Thursday, 5 April 2018

ద్రౌపది - నిప్పుల్లో దొర్లిన ఒక స్త్రీ





ద్రౌపది
నిప్పుల్లో దొర్లిన ఒక స్త్రీ

పాండవుల మూర్తిమత్వంలో సందిగ్ధతలు, ద్వైధీభావాలు కనపడతాయి కాని ద్రౌపదిలో కానరావు. కఠిన పురుష ప్రపంచంలో ఒక ధిక్కారస్వరం ఆమె. స్వతంత్ర భావప్రకటనలో సీత మొదలు ఏ పౌరాణిక స్త్రీనీ ఆమెతో పోల్చలేం.

ఆమె కృష్ణ, పాంచాలి, యాజ్ఞసేని, ద్రౌపది. భారతీయ సాహిత్యంలో నాకిష్టమైన విశిష్టమైన స్త్రీ. సీత, సావిత్రి వంటి సాధ్వీ మణుల జాబితాలో ఆమెకు చోటు లేకపోవచ్చు. (మూడున్నర దశాబ్దాల ఈ రచయిత అధ్యాపక వృత్తిలో ఒకే ఒక్క విద్యార్థిని మాత్రమే ‘ద్రౌపది’ పేరుతో చేరింది.) కాని ఆ అందరికన్న ఆమె జీవితం చాలా కష్టమైనది, క్లిష్టమైనది. భర్తలు మొదలు సమాజం దాక అందరివల్ల ఆమెకు అన్యాయమే జరిగింది. ద్రౌపది పాత్ర భారతంతో ముగిసిపోయిందనుకోను. ఇప్పటికీ ఆమె ఆధునిక స్త్రీ గాయాల తో తన గాయాలను పోల్చి చూసుకుంటూనే ఉంది.

ఆమె పుట్టుకే ఒక మర్మం. ద్రోణుడిని వధించగల కొడుకు కావాలని గంగాతీరాన ఉన్న యాజోపయాజులచేత పుత్ర కామేష్టి జరిపించాడు ద్రుపదుడు. అగ్నిప్రసాదంతో యజ్ఞ కుండం నుంచి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది కూడా జన్మించారు. కనుక ద్రౌపది అయోనిజ. అగ్నిస్వభావం ఆమెలో అంతర్గర్భితమై ఉంది.

ఆనాటి రాజకుమార్తెలకు కాబోయే వరుడిని ఎన్నుకోవటంలో స్వయంవరం ఒక అవకాశం. అయితే ద్రౌపది విషయంలో అది జీవితకాలపు శాపమే అయ్యింది. ఆ సందర్భంలో కర్ణుడు మత్స్యయంత్రాన్ని భేదించే ప్రయత్నం చేశాడని, కాని ద్రౌపది ‘నేను సూతుడిని వరించను’ (‘నాహం వరయామి సూతమ్‌’) అన్నదని, దానితో కర్ణుడు విల్లు వదిలాడని ఒక కథ. అది సంశోధిత ప్రతుల్లో లేదు. ఆ అసంబద్ధ కథనాన్ని నన్నయ కూడా త్రోసిపుచ్చాడు. ఇలా ఆమె చుట్టూ ఎన్నో అబద్ధాలు అల్లుకొన్నాయి.

