Saturday, 21 April 2018

శిబి చక్రవర్తి


Sun,February 11, 2018 12:44 AM
నుష్యత్వం అనేది ప్రపంచ పరిభాషలో ఒకనొక జీవికి, లోకంలోని అన్యప్రాణులకంటే భిన్నమైన దానికీ వర్తించే తత్వం మాత్రమే కాదు. ఆలోచన, వివేకం, విచక్షణ, ప్రేమ, భావ ప్రకటన, అపారమైన మేధస్సు, కొండలనైనా పిండిచేయగల శక్తి, సాహసం, మధురవాక్కు, సహృదయం, గంభీరమైన దేహం తనకు స్థానమిచ్చిన ప్రపంచానికి రూపమిచ్చే అద్భుతం మనిషి. అటువంటి మనిషి తన తత్వమైన మానవత్వాన్ని వ్యక్తీకరించుకునే క్రమంలో తనతోపాటు భూప్రపంచంలో బతికే సకల జీవరాశినీ, ప్రకృతినీ ప్రేమించే గుణాన్నీ, సత్యసంధతనూ ఆసరా చేసుకున్నాడు. మానవత్వాన్ని ఆపాదించుకున్న మనం మన బతుకుకోసం ప్రపంచ సంపదను వినియోగించుకోవడమే కాదు. మన వంతు కర్తవ్యంగా సత్యవిప్లవాన్ని ఆసరా చేసుకొని ప్రపంచ మనగడకు చేయూతనివ్వాలని ఎందరో మహనీయులు తమ జీవితమే అద్దంలా చూపించారు. ఆ పారదర్శకత సత్య విప్లవమై విజృంభిస్తేనే మానవత్వం మంటగలిసిపోదనే విషయాన్ని శిబిచక్రవర్తి నిరూపించాడు. సత్యసంధతను తనలో భాగం చేసుకున్న శిబి మానవతకు అసలైన అర్థం చెప్పాడు.
sibhi-chakravarthy
-ఇట్టేడు అర్కనందనా దేవి

ఉశీనరదేశానికి అధిపతి అయిన ఉశీనరుని పుత్రుడే శిబి. ఈతని తల్లి మాధవి. శిబి అసలు పేరు అరిందుడు. ఏడు దీవుల విస్తీర్ణం కల మహారాజ్యం శిబిచక్రవర్తిది. ఏడుదీవులలో కూడా శత్రువనే మాటే ఎరుగని మహోన్నతుడు శిబి.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటేనే రాజ్యం సమర్థంగా నిర్వహించబడుతుందనీ ప్రతీ ప్రాణికీ తమ జీవితంపై సంపూర్ణమైన హక్కుంటుందనీ శిబి నమ్మిన సిద్ధాంతాలు. జీవం ఉన్న ప్రతీ దాన్ని ప్రేమించాలనీ కారుణ్యం చూపించాలనీ, ఆదరించాలనీ చెప్పే శిబి తన జీవితకాల పర్యంతం ఆచరించి చూపించాడు.
శిబి గుణంలోనే ఉన్నతత్వం ఉంది. ఆలోచన పరిపక్వతకు రూపమైంది. అందుకేనేమో దేవతలూ మెచ్చి శిబికి అక్షయ ధనాన్నిచ్చారు. శిబి చక్రవర్తి నమ్మిన, ఆచరించిన సత్యవిప్లవం ఎంతగా విస్తరించిందంటే కలలో కూడా అసత్యపు తలంపు రానంత. సత్యం మరుగున పడిపోయినా మాట మరుగైపోదు. అందుకే ఆడినమాట తప్పని నిజాయితీ శరణాగత రక్షణ, సత్యసంధత శిబి చక్రవర్తి ప్రతిరూపాలుగా నిలిచాయి.

గొప్పవారి ఆలోచనలు వారివరకే పరిమితం అయితే ఆదర్శమనే మాటకు అర్థం ఉండదన్నట్లు ఇంద్రాగ్నులు ఇద్దరూ శిబి చక్రవర్తిని పరీక్షించడమనే నెపంతో, శిబి చరిత్రను జగతికి తెలియజెప్పేందుకు డేగ, పావురం రూపాలు ధరించి పావురాన్ని డేగ తినడానికని తరుముకుంటూ శిబి చక్రవర్తి సభలోకి చేరుతాయి. డేగ పావురాన్ని వెంబడిస్తుంటే పావురం కాస్త వేగంగా శిబి చెంతకు చేరి అభయమివ్వమని అడుగుతుంది. నన్ను ఆశ్రయించిన నీ కోసం ఎంత దూరమైనా వెళతానని మాట ఇస్తాడు. ఇంతలో డేగ పావురాన్ని తరుముతూ దాని రెక్కలు విరిగిపడిన ఆనవాళ్ళతో శిబి చక్రవర్తి సభకు చేరుకుంటుంది. శిబిని శరణు పొందిన పావురం తన ఆహారం అనీ, దానిని తనకు దొరుకకుండా అడ్డుపడడం అన్యాయం అని అంటుంది డేగ.

డేగ మళ్ళీ మాట్లాడుతూ నీవు న్యాయ విదుడివి కదా! లోకధర్మం ప్రకారం పావురం నా ఆహారంగా మారడంలో ఎటువంటి అనుచితం లేదు. ఏది సరైందో నువ్వే న్యాయం చెప్పమని శిబిని కోరింది.



శిబి డేగతో పావురం నన్ను శరణుపొందింది. నీకు ఆహారం కావాలి కదా! ఆహారం కోసం ఇంకేదైనా అడుగు, నేను తక్షణం ఏర్పాటు చేస్తానంటాడు. డేగ సరే అయితే పావురం బరువుతో సమానమైన మాంసం నీ శరీరం నుంచి తీసి నాకివ్వమని అడుగుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరేనని అంగీకరించిన శిబి తూకంలో ఒకవైపు పావురాన్నుంచి మరోవైపు తన తొడనుంచి మాంసాన్ని కోసి సరిచూస్తాడు. ఎంత మాంసం వేసినా పావురం బరువే ఎక్కువగా కనిపిస్తుంది. చివరికి తనను తాను పూర్తిగా పావురం బరువుకు సరిచూస్తాడు. అతని ఉదాత్తతకు చలించిన ఇంద్రాగ్నులు పావురం, డేగ రూపాల నుంచి బయటికొచ్చి విషయం తెలియపరుస్తారు. శిబికి యథా శరీరాన్ని అనుగ్రహిస్తారు. శిబి స్థానంలో తామున్నా ఇంతటి సాహసం చేయబోమని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

శరణాగత రక్షణను సత్యసంధత సాక్షిగా పరిరక్షించే క్రమంలో తన్నుతాను సమర్పించుకునేంత గొప్పచరిత్ర లోకంలో శిబిచక్రవర్తికే దక్కింది. సత్యవిప్లవాన్ని ప్రచారం చేసే క్రమంలోనూ శిబి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనందంతో స్వీకరించాడే గానీ, ఏమాత్రం కలత చెందలేదు. కీర్తి ప్రతిష్టల కోసమో, రాజ్య విస్తరణ కోసమో కాక జీవితమంతా సత్య ప్రతిష్ఠాకర్తవ్యంతో బ్రతికిన శిబి చక్రవర్తి జీవితం ఆదర్శానికి పెద్దపీట వేసింది.

No comments:

Post a Comment