బాలాత్రిపుర సుందరి దేవి మొదటి రోజు
"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"
శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.
నైవేద్యం - పొంగలి
గాయత్రీ దేవి రెండో రోజు
"ముక్తా విద్రుమ హేమనీల
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే"
సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.
నైవేద్యం - అల్లం గారెలు
అన్నపూర్ణాదేవి మూడవ రోజు
"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"
దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఆశ్వియుజ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం - దధ్ధోజనం
మహాలక్ష్మీ దేవి నాల్గవ రోజు
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం
లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద
విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలిక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియాం
కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.
నైవేద్యం - వడపప్పు
శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - ఐదవ రోజు
''యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా"
నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి, చతుష్షష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీ దేవి. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి.
నైవేద్యం - పెసరపప్పు పాయసం
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరవ రోజు
ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి.
నైవేద్యం - అప్పాలు,- పులిహోర
దుర్గాదేవి - ఏడవరోజు
విద్యుద్దామ సమప్రభాం
మృగపతి స్కందస్థితాం భీషణా౦
కన్యాభి: కరవాలఖేల
విలద్దస్తా భిరాసేవితాం!
హసైశ్చక్రగదాసిఖేట
విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం
దుర్గం త్రినేత్రం భజే
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.
నైవేద్యం - చక్రపొంగలి
శ్రీ మహిషాసురమర్దినీ దేవి - ఎనిమిదవ రోజు
మహిషమస్తక నృత్త వినోదిని
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదిని
దేవి తొమ్మిది అవవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే "మహర్నవమి"గా ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చేయాలి. "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మో హిన్యైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదన చేయాలి.
నైవేద్యం - కేసరి పూర్ణాలు
శ్రీ రాజరాజేశ్వరీదేవి - తొమ్మిదవ రోజు
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.
నైవేద్యం - లడ్డూలు
No comments:
Post a Comment