మత్స్యయంత్రాన్ని ఐదు బాణాలతో కొట్టిన అర్జునుడితో పాటు పాండవులు తల్లి వద్దకువచ్చి, ‘మేమొక్క భిక్ష తెచ్చితిమి’ అని చెప్పారు. ‘మీరేవురు నుపయోగింపుడు’ అన్నది కుంతి. పొరపాటు తెలుసుకొని, ‘నా మాట పూర్వం ఎప్పుడూ అనృతం కాలేదు, ఇదేమో లోకంలో లేని ఆచారం. ఇప్పుడేం చెయ్యాలి?’ అని మథనపడింది. పెద్దవాడుండగా చిన్నవాడు పెళ్లాడటం ధర్మవిరుద్ధం కాబట్టి ఆమెను ‘అగ్రమహిషి’గా స్వీకరించమని అర్జునుడు అన్నను కోరాడు. అలా అయితే ఆమె మన ఐదుగురికీ భార్య అవుతుందన్నాడు ధర్మరాజు. విషయం తెలిసి ద్రుపదుడు బాధపడుతుంటే వ్యాసుడు వచ్చి ద్రౌపది పూర్వజన్మ (ఇంద్రసేన) వృత్తాంతం వివరించాడు. పూర్వ జన్మలో ఆమె కామస్వభావంతో శివుడిని ‘పతిం దేహి’ అని ఐదుమార్లు కోరిందని, అందువల్ల మరుజన్మలో ఐదుగురు భర్తలు కలుగుతున్నారని, అందులో తప్పు లేదని వ్యాసుడి మాట. "ఎన్నిమార్లు కోరినా వరమిచ్చిన సర్వజ్ఞుడికి ఆ మాత్రం తెలియదా?" అనే ప్రశ్నని పక్కన బెట్టినా ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం కేవలం కల్పితమని తెలుస్తుంది. తెలుగు భారతంలో ఆ కథ లేదు. మూలంలోను సంశోధిత ప్రచురణలో లేదు. పాండవులందరికీ ద్రౌపది మీద కోరిక ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. కాని భారతంలో ఎక్కడా ద్రౌపది ప్రేమికురాలుగా తప్ప కాముకురాలుగా కనపడదు.

వివాహవృత్తాంతం అంతటిలో ద్రౌపది ప్రమేయం ఏమాత్రం లేదు. ఆమె ఇష్టానిష్టాలతో రవ్వంత నిమిత్తం లేకుండా ఆస్తిని పంచుకున్నట్టు ఆమెనీ పంచుకున్నారు. తండ్రి మొదలు తాళి కట్టే భర్త దాక ఎవ్వరూ ఆమె అభిప్రాయాన్ని అడగకపోవటం విచిత్రం. అదే సమయాన ద్రౌపది తన అభిప్రాయం తెలపటానికి కనీసం ప్రయత్నించలేదు. బహుశః అప్పటికి అది సమాజం స్థిరీకరించిన పురుషాధిపత్య విధానం అయ్యుండాలి. కనుకనే కాలక్రమంలో ఎన్నో విషయాల్లో ఆమోదిత విలువలకు భిన్నంగా స్వతంత్రాభిప్రాయాలు ప్రకటించిన ద్రౌపది అతి ముఖ్యమైన జీవితసందర్భంలో మౌనంగా ఉండిపోయింది.

