మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడవలె అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి సౌశీల్యం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఆభిజాత్యాన్నిగానీ ఐశ్వర్యాన్నిగానీ విద్యనుగానీ పదవినిగానీ దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. ఆ దృష్టి లేనివాడే సౌశీల్యమూర్తి. అలాంటి సౌశీల్యరూపుడు శ్రీరామచంద్రుడు. రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా దర్శనమిస్తారు. రాముడు చక్రవర్తి అయినా.. గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే.. సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే.. రుమ, సీతల విముక్తికి కారణమైంది. శత్రువు సోదరుడైనా సరే.. అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు.
‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’..
మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు.
ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్
..అన్నారు వాల్మీకి మహర్షి.
నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావం.
-గన్నమరాజు గిరిజామనోహర బాబు
No comments:
Post a Comment