అతని మీద పదునైన బాణాల్ని ప్రయోగించాడు. దాంతో కోపించి ఉలూకుడు ఇరవై శిలీముఖాలతని శరీరాన నాటి కేతనాన్ని విరిచాడు. నీకొడుకు ఐదు విశిఖాల్ని అతని రొమ్మున నాటాడు. అవతన్ని బాగా బాధించినయ్. దాంతో అతను వేషం దాల్చిన రోషంలా ఓ భల్లంతో సూతుణ్ణి, నాలుగు బాణాల్తో గుర్రాల్ని చంపి, ఐదు పదునెక్కిన బాణాల్తో అతని కవచాన్ని చించితే అందరూ చూస్తుండగా నీకొడుకు పారిపోయి మరో రథం ఎక్కాడు. ఆ గెలుపుతో ఇంకా విజృంభించి ఉలూకుడు పాంచాలబలాల మీదికి దూకాడు.

ఇలా వుండగా కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుడితో తలపడ్డాడు. ద్రోణవధకి ప్రతీకారంగా ధృష్టద్యుమ్నుడి చావు చూడకుండా వదలడని అందరూ కుతూహలంగా వాళ్ల యుద్ధం చూస్తున్నారు. కృపుడు మహోగ్రంగా పటిష్టమైన బాణాల్తో అతని గుర్రాల్ని, సారథిని నొప్పించి అతని శరీరాన్ని రక్తసిక్తం చేశాడు. అతని సారథి ధృష్టద్యుమ్నుడికి “ఇప్పుడితనితో యుద్ధం నీవల్ల అయే పని కాదు. ఇతను అవధ్యుడు కూడ. నీ బాణాలేవీ ఇతని మీద పనిచెయ్యటం లేదు. కనక ఇప్పటికి మనం ఇక్కణ్ణుంచి తప్పుకోవటమే మంచిది” అని సలహా ఇస్తే ధృష్టద్యుమ్నుడు కూడ “నిజమే, నా కాళ్లూ చేతులూ వణుకుతున్నయ్, ఒళ్లు తూలుతున్నది, మనసు పరిపరి విధాల పోతున్నది. అర్జునుడో భీముడో దగ్గర్లో వుంటే వాళ్ల దగ్గరికి మనరథం మళ్లించు” అన్నాడు చిన్న గొంతుతో. సారథి వెంటనే రథాన్ని అతివేగంగా భీముడి దగ్గరికి తోలాడు. ఐనా వదలకుండా వెంటపడి బాణాలేస్తూ తరిమాడు కృపుడు.

మరోచోట కృతవర్మతో యుద్ధం చేస్తున్న శిఖండికి కూడ అలాటి అనుభవమే ఎదురయ్యింది. శిఖండి రథాన్ని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ ఎంతో సాహసంగా పోరినా కృతవర్మ అతని ఒళ్లంతా రక్తం కారేలా నానాశరాల్తో బాధించి ఉగ్రనారాచాల్ని వేసి అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. అతని సారథి రథాన్ని తోలుకుని పారిపోయాడు. అతనితో పాటే వాళ్ల సేనంతా చెల్లాచెదురైంది.

శిబి, త్రిగర్త, సాల్వ, సంశప్తక సైన్యాలు ఎంత నష్టం జరుగుతున్నా వెనక్కి తిరక్కుండా అర్జునుడితో పోరాడుతున్నయ్. సుశర్మ, అతని తమ్ములు, కొడుకులు ఒకేసారి అర్జునుడితో తలపడ్డారు. సత్యసేనుడు మూడు సాయకాలు, మిత్రదేవుడు ఆరు మార్గణాలు, చంద్రదేవుడు మూడు క్రూరబాణాలు, మిత్రవర్ముడు ఏడు శరాలు, సౌశ్రుతి డెబ్బైమూడు కంకపత్రాలు, శత్రుంజయుడు ఏడు విశిఖాలు, సుశర్మ ఇరవై కాండాలు ఒక్కసారిగా ప్రయోగించారు. అర్జునుడు చెక్కుచెదరకుండా నిలబడి అందర్నీ అనేక ఆయుధాల్తో ఎదుర్కుని శత్రుంజయుణ్ణి చంపి సౌశ్రుతిని బాగా గాయపరిచాడు. ఇంతలో సత్యసేనుడు బలంగా విసిరిన తోమరం కృష్ణుడి భుజానికి తగిలి అతని చేతి మునికోల నేల మీద, పగ్గాలు నొగల్లో పడినయ్. అర్జునుడు “వాడి రథం దగ్గరకి వెళ్దాం పద” అంటే కృష్ణుడు మరో మునికోల తీసుకుని వేగంగా అక్కడికి నడిపాడు. పదునైన అనేక భల్లాలు ప్రయోగించి వాణ్ణి చిత్రవధ చేశాడు అర్జునుడు. మిత్రవర్ముణ్ణి, వాడి సారథిని నేలకూల్చాడు. ఐనా సుశర్మ దాయాదులు వెనక్కి తగ్గకుండా పోరారు. అర్జునుడప్పుడు ఇంద్రాస్త్రం ప్రయోగిస్తే దాన్నుంచి అనేక భల్లాలు, అంజలికాలు మొదలైన ఆయుధాలు వచ్చి సంశప్తక సేనల్ని మట్టుబెట్టినయ్. ఆ ప్రదేశమంతా పీనుగుపెంటల్తో నిండిపోయింది. అర్జున శరాగ్నిలో మిడతల్లా మాడిన సంశప్తక సేనల్లో మిగిలిన కొద్దిమంది దిక్కుకొకరుగా పారిపోయారు. పొగ విడిచిన అగ్నిలా అతను ప్రకాశించాడు.