జూదసభ ద్రౌపదిని జీవితాంతం వెన్నాడిన పీడ. అందులో ఒకానొక ప్రశ్న కూడా.
బ్రతుకంతా ఆమెకి సమాధానం దొరకలేదు. ఏకవస్త్రగా ఉన్న తనను నిండుసభలోకి ఈడ్చినప్పుడు, ‘నేను ధర్మవిజితనా? అధర్మ విజితనా? దాసినా? అదాసినా?’ అని ఆమె అడిగింది. ఏ యుగంలోనైనా ఎటువంటి తప్పుడు జూదగాడైనా ఆలిని పందెంగా పెట్టిన వాడున్నాడా అని ఆశ్చర్యపడింది. ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ - ఇదీ ఆమె ధర్మసూక్ష్మత. పురుష సమాజానికి వేసిన ఆ ప్రశ్నలో తెలివి, తెగువ - రెండూ ఉన్నాయి. భీష్ముడితో సహా ఎవ్వరూ నోరెత్తని సందర్భంలో ‘నేనిందు ధర్మనిర్ణయంబు సేసెద’నని ముందుకు వచ్చిన ధైర్యశాలి వికర్ణుడు. పాండవులందరికీ సాధారణ ధనమైన పాంచాలిని ధర్మరాజు ఒక్కడే పణంగా పెట్టాడు కనుక ‘ద్రౌపది అధర్మ విజిత, అక్కోమలి నేకవస్త్రనిట దోడ్కొని తెచ్చుట యన్యాయంబు’ అని ప్రకటించిన ధీశాలి అతను. భార్యకు దైవవిహితుడైన భర్త ఒక్కడే, ఇది అనేక భర్తృక కాబట్టి ‘బంధకి’ అనబడుతుంది, అటువంటి దానిని వివస్త్రగా చేసి తెచ్చినా తప్పులేదన్నాడు కర్ణుడు. ఇది ఆమెకు మరో తీవ్ర గాయం. అనేకభర్తృక కావటంలో ఆమె నిస్సహాయురాలని, అందువల్ల ఆమె చేసిన శీలాతిక్రమణం ఏమీ లేదని ఎవ్వరూ అనలేకపోయారు. ఆ సమయాన ‘భ్రాతృ పుత్త్ర బంధుజనం బులు నాకుం గలిగియు లేనివారయిరి’ అని అరణ్యవాసంలో కృష్ణుడి వద్ద వాపోయింది ఆమె. అన్ని అవమానాలు ముగిసి నాక మానసికంగానూ గుడ్డివాడైన ధృతరాష్ర్టుడు రెండు వరాలు కోరుకొమ్మన్నప్పుడు ఆమె తొలి భర్తకి, ఆ తర్వాత తక్కిన నలుగురికీ విమోచనం కోరుకొంది. మూడో వరం కోరుకొమ్మన్నప్పుడు తనకై ఏమీ యాచించకుండా క్షత్రియస్త్రీ రెండు వరాలే ధర్మ పద్ధతి అని ఎంతో ఉన్నతంగా ఆలోచించి, వద్దన్నది. ఈ వస్త్రాపహరణ సన్నివేశంలో మొత్తం కౌరవసభ నైతికంగా మరణించింది.

పనిపాటలెట్లా చెయ్యాలో మెట్టినింట్లో అడుగు పెట్టిననాటి నుంచే కోడలికి నేర్పిన కుంతి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తన బిడ్డల్ని ఆమెకి అప్పగించింది. సహదేవుడిని ‘కడు పసిబిడ్డ’గా అప్పజెప్పింది. పాండవులకు విడివిడిగా దేవిక మొదలు పదిమంది భార్యలున్నా ఎవ్వరూ అడవికి పోలేదు. ద్రౌపది ఆ పన్నెండేళ్లూ వాళ్లకి ఇల్లాలుగా సేవలు చేసింది, తల్లిగా కూరిమి చూపింది. స్త్రీ తమ భర్తలకి భార్యలే కాదు, తల్లులు కూడా అని నిరూపించింది. అంతకు మించి ‘కరణేషు మంత్రి’గా క్షత్రియులకు క్షమతో పాటు తేజస్సు కూడా అవసర మని అరణ్యవాసంలో ధర్మరాజుతో వాదించింది. ధర్మపన్నాలు వల్లిస్తున్న భర్తతో ‘ఎఱుగని దాన గాను ధర్మతత్త్వయుక్తి’ అని విశదం చేసిన శాస్త్రజ్ఞానం ఆమెది. భర్తలకన్న మిన్నగా ఆనాటి క్షత్రియధర్మం పాటించింది ద్రౌపది.

