Monday, 15 January 2018

ఉద్దవ గీత





మహాభారతం – విశేషములు

ఉద్దవుడు శ్రీకృష్ణునికి బాల్యమిత్రుడు. శ్రీకృష్ణుడు ఉద్దవుని చాలా సార్లు ఒంటరి ప్రదేశంలో ధ్యానము కొనసాగించి జ్ఞానసిద్ధి పొందమని ప్రభోదించాడు. కాని, ఎదురుగా పరబ్రహ్మమును పెట్టుకుని ఎక్కడో అరణ్యములో ధ్యానము చెయ్యడమేమిటని ఉద్దవుడు శ్రీకృష్ణభగవానుని మాట వినలేదు. 

"ఉద్దవా! నా తత్వమును ఈ ఒక్క శరీరానికే పరిమితము చేస్తే, శ్రీ కృష్ణ తత్వము నీకు బోధపడదు. చెప్పిన మాట విని ధ్యానము చెయ్యి." అని బాల్యమిత్రునికి తిరిగి చెప్పాడు. 

అయినా ఉద్దవుడు శ్రీకృష్ణుని విడవక సేవిస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఉద్ధవుడు "స్వామి నా సంగతి ఏమిటి" అని మన స్వామిని అడుగుతాడు. 

"నీసంగతి నువ్వే చూచుకోవాలి అని చాలా సార్లు చెప్పాను. అయినా నువ్వు వినలేదు." అంటాడు స్వామి. 

"స్వామి మనది 100 సంవత్సరాల పైగా ఉన్న స్నేహము. అది వృధాయేనా ? " అని ఉద్ధవుడు బాధపడతాడు. 

బాల్యమిత్రుని ఉద్దరించడానికి మన స్వామి ఆయనకు చేసిన జ్ఞానబోధయే "ఉద్దవ గీత" గా ప్రసిద్ధి చెందినది. 

ఆ బోధచేసి ఉద్ధవునితో "నీవు బదరీకాశ్రమము వెళ్ళి, అక్కడ తపస్సు చేసి జ్ఞానము పొందు" అని అదేశిస్తాడు. 

అప్పుడు అక్కడే ఉన్న మైత్రేయ మహర్షి కూడా ఉద్దవ గీత విన్నాడు. 

స్వామి ఆయనను అడిగాడు "మహర్షి ఈ బోధ విన్నారుగా! అర్ధమయ్యింది కదా!" 
మైత్రేయ మహర్షి "స్వామి! మీరు ఉద్ధవునికదా బోధ చేసింది, నాకు కాదు కదా! అయినా జగదాచార్యుల బోధ పూర్తిగా అర్ధం చేసుకున్నాను" అని మైత్రేయుడు చెబుతే, 

"మహర్షి! ఈ బోధ మీరు ఇతరులకు అందించండి. విదురుడు నా దగ్గర ఉపదేశం కోసం బయలుదేరాడు. కాని ఆయనకు సందేహం వచ్చింది. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దగ్గర ఉపదేశం పొందే అర్హత నాకు ఉన్నదా? అన్న అనుమానం వచ్చి మరింత పరిపక్వతకొరకు తపస్సు చేస్తున్నాడు. విదురుడు మిమ్ములను ప్రభాస తీర్ధములో కలుస్తాడు. అప్పుడు ఆయనకు మీరు ఈ బోధ అందించండి." 

ప్రభాస తీర్ధములో విదురునితో "నాయనా అందరూ నిర్యాణసమయములో స్వామిని తలుస్తూంటే, ఆ స్వామి తన నిర్యాణ సమయములో నిన్ను తలచి, నీకు ఈ బోధ చెయ్యమని ఆదేశించాడు. నీతోపాటు నన్ను ధన్యుడిని చేశావు" అని విదురునికి ఉద్ధవగీత బోధ చేస్తాడు.

ఇది ఉద్ధవగీత సంబంధించిన వృత్తాంతము.



కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఎందుకు కష్టపడ్డారు?

కృష్ణ : నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది, ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమి అడగలేదు, ఏమైనా ఉంటె అడుగు మళ్ళీ దొరకను.

ఉద్దవ : కృష్ణా నాకు ఎటువంటి కోరికలు లేవు కాని కొన్ని సందేహాలు ఉన్నాయి, అనుమతిస్తే నివృత్తి చేసుకుంటాను.
కృష్ణ : తప్పకుండా మిత్రమా, అడుగు…

ఉద్దవ : నిజమైన స్నేహితుడు అంటే ఎవరు ?
కృష్ణ : నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నీ పిలుపు కోసం ఎదురుచూడకుండా వచ్చి సాయం చేసేవాడు.

ఉద్దవ : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?


కృష్ణ : ఉద్దవా! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధనమన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటె రాకుండా ఉంటానా.

ఉద్దవ : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?


కృష్ణ : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మ ని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీది గమనిస్తూ ఉంటాను.

ఉద్దవ : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?


కృష్ణ : ఉద్దవా! నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి, నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.

కృష్ణుడు ఏది వూరికే చేయడు, మన పక్కనే ఉంటాడు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు మన లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతుందన్నమాట. భారతంలో అర్జునిడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానం భగవద్గీత అయితే, భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్ధవగీత(హంస గీత)గా ఉంది.



No comments:

Post a Comment