Friday, 16 March 2018

శరన్నవరాత్రులు





దేవీ ఉపాసన కాలమే... శరన్నవరాత్రులు

శక్తి స్వరూపం.. ఆశ్వయుజమాసం
మనస్సు నిర్మలంగా ఉండాలంటే మహర్షులు చెప్పిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. శక్తి స్వరూపిణి పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజ మాసానికి ఇష మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.

శరద్రుతువు
ఈ మాసం శరద్రుతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయి. విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతాయి.

శరన్నవరాత్రి ఉత్సవాలు

  • పది జన్మల పాపాలను పోగొడుతుంది
  • మొదటి మూడు రాత్రులు పార్వతి,
  • మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి,
  • చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.

శరద్రుతువులో కాచే పండువెన్నెల వంటి కాంతి, చల్లని చూపు, మందహాసం, ముఖపద్మం కలిగినదిగా పరాశక్తిని రుషులు అభివర్ణిస్తారు. శరత్కాలంలో ఆవిర్భవించటం వల్ల ఆ పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. ఈ దేవిని ఉపాసించే కాలాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలుగా, దసరా ఉత్సవాలుగా జరుపుక్గుఇరు.

దేవీ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు పార్వతీదేవి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులను

సరస్వతీదేవిని పూజించటం శుభప్రదం.
ప్రకృతి నియమాలను అనుసరించి ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దశహరా అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పొగొట్టేది అనే అర్థం కూడా ఉంది.

శరత్కాలంలోని తొలి తొమ్మిది రాత్రుళ్ళు దుర్గాదేవి
ని (పరాశక్తి) పూజిస్తే భక్తుల జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని ఒక నమ్మిక.. దేవిని ఉపాసన చేస్తూ నిర్వహించే ఉత్సవాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి కాబట్టే వీటికి నవరాత్రులనే పేరు వచ్చింది. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను సత్కరించటం ఆనవాయితీగా వస్తోంది.

కుమారీపూజ ప్రత్యేకం
నవరాత్రి పూజావిధానాలలో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి నూతన వసా్త్రలను ధరింపజేసి, అమ్మస్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసే పూజను కుమారీ పూజ అంటారు. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో కుమారీలను ప్రత్యేకంగా పూజిస్తారు.

నవదుర్గలు
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని - సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.






విజయదశమి విశిష్టత.. శమీ పూజ ప్రాశస్త్యం


యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా!నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారములు అని చెప్పడమే ఈ శ్లోక భావం. సకల ప్రాణులకూ తల్లే మూలం అని దీని పరమార్థం. మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, వారిని తల్లి పెంచి పోషిస్తుంది. అందుకే సకల చరాచర సృష్టిలో జీవులన్నీ తల్లినే ఆశ్రయిస్తాయి. సర్వలోకాలకు తల్లి ఆ జగజ్జనని. ఆదిపరాశక్తి కాబట్టే ఆమె అమ్మలగన్న అమ్మ అయింది.

ఆది పరాశక్తి, ఆ జగన్మాత లోకకల్యాణార్థం రాక్షస సంహారం గావించింది. ఒకొక్కరోజు ఒకొక్క రూపం ధరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసులను సంహరించింది. సాధించిన విజయానికి గుర్తుగా ఆ తల్లిని ఆరాధిస్తూ తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసుకుంటారు. వీటినే దేవీ నవరాత్రులు అంటారు. చివరి రోజు ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని పర్వదినంగా జరుపుకుంటారు. దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహ సాధనకు విశిష్టమైన రోజులు. శరదృతువులో ప్రారంభమవుతాయి కనుకనే వీటిని శరన్నవరాత్రులు అని వ్యవహరిస్తారు.

శరన్నవరాత్రుల విశిష్టత
వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘ నవరాత్రులు అనే పేర్లతో సంవత్సరంలో నాలుగుసార్లు ఈ అమ్మ వారి నవరాత్రులను ఉత్సవాలుగా నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ జరిగే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఇవి వసంత కాలంలో వస్తాయి. వీటినే రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఆషాఢ శుక్లపక్షంలో జరిపే నవరాత్రులను ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులు అంటారు. మాఘమాసంలో తొమ్మిది రూపాలలో మాఘ శుక్ల పక్షాన జరుపు కునే నవరాత్రులను మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఈ మూడు నవరాత్రులను అన్ని ప్రాంతాల వారు నిర్వహించక పోవచ్చు కానీ శరత్‌ కాలంలో వచ్చే శరన్నవరాత్రులను దేశమంతటా ఘనంగా జరుపుతారు కాబట్టే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది.

అమ్మవారి పూజలో అంతరార్థం
దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా పదవరోజును విజయదశమిగా పాటిస్తున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలోని అంతరార్థం.

తొమ్మిది రోజులు - తొమ్మిది రూపాలు
నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో నవరాత్రులలో దేవిని పూజించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెబుతారు.

ప్రాంతీయ ఆచారాలను బట్టి నవరాత్రులలో దేవీ అలంకారాలు చేస్తారు. బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గా, మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీదేవిగా తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. చాలా చోట్ల ఈ అవతారాలకే పూజలు చేస్తారు, ఉత్తర భారతంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లాంటి తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. అయితే తెలుగునాట శ్రీశైలంలో అమ్మవారిని ఈ రూపాలలో అర్చిస్తారు.