అజ్ఞాతవాసం ఎట్లాచెయ్యాలో ద్రౌపదికి చెపుతూ ధర్మరాజు, తులువల తలపులు తెలిసి ప్రవర్తించాలి అన్నప్పుడు ఆమె ‘అనాదర మందస్మితం’ చేసింది. ఆ మాత్రం తెలియని దానినా అని ఆ నవ్వుకర్థం. స్వతంత్రమైన ఆలోచనతో ‘మాలిని’ పేరుతో తనంత తనే సైరంధ్రి వృత్తి నిర్ణయించుకొంది. ఆ వృత్తిలోనే ఆమె మనసు మీద మరో కత్తిగాటు పడింది. కీచకుడు బలాత్కారం చెయ్యటమేకాక, తప్పించుకు పరుగెత్తిన ఆమెను నిండుసభలో జుట్టుముడిపట్టి లాగి, కాలితో తన్నాడు. పడి లేచిన ద్రౌపది ఏ స్పందన లేని ఆ సభాంగణంలో ‘ఎవ్వరి యాండ్రురింక పరిభవంబున బొందక బ్రతుకువారు?’ అని విరటుడిని ప్రశ్నించింది. ఆలి అవమానానికి గాక అజ్ఞాతవాస భంగానికి వెరచిన ధర్మరాజు ‘పలుపోకల బోవుచు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాడ్పున... కులసతుల గరువచందము తొలగగ’ ఇట్లా ప్రవర్తించటం తగునా... అని మందలించాడు. పుండుమీద కారం అది. ఆమె చేసింది నాట్యమేనా? కులసతుల గౌరవం, అవమానించిన కీచకుడి వల్ల తొలగిందా, ద్రౌపది వల్ల తొలగిందా అనేది ‘అంతర్మద దుష్టుడు’ అయిన ధర్మరాజు గుర్తించలేదు. దానికి వచ్చిన సమాధానం అతని జీవితంలో మర్చిపో లేనిది.
‘నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు
కాన పతుల విధమ కాక యే శైలూషి కాదనంగ రాదు కంకభట్ట!’

‘మత్పతి శైలూషుండ కాడు, కితవుండునుం గాన జూదరి యాలికి గరువచందంబెక్కడిది?’ అన్నది ద్రౌపది. శైలూషుడు (నర్తకుడు) అనే మాట బృహన్నలకు తగిలితే కితవుడు (జూదగాడు) అనే మాట ధర్మరాజుకు తగిలింది. దెబ్బతిన్న ఆత్మాభిమా నానికి రోషం తోడైతే వెలువడ్డ ఎత్తిపొడుపు మాటలవి.
ఆ రాత్రి వంటశాలలో నిద్రిస్తున్న భీముడిని లేపింది ద్రౌపది. ‘ఉత్తిష్తోత్తిష్ట భీమసేన! కిం శేషే యథా మృతః?’ అని మూలం. ఆలి తలవంపు పట్టకుండా చచ్చినవాడిలా అంత గాఢనిద్రా? అని ఆమె కినుక. ఎన్నో చోట్ల మూలానికి మెరుగులు దిద్దిన తిక్కన అంత పెద్ద తిట్టు ఆమె నోటివెంట పలికించలేక మెల్లని మాటలతో మెత్తని కరస్పర్శతో మేల్కొలిపినట్టు చెప్పాడు. ఆమె స్వభావానికి మూలమే తగుననిపిస్తుంది. తన బాధ, కష్టం భీముడికి చెప్పుకొని, కాయలు గాసిన చేతులు చూపించి, అతని రొమ్ముపై తల పెట్టి ఏడ్చింది ద్రౌపది. కీచకుడిని చంపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఒత్తిడి చేసింది. అది ఆమె ప్రతీకారవాంఛ. భీముడు చెప్పిన ఉపాయం చొప్పున కీచకుడిని ఆకర్షించటానికి ఎన్నడూలేని వగలమారి తనం చూపించింది. కీచకుడిని నర్తనశాలలో ‘వికృతపు చావు’ చంపిన భీముడు ‘శాంతింబొందెనె రోషపావకుడు? దుశ్చారిత్రునిం జూచితే?
సంతోషించితె?’ అని అడిగాడు. సంతోషించింది ద్రౌపది. పరాభవించబడిన ప్రతిసారి ఆమె తలెత్తి నిలబడింది. ప్రతి అవమానాన్ని ధిక్కరించింది. ఆమెకి తోడునీడై జరిగిన ప్రతి అవమానానికి బదులు తీర్చినవాడు, అందరి కన్న ఆమెను గాఢంగా ప్రేమించిన వాడు భీముడే.

