Sunday, 21 January 2018

వివాహం





రాక్షస వివాహాలు

రఘువంశంలో కాళిదాసు చెప్పిన ‘సంచారిణీ దీప శిఖేవ’ శ్లోకం సుప్రసిద్ధమైనది.  ఇందుమతీ దేవి స్వయంవరం జరుగుతోంది, అనేక మంది రాజులూ, రాకుమారులూ ఆమెను దక్కించుకోవాలనే ఆశతో విచ్చేశారు స్వయంవరానికి. నిర్ణీత సమయానికి  నెచ్చెలి సునంద వెంటరాగా వరమాలను చేత ధరించి ఇందుమతీ దేవి ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది. సునంద ఆ రాజును గురించి అమెకు పరిచయం చేస్తుంటే ఒక్క క్షణం ఆతని ముఖాన్ని పరకాయించి చూస్తున్నది. ఆ క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది – “ ఇందుమతి నన్నే చూస్తోంది! ఇక మాల మెడలో పడడమే తరువాయి” అన్న ఊహ అతని ముఖాన్ని దీప్తిమంతం చేస్తున్నది. అంతలో ఇందుమతి  ముందుకు వెళ్ళి పోతుంది. చివరికి ఇందుమతి అజ మహారాజును వరించింది. ఆ సన్నివేశంలో ఆ రాకుమారినీ, ఆయా రాజవంశీయులనూ కవి కాళిదాసు ఇలా వర్ణించాడు:

 “సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం సస భూమిపాల”

- ఆ స్వయంవర సభలో ఇందుమతి నడుస్తున్న దీపశిఖలా ఉందట. చీకట్లో రాజవీధిలో ఓ దీపశిఖ నడిచిపోతూ వుంటే ఒక్కో రాజభవనపు గుమ్మం, జ్వాల దగ్గరవుతున్నకొద్దీ ప్రకాశమానమవుతూ, జ్వాల దాటి పోగానే చీకట్లో మునిగిపోతున్నట్లుగా ఒక్కో రాజు ముఖం ఇందుమతి సమీపిస్తూ ఉంటే ప్రకాశిస్తూ, తనను దాటిపోతుంటే నల్లబడిపోతోంది.

వీధులను రాత్రిపూట కాంతివంతంగా ఉంచడానికి నాటి కాలంలో దివితీలను పట్టుకొని పహారా కాచేవారు. ఆ పనిచేసే వారు దివిటీ పట్టి నడిచిపోతున్నప్పుడు అతను ఏ ఇంటిముందు ఉంటే ఆ ఇల్లు దివిటీ కాంతికి ప్రకాశవంతంగా కనబడేది. ఆ యింటిని ఆ వ్యక్తి దాటి వెళ్లి పోయేక తిరిగి ప్రకాశ హీనమయ్యేది.

ఎంతగా దీన్ని మనసులో ఉంచుకున్నాడో, మహాకవి కాళిదాసు గారు, ఈ విషయాన్ని పై శ్లోకం లో రాకుమారి ఇందుమతిని దీపశిఖ గాను, వెలిగి ఆరిపోతున్న ఇండ్లను ఆమె తమను దాటి వెళ్లిపోతుంటే వివర్ణమవుతున్న రాజుల ముఖాలతోనూ పోల్చి చెప్పాడు - ఎంతైనా ఉపమాలంకారానికి పేరుగాంచిన కవి కదా కాళిదాసు! ఈ ఉపమానం చెప్పడం వలన ఆయన్ని 'దీపశిఖా కాళిదాసు' అనేవారట! ఈ శ్లోకం ఉన్న కావ్యం రఘువంశం.

