Monday, 23 April 2018

గుహుడు






గుహుడి నిలువెత్తు సంస్కారం

ధర్మరక్షణ కోసం తరతరాలుగా, యుగయుగాలుగా ఎందరో మహానుభావులు జన్మిస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. కానీ బిందువూ బిందువూ కలిస్తేనే సింధువుగా మారినట్లు ప్రత్యక్ష పరోక్ష పాత్రల్లో ధర్మ సంస్థాపనకు సహకరించిన వారెందరో.. అది తమ విద్యుక్త ధర్మమని తలంచి ప్రపంచమనే వేదికపైకి రాకుండా తెరవెనుక ఆణిముత్యాలై చరితార్థులయ్యారు. అందులో ప్రత్యేకమైన స్థానం నిషాదరాజైన గుహుడికి దక్కింది. మంచితనం, విలువలు గుహుడి వ్యక్తిత్వ స్వరూపాలుగా మారి ధర్మరక్షణ సభ్య సమాజ రక్షణేనని తెలుపకనే తెలిపాయంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచంలో కారణం లేకుండా ఏ పనీ జరుగదు. మరి మనిషి పుట్టుక వెనుక ఉన్న మహోన్నత కారణం అసలు సిసలైన మనిషిగా బతకడమేననీ, ఆ బతుకుబాట ఒంటరిగా కొనసాగదనీ, వ్యక్తి కుటుంబం వ్యవస్థ దిశగా విలువలే వారధిగా సాగిపోతుందనీ తెలియజెప్పిన వ్యక్తి గుహుడు. మంచి వ్యక్తిగా మంచి రాజుగా, రామసేవాంకితుడిగా చరిత్రలో నిలిచిపోయిన గుహుడి వ్యక్తిత్వం సాధారణ వ్యక్తిని అసాధారణ మానవత్వంతో పరిమళించేలా చేసింది.

వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పాపం అంటని పావన నది గంగాతీరంలోని శృంగిబేరపురం దగ్గర ఆగుతారు. ఆ ప్రాంతం గుహుడి రాజ్యపరిధి లోనిది. మహాబలవంతుడైన గుహుడు స్థిపతి బిరుదుతో రాజ్యమేలుతున్నాడు. బోయజాతివాడు. అందమైన మనసున్న వాడు. రాముని రాకను తెలుసుకుని గంగా తీరానికి చేరుకుని శ్రీరామునికి అతిథి మర్యాదలు చేయసాగాడు. సంతోషంగా స్నేహహస్తం అందించిన గుహుడిని ఆర్తితో పలుకరించాడు రాముడు. గుహుడి మంచితనంలోని పారదర్శకతే దానికి నిదర్శనం.

గుహుడికి రాముడంటే ప్రాణం. రాముని వల్లనే రాజ్యాన్నీ, ధర్మజ్ఞానాన్నీ పొందానని బలంగా నమ్మే వ్యక్తి గుహుడు. సీతారాములు కటిక నేలమీద నిద్రించడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మణుని బాధను సహృదయంతో ఆలకించి చలించిపోయిన గుహుడు రాముడెక్కడుంటే అదే వైకుంఠమని సాంత్వన పరుస్తాడు. సీతారామ లక్ష్మణులు గంగను దాటడానికి అందమైన నావను సిద్ధం చేసి, రాముని కోరిక మేరకు మర్రిపాలను ఏర్పాటు చేసి, వనవాస దీక్షలో రామలక్ష్మణుల జుట్టు జడలుగా చేసుకునేందుకు సహకరించాడు.

గుహుడు ఏర్పాటు చేసిన నావను ఎక్కుతూ అరణ్యంలోనే వనవాసం చేయాలని నా తండ్రి ఆజ్ఞ. అందుకే నీ జన సంచార సంజనితమైన రాజ్యంలో ఉండలేకపోతున్నాననీ, రాముడన్నాడు. దానికి నీ మాటే నాకు వేదవాక్కు. రామా! నీవెక్కడున్నా నా మనసు నీ చెంతనే ఆనందంతో తేలియాడుతుందని చెప్పి వీడ్కోలు చెబుతాడు. రాముడు కనుమరుగయ్యేంత వరకూ తన చూపు మరల్చక చూస్తుండిపోయిన గుహుని నిస్వార్థ ప్రేమ అద్వితీయమైంది.