కృష్ణుడు రాయబారానికి బయలుదేరేటప్పుడు ఆమె నిప్పులు కురిసింది. పాండవులు అన్నదమ్ములు ఐదుగరూ ‘హీనగతి’తో ఐనా సంధికే ఇష్టపడ్డారు. అది అసమర్థత అని లోకులంటారన్నది ద్రౌపది. ఆ సందర్భంలో తన ఆభిజాత్యాన్ని తొలిసారి ప్రకటించింది:
‘వరమునఁ బుట్టితిన్‌, భరతవంశముఁ జొచ్చితి, నందు పాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁ బొందితి, నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్‌, సహజన్ముల ప్రాపు గాంచితిన్‌
సరసిజనాభ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కిన దాననెంతయున్‌’


ఒక ఉత్తమ ఇల్లాలి గౌరవప్రమాణాలు ఏవని ఆమె భావించిందో- వర ప్రాభవం, వంశ ప్రతిష్ఠ, ఉత్తమ భర్తృత్వం, వీరమాతృత్వం, సోదరప్రేమ- అవన్నీ తనకున్నాయి. అదీ ఆమె ప్రశస్తి, ఆత్మగౌరవం. అటువంటి తనను కౌరవులు అవమానించారు. కోడలిని దాసిని చేశారు. ఇప్పుడు భర్తలు ఆ ‘మహాపురుషుడి’ (ధృతరాష్ర్టుడి)వద్దకు అభిమానం చంపుకొని పోగా, నేను కూడా వెళ్లి కోడరికం చెయ్యాలా? దాస్యం చెయ్యాలా? అని ఆమె అడిగిన ప్రశ్నలో చాలా తర్కం ఉంది. ఈ క్రమంలో తన రోషం ఆపుకోలేక కురులు విప్పి, కృష్ణుడి ముందు పెట్టి, ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన ఆ చేయి మొదలు తనువంతా ముక్కలు ముక్కలు కావాలని, రాజరాజు పీనుగు కళ్లారా చూడాలని తన ప్రతీకారేచ్ఛ వెల్లడించింది. పాండవుల మూర్తిమత్వంలో సందిగ్ధతలు, సడలుతనాలు, ద్వైధీభావాలు కనపడతాయి కాని ద్రౌపదిలో మచ్చుకు కూడా కానరావు. కఠిన పురుష ప్రపంచంలో ఒక ధిక్కారస్వరం ఆమె. స్వతంత్ర భావప్రకటనలో సీత మొదలు ఏ పౌరాణిక స్త్రీనీ ఆమెతో పోల్చలేం.

భారతంలో చివరిసారిగా ఆమె కనపడేది పాండవుల మహాప్రస్థానంలో. హిమాలయాలు దాటి మేరుపర్వత పథంలో ఉండగా ముందుగా ద్రౌపది కుప్పగూలిపోయింది. ఆమెని అమితంగా ప్రేమించిన భీముడు అడిగాడు అన్నని, ‘ఈమె ఎన్నడూ ధర్మహాని చెయ్యలేదు, ఇట్లా కూలిపోవటానికి కారణమేమిటి’ అని. ‘ఈమెకు అర్జునుడి పట్ల పక్షపాతం. అందువల్ల తన పుణ్యాలు ఫలించక ఇటువంటి దురవస్థ పాటిల్లింది’ అన్నాడు ధర్మరాజు. ‘ధర్మార్థ కుశలా చైవ ద్రౌపదీ ధర్మచారిణీ’ (వ్యాసుడు), ‘అయోనిజా లోకకాంతా పుణ్యగంధా’ (ఇంద్రుడు) అనే విధంగా ఎందరి మెప్పునో పొందిన ఆమె, జీవితాంతం అసలు భర్త కాని ఏ వ్యక్తిని నెత్తిని పెట్టుకొందో అతని మెప్పు మాత్రం పొందలేక పోయింది. తన జీవితంలో అన్ని అవమానాల కన్న దారుణమైన అవమానం అదే. ‘నాథవతీ అనాథవత్‌’ (భర్తలుండీ లేనిది)అని భారతమంతటా వచ్చే ప్రస్తావన ఒక రకంగా ఆమె బండలైన బ్రతుకుకు వ్యాఖ్యానమే.