పూర్వం రాకుమార్తెలు అలా తమ భర్తలను తామే ఎంపిక చేసుకొనేవారు. కూతురు ఎంచుకొన్న వరుడితో ప్రభువులు- భాగవతంలో పోతన చెప్పినట్లు, ‘కన్యన్‌ చేకొన ఇన్ని లోకముల నీకన్నన్‌ ఘనుండైన రాజన్యుండెవ్వడు? నీ గుణంబులకును ఆశ్చర్యంబునుంబొంది...’ నిన్ను కోరుకొంది- అంటూ ఆయనకు ఇచ్చి పెళ్లి జరిపించేవారు. దేశదేశాల యువరాజుల్లో బాగా నచ్చినవారిని తామే స్వయంగా వరించే ఆ ప్రక్రియను ‘స్వయంవరం’ అనేవారు. కాళింది మాత్రం అర్జునుణ్ని మధ్యవర్తిగా పెట్టుకొంది. ‘విష్ణుం ప్రభున్‌ వరుగా గోరి తపంబు సేయుదు పరున్‌ వాంఛింప’ అని చెప్పి ఆయన సాయంతో కృష్ణుణ్ని పెళ్లాడింది. నూతిలో పడి ఉన్న దేవయానికి యయాతి కుడిచేతిని అందించి పైకి లాగాడు. ‘ఇది దేవుడి సంకల్పం... నువ్వే నా భర్తవి’ అంది దేవయాని. కారణమూ చెప్పింది. ‘నను పాణిగ్రహణంబు చేసితి కదా! నా భర్తవున్నీవ! దైవ నియోగంబిది’ అనేసి తన నిశ్చయాన్ని ప్రకటించింది. పూర్వం స్వేచ్ఛగా అమ్మాయిలిలా వలచి వరించి, అవసరం అయితే, ‘రాక్షస వివాహమునన్‌ భవదీయ శౌర్యమే ఉంకువ (కన్యాశుల్కం లేదా ఓలి) చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్‌’ అని రుక్మిణి మాదిరిగా ధైర్యంగా వర్తమానాలు పంపేవారు. ఎంత మంచికాలం అది!

అద్భుతం అనే భావాన్ని ఒక్క అక్షరంలో చెబితే అది- స్త్రీ.
ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతం చేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్లి.
మూడుముళ్లతో బలపడే బంధాన్ని మూడు అక్షరాల్లో పలికితే అది దాంపత్యం!
దాంపత్య జీవితంలో స్త్రీ అనే వీణను ప్రేమగా శ్రుతిచేసే విద్వాంసుడి నాలుగక్షరాల పేరు- పురుషుడు.
వారిద్దరి ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట- ఆలుమగలు

ఆడ, మగలను ఆలుమగల్ని చేసే ఆరక్షరాల తంతు- వివాహ ప్రక్రియ.
భార్యాభర్తలు తలకెత్తుకొనే సామాజిక బాధ్యతకు ఏడక్షరాల పేరు- గృహస్థాశ్రమ ధర్మం.
ఇది సప్తపది. వేద విధి.
ఏడు అంచెల మాంగల్య మహా సూత్రమిది.

యుక్తవయసు రాగానే పిల్లవాణ్ని పిలిచి ‘చదివితివి ఎల్ల శాస్త్రములు... వివాహ యోగమగు నట్టిది గాన కళత్రమున్‌(భార్యను) వరింపదగు, మఖ క్రియల్‌(యాగాలు) పొనరుపందగు పుత్రుల గాంచగా దగున్‌’ అని పెద్దలు చెప్పాలన్నారు దేవీభాగవతంలో తిరుపతి వేంకటకవులు. పితృరుణం అంటే అదే.

‘ముదమలరన్‌ మమున్‌ రుణవిముక్తుల చేయదగుం కుమారకా’ అంటూ గృహస్థాశ్రమ ధర్మ పరమావధిని వారు లోకానికి బోధించారు.

‘పెండ్లియన వినోద విక్షేపమా... కాదు, దీర్ఘ సత్రయాగ దివ్యదీక్ష’ అన్నది పెద్దల నిర్దేశం. దాన్ని అండగా చేసుకొని దంపతులు నిండుగా జీవితాన్ని పండించుకోవడమే పెళ్లికి పరమార్థం.

