Sunday, 21 October 2018

అమ్మల గన్న యమ్మ...








అమ్మల గన్న యమ్మ...



దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా

నేటి నుంచి శరన్నవరాత్రులు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా నవవిధ రూపాల్లో కొలుస్తారు. అందులోనూ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆరాధన ఈ రోజుల్లో అత్యంత విశేషం. ఈ నవరాత్రుల్లో నవదుర్గల అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి


నేటి అలంకరణ :శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి బుధవారం
నైవేద్యం:చక్కెర పొంగలి, గారెలు, మినప పిండితో చేసిన ఇతర వంటలు
అలంకరించే చీర రంగు:బంగారు వర్ణం
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :దుర్గా సప్తశతి

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి తొలి అలంకారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఇతిహాసం ప్రకారం, పూర్వం మాధవవర్మ మహారాజు విజయవాటికాపురి (నేటి విజయవాడ)ని ధర్మం నాలుగు పాదాలా నడిచేలా, జనప్రియంగా పరిపాలించేవాడు. అతడు గొప్ప దేవీ భక్తుడు. ఒకరోజు ఆయన కుమారుడు నగర సందర్శన సమయంలో అతని రథ చక్రాల కింద ఒక బాలుడు పడి మరణించాడు. ఆ బాలుడి తల్లితండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం చేయాలని రాజును కోరారు. విచారించిన రాజు తన కుమారుడిని దోషిగా నిర్ణయించి, అతడికి మరణశిక్ష విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు (దుర్గాదేవి) మృతిచెందిన బాలుడికి ప్రాణభిక్ష పెట్టారు. విజయవాటికాపురిలో కొన్ని గంటల పాటు కనకవర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘కనకదుర్గగా పూజలందుకుంటున్నారు. ‘దుర్గా’ అంటే దుర్గతులు నశిస్తాయనీ, ఆ తల్లిని దర్శించుకోవడం వల్ల సకల దారిద్య్రాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందనీ నమ్మిక.


బాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గామాత


నేటి అలంకరణ :బాలాత్రిపుర సుందరీదేవి
ఆశ్వయుజ శుద్ధ విదియ, గురువారం
నైవేద్యం:పాయసం, పులగం
అలంకరించే చీర రంగు:లేత గులాబీ రంగు
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :లలితా త్రిశతి

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్‌
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితామజ్జ్వలాం
తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీమ్‌

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా గొప్పదనీ ఆధ్యాత్మికుల ఉవాచ. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదటగా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు.

త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురా త్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఆమె అధిష్ఠాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణం చేస్తుంటారు.

మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయంటారు. ఆమె సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. సకల దారిద్ర్యాలు నశిస్తాయి. త్రిమూర్తి స్వరూపమైన ఆమెను కొలిచిన వారికి జ్ఞానం కలుగుతుంది. జీవనోపాధి లభిస్తుంది. చదువులలో ఉన్నతులవుతారు. ఇది అనాదిగా భక్తుల విశ్వాసం.


వరదాయిని గాయత్రి!!


నేటి అలంకరణ :శ్రీ గాయత్రీ దేవి
NA
నైవేద్యం:అల్లం గారెలు, ఐదు రకాల పిండివంటలు
అలంకరించే చీర రంగు:కాషాయ వర్ణం
అర్చించే పూల రంగు:NA
పారాయణ :గాయత్రీ మంత్రం

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్‌ ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!

నవరాత్రుల్లో మూడో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతోంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆ యా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆ యా దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు.

గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుంది. ఆరోగ్యం లభిస్తుంది. వరదాభయహస్తాలతో... సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుంది. గాయత్రిని వేదమాతగా కొలుస్తూ, ఆమెను దర్శించడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు. ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. పూజించిన వారికి సద్బుద్ధులు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. అజ్ఞానం తొలగిపోతుంది. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.


 లలితా త్రిపుర సుందరీమ్‌ ఆశ్రయే!


నేటి అలంకరణ : శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి
NA
నైవేద్యం:అల్లం గారెలు, ఐదురకాల తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు:బంగారు వర్ణం
అర్చించే పూల రంగు:వివిధ రకాలు
పారాయణ :లలితా సహస్రనామం

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌ శ్రీశ్రీ

నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా కొలువై.. తనను కొలిచే భక్తులనూ, ఉపాసకులనూ అనురగ్రహిస్తుంది. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీసరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా, శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువై ఉంటుంది.

చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి, శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుందనీ, పంచ, దశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్నీ, ఉపాసకుల్నీ అనుగ్రహిస్తుందనీ భక్తులు నమ్ముతారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ విశ్వాసం.. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలనీ, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలనీ పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ చెబుతున్నాయి.


సర్వసిద్ధికరీ... సరస్వతీ!


నేటి అలంకరణ : సరస్వతీదేవి
NA
నైవేద్యం:దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు:తెలుపు
అర్చించే పూల రంగు:కలువ పూలు
పారాయణ :సరస్వతీ స్తోత్రాలు

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరించడమే మూలానక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారం విశిష్టత. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. అమ్మవారి అనుగ్రహం కోరుకున్నవారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. మూలానక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష దివ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని. ఆమెను కొలిస్తే విద్యార్థులకు చదువు బాగా వస్తుందనీ, జ్ఞానజ్యోతులను ఆమె ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధి, మంచి బుద్ధీ ఇస్తుందనీ నమ్మిక.





సౌభాగ్యదాం... భాగ్యదాం


నేటి అలంకరణ : శ్రీ మహాలక్ష్మి
NA
నైవేద్యం:రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం
అలంకరించే చీర రంగు:గులాబీ (పింక్‌)
అర్చించే పూల రంగు:తామర పుష్పాలు
పారాయణ :లక్ష్మీ స్తోత్రాలు


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుందప్రియాం

నవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారం చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. మహా లక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం సంపత్ప్రదం. ఈ రూపంలో ఆమెను అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దర్శించడం వల్ల భక్తులకు ఐశ్వర్యం, విజయం లభిస్తాయనీ, పూజించడం వల్ల దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందంటారు పెద్దలు.




దుర్గే దుర్గతి నాశని!


నేటి అలంకరణ : దుర్గాదేవి
NA
నైవేద్యం:గారెలు, చిత్రాన్నం
అలంకరించే చీర రంగు:ఎరుపు
వేటితో అర్చించాలి:గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు
పారాయణ :దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ


సర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్ర్తాహి నో దేవి దుర్గ్గే దేవీ నమోస్తుతే!

దేవీ నవరాత్రి మహోత్సవాల్లో ఎనిమిదో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడిని వధించి, దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలుగొందినది అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది.

భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయి. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ నమ్మిక. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం శుభాలను కలుగజేస్తుందనీ, దివ్యరూపిణి దుర్గమ్మ వారి దర్శనం సకల శ్రేయోదాయకమనీ పెద్దల మాట.




జయ జయహే మహిషాసురమర్దిని!


నేటి అలంకరణ : మహిషాసురమర్దిని
అయిగిరినందిని, నందితమేదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!

నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన 18వ తేదీ గురువారం ఒకేరోజు రెండు అలంకారాలలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 11 గంటల వరకు అమ్మ వారు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసులందర్నీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువైంది.

ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం ఇదే. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీ దేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందంటారు. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, శత్రు పరాజయం కలుగుతుందనీ, అంతః శత్రువులు కూడా నశిస్తాయనీ, ధైర్యం కలుగుతుందనీ, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందనీ నమ్మకం. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అరిషడ్వర్గాలు నశిస్తాయి. సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పటాపంచలవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరతాయి.

ఆశ్వయుజ శుద్ధ నవమి
నైవేద్యం:బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు
అలంకరించే చీర రంగు:గోదుమ, ఎరుపు కలనేత జరీ
అర్చించే పూల రంగు:తామర పుష్పాలు
పారాయణ :మహిషాసురమర్దినీ స్తోత్రం

రాజరాజేశ్వరీదేవి


నేటి అలంకరణ : రాజరాజేశ్వరీదేవి

అంబా శాంభవి చంద్రమౌళి రబలా అపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆమె సకల భువన, బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది.

మాయామోహితులైన మానవుల్లో చైతన్యాన్ని యోగమూర్తిగా ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత. ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, ఆ అమ్మ భక్తుల కోరికలను నెరవేరుస్తుందనీ, మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానం కలుగజేస్తుందనీ నమ్మిక. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు భక్తులకు లభిస్తాయి.

ఆశ్వయుజ శుద్ధ దశమి- విజయదశమి
నైవేద్యం:పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు
అలంకరించే చీర రంగు:ఆకుపచ్చ, తెలుపు
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :చెయ్యాల్సింది: లలితా సహస్రనామం
అర్చన :ఎర్రటి గాజులతో అలంకరించి, కుంకుమార్చన









No comments:

Post a Comment