కుమారీపూజ
శరన్నవరాత్రులలో దేవీపూజతో పాటు కొన్ని చోట్ల కుమారీపూజ కూడా చేస్తారు. ఇందులో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికలను పూజిస్తారు. వారికి విందు చేసి, వస్ర్తాదులతో సత్కరిస్తారు. ఒకొక్కరోజు ఒకొక్క వయసున్న బాలికకు పూజలు చేస్తారు. రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అంటారు. ఇలా ఆమెను కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్య్ర దుఃఖాలు నశిస్తాయి. మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అంటారు. ఈ త్రిమూర్తి పూజవల్ల ధనధాన్య, పుుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగు సంవత్సరాలున్న బాలికను కల్యాణి అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఐదేళ్ళు వయసుగల బాలికను రోహిణి అంటారు. ఈమెను పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.

ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అంటారు. కాళికను పూజిస్తే శత్రు నాశనం జరుగుతుంది. ఏడు సంవత్సరాల వయసుగల బాలికను చండిక అంటారు. ఈ పూజ ఐశ్వర్యాన్నిస్తుంది. ఎనిమిది సంవత్సరాలున్న బాలికను శాంభవి అని వ్యవహరిస్తారు. ఈ పూజను నృపసమ్మోహకం అంటారు. ఈ పూజవల్ల అధి కారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిది సంవత్సరాల వయసుగల బాలికను దుర్గ అంటారు. ఈమెను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి. పది సంవత్సరాలున్న బాలికను సుభద్ర అంటారు. ఈపూజ వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి.

చివరి మూడు రోజులు - అత్యంత శ్రేయస్కరం
నవరాత్రులలో అన్ని రోజులూ పూజలు చేయలేనివారు కనీసం చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి. ఈ మూడు రోజులూ త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి దేవి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో ఉంది.

విజయాలను చేకూర్చే విజయ దశమి
దశ హరా అంటే పదిరోజుల పండుగ! పది పాపాలను నాశనం చేసేది అని అర్థం. అదే దసరాగా వాడుకలోకి వచ్చింది. త్రిశక్త్యాత్మకంగా అమ్మవారు పూజలు అందుకుని పదవరోజున అపరాజితాదేవిగా కొలువు తీరుతుంది.

ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయం సంధ్యాసమయాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధకమైన సమయం. ఆ దశమీ దినం శ్రవణా నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈరోజున సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడమన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటంటే సాధారణంగా శత్రువులూ, మిత్రులూ అనే అంశం వచ్చినప్పుడు వారిరువురి మధ్య కొన్ని హద్దులేర్పడతాయి. వాటిని తుడిచేసి శత్రువులు సైతం పాతకక్షలు మరిచిపోయి మిత్రులుగా ఉండాలనేది సీమోల్లంఘన భావన. ఈ విజయదశమి పుణ్య దినాన ప్రజలంతా చేరి ఊరిలో ఈశాన్య దిశలో ఉండే శమీవృక్ష ప్రదేశానికి వెళతారు. శమీవృక్షానికి పూజ చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.

శమీ శమీయతే పాపం శమీశతృ వినాశనం
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శనీ

అంటే శమీవృక్షము పాపాన్ని పరిహరిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుందని అర్ధం. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది, శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.


ముస్త్యాల రామచంద్రశర్మ









దుర్గుణాలను జయించండి


ఆధ్యాత్మిక దేశమైన భారతావనిలో శరన్నవరాత్రులకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ పండుగ పరమార్థం గ్రహించి జీవితాలను పరివర్తన చేసుకోవాలి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దశమి రోజున రాక్షసత్వంపై దైవం సాధించిన విజయానికి ప్రతీకగా దసరా చేసుకుంటారు.

ఆధ్యాత్మిక సాధనకు నవరాత్రులు మంచి వేదిక. మన మనసుల్లో పేరుకుపోయిన కామక్రోధాది వికారాలను జయించడానికి కావాల్సిన శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతి రూపాలుగా ఆ తల్లిని ఆరాధిస్తారు. త్రిశక్తి స్వరూపమైన జగన్మాత.. అష్టభుజాలతో ఖడ్గం, శూలం, సుదర్శన చక్రం, శంఖం, దీపం, గద మొదలైన ఆయుధాలు చేతబూని భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆయుధాలు ఆధ్యాత్మిక శక్తులకు నిదర్శనంగా భావించాలి.

దసర అనగా దశ శిర హార అని అంటారు. నేటి మానవుల్లో పెచ్చురిల్లుతున్న దశ వికారాలు.. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, నిర్లక్ష్యం, సోమరితనం.. ఈ పది వికారాలకు గుర్తుగా పది తలల రావణాసురుడిని చూపిస్తారు. అందుకే ఏటా విజయదశమి రోజున రావణ దహనం చేస్తారు. కానీ, మనలోనే ఉన్న ఈ పది దుర్గుణాలను జయించిన రోజునే నిజమైన దసరా.

ఈ వికారాలను జయించడం ఎలా..? 

ఈ వికారాలకు మూలం దేహభ్రాంతి, దీన్ని జయిస్తే మిగతా వికారాలు దూరమవుతాయి. అయితే దేహభ్రాంతి నుంచి బయటపడాలంటే జ్ఞానయోగాలనే అస్త్రాలు కావాలి. తనలోని నిజమైన స్వరూపాన్ని గుర్తుంచుకుని అంటే ఆత్మాభిమానంతో నిరంతరం పరమాత్ముని స్తుతిస్తూ జీవనం సాగిస్తే ఆత్మకు అష్టశక్తులు లభిస్తాయి. ఆ అష్టశక్తులే అమ్మవారి అష్టభుజాలు. అవి సంకీర్ణ శక్తి, సమీకరణ శక్తి, సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలనాశక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కునే శక్తి, సహనయోగ శక్తి. శివాత్మిక అయిన అమ్మవారిని ఆరాధించడం ఈ శక్తులు సిద్ధిస్తాయి. నవరాత్రుల్లో ఆ తల్లిని నిష్ఠగా సేవించి సద్గుణాలను పొందండి.



No comments:

Post a Comment