పౌరాణిక సాహిత్యం చెయ్యలేని కావ్యన్యాయం జానపద సాహిత్యం చేసింది. జూదసభలోకి తనే స్వయంగా వచ్చి, శకునిని సవాలు చేసి, ఎడమకాలితో పాచికలాడి, పాండవుల్ని తిరిగి గెలిపించి, దుర్యోధనుడి ముఖంపై ఉమ్మేసిన ‘పాంచాలమ్మ పాట’ ఆ పాత్రలోని పౌరుషాన్ని ఆవిష్కరి స్తుంది. (సూళ్లూరు పేట, పొన్నేరు ప్రాంతాల్లో పాడుకొనే ఈ పాట గురించి మిత్రులు స.వెం. రమేశ్‌ చెప్పారు. ఆమె పూర్వజన్మ గురించీ ఒక జంగం పాట ఉన్నట్టు తెలుస్తుంది.) ప్రాచీనపాత్రల్ని ఆధునిక రచనలు పునర్వ్యాఖ్య చేేసటప్పుడు జాగ్రత్త అవసరం. ఆ వ్యాఖ్యలు లేదా కల్పనలు వాస్తవ భూమిక మీద ఆయా పాత్రల అవ్యక్త అంతరంగాన్ని ఆవిష్కరించేలాగా, సానుకూలంగా ఉండాలి. మూలచ్ఛేదం చెయ్యగూడదు.

చెయ్యని నేరం తలకెత్తిన సీత, ద్రౌపది వంటి స్త్రీలే యుద్ధాలకి మూలకారణం అనటం పురుష దుర్మార్గాలను కప్పిపుచ్చటమే. నిజానికి అనాదిగా ఈ కర్మభూమిలో తమ జీవితంలో స్త్రీలచేత ఎప్పుడూ అవమానించబడని పురుషులుం టారు. కాని పురుషుల చేత ఎన్నడూ అవమానించబడని స్త్రీలు ఉండరు గాక ఉండరు. బ్రతుకంతా నిప్పుల్లో పొర్లాడింది ఆ అభాగిని. సత్త్వ రజోగుణాల కలయిక ఆమె. అవమానిత భారతీయ మహిళా సమాజానికి ప్రాచీన ప్రతీక ద్రౌపది. అదే సమయాన తన జీవితంపై తన అధికారం కోసం పోరాడు తున్న ఆధునిక మహిళకి మహా స్ఫూర్తి ద్రౌపది.

‘అహల్యా ద్రౌపదీ కుంతీ, తారా మండోదరీ తథా
పంచకన్యా స్మరేన్నిత్యం, మహాపాతక నాశనమ్‌’
వీళ్లంతా తమ తమ బ్రతుకుల్లో అత్యాచారానికి గురి అయినవాళ్లు. అందరిలో మహా దయనీయ, మహా ధైర్యశాలి ద్రౌపది. ఎన్నో పేర్లున్నా ఆమెకి పెట్టదగిన పాతకాలపు పేరు ‘పుణ్యగంధ’. ఈ కాలపు అచ్చమైన పేరు ‘ధీర వనిత’.
పాపినేని శివశంకర్‌



No comments:

Post a Comment