‘కలదు విశిష్ట అద్వైతము, కలదు అద్వైత సుషమైక కైవల్యమ్ముల్‌, కలదు కదద్వైతమును... మతత్రయమును మన దాంపత్యములో’ అన్న నండూరి రామకృష్ణమాచార్యుల మాట ఏ జంట జీవనయానంలో నిజమవుతుందో- వారి జన్మ ధన్యం!

‘ఓ సుకుమారతా ప్రియ మహోదయ శేఖర, స్వీకరింపుమా, నా సుహృద అంతరంగ సుమన శ్శుభ శోభన ధన్యవాదముల్‌’ అన్నట్లుగా ఉండాలట నూతన దంపతుల హృదయ స్పందన. వేదం అదే చెప్పింది.

‘సఖా సప్తపదాభవ...’ నా స్నేహితురాలివి కా, ‘సంప్రియారోచిష్ణూ! చిరకాలం ప్రేయసీ ప్రియులుగా గడుపుదాం’ అని వధూవరుల చేత సప్తపది మంత్రాల్లో వాగ్దానం చేయిస్తుంది.

వివాహం అనే మాటకు- వి, వహనం, బాధ్యతలను విశేషంగా వహించడం అని అర్థం. ఉత్తమ రీతిలో వహించడం అనే అర్థంలో ఉద్వాహం అనీ అంటారు. ‘తలపులందు, బ్రతుకు మలుపులందు ధర్మ నిర్వహణమె దాంపత్యమునకు ఆత్మ!’ అన్నారు కవులు.

బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం... అనే ఎనిమిది రకాల వివాహాలను చెప్పాయి ధర్మశాస్త్రాలు. వాటిలో చివరిది నీచతమం. నిద్రిస్తున్న లేక మైకంలో ఏమరుపాటుగా ఉన్న స్త్రీని బలవంతంగా ఎత్తుకురావడం పైశాచికం. కనుక ‘పైశాచశ్చ అష్టమో అధమః’ అన్నాడు మనువు.

బిహార్‌లో పెరిగిపోతున్న ‘పకడ్వా వివాహ్‌’ ప్రక్రియను మనం ఆ ఎనిమిదో బాపతుగా చెప్పవచ్చు. పెళ్లికాని కుర్రాడు కనపడితే తలకు తుపాకీ గురిపెట్టి ఎత్తుకెళ్లిపోయి, ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ముక్కూ మొహం తెలియని అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించడం అక్కడి ఆచారం.

‘ఇది వలపొ జన్మజన్మాలను అదుము సౌహృదమ్మొ, లోన ఆత్మల పిల్పు దాచుకున్న పుణ్యమో’ అని భావకవులు పలవరించేవేవీ అక్కడ చెల్లుబాటు కావు.

‘ప్రణయినీ ప్రసూనాంగ సంస్పర్శ తగిలి తగులని విధాన కలిగినంతనె అనంత దివ్యరాగ స్రవంతిలో తేలిపోదు’ అని నాయని సుబ్బారావు చెప్పిన మధురానుభూతులతో ప్రమేయమే లేదు.

పైపెచ్చు భోరున ఏడుస్తూ తాళి కడుతుండే ఆ అబ్బాయికి ‘ప్రతి మంచి పెళ్లీ కన్నీళ్లతోనే మొదలవుతుంది’ అని బిహారీలు తరచుగా నచ్చజెబుతుంటారట.

‘రుక్మి కృష్ణుని ఎడ చాల విరోధము చేసి మత్త పుష్పంధయవేణి(రుక్మిణి) నిత్తు శిశుపాలునికి’ అని మూర్ఖంగా ఆలోచించినప్పుడు రుక్మిణి ఎంతగా బాధపడిందో అనిపిస్తుంది ఇది వింటుంటే.

‘వీనుదోయికెట్లు వినిపించు చప్పట్లు చేరకుండ రెండు చేతులు ఎలమి’ అన్నట్లు రెండు మనసులూ ఏకం కాకపోతే దిక్కేమిటన్నది ఇక్కడి ప్రశ్న!




No comments:

Post a Comment