దుర్యోధనుడు ధర్మరాజుని ఎదుర్కుని తొమ్మిది సాయకాలు అతని శరీరానికి గుచ్చి సారథినొక తీవ్రబాణాన కొడితే కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ ధర్మరాజు పదమూడు బాణాల్తో దుర్యోధనుణ్ణి నొప్పించాడు. వెంటవెంటనే నాలుగు శరాల్తో గుర్రాల్ని చంపి, ఐదో బాణంతో సూతుణ్ణి, ఆరో బాణంతో కేతనాన్ని, ఏడో దాంతో ధనుస్సుని, ఎనిమిదో బాణంతో దుర్యోధనుడెత్తిన కత్తిని తునకలు చేశాడు. పన్లో పనిగా ఐదు వాలిక నారసాల్ని అతని వక్షాన నాటితే భయపడి దుర్యోధనుడు రథం మీంచి దూకేశాడు. అతని పరిస్థితి చూసి పరుగున వచ్చి అశ్వత్థామ, కర్ణ, కృపులు అతని చుట్టూ చేరారు. అది చూసి ఆ వైపునుంచి పాండవులు హుటాహుటిన అన్నకి సాయంగా వచ్చారు.

ఇలా మధ్యాన్న సమయానికి దొరలంతా ఒక్కచోట చేరారు. ఇరు పక్షాలకి రౌద్రంగా రణం జరిగింది. ఏనుగుల దంతాల్లో చిక్కుకున్న గుర్రాలు, గుర్రాల కాళ్ల కింద నలిగిన బంట్లు, ఒరుసుకుని ముక్కలైన రథాలు, రథచక్రాల కింద పడి మడిసిన రథికులు – ఇలా రణరంగం పీనుగుపెంటల్తో, నెత్తురు కాలవల్తో, అవయవాల గుట్టల్తో నిండిపోయింది. విరథుడైన దుర్యోధనుడు కూడ రణభూమిని విడవకుండా మరో రథం కూర్చుకుని తన సారథిని ధర్మరాజు మీదికి పోనివ్వమన్నాడు. అలాగే అతని రాకని చూసిన ధర్మరాజు తన రథాన్ని దుర్యోధనుడి వైపుకి తిప్పమని తన సారథికి చెప్పాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి యుద్ధం కొనసాగించారు. నీకొడుకు ధర్మజుడి వింటిని విరిచాడు, అతను వేగంగా ఇంకో విల్లు తీసుకుని దుర్యోధనుడి విల్లు తుంచాడు. దుర్యోధనుడు మరో వింటితో బాణాలేశాడు. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. దుర్యోధనుడొక ఘోరశక్తిని వేస్తే ధర్మరాజు దాన్ని మధ్యలో తుంచి ఐదు పదునైన బాణాల్తో నీకొడుకు వక్షాన్ని కొట్టాడు. దుర్యోధనుడు తొమ్మిది భల్లాలు వేశాడు. ధర్మరాజు కోపోద్రేకంతో పిడుగు లాటి శిలీముఖంతో దెబ్బతీశాడు. దుర్యోధనుడు గద తీసుకుని ఈ యుద్ధం ఇప్పుడే మానిపిస్తానని కిందికి దూకితే ధర్మరాజు ఏమీ కంగారు పడకుండా ఒక ఉగ్రశక్తితో అతని రొమ్ముని మోదితే నీకొడుకు తిరిగి రథం ఎక్కాడు. ఐతే ధర్మరాజు కొట్టిన దెబ్బకి రక్తం చిమ్ముతుంటే అతను నిలబడలేక మూర్ఛపడ్డాడు.

కృతవర్మ వేగంగా వచ్చి దుర్యోధనుడికి అడ్డంగా నిలిచాడు. భీముడతనితో తలపడితే కృతవర్మకి సాయంగా మనబలాలు పోగయినయ్. అదే అదునుగా అర్జునుడు మనబలాల్ని చేతుల తీట తీరేట్టు చెండాడుకున్నాడు. ఇంతలో దుర్యోధనుడు తెప్పరిల్లి లేచి అర్జునుడితో తలపడ్డాడు. అర్జును డతివేగంగా అతని జెండాని, గుర్రాల్ని, సూతుణ్ణి, వింటిని ముక్కలు చేశాడు. అతని ప్రాణాలు తీసే ఒక శక్తివంతమైన బాణాన్నీ వేశాడు. ఐతే దాన్ని అశ్వత్థామ మధ్యలోనే ఆరుబాణాల్తో పొడి చేశాడు. అర్జునుడు అశ్వత్థామ వింటిని విరిచి గుర్రాల్ని చంపి అడ్డొస్తున్న కృపుడి వింటిని కూడ పనిలో పనిగా నరికాడు. కృతవర్మ వచ్చి తాకితే అతని గుర్రాల్ని, కేతనాన్ని, వింటిని రూపు మాపాడు. ఎదుర్కోబోయిన దుశ్శాసనుడి విల్లు కూడ రెండు ముక్కలు చేసి గాండీవ గుణధ్వనితో దిక్కులు మారుమోగుతుంటే కర్ణుడి మీదికి కాలుదువ్వాడు.

అర్జునుణ్ణి మూడు, కృష్ణుణ్ణి ఇరవై బాణాల్తో భేదించి మరో మూడు బాణాలు అర్జునుడి మీద వేశాడు కర్ణుడు. అంతకుముందు వరకు కర్ణుడితో పోరుతున్న సాత్యకి వచ్చి అర్జునుడికి అడ్డుపడి తొంభై శరాలు, తొమ్మిది మార్గణాలు, వంద శిలీముఖాలు కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడతని రథం, సారథి, గుర్రాలు, జెండా – అన్నిటినీ అస్త్రవర్షంలో ముంచెత్తాడు. యుధామన్యుడు, శిఖండి, ఉత్తమౌజుడు, ద్రౌపదేయులు, యుయుత్సుడు, కవలు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ప్రభద్రక, చేది, కరూశ, మత్స్య, కేకయ, వత్స సేనల్తో కలిసి వచ్చి కర్ణుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు సమరోల్లాసంతో ఆ సైన్యాల్ని చెల్లాచెదురు చేసి తన ధనుర్గుణ ధ్వని రోదసి నిండేట్టు విజృంభించాడు.

అదిచూసి అసూయ పడ్డాడు అర్జునుడు. అతనికి సమానంగా మన సేనల్ని ముప్పుతిప్పలు పెట్టి గాండీవం పదునెంతో చూపించాడు.

సూర్యుడు పశ్చిమాద్రికి చేరాడు. దుమ్మూ ధూళీ కలిసి అంధకారం అలుముకుంది. పాండవబలాలు తరుముతున్నా మన వాళ్లు యుద్ధం ఆపి వెనక్కి తిరిగారు. మన బలగాల్ని హేళన చేస్తూ పాండవబలాలు వెనక్కి మళ్లినయ్.

అంతవరకు విని ధృతరాష్ట్రుడు “అర్జునుడు తల్చుకుంటే మిమ్మల్నందర్నీ చంపగలడనేది తేటతెల్లమైపోయింది. ఐతే అతన్నెదిరించటం యముడు, అగ్ని లాటి వాళ్లకే సాధ్యం కాదు, వీళ్లని అనుకోవటానికేముంది? యాదవవీరులందర్నీ అవలీలగా ఓడించి సుభద్రని తెచ్చుకున్నాడు. వినోదప్రాయంగా అగ్నికి ఖాండవ వనాన్ని ఇప్పించాడు. శబరవేషంలో వచ్చిన శివుడినే పోరాడి మెప్పించాడు. గంధర్వుల చెరనుంచి దుర్యోధనుణ్ణి విడిపించాడు. కాలకేయాది రాక్షసుల్ని కాలుడి దగ్గరికి పంపాడు. అలాటి అర్జునుడి చేతిలో మనవాళ్లు ఓడిపోయారంటే దాన్లో ఆశ్చర్యం ఏముంది? అసలతని ఎదురుగా నిలబడి పోరాడారు, అదే గొప్ప విషయం” అని విశ్లేషించాడు. సంజయుడు యుద్ధవృత్తాంతాన్ని కొనసాగించాడు.

అలా శిబిరాలకి తిరిగి వెళ్లిన మనవాళ్లు అర్జునుడి పరాక్రమాన్ని తల్చుకుని నీరుగారి పోయారు. పాలిపోయిన మొహాల్తో దీనంగా దిక్కులు చూడసాగారు. అప్పుడు కర్ణుడు “అర్జునుడు మొనగాడు, నిజమే. అతనికి ఏవన్నా తెలియకపోతే బోధించటానికి పక్కనే కృష్ణుడు కూడ వున్నాడు. ఇంద్రుడిచ్చిన ఘనశక్తిని నేను ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి అర్జునుణ్ణి ఎలా రక్షించుకున్నాడో మనందరం విన్నాం, చూశాం. ఐనా ఏమీ భయం అక్కర్లేదు. రేపు నేను నా ప్రతాపం చూపిస్తా. అర్జునుడి అంతం చూస్తా. నీకిక ‘పగ ‘ అనేది లేకుండా చేస్తా” అని దుర్యోధనుడితో చెప్పాడు. నీకొడుకు తృప్తి పడ్డాడు. అందరూ వారి వారి మందిరాలకి వెళ్లారు.

No comments:

Post a Comment