Thursday, 15 March 2018

పంచాక్షరీ మంత్రం - అష్టాక్షరీ మంత్రం




పంచాక్షరీ మంత్ర రహస్యార్థం

ఓం నమశ్శివాయ.. ఇదే పంచాక్షరీమహామంత్రం. ఇది యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి కల్గుతాయి. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ఓం ప్రతి మంత్రానికి ఆదిలో ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారం వదలరాదు. ఓంకారపూర్వకంగానే నమశ్శివాయ అనే పంచాక్షరిని ఉచ్చరించడం విధి. ఎందుకంటే ఓంకారం మంత్రానికి శిరస్సులాంటిది.

మంత్రాన్ని లేక భగవన్నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది. ఒకసారి శివభక్తులైన సౌనందగణేశమునివర్యులు యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆ మునీంద్రుని సత్కరించి, వచ్చిన కారణం అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పగా.. తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆయనకు చూపాడు. ఆ మునీంద్రునికి వారిపై కనికరం గలిగి ‘‘ఓ జనులారా! ఇదో ‘ఓం నమశ్శివాయ’ అని ఉచ్చరించండి. మీ యాతనలు పటాపంచలవుతాయి’’ అని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరకవిముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట. ఆ ముని వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.

ఓంకారం అర్థమే నమశ్శివాయ అని. అన్ని మంత్రాలూ ఓంకారాన్నే విశదీకరిస్తున్నాయి. ఓంకారంలో ఆ, ఉ, మ్‌ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ మూడూ కలిసి ఓం. ‘ఈశ్వరాయ భృత్యవత్కరోమి’ అని శంకరగీతాభాష్యం అంటే, ఈశ్వరునకు తాను దాసుడని భావించి అతని సేవకోసమే తానున్నానని నిశ్చయించి కర్మ ఫలాన్ని అతనికి అర్పించడమే జీవుని కర్తవ్యం. ఇదే ఓంకారం విశేషార్థం. ఈ అర్థాన్నే పంచాక్షరి కూడా తెలుపుతోంది. ఈశ్వర్పాణ బుద్ధితో కర్మలు చేయడమే మానవుడి విధ్యుక్తధర్మం. ఇది పంచాక్షరికి కర్మయోగపరమైన రహస్యార్థం.

-స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి



అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత

“ఓమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః

‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).

శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గతజన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.







అష్టాక్షరీ శక్తి అమోఘం!


అత్యంత శక్తిమంతమైన అష్టాక్షరీ మంత్రాన్ని ఎన్ని సార్లు జపించాలి? జపమాల త్రిప్పేటప్పుడు ఏం చదవాలి? వంటి సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

అష్టాక్షరీ మంత్రం శబ్దశక్తి.. అర్థశక్తి.. అర్థపూర్తి కలిగిన మంత్రం. ఇటీవల కాలంలో మనుషుల పేర్లతో కూడా మంత్రాలను కల్పిస్తున్నారు కానీ మంత్రం అనే ప్రక్రియకు చాలా శక్తి ఉంది. కేవలం అక్షర సంపుటి మాత్రమే కాదు. దీని ద్వారా అపరిమితమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. దీనిని 108 సార్లు, వెయ్యి సార్లు, లక్షసార్లు - ఇలా రకరకాలుగా జపిస్తూ ఉంటారు.

ఈ అష్టాక్షరీ మంత్రంలోని అర్ధాన్ని ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి. ఇక మన శాస్త్రాల ప్రకారం చూస్తే- అష్టాక్షరీ వల్ల అజామిళుడు అవతరించాడు. ఈ మంత్రాన్ని జపం చేయాలంటే బాహ్యంగ ఆహారం తీసుకోవటానికి ముందు నియమంగా ఉపదేశం పొంది చేయాలి. కానీ దాని అర్థాన్ని మాత్రం ఎల్లవేళలా, శుచి.. అశుచి సమయాల్లోనైనా తలచుకుంటూ ఉండవచ్చు. మనస్సులో సదా స్మరిస్తూ ఉండవచ్చు. ఇక జపం చేయటానికి వెనకున్న నియమాలు తెలుసుకుందాం. శుచి, అశుచి అనేవి కేవలం శరీరానికి సంబంధించినవే.

అయితే మంత్రార్థం తెలుసుకున్న తర్వాతే జపాన్ని ప్రారంభించాలి. అప్పుడు మంత్రం స్మరిస్తున్న సమయంలో అర్థబావన కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనస్సు పూర్తిగా భావంపైనే ఉండాలి. లేకపోతే ఒక వైపు మాల తిరుగుతూనే ఉంటుంది. మనస్సు అంకెలపైనే ఉంటుంది. సంఖ్య పూర్తై ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంతే కాకుండా మాల తిప్పే విధానాన్ని కూడా మన పూర్వీకులు ఏర్పరిచారు. ముందు మాలను శుద్ధి చేయాలి. మాల కుడిచేత్తో చూపుడువేలుకు తగలకుండా మధ్యవేలిపై బ్రొటన వేలివైపు నుంచి ముందువైపునకు గడియారము తిరిగినట్లు తిరగాలి.

దీనితో పాటుగా ఏఏ రకం మాలలను వాడితే ఏమవుతుంది? ఏ రంగు పూసలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మొదలైన విషయాలను కూడా తెలుసుకోవటం మంచిది. లేకపోతే మాలను తిప్పి ప్రయోజనం ఉండదు. అందువల్ల మనవారు మాలతో త్రిప్పి లెక్కించే జపాలు వద్దన్నారు. లక్ష్మీనారాయణుడికి సేవ చేస్తున్నట్లుగా భావించి ఎంత సేపు వీలైతే అంత సేపు జపం చేయాలి. ఎప్పుడైనా జపం చేయడంపై మనసు నిలకడ లేకపోతే అప్పటికి దానిని వదిలేయటం మంచిది.

-త్రిదండి చిన జీయర్‌ స్వామి




No comments:

Post a Comment