Saturday, 21 April 2018

శంతనుడు

శంతనుడు


Sun,April 8, 2018 04:21 AM
మనిషి జీవితాన్ని శాసించేవి కాలంతో పాటు వచ్చే పరిస్థితులో, కర్మఫలాలో, ఆలోచనా సరళో కాదు. మనిషి వ్యక్తిత్వానికి ఆలంబనగా నిలిచే స్వాధీనత పరాధీనత, స్వాతంత్య్రం, పరతంత్య్రం. కొన్నికొన్ని సార్లు మనకు తెలియకుండానే మన జీవితం పరాధీనతలోకి, పరతంత్య్రంలోకి నెట్టివేయబడుతుంది. అప్పుడు ఉన్నతమైన కుటుంబ నేపథ్యం, స్వీయ తెలివితేటలు జీవితాన్ని సామాన్యంగా చిత్రీకరిస్తాయి. ఉన్నతత్వం, సామాన్యత అనేవి రెండూ భిన్న పార్వ్యాలు. వాటిలో దేనిని సాధించుకోవాలో, దేన్నుంచి దేనికి వెళ్ళాలో నిర్ణయించుకునేది మనమే. మనలోని తత్వం అలంకరింపబడే అవకాశం ఉన్నతత్వానికిస్తామా? లేదా సామాన్యంగా గడుపుతామా?.. అనేది కేవలం మన నిర్ణయమే. అలాంటి జీవితాన్ని ఉదాహరణగా చూపించే శంతనుని గురించి భారతం చాటుతున్న కబుర్లు సామాన్యత వెనుకున్న గాంభీర్యాన్నీ, ఎటువంటి భేషజాలూ లేని పరతంత్య్రమునూ, పరాధీనతనూ ప్రదర్శిస్తున్నాయి. శంతననుని చరిత్ర కూడా అలా మొదలై ఇలా ముగిసిపోతుంది.
-ప్రమద్వర


ప్రతీపుడు శంతనుని తండ్రి. శంతనునికి దేవాపి అనే అన్న, బాహ్లకుడనే తమ్ముడు. ఇదే అతని కుటుంబం. తండ్రీ, అన్న రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోగా చాలా చిన్న వయసులోనే శంతనునిపై రాజ్యభారం పడింది.తనకన్నా పెద్దవాడైన దేవాపి అన్ని అర్హతలూ కలిగినవాడు ఉండగా శంతనుడు రాజుగా బాధ్యతలు చేపట్టడం వల్లే రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు వర్షాలు లేక కరువు ఏర్పడిందనే నింద పడింది. దాంతో దేవాపిని వెతికి అతనికి రాజ్యభారం అప్పగించే క్రమంలో దేవాపి అప్పటికే సన్యాస ధర్మంలోకి వెళ్లిపోవడంతో శాస్ర్తోక్తంగా తనే పట్టాభిషిక్తుడయ్యాడు శంతనుడు. దాంతో వర్షం కుంభవృైష్టె కురిసింది. శంతనుడు బాధ్యతలకూ, ధర్మాలకూ, పరిస్థితులకూ ఆధీనుడే గానీ స్వచ్ఛమైన మనస్తత్వం కలవాడు. అతని స్వచ్ఛతకు నిరూపణ ఏంటంటే.. శంతనుడు తాకిన వెంటనే పండు ముసలి సైతం యవ్వనంతో వెలిగిపోతారట.

శంతనుడు తన స్వతంత్య్రాన్ని, స్వాధీనతనూ తన ఇద్దరు భార్యలకూ ఇచ్చేశాడు. ముందు గంగను వరించి ఆమె మాటకు ఎదురు మాట్లాడక తమకు పుట్టిన ఏడుగురు సంతానాన్నీ గంగపాలు చేస్తుంటే చూసి ఊరకుండిపోయాడు. ఎనిమిదవ వాడైన తన పుత్రున్ని గంగలో కలిపేస్తుంటే వారించాడు శంతనుడు. తనకు అడ్డు చెప్పినందుకు గంగపుత్రునితో సహా వెళ్లిపోయింది. పదమూడవ యేట ఆ పిల్లాన్ని అప్పగిస్తానని వెళ్తూ వెళ్తూ చెప్పింది. అతనే భీష్ముడు. శంతనుడు భీష్ముడు తనను చేరగానే అతనికి రాజ్యభారం అప్పగించాడు. తర్వాత సత్యవతిని వరించి పెళ్లి చేసుకుందామంటే, ఆమె వల్ల భీష్మునికి గాక, శంతన సత్యవతుల సంతానానికి పట్టం కట్టేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. భీష్ముడూ తండ్రికోసం, శంతనుని స్వచ్ఛమైన వ్యక్తిత్వం కోసం రాజ్యాన్ని, వివాహాన్ని త్యాగం చేశాడు. మనం ఎవరికోసమైనా త్యాగం చేస్తున్నామంటే వారిలోని ఉదాత్తత ఎంతటిదో చెప్పక్కర్లేదు.

శంతనుడు చాలా విశాల హృదయం గల మనిషి. అందరినీ ఆదరించాలనే ఆత్రుత ఆయనలో గుణరత్నమై ఒప్పారింది. ఒకనాడు వేటకై వెళ్లిన శంతనుడు అక్కడ ఆదరణ లేక పెరుగుతున్న కృపినీ, కృపాచార్యులను ఇంటికి తెచ్చుకొని పెంచి పెద్దచేశాడు. కృపతో వారిని గ్రహించాడు కనుక వారికి ఆ పేర్లు వచ్చాయి.అత్యంత శక్తి బలసంపన్నుడు, భీష్ముడంతడి వాడికి తండ్రి. తన మరో ఇద్దరు పుత్రులైన విచిత్రవీర్యుని, చిత్రాంగదుని సంస్కారంతో పెంచి, వారికి రాజ్యాన్ని అప్పగించి తనువు చాలించిన మహోన్నత వ్యక్తి శంతనుడు. ఇతని గొప్పతనం భీష్మునిలో ద్విగుణీకృతమైంది.

తనదైన జీవితం తనది కాకుండానే బతికి, తన వారి కోసం సర్వం త్యాగం చేసి, ఎటువంటి కోరికలకూ, అహంకారాలకూ లోనవ్వకుండా బతికినవాడు శంతనుడు. తాను తలుచుకుంటే ఒక గొప్ప చక్రవర్తిలా అలుపెరుగని యోధునిలా, సకల విద్యాపారంగతునిగానో చరిత్రలో స్థానం సంపాదించుకునేవాడు. కానీ అతి సామాన్యంగా, తనలోని ఉన్నతత్తాన్ని ఉదారత ఛాయలో నిండు జీవితాన్ని అనుభవించిన శంతనునిది నిక్కచ్చిగా చెప్పాలంటే పరాధీన, పారతంత్య్ర జీవితం కాదేమో! విలువైన, సత్యభూషితమైన, స్వాభావికతకు ఆస్కారమిచ్చే చరితయేమోనని అర్థమైపోతుంది.

No comments:

Post a Comment