గంగాతీరంలో మరోసారి అయోధ్య పురమంతా దాదాపుగా మజిలీ చేసినట్టు తెలుసుకున్న గుహుడు భరతుని సారథ్యంలో ఇదంతా సాధ్యమైందని గమనించి కైకేయీ భరతులు అడవికెళ్లినా రామున్ని వదిలిపెట్టరా! రాజ్యం ముందు రక్తసంబంధాలు అంత అల్పమైనవా! అని బాధపడి, అంతలోనే తేరుకున్నాడు. భరతుడి ఉద్దేశం రాముని ప్రశాంతతకు భంగం కలిగించేదే అయితే గంగను దాటనీయక పోరాడుదామనీ, సదుద్దేశమే అయితే ఆహ్వానం పలుకుదామనీ చతురంగా బలాలనూ పురమాయించిన గుహుడు యుద్ధ తంత్రంలో తొందరపాటు చూపలేదు. సరికదా అసలు భరతుని మనసులో ఏముందో తెలుసుకుందామని భరతుని గుడారానికి వెళతాడు.

భరతుడితోపాటు సమస్త బలగానికీ ఆతిథ్యాన్ని ఆహ్వానంగా అందిస్తాడు.

రాముని జాడ తెలుపమని అడిగిన భరతునితో గుహుడు వినయం తగ్గని స్వరంతోనే సూటిగా ప్రశ్నిస్తాడు. రాముడు క్షత్రియుడైనా సాధుజీవి. ఎవ్వరికీ అపకారం తలపెట్టని వాడు. ఇంత సైన్యంతో ఆయుధాలతో రామదర్శనం ఎందుకో తెలుసుకోవచ్చా? అని నిర్భయంగా అడుగుతాడు. గుహుని సందేహాన్ని తప్పుబట్టని భరతుడు అయోధ్యకు రామున్ని తిరిగి రమ్మని అడిగేందుకే ఈ తపన అంటూ సమాధానపరుస్తాడు.

అధర్మంగా వచ్చిన రాజ్యాన్ని తృణీకరించిన భరతునిపై పెరిగిన ఒకింత గౌరవాన్ని వ్యక్త పరుస్తూ సమస్త బలగానికీ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో గడిపిన కొన్ని ఘడియలనీ మధురమైన జ్ఞాపకాలుగా భరతునికి వినిపిస్తాడు. చెదిరిన భరతుని మనసును తృప్తి పరుస్తాడు. రామదర్శనమే నా తక్షణ కర్తవ్యమని భరతుడు చెప్పగానే ఐదువందల నావలను సిద్ధం చేసి, స్వస్తికం అనే ప్రత్యేక నావను భరత శత్రుఘ్నులకూ రాజమాతలకూ ఏర్పాటు చేస్తాడు. విశాలమైన గంగానదిలో గుహుడు ఏర్పాటు చేసిన నావలు అద్భుతమై ఆగుపించాయి. ఇంతటి గుహుడు తన సామర్థ్యాన్ని ఎక్కడా ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. రామకార్యంలో నిశ్చలమై ఒదిగిపోయింది.

సీతాన్వేషణలో భాగంగా సీత ఉత్తరీయంలోని చిన్న ముక్కను సుగ్రీవుడు గుహుడికివ్వగా దానిని రామునికి అందించి ఆణగారి పోయిన రాముని ఆశలకు ప్రాణం పోశాడు గుహుడు. ఇలా.. రామునిపై అకుంఠిత విశ్వాసం, రాముని సేవా ధర్మ పరిరక్షణేనని భావించే తత్తం, రామకార్యానికి అడ్డు పడేందుకు ప్రయత్నించిన వారిని నిర్భయంగా ప్రశ్నించే భావ వ్యక్తీకరణ, నిగ్గు తేలిని ధైర్యం, నిరాడంబరత, మనుషులను అర్థం చేసుకుని మనసులకు సాంత్వన చేకూర్చే పరిపక్వత, తన గాథనే రాముని చరితంగా మలుచుకుని మురిసిపోయిన అమాయకత్వం.. బోయవాడైన గుహుడిని మనసున్న మంచి తనానికి, మానవత్వం రూపుదాల్చిన ధర్మానికీ ప్రతీకగా దర్శించేలా చేసింది. నిలువెత్తు సంస్కారానికి నిజరూపంగా వ్యక్తీకరించేందుకు అవకాశం ఇచ్చింది.
ప్రమద్వర 

No comments:

